Saturday, August 28

వోటింగ్ మెషీన్లూ..........

...........యెన్నికలూ

నేనిదివరకే చెప్పాను--ఎలెక్ట్రానిక్ వోటింగ్ మేషీన్లని టాంపరింగ్ చెయ్యడం అసాధ్యం--అని.

ఇప్పుడు, జేపీ (లోక్ సత్తా) ఈవీయెం లతో రిగ్గింగ్ జరుగుతుందనడానికి యెలాంటి ఆధారాలూ లేవనీ, కొందరు సదుద్దేశ్యం తో, కొందరు దురుద్దేశ్యం తో వీటిపై అనుమానాలు రేకెత్తిస్తున్నారు అనీ అన్నారు!

మరి సాంకేతిక నిపుణుడు హరి ప్రసాద్ మాటేమిటి?

వివిధ ప్రదేశాలనించి ఈవీయెం లని రప్పించి, సభాముఖం గా వాటిని టాంపరు చేసి చూపించమన్న యెన్నికల సంఘాం సవాలుని స్వీకరించి, యెవరూ నిరూపించలేక పోయారు.

మరి హరి ప్రసాద్ ఓ మెషీన్ ని దొంగిలించి, తన యింట్లోనో లాబ్ లోనో దాని పనిచేసే విధానం మార్చేసి, ప్రదర్శన ఇస్తాను, ఇది తప్పుగా ప్రవర్తిస్తుంది--అనడం యెంత హాస్యాస్పదం!

ఒక మెషీన్ ని మారిస్తే, అదేవిధం గా అన్ని లక్షల మెషీన్లూ యెలా మారిపోతాయి?

(ఆయన మీద దొంగతనం కేసుపెట్టడం వేరేసంగతి--ఆయన్ని విడుదల చెయ్యాలని కోరడం సమంజసమే)

ఇక, ఢిల్లీ మాజీ ముఖ్య కార్యదర్శి ఒమేశ్ సైగల్, సమాచార హక్కు ద్వారా తాను, ఈవీయెం చిప్ లపై ప్రోగ్రాం లు వ్రాయడానికి విదేశీ సంస్థల నుంచి బెల్, ఈసీఐఎల్ సేవలు వినియోగించుకున్నాయి అని వెల్లడించారు.

మెషీన్లు చక్కగా పని చేస్తున్నంతవరకూ, ప్రొగ్రాం యెవరు వ్రాశారు అనే మీమాంస అనవసరం కదా? అయినా ఆయన అన్నట్టు విచారణ జరిపిస్తే పోయేదేమీ లేదు.

ఇంక, అమెరికా లాంటి దేశాలూ, ఇతర ప్రజాస్వామిక దేశాలూ ఈ మెషీన్లని వాడక పోవడానికి కారణం వొక్కటే--వోటు వేసినట్టు నిర్ధారిస్తూ 'బీప్' వస్తుంది గానీ, ఫలానా గుర్తుకే వోటు పడింది అని నిర్ధారణగా వోటు వేసినవారికి తెలియదు!

దీనితో నేనుకూడా యేకీభవిస్తాను.

ఈవీయెం లలో గుర్తులు అంటించే ప్రాంతాన్ని పారదర్శకం చేసి, క్రింద ప్రతి గుర్తుకీ ఓ చిన్న బల్బు పెట్టి, వోటు వెయ్యగానే సంబంధిత గుర్తు క్రింద బల్బు వెలిగేలాగ చెయ్యగలిగితే, సమస్య పరిష్కారం అయిపోతుంది!

మన శాస్త్రఙ్ఞులు ప్రయత్నిస్తే బాగుంటుంది.

Sunday, August 22

తెలుగు బ్లాగుల

సంకలినులు

ఇవాళ ఈనాడులో (21-08-2010) తెలుగు బ్లాగుల సంకలినుల గురించి వ్యాసం వచ్చింది. ముఖ్యం గా వీవెన్ కూడలి, భా రా రె హారం, జాలయ్య జల్లెడ, భరద్వాజ్ మొదలైనవాళ్ల మాలిక గురించి వ్రాయడం జరిగింది. ఇంకా ప్రవీణ్ శర్మ సంకలిని కూడా ప్రస్తావించడం జరిగింది--ఇంకో సంకలినితో సహా.

అమ్మాయి సుజాత చక్కగా వ్రాసింది. (వృత్తి ధర్మం గా వ్రాశాను అనే అంటుంది లెండి).

ఇక చూస్కోండి--బ్లాగుల్లో, కామెంట్లలో రెచ్చిపోయారు కొంతమంది. 

ఈ సంకలినులు స్థాపించి, నిర్వహిస్తూ, తెలుగు భాషకీ, బ్లాగర్లకీ సేవ చెయ్యడం బాగానే వుంది. కానీ, ఒకళ్లనొకళ్లు తిట్టుకోవలసిన అవసరం వుందా?

ఇక్కడ ఒకటే కనిపిస్తూంది--పర్సనల్ ఇగోలూ, కుల పిచ్చిలూ!

అసలు బ్లాగుల్లో "అనోనిమస్" గా, "అఙ్ఞాత" గా కామెంట్లు చెయ్యడం యెందుకు అనుమతించబడుతోంది?

ఒక వివాదాస్పదమైన విషయం లో తాము నిజం చెప్పగలిగి వుండీ, తమ అధికార స్థానం వల్లో, తమ సంస్థ నిబంధనలకి లోబడో వ్యాఖ్యానించలేనివాళ్లు, తమ అభిప్రాయాలని బయటపెట్టడానికి!

అప్పట్లో బ్లాగులు లేకపోవచ్చుగానీ, నిక్సన్ వాటర్ గేట్, క్లింటన్ సెక్స్ స్కాండల్ లాంటివి బయటపెట్టినవాళ్లు ఈ అఙ్ఞాతలే!

అలాంటి వున్నతమైన ఆదర్శంతో అనుమతించబడ్డ ఈ వ్యాఖ్యల్ని, తమ మెదడుకి తోచినట్టు, తమ నోటి దురద తీర్చుకోడానికి వుపయోగించడం యెందుకో--యెవరికి వారు అలోచించుకోవాలి.

పువ్వులూ, పళ్లూ, పురుగులూ, పేకముక్కలూ, చిన్నపిల్లలూ మొదలైన ఫోటోలు పెట్టుకోకండి! మీ ఫోటో పెట్టుకోండి! (శరత్ ఇప్పటికే ముందడుగు వేశాడు)

పప్పులూ, వుప్పులూ, చిన్నప్పటి ముద్దుపేర్లూ, కలలో తోచిన పేర్లూ వదలిపెట్టండి--మీ పేర్లు వ్రాయండి!

తెలుగు బ్లాగు లోకం చక్కగా వర్థిల్లాలంటే--ఇలా చేస్తే బాగుంటుందని నా సలహా!

తరవాత మీ యిష్టం!

Tuesday, August 17

వుద్యోగ విరమణ

నాకూ స్వాతంత్ర్యం వచ్చింది

నిజం!

కారణాలేమయితేనేం--నా వుద్యోగానికి నేను సమర్పించిన రాజీనామా 13-08-2010 నించీ ఆమోదించబడింది.

ఇక నాకు స్వాతంత్ర్యం వచ్చినట్టేకదా?

దాదాపు 37న్నర సంవత్సరాలుగా, తెల్లారి లేచి, ఓ ప్రక్క కాలకృత్యాలు తీర్చుకుంటూనే, "ఇవాళ బ్యాంకులో చెయ్యవలసిన ముఖ్యమైన పనులేమిటి, రాబోయే సమస్యలేమిటి, వాటిని యెలా అధిగమించాలి, ముఖ్యం గా సహనం కోల్పోకుండా, అన్నీ భరిస్తూ వుద్యోగం యెలా చేసుకోవాలి" ఇలాంటి ఆలోచనల్తో సమయానికి బ్యాంకుకి చేరుకొని, సీట్లో కూర్చొని--పొద్దుణ్ణించీ చేసుకున్న ఆలోచనలు గాలికి పోగా, రొటీన్ గా చక చకా పని చేసుకొని, మధ్యలో లంచి చేసి, సాయంత్రం బయటపడి, కాసేపు కొలీగ్స్ తో ఖబుర్లాడుకొని, ఇంటికి చేరడం అనే రొటీన్ నించి విముక్తి--యెంత స్వాతంత్ర్యం!

ఇక నించీ 'ఫ్రీ బర్డ్' అనుకొంటే సంతోషం గానే వుంది.

ఇక చెయ్యవలసిన పనులు, వాటి ప్లానింగ్ వీటిపై దృష్టి పెట్టాలి అనుకుంటూండగానే, ముందు ఈ జీవితానికి అలవాటుపడడానికి ప్రయత్నిస్తున్నాను!

మిగిలిన ముచ్చట్లు తరవాత.

Thursday, August 12

విశిష్ట గుర్తింపు

"ఆథార్" సంఖ్య

ఓ యాభయ్యేళ్ల క్రితమే, ప్రపంచాన్ని తమ సంగీతం తో వుర్రూతలూపిన "బీటిల్స్" అనే నలుగురు కుర్రాళ్లు వుండేవారు.

కంప్యూటర్లు ఇంకా రాని రోజుల్లోనే, వాళ్ల దేశ ప్రభుత్వం, వాళ్లకి పుట్టుకతోనే "విశిష్ట గుర్తింపు సంఖ్యలు" కేటాయించిందట--అందరు ప్రజలకీ ఇచ్చినట్టే! అది చిన్న దేశమే అయి వుండచ్చు, జనాభా తక్కువే అయి వుండవచ్చు--అయినా మనసుంటే మార్గముంటుందని నిరూపించింది కదా?

ఇక మన విషయానికొస్తే--సామాన్యుడిక్కూడా "విశిష్ట గుర్తింపు" వస్తోందంటే సంతోషమే కానీ--

ఇన్‌కమ్ టేక్స్ వాళ్ల పాన్ నెంబర్ల వ్యవహారం చూశాముకదా--ఒక్కోళ్లకీ పాతిక దాకా కేటాయించేసి, తరవాత జుట్లు పీక్కుని--ఒకటే వుపయోగించుకోవాలి, లేకపోతే అది నేరం అంటున్నారు!

రేషన్ కార్డులన్నారు; అందులో రంగులన్నారు; లంచమిస్తే రంగులు మారేవంటారు; డూప్లికేట్లు వచ్చాయన్నారు; బోగస్ వి వచ్చాయన్నారు; స్మార్ట్ కార్డులన్నారు; ఐరిస్ కార్డులన్నారు; బయో మెట్రిక్ అన్నారు--ఇప్పుడు కొన్ని వేల కోట్లతో "ఆథార్" సంఖ్యలంటున్నారు!

ఇప్పటివరకూ ఇలాంటి కార్డులకి యెన్ని కోట్లు ఖర్చుపెట్టారో యెవరైనా స. హ. దరఖాస్తు ద్వారా సేకరిస్తే బాగుండును.

ఇప్పుడు, ఈ ఆథార్ ప్రారంభం మన రాష్ట్రం లోనే చెయ్యడానికి నెలాఖరున ముహూర్తం పెట్టారట. తొలివిడత హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో జారీ చేస్తారట.

ఈ ఆథార్ కి ఆథారం యేమిటో తెలుసా?

రాష్ట్ర "పౌర సరఫరాల శాఖ" వద్ద 'అందుబాటులో' వున్న మూడు కోట్లమంది ప్రజల సమాచారం అధారంగా జారీ చేస్తారట!

ఇక యెంత అందంగా వుంటాయో ఈ ఆథార్ సంఖ్యలు వేరే వూహించుకోవాలా!

మన రెవెన్యూ డిపార్ట్ మెంట్ తో పెట్టుకుంటే, కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లే!

భారతీయుడు సినిమాలో కమల్ హాసనో, యేదో సినిమాలో చిరంజీవో అన్నట్టు, లంచం, లంచం, లంచం అంటూ డైలాగు చెప్పుకోవాలి.

ఈ బాధలు పడలేక, నీ రేషన్ కార్డూ వద్దు, నువ్వూ వద్దు అని దశాబ్దం క్రితమే వదిలేసిన నాలాంటివాళ్లని ఇప్పుడు వంటగ్యాస్ బుక్ చేసుకోవాలంటే, "రేషన్ కార్డు లేదు" అని తాశీల్దారు దగ్గరనించి సర్టిఫికెట్ తెచ్చుకోమన్నారు! (యెంతో కాదు లెండి--నూట యాభై మాత్రమే ఖర్చయ్యింది నాకు దానికోసం)

వోటరు లిస్టులు సవరించాలని ప్రభుత్వం ఆదేశించడం, సవరింపు పూర్తయిందని పేపర్లలో చదవడమే!

జనాభా లెఖ్ఖలు మొన్న ఏప్రియల్ 1 నించే మొదలయ్యాయట!

వూళ్లన్నీ తిరిగినప్పుడెలాగూ లేదు, ఈ వూరు చేరి 3 సంవత్సరాలైనా, ఈ విషయాల్లో మా దగ్గరకి వచ్చిన ఎల్ కే (అద్వానీ) యెవడూ లేడు!

గుడ్డిలో మెల్ల యేమిటంటే, ఓ పెద్దాయనకి ఈ ఆథార్ కార్డుల పని అప్పగించారట--కాబట్టి ఆ చిత్రగుప్తుడు వీళ్ల లెఖ్ఖలని యెలా సరిపెడతాడో చూద్దాం!   

అంతకన్నా యేం చెయ్యగలం!

Friday, July 30

రామాయణం లో పిడకల వేట

వాలి, సుగ్రీవ, రామ....."తదితరుల" గురించి చర్చ

ఇంత చర్చ అవసరమా? యేమో!

రామాయణ, భారత, భాగవతాల్ని "ఇతిహాసాలు" అన్నారు. అంటే, ఒకప్పుడు జరిగినవిగా 'చెప్పబడుతున్న' "కథలు". 

పురాతన మహర్షులు చెప్పినా, గ్రీకులవంటివారు చెప్పుకున్నా ఇవి ఇతిహాసాలే!

ఇవి తరతరాలుగా, "అనుశృతం గా" వస్తున్నవి. అంటే, "విన్నది విన్నట్టుగా" చెప్పబడుతున్నవి! 

(ఓ సంఘటనకి ప్రత్యక్ష సాక్షులు నలుగురుంటే, నలుగురూ నాలుగు రకాలుగా చెపుతారే--ఇక విన్నది విన్నట్టుగా చెప్పడమంటే--యెన్ని మార్పులూ చేర్పులూ జరిగి వుండవచ్చో వూహించండి!)

ఇలా కథలు చెప్పేవాళ్ళు సందర్భానుసారం పాత్రల్ని ప్రవేశపెట్టడం, (రోజుల తరబడి సాగే ఈ కథ చెప్పడం లో) కొన్ని పాత్రలని మరచిపోవడం, మళ్ళీ యెవరో గుర్తుచేస్తేనో, వాటి సంగతి యేమయిందని అడిగితేనో, మళ్ళీ ఆ పాత్రల గురించి చెప్పడం, ముందు చెప్పినదానికీ, ఇప్పుడు చెప్పేదానికీ వైరుధ్యాలుండడం--ఇవన్నీ సహజమే కదా!

మన విఠలాచార్య హీరో కాల్ షీట్లు దొరకకపోతే, అర్జంటుగా వాడిని ఓ మొసలిగానో, యెలుగుబంటి గానో, తొండగానో, కప్పగానో మార్చి, కథ నడిపించి, హీరో కాల్ షీట్ ఒక్క రోజే దొరికినా, ఆ కథని కూర్పు చెయ్యడానికి హీరో క్లోజప్పులు మాత్రమే తీసుకొని, మిగిలిన సినిమా అంతా డూప్ లతోనూ, జంతువులూ, వాటి వేషాలేసుకున్న మనుషులతోనూ షూట్ చేసేసేవాడు!

ఇక మైథాలజీ అంటే, అప్పట్లో ప్రజల్లో వున్న నమ్మకాలని బట్టి, 'మిథ్య' తో సృష్టించబడినవి. మన పురాణాల సంగతేమోగానీ, గ్రీకు పురాణాలన్నీ ఈ మైథాలజీ క్రిందకి వస్తాయి--అట్లాసు భూమిని మోస్తూండటం, వీనస్, క్యూపిడ్, జియస్ లాంటి కథలు!

ఇక, కథ చెప్పేవాళ్ళ దగ్గరకి వస్తే, అన్నీ "సూతుడు శౌనకాది మహా మునులకి" చెప్పినవే!

ఈ సూతుడు అంటే యెవరు?

అసలున్నది "శుక, శౌనకాది మహామునులు" మాత్రమే! కాబట్టి "సూత మహర్షి" అనేవాడు లేడు!

వీళ్ళల్లో మొదటివాడు "శుకుడే" (చిలక్కి పుట్టినవాడు అని అర్థమేమో!) సూతుడు! 

(శౌనకుడు అంటే, శునకానికి పుట్టినవాడేమో కూడా!)

అందుకే, చిలకలా, తాను విన్నవి మళ్లీ అందరికీ వినిపిస్తూండేవాడు!

(తరవాత యెవరు ఈ కథలు చెప్పినా, "నైమిశారణ్యం లో సూతుడు శౌనకాది మహర్షులకి" చెప్పినట్టు.......అనే మొదలుపెట్టేవారు!)

ఈ విషయం, కొన్ని దశాబ్దాల క్రితమే, పెద్దలచే (ఇంక్లూడింగ్ మాలతీ చందూర్ ఇన్ ప్రమదావనం--జవాబులు) రూఢి చెయ్యబడింది!

మరి ఇప్పటిక్కూడా, "సూత మహర్షి" అంటూ వస్తున్న రచనలెన్నో!

అదలా వుంచితే, వేదవ్యాసుడూ, వాల్మీకి మొదలైనవాళ్లు యెవరూ కాగితల మీదా, అట్టలమీదా, చర్మాల మీదా, రేకుల మీదా, కనీసం తాళ పత్రాలమీదా వ్రాయలేదు కదా?

తరవాత్తరవాత వ్రాసినవాళ్లయినా, తమకి అప్పటికి తెలిసున్న "తెలుగు" లిపి లో నో, ఇంకో లిపి లోనో మాత్రమే వ్రాశారు! ఇలాంటి తాళ, భూర్జర, తామ్ర, శిలా.......వగైరా పత్రాలని, మల్లంపల్లి వంటివారూ, ఇంకొందరు మహామహులూ "పరిష్కరించి" ఈనాడు మనం వ్రాసుకుంటున్న "ముత్యాల్లాంటి" తెలుగు అక్షరాలలో అందించారు!

(వాటిలోనూ కొన్ని అపభ్రంశాలుండవచ్చు--ఉదా:- అన్నమాచార్య కీర్తనలు)

మరి ఈ రోజు మనం ఇన్నిరకాలుగా కొట్టుకోవలసిన అవసరం వుందా?

నన్నడిగితే, ఈ లండాచోరీ (ఈ మాట తప్పైతే నన్ను క్షమించగలరు) అంతా ఇప్పుడెవరికీ తెలియని "సంస్కృత" భాషవల్లే వచ్చింది!

ఒకడు "యత్రనార్యస్తు......." అంటాడు, ఇంకొకడు "యత్ర నార్యన్‌తు........." అంటాడు.

ఒకడు "నైనం ఛిందంతి......." అంటే, ఇంకొకడు "నయనం ఛిందన్‌తి............" అంటాడు.

ఒకడు ".....అభ్యుథ్థానం, థర్మస్య...." అంటే, ఒకడు ".......అభ్యుథ్థానమధర్మస్య......." అంటాడు.

ఇక అంకెల దగ్గరకొస్తే, ఇక చెప్పఖ్ఖర్లేదు...."అష్టోత్తరం"; "పంచ వింశతి"; "షష్టి"; "షష్ఠి".....ఇలాగ. 

(మొన్నీమధ్య గరికపాటివారు చెప్పేవరకూ నాకు షష్టి ల గురించి తెలియదు--ఇదివరకెప్పుడో నా బ్లాగులో తప్పు వ్రాసినట్టు కూడా గుర్తు నాకు!) 

కానీ, అందరూ, అలవోకగా అన్ని శ్లోకాలనీ జనాల (స్వైన్స్) ముందు "ముత్యాల్లా" (అని వారి భావన) జల్లేస్తూనే వుంటారు!

కనీసం ఇప్పుడైనా, "వుభయ భాషా ప్రవీణులెవరైనా" సంస్కృతం --టు-- తెలుగు వ్యాకరణాన్నీ, నిఘంటువునీ వ్రాస్తే, అది అన్నివిధాలా అందరికీ అమోదనీయమైతే, యెంతబాగుండునో!

తీరుతుందంటారా--ఈ ఆశ?

Monday, July 26

అర్రర్రర్రె!

'.....నా తప్పేం లేదండి....'

(శరత్ 'కాలమ్' "ఊప్స్" గురించి టపా చదివాక)

'బీచ్ క్రాఫ్ట్ బొనాంజా' అనే చిన్న ప్లేన్ ను నడుపుకుంటూ, భార్యా పిల్లలతో బీచ్ కి వెళ్తూంటాడొకాయన.....రూల్ బుక్ ప్రకారం నడుచుకుంటూ, ఫ్లైట్ ప్లాన్ ప్రకారమే, తక్కువ యెత్తులో వెళుతూ.....

ఇంకో ప్లేన్ లో ఓ కుర్రాడు, గాలిలో విన్యాసాలు చేసుకొంటూ ఆనందిస్తూ వుంటాడు.....పైకి వెళుతూ, డైవ్ లు కొడుతూ, తలక్రిందులుగా, మళ్ళీ సరిగా.....ఇలా!

ఏ టీ సీ నించి బీచ్ బొనంజాకి కమాండ్ వస్తుంది......."90 డిగ్రీలలో యెడం వైపు తిరిగిపో......వెంటనే!" అని.

ఇంకెవరైనా అయితే, "వెంటనే" అన్న గొంతుకలోని అర్జెన్సీ ని గమనించి, ప్లేన్ ని తిప్పేసి, "తిప్పేశాను" అని చెప్పేవారు.....కానీ, రూల్ బుక్ పాటించే ఆయన, మైక్ లో "రోజర్" అని చెప్పి, తిప్పబోయేలోపల....."బ్యాంగ్!" విన్యాసాలు చేస్తున్న ప్లేన్, ఈ ప్లేన్ ని గుద్దేసి, రెండూ గాలిలో మండి పోతాయి!

ఆఖరుగా, ఓ చిన్న పిల్లవాడు, "డాడీ! నేను చనిపోవాలనుకోవడం లేదు!" అంటూండగా, ఏ టీ సీ లో ప్రసారం ఆగి పోతుంది!

*  *  *

జే ఎఫ్ కె ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లో, ఏ టీ సీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) టవర్ లో, విమానాలని కంటిన్యూగా మోనిటర్ చేస్తూ వుండే డజను పైగా వుండే వుద్యోగుల్లో ఒకాయన, (సీనియర్ అవడం తో, ఆయన మోనిటర్ చేసే యేరియాలో ట్రాఫిక్ అసలే యెక్కువ) కళ్ళు కొంచెం లాగుతున్నాయని, రిలీఫ్ ఇన్స్ పెక్టర్ని రిక్వెస్ట్ చేసి, బయటికి వెళతాడు. చుట్ట వెలిగించుకొని, బాత్రూం కి వెళ్ళి వచ్చి, కారిడార్ లో తన ఇంటి సమస్యలని గురించి ఆలోచిస్తూ, వుండిపోతాడు.

చుట్టతో వేళ్ళు కాలేటప్పటికి తెలుస్తుంది--తను అనుకున్నదానికన్నా కొన్ని సెకన్లు యెక్కువ బయట వుండి పోయానని.

గబగబా తన సీటు దగ్గరకి వెళుతుంటే, మానిటర్ లో అతివేగంగా, ప్రమాదకరం గా దగ్గరవుతున్న రెండు చుక్కల్ని చూసి, మైక్ లాక్కొని ఆఙ్ఞాపిస్తాడు "90 డిగ్రీలలో యెడం వైపుకు తిరిగిపో--వెంటనే" అని!

*  *  *

జరగవలసిన ఘోరం జరిగేపోయింది!

*  *  *

"అయ్యో! నాకు నిజం గానే బుధ్ధి లేదు.....ఆ కాస్తసేపూ నేను యెక్కువ బయట గడిపి వుండకపోతే.....అనుభవం కొంచెం తక్కువైన రిలీవరు తన దృష్టి మానిటరుపై పెట్టి, ఆ చుక్కలని అర్థం చేసుకొని వుంటే.....ఆ విన్యాసాలు చేస్తున్న మూర్ఖుడు రెండు మూడు సెకన్లు ఆలస్యం గా క్రిందకి డైవ్ చేసి వుంటే.....ఆ బీచ్ క్రాఫ్ట్ పైలట్, ముందు పక్కకి తిరిగి, తరవాత "రోజర్" అని వుంటే......" ఇలా అనేక "ఐతే" లతో కుమిలిపోతూ వుంటాడు--ఆ వుద్యోగి!

ఓ నలభై నించి 35 యేళ్ళ క్రితం, నేను ఇంగ్లీష్ నవలలు చదవడం మొదలుపెట్టిన కొత్తలో చదివిన--ఆర్థర్ హెయిలీ వ్రాసిన--"ఎయిపోర్ట్" నవల లోనివీ భాగాలు. (నాకు గుర్తున్నంతవరకూ వ్రాశాను--తప్పులు వుండవచ్చు)

*  *  *

గత పది పదిహేను రోజులుగా పత్రికలలో విమానాలకి "తృటిలో తప్పిన ప్రమాదాలు" అని తరచూ చదువుతున్నాం! "హెడాన్ కొలిజన్" తప్పడం, రన్ వే మీద ఓ ప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంటే, ఇంకోటి ల్యాండ్ అవుతూ, రెక్కలు తగలకుండా తప్పించుకోవడం, దిగుతూండగా టైర్లు పేలి పోవడం, బయలుదేరుతూండగా అండర్ క్యేరేజ్ లో మంటలు రావడం--ఇలా అనేకం!

ముఖ్యం గా కింగ్ ఫిషర్, స్పైస్ జెట్ లాంటి వాటికి ఈ ప్రమాదాలు యెదురవుతున్నాయి!

ముఖ్యం గా ప్రైవేట్ ఎయిలైన్స్ కి అనుమతి ఇచ్చేముందు, మన రన్ వేలూ, ఏ టీ సీ లూ, ఎన్ ఎల్ ఎస్ లూ, స్టాఫ్ పరిస్థితీ--ఇవన్నీ యెవరైనా ఆలోచించారా లేదా అని నాకో డవుటు.

మన రైళ్ళు చూస్తే అలాగ వున్నాయి--కొన్ని వందలమందిని చంపుతూ! ఇక ప్లేన్లు కూడా అయితే--(అమంగళము ప్రతిహతమగు గాక)!"

మన మంత్రులూ, అధికారులూ, వుద్యోగులూ కనీసం మనసులోనైనా "ఊప్స్" అనుకుంటున్నారా? ఆ వుద్యోగి మనసులో పడ్డ నరకబాధలో వందో వంతైనా పడుతున్నారా?

పైకి తేలరుగానీ, అంతకన్నా యెక్కువే పడుతూ వుంటారు! అదేదో సినిమాలో ముళ్ళపూడి వ్రాసినట్టు "అనుభవిస్తారు.....అంతకి అంతా అనుభవిస్తారు!"

.........మళ్ళీ ఇంకోసారి

Thursday, July 22

తెలుగోడు


బాబ్లీ-2

"లాఠీలకు వెరవకుండా, అక్కడి పోలీసుల దురుసు ప్రవర్తనను సహించి, సాహసంతో బాబ్లీని అడ్డుకునేందుకు తెలుగుదేశం చేసిన పోరాటాన్ని హృదయపూర్వకం గా అభినందిస్తున్నాను" అన్నారట రోశయ్య--తెలివైనవాడు కదా.

నోటితో మెచ్చుకుంటూ, నొసటితో వెక్కిరించడం అంటే ఇదే.

వాళ్ళు వెళ్ళింది అడ్డుకోడానికీ, పోరాటానికీ కాదు--అఖిలపక్షం లోగా వాస్తవ పరిస్థితిని చూడడానికి అన్న విషయాన్ని యెంత తెలివిగా పక్కదారి పట్టించాడో చూడండి!

ఇంకా, 1995 నించీ మీరేమీ చెయ్యకపోవడం వల్లే సమస్య ముదిరింది--అంటూ యెదురుదాడి మామూలే.

"బాబ్లీ గురించి పత్రికల్లో చూసేదాకా ప్రభుత్వానికేమీ సమాచారం లేదు" అని పదే పదే వారి ప్రభుత్వం అసెంబ్లీ లో ప్రకటించిన విషయాన్ని మరిచిపోతున్నారు. 2005 లో లేని సమాచారం 1995 లో యెలా వుంటుంది ప్రభుత్వం దగ్గర?

ఆ తరవాత మరో పదమూడో, పదిహేడో ప్రాజెక్టులగురించి కూడా ఇలాగే ప్రకటించారు--అసెంబ్లీ లో!

జనాల ఙ్ఞాపక శక్తి చాలా తక్కువ అనే వాళ్ళ నమ్మకం.

ఇక మన గుంటూరు ఎం పీ రాయపాటి, "మంగళవారం వుదయం నేను అధినేత్రిని కలిసి, చెపితేనే, ఆవిడ మరాఠా ముఖ్యమంత్రితో మాట్లాడి, 'సమస్య జటిలం కాకుండా చూడాలని' ఆదేశించినట్టూ, 'మరాఠా ముఖ్యమంత్రిని ఓ రకం గా మందలించారు' అనీ, స్వకుచమర్దనం చేసుకుంటూ, పళ్లికిలిస్తున్నారు.

మంగళవారం వుదయం 9-00 లోపే, ఇంకా చాలా మంది 'వేప్పుల్లలతో' దంతధావనం చేస్తూండగానే, పూర్తిగా కాలకృత్యాలు తీర్చుకోకుండానే వాళ్ళని పోలీసులు చితకబాదారని పత్రికలూ, టీవీలూ చూపించాయి.

మరి ఆవిడ నిద్రలేచి, బాత్రూముకి కూడా వెళ్ళకుండానే, మన రాయపాటి 'ఆవిడని కలిసి........'అని మనని నమ్మమంటాడు.

పైగా 'సమస్య జటిలం కాకుండా' అంటే, వాళ్ళని చావబాది, బస్సులెక్కించమని అర్థమా; అదికూడా ఆవిడే చెప్పిందా అన్న విషయం లో ఈయనేమీ మాట్లాడడం లేదు.

బాబూ! మీకంత సీనే వుంటే, ఇలాంటి సమస్యలే వచ్చేవి కాదు అంటున్నారు మన తెలుగు వాళ్ళు. అవునా?

ఇక, ఒకప్పుడు తననుతాను 'మరాఠా సింహం' గా అభివర్ణించుకున్న ముసలి రాజకీయ పందికొక్కు బాల్ ఠాక్రే, "బాబేమన్నా మీ ఇంటల్లుడా? వాడికి ఆంధ్రాలోనే జైలుగుడ్డలు వేసి, మన జైల్లో చిప్పకూడు యెందుకు తినిపించలేదు?" అని ఘుర్ఘురించాడట వాళ్ళ ముఖ్య మంత్రిని!

అఫ్ కోర్స్--వాడి ప్రతి పక్ష పాత్ర వాడు పోషిస్తున్నాడు--రక్తి కట్టేలా! 

సొంత కొడుకే వాణ్ణి గుడ్డలూడదీసి చితక్కొట్టినంతపని చేసినా వాడికి బుధ్ధి రాలేదు--రాబోదు! వాణ్ణేమీ అనఖ్ఖర్లేదు మనం.

"తెదేపా యాత్రని రాజకీయాలతో ముడిపెట్టడం సరి కాదు. అలా అయితే, మధు యాష్కీ సుప్రీం కోర్టులో కేసు వెయ్యడమూ రాజకీయమేనా?....వుప యెన్నికలకూ, తెదేపా బాబ్లీ చూసేందుకు వెళ్లడానికీ సంబంధం లేదు" అంటూ అమూల్యం గా తన అభిప్రాయాన్ని ప్రకటించారు--'కాకా' వెంకట స్వామి. 

"....నేతలను హైదరాబాదు పంపడం 'ఆమె నిర్ణయమే' అయి వుండవచ్చు అని భావిస్తున్నా" అని మళ్ళీ సన్నగా నొక్కుతూ, తన వీర విధేయతని చాటుకున్నారు.

ఇక 'నాందేడ్' ఎంపీ, భాస్కరరావు పాటిల్, "వాళ్ళని వాళ్ళే కొట్టేసుకుని, గాయ పడ్డారు. తరవాత పోలీసులపై దాడి చెయ్యడం తో 'యెనిమిది మంది'...కాదు కాదు..'ఆరుగురు పోలీసులు' గాయ పడ్డారు" అని చెప్పాడట!

"ఆంధ్రా నించి పైసాకూడా తీసుకోలేదు.....సుప్రీం కోర్టు గేట్లు పెట్టద్దనలేదు....." అంటూ అవాకులూ చవాకులూ పేలాడట!

ఇలాంటి బఫూన్ వెధవలకి వోటు వేసిన నాందేడ్ ప్రజలని--కాదు వోటర్లని--అనాలి!

ఇక మన గౌరవనీయ హైకోర్టు, "తెదేపా అధినేత చట్టాన్ని వ్యతిరేకించవచ్చా? శాంతి భద్రతల సమస్యను సృష్టించవచ్చా? అన్నీ తెలిసిన వ్యక్తి అక్కడికెందుకు వెళ్ళారు? ఇది ప్రచారం కోసం దాఖలు చేసినట్లుగా వుంది!" అనే కాకుండా, "ఈ కేసులో అవసరమైతే (పిటిషనరు కి) జరిమానా కూడా విధించాల్సి వుంటుంది" అని వ్యాఖ్యానిస్తూ బెదిరించింది(ట).

"ప్రి జుడిస్" కి చక్కని వుదాహరణ కదూ ఇది?



Wednesday, July 21

తెలుగోడు

బాబ్లీ

చంద్రబాబు యాత్ర "సుఖాంతం" అయి, కేర్ హాస్పిటల్ కి చేరింది.

రోశయ్య, 'మహారాష్ట్ర పోలీసులు కాస్త అతిగా ప్రవర్తించినట్లు అనిపిస్తోంది' అనలేదింకా!

చిన్నా చితకా కాంగీరేసు రా నా లు మాత్రం, "చంద్రబాబు అరెస్టు అయితేనే ఆత్మహత్యలు చేసుకొంటున్నారట. ఇక చనిపోతే (పాపం శమించుగాక) యెన్ని లక్షలమంది చనిపోతారో?" అనివ్యాఖ్యానిస్తూ, ప్రజలు వీళ్ళనీ, వీళ్ళ వ్యవహారాన్నీ చూసి, దేనితో నవ్వుతున్నారో చూడడం లేదు.

జేపీ కూడా, చంద్రబాబుది రాజకీయం అనడానికి వీల్లేదు అంటున్నాడు.

మామూలుగానే, నాక్కొన్ని సందేహాలు.

1. 2004 ఆగష్టు లో బాబ్లీ శంకుస్థాపన జరిగినప్పుడు, అధికారం లో వున్న వై యెస్, "మహారాష్ట్ర ముఖ్యమంత్రిని మందలించమని సోనియా ని అడగడం బాగోదు కదా?" అనీ, "ఓ రెండుమూడు లక్షల మంది తో మహారాష్ట్ర మీద యుధ్ధానికి వెళ్ళలేము కదా?" అనీ వ్యాఖ్యానించి, మనరాష్ట్రం '....క్రిందికి' నీళ్ళు చేరుతున్నా, మిన్నకుండిపోయారని వీళ్ళు (కాంగీరేసులు) మరిచిపోయారా?

2. జడ్ ప్లస్ కేటగరీ లో వున్న చంద్రబాబు రక్షకులు, ఆయన మీద లాఠీ చార్జీ జరిగి చొక్కా చిరిగి పోతే, పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆయన చుట్టూ రక్షణ వలయాన్ని నిర్మించారట. మిగిలిన నాయకుల అంగరక్షకుల్ని పోలీసులు తరిమికొడుతూంటే, పొలాల వెంబడి పరుగెత్తారట!

యెందుకలగ?

==> ఓ అంగ రక్షకుడు, తన తుపాకీని గాలిలోకి పేల్చి, పోలీసుల్ని హెచ్చరిస్తే, వాళ్లు ఆగిపోయేవారు కదా?

ఇంకా వాళ్లు ఆగకపోతే, ఓ నలుగురైదుగుర్ని వేసేస్తే, ఇంకా మాట్లాడితే, నాందేడ్ కలెక్టర్నీ, ఎస్ పీ నీ కూడా వేసేస్తే, యెలా వుండేది?

(చట్ట ప్రకారం, అంగరక్షకులు చేసే పనికి నాయకులే బాధ్యత వహించాలంటారా? మన రా నా లకి, కేసులూ, కోర్టులూ యేమీ కొత్త కాదు కదా? గాంధీగారు మన రా నా లకి ఆదర్శం కానీ, అంగరక్షకులకి కాదు కదా?)

3. 'పిలుపు తక్కువయ్యింది' అని అలిగి వెళ్ళలేదు అని చెప్పిన చిరంజీవి, ఇప్పుడు '23న అఖిలపక్షం వుండగా వెళ్ళడం ఆయన తొందరపాటే' అంటున్న చిరంజీవి, నిజం గా యాత్రకి వెళ్ళి వాళ్ళతో వుండి వుంటే--యేమి జరిగేది?

ఆయన అభిమానులూ, కార్యకర్తలూ ఈపాటికి యేమి చేసేవారు?

(ఇంకా సందేహాలు వున్నాయి గానీ, ఇవే ముఖ్యమైనవి)

ఇక చెయ్యవలసింది?

రెండురోజుల్లో ప్రథానితో జరగవలసిన అఖిలపక్షం భేటీని ఇంకో మూడు రోజులు పొడిగించి, 26 కి మార్చారు.

ఇక విపక్షాలన్నీ, ఈ భేటీని బహిష్కరించండి. ప్రథానీ, అధిష్టానం దిగి వచ్చి, అఖిలపక్షాన్ని హైదరాబాదులోనే కలవమనండి--జరిగిందానికి క్షమాపణ చెప్పాక!

ఆ భేటీ కి మరాఠీ ముఖ్యమంత్రిని కూడా రప్పించమనండి. 

వాడు రాగానే, అంగ రక్షకులతోసహా విమానాశ్రయం లోనే బంధించి, బందెలదొడ్లో పెట్టి కుళ్ళబొడవమనండి.

అప్పటిదాకా, కాంగీరేసుల్తో అన్ని అధికార, అనధికార సమావేశాల్నీ బహిష్కరించండి.

యేం జరుగుతుందో చూడండి.
 

Monday, July 19

అంతర్రాష్ట్ర....

.....దురన్యాయం
"మేమేమైనా టెర్రరిస్టులమా? బాంబులూ తుపాకులూ తెచ్చామా? ఇక్కడకి రావడానికి పాస్ పోర్టూ, వీసా కావాలా? ప్రాజెక్ట్ చూస్తే తప్పేమి వుంది? యెందుకు అరెస్టు చేస్తారూ?"
ఇవీ చంద్రబాబు లేవనెత్తిన ప్రశ్నలు. అన్నీ సబబుగానే వున్నాయి కదా?

జరిగే పనులూ, గొడవలూ జరుగుతూనే వుండగా, ఈయన యేమి సాధిద్దామని అక్కడికి వెళ్ళాడో, ఆ ప్రాజెక్ట్ ని చూడనిస్తే ఆ ముఖ్యమంత్రికేమి నష్టమో--ఇలాంటివన్నీ రాజకీయ రాక్షసులకి తప్ప సామాన్యులకి అర్థం అవుతాయనుకోను.

ఈ విషయాలు పక్కన పెడితే--

ఇదివరకు తెదేపా నేతలు వెళితే, సరిహద్దుల్లో వాళ్ళ జనాలని సమీకరించి, పోలీసులని మోహరించి, వీళ్ళమీద లాఠీలతో వీరవిహారం చేశారు.

ఇప్పుడు కూడా, నిన్న (18-07-2010) పోలీసులకి కొంత బిజీ తగ్గాక, మీడియా వాళ్ళని యేదో వంకతో వాళ్ళ రాష్ట్రం లో కొంత దూరం తీసుకెళ్ళి, వాళ్ళు వెనక్కీ ముందుకీ కదలడానికి వీల్లేకుండా చేసి, అదే సమయం లో సరిహద్దుల్లో అందోళన చేస్తున్న జనాలనీ, మీడియా వాళ్ళనీ--చితక బాదారు. మన రాష్ట్రం లో చాలా దూరం లో పొలం పనులు చేసుకుంటున్నవాళ్ళని కూడా బాదారుట.

మామూలుగా కూడా యెవరినీ ఆ సరిహద్దు దాటకుంటా కట్టడి చేసేశారు ఇన్నాళ్ళ నించీ!

ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి, వాళ్ళ అధినేత్రి దగ్గరకి వెళ్లి, ఇంకా కొన్ని మెలుకువలు నేర్చుకొని మరీ వచ్చారట.

నా దృష్టిని ఆకర్షించిందేమిటంటే, పత్రికలవాళ్ళతో 'మహారాష్ట్రకి స్వయం ప్రతిపత్తి గురించి మా మధ్య మాటలు జరగలేదు' అని ఆయన అన్నాడట.

ఇవన్నీ చూస్తుంటే, సమీప భవిష్యత్తులోనే, రాష్ట్రాలు కూడా--(దేశం నుంచి) "సోదరుల్లా విడిపోదాం" అనే పరిస్థితి దాపురించేందుకు ఆ పార్టీ పెద్ద యెత్తున కుట్ర చేస్తోందేమో అనిపిస్తూంది.

మరి యేమవుతుందో! 

Friday, July 16

వినోదం

మానసికానందం

శివ గారి సాహిత్యాభిమాని లో పైరసీ గురించి టపా చూశాక, ఇది వ్రాయాలనిపించింది.

మొన్న AVS టపా మీద నా టపా లో '............చిరాకు వచ్చింది' అని వ్రాస్తే, యెవరైనా అడుగుతారేమో అనుకున్నాను--యెందుకు? అని.

ఇదివరకు థియేటర్లో సౌండ్ సిస్టం లో ఓ విప్లవం 'dts' సౌండ్. పాత సౌండ్ సిస్టం ల కన్నా చాలా స్పష్టం గా వినిపించి, వినడానికి ఆహ్లాదం గా వుండేది.

తరవాత వచ్చిన 'డాల్బీ' సిస్టం తోనే వచ్చింది తంటా.

సాహిత్య అభిమాని బ్లాగులో చెప్పినట్టు, పాటలు వస్తే విపరీతమైన సౌండ్ రావడం, యెవరో తలుపు తోస్తే, చెవులు చిల్లులుపడే శబ్దం రావడం--ఇలాంటివి. ఇంకా ఓపక్క స్పీకర్లని రెండో మూడో ఆఫ్, ఆన్ చెయ్యడం లాంటివి స్వయం గా చేస్తున్నారో, ఆటోమేటిక్ గా ఆ సిస్టం లో అవుతాయో నాకు ఇప్పటికీ తెలియదు.

ఇక మాడరన్ ట్రెండ్ అంటే, దుబాయ్ వాళ్ళ ట్యూనులని దిగుమతి చేసుకొని, పాడే వాళ్ళ గొంతుల్ని నొక్కేసి, అదేదో సీనారేకు మీద దువ్వెన్న తో గీకితే వచ్చే కీచు గొంతుకలా రికార్డు చెయ్యడం, అన్నిభాషలనీ మిక్స్ చేసేసి, యేదో పాడించేసి, వెనకాల సోఁయ్ సోఁయ్, అనో, డోఁయ్, డోఁయ్ అనో, ఈఁ ఈఁ ఈఁ అనో, ఊఁ ఊఁ ఊఁ అనో మోతెత్తించడం. 

ఓ సినిమాలో లక్ష్మీపతి గొంతు 'తారురోడ్డు మీద రేకు డబ్బా తో గీసినట్టు వుంటుంది' అనిపించారు--హాస్యం గా బాగానే వుంది. 

మరి సంగీతం లో ఈ వెర్రి తలలు యేమిటో!

శ్రీ రామదాసు సినిమాని ఎంజాయ్ చెయ్యలేకపోడానికి సౌండ్ సిస్టం మొదటి కారణం. 

కథని వక్రీకరించడం రెండో కారణం.

మూడోది--హాస్య తొట్టి గ్యాంగ్. ముఖ్యం గా జయప్రకాష్ రెడ్డి--ఆయన లేకుండా వుంటే సినిమా ఇంకా చాలా బాగుండేది.

పాత భక్త రామదాసులో తానీషా--శ్రీ పసల సూర్యచంద్ర రావు--ని ఓ సారి చూడండి యెక్కడైనా దొరికితే!

(ఇదివరకు అదే కథ తో మళ్ళీ తీసిన సినిమా విడుదల అయితే, దాంతోపాటు పాత సినిమాని కూడా విడుదల చేసేవారు--ప్రేక్షకులు రెండూ కంపేర్ చేసుకుంటారనే వుద్దేశ్యం తోనేమో! ఉదా:- కొత్త దేవదాసు, పాత దేవదాసు)

మళ్ళీ ఇంకోసారి.

Sunday, July 11

సినీ పరిశ్రమ

పైరసీ

డియర్ AVS!


లక్కీగా ఆర్టిస్ట్ అవడం కాదు--లక్కీగా హిట్ అవడం. ఇక బ్యాంకింగ్ రంగం లో లక్ యెలా వుంటుందో నాకు తెలియదు.

ఇక రొయ్యల చెరువులూ, చేపల చెరువులూ, పొగాకు చుట్టలూ, బీడీలు పరిశ్రమల్లో కోట్లు సంపాదించి, సినిమాలు తీసి, వందల కోట్లు సంపాదించాలనుకున్నవాళ్ళు యేమయ్యారో, మీకు తెలిసేవుంటుంది.

పైరసీవల్ల సినిమా పరిశ్రమ నష్టపోతూంది అనేదానికి అన్నానుగానీ, వ్యక్తిగతం గా మీ సినిమాలు ఢాం అంటే, నాకు 
సంతోషం కాదు కదా? 

'యేవి మంచి సినిమాలో తెలియాలంటే.......'--అఖ్ఖర్లేదు. మీరన్న "అల్లూరి సీతారామ రాజు" సినిమా చూసి బయటికొస్తున్న నన్ను అభిప్రాయం అడిగితే, "పిక్చర్ ఆఫ్ ది డికేడ్" అని చెప్పాను. 

మళ్ళీ హాస్యం గా అంటున్నారా అని అడిగినవాళ్ళకి, "ఇది నిజం" అని నొక్కి చెప్పాను.

ఇప్పటికీ అది "పిక్చర్ ఆఫ్ ది మిలీనియం" గా వుంది. 

రండి, యెన్ని పైరసీ సీడీలు విడుదల చేస్తారో--థియేటర్ లోనూ రిలీజు చెయ్యండి.....కలెక్షన్లు యెలా వుంటాయో చూడండి.

దాదాపు 20 యేళ్ళ తరవాత మళ్ళీ థియేటరు కి వెళ్ళి, "శ్రీ రామదాసు" చూశాను--చిరాకు వచ్చింది అంటే నమ్మరేమో మీరు!

ఇక ఇండస్ ట్రీ గురించీ, వాల్ పోస్టర్లు అంటించేవాళ్ళగురించీ, యెవరెంత బాధపడినా, కొన్ని అనివార్యం.

ఈ రోజు బ్లాగుల్లో చూస్తున్నట్టు, ఒకప్పుడు వెలిగిన రేడియో మెకానిక్ లు యేమి చేస్తున్నారు? ఆడియో క్యాసెట్లూ, రికార్డర్లూ, టూ ఇన్ వన్ లూ, వీడియో ప్లేయర్లూ, రికార్డర్లూ, ఇవన్నీ యేమయిపోయాయి? యెన్ని లక్షలమంది వుపాధి పోగొట్టుకున్నారు? 

గాడ్రెజ్ కంపెనీ తన ఆఖరి టైప్ రైటర్ ఫ్యాక్టరీని కూడా మూసేసిందే? 

చెప్పాలంటే ఇంకా చాలా వున్నాయి--కష్టించేవాడికి ఇది కాకపోతే, మరోటి! 

'.......యెవరూ యేడవరు ' కరెక్టే! కానీ యేమి తీసినా కనీసం నేలటిక్కెట్టు అయినా కొనుక్కొని చూశారు జనాలు! యెందుకంటే అప్పట్లో వాళ్ళకి వున్న ఒకే ఒక్క 'ఎంటర్టెయిన్ మెంట్' అదే కాబట్టి!

ఇప్పుడుకూడా, మేం కోట్లు పెట్టి తీస్తాం, యెంత చెత్తగా వున్నా మీరు వేలు ఖర్చుపెట్టి చూడల్సిందే--తక్కువరేటుకి వచ్చేవి చూడద్దు--అంటే!?? తియ్యడం మానేస్తే పోలా? ఇండస్ ట్రీని మూసేస్తే పోలా?

ఇక--ఈ santhi యెవరో--చిలక పలుకుల్లా లక్ గురించీ, బ్యాంకింగ్ రంగం లో లక్ గురించీ మాట్లాడుతున్నారు. 'తుత్తి ' అన్న ఆయన మేనరిజం 'హిట్' అయ్యింది--సినిమా అంత గొప్పది అంటే నేనొప్పుకోను. మరి నేను వ్యక్తిగత విషయాలేమి చర్చించానో తమరే చెప్పాలి.

WitReal, deepu లాంటి వాళ్ళు తెలుగు వ్రాయగలిగీ, ఇంగ్లీ-తెలుగు లో యెందుకు బ్లాగుతున్నారో నాకు తెలీదు. 

Friday, June 25

ప్రజల సంపదకి......

......ధర్మకర్తలు

"సంపదకి సామాన్య ప్రజల తరఫున ధర్మ కర్తలుగా వ్యవహరించండి!" అని కోరేవాడట--మన మహాత్ముడు గాంధీ!

టాటా బిర్లాల దగ్గరనించి చందాలు స్వీకరిస్తూ, వాళ్ళకి ఇలాంటి సలహాలిస్తాడేమిటీ పిచ్చి ముండాకొడుకు? అని ఆశ్చర్యపోయాను మొదటిసారి నా చిన్నప్పుడు ఈ విషయం చదివినప్పుడు.

ఆయన ఆ విషయం చెప్పిన దాదాపు వందేళ్ళ తరవాత, ప్రపంచ సంపద యెక్కువ మూటకట్టుకున్నవాళ్ళు ఇప్పుడు చెపుతున్న, చేస్తున్న పనులు చూస్తూంటే, 'యెంత నిజం చెప్పాడు మహాత్ముడు!' అని ఆశ్చర్యపోవడం నా వంతయ్యింది ఇప్పుడు!

"వూరి వెలుపల పాడు కోనేటి చెంత
మనుజులెవ్వరు మసలని మారు మూల
గుట్ట చాటున లోతైన గోయి త్రవ్వి
పసిడి దాచెను పిసినారి ముసలి ఒకడు!"

ఇలా దాచడం వల్ల వుపయోగం లేదు అని గ్రహించడమే కాదు, అలా దాచేవాళ్ళందరికీ పాఠాలు చెప్పడానికి కంకణం కట్టుకున్నాడు--వారెన్ బఫెట్! ఆయనకి తోడుగా, బిల్ గేట్స్!

"నా సంపదలో 1% చాలు నా వారసులూ, నేనూ హాయిగా బతకడానికి" అంటున్నాడాయన--ఆ 1% విలువ కొన్ని వేల కోట్లు మరి!

మిగతా ఆస్థుల్ని 'ప్రపంచ పేదల' కోసం ట్రస్టులకి దానం ఇవ్వడమేకాదు, మిగతా ప్రపంచ కోటీశ్వరులని అందరినీ కలిసి, వాళ్ళు కూడా 'అదేపని' చెయ్యమన ప్రొత్సహిస్తున్నాడు బఫెట్! (ఇంకా వాళ్ళెవరూ ఈ మాట విన్నట్టు లేదు మరి.)

కానీ, మన దేశం లో--

==> హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్ 'శివ్ నాడార్' 580 కోట్లు గురువారం నాడు దానం చేశాడు!

==> టెక్ మహీంద్రా ఎం డీ వినీత్ నయ్యర్ కంపెనీలో తన వాటాలో మూడో వంతు--తన భార్య నిర్వహిస్తున్న ఓ స్వచ్చంద సంస్థకి దానం చేశాడు!

==> ఆజీమ్ ప్రేమ్‌జీ, నారాయణ మూర్తి, సుధా మూర్తి, ఇప్పటికే వందల కోట్ల తో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు!

==> నందన్ నీలేకణి భార్య రోహిణి కూడా 40 మిలియన్ డాలర్లు దానం చేశారు!

2009 లో ఇలా దాతృత్వం కోసం కేటాయించబడ్డ సొమ్ము దాదాపు 3,487.12 కోట్లకి చేరుకొందట!

బాపూ! నీకు, నీ దూర దృష్టికీ జోహార్లు!

Monday, May 24

పశువులక్లాస్

“పందావన్ ఎక్స్ ప్రెస్”

మొన్నామధ్య శశిథరూర్ అనే ఓ మంత్రిగారు, ‘మీరు క్యాటిల్ క్లాస్ (పశువుల తరగతి) లోనే ప్రయాణిస్తారా?’ అని అడిగిన ప్రశ్నకి, ‘తప్పకుండా’ అని జవాబిచ్చాడట తన బ్లాగు లో!

“అదుగో! పశువుల తరగతి అంటావా! హాత్తెరికీ” అంటూ రెచ్చిపోయారు కొంతమంది.

‘క్యాటిల్’ అంటే, మచ్చికయిన, పాలిచ్చే జంతువులు అని అర్థం అనుకుంటా.

మరి వీటిలో, పందులూ, గాడిదలూ వున్నాయోలేదో నాకు తెలీదు.

కానీ, ఆ క్లాస్ కి చక్కటి వుదాహరణ చెన్నై నించి బెంగళూరు వెళ్ళే ‘బృందావన్ ఎక్స్ ప్రెస్!‘

ఇదో చిత్రమైన రైలు. ఉదయం 7-15 కి చెన్నై సెంట్రల్ లో బయలుదేరి, 11-00 కల్లా బెంగళూరు చేరుతుంది. ఇంజన్ తరవాత ఓ ఐదారు ‘అన్ రిజర్వుడు‘ బోగీలు, మూడు ‘ఏ సీ’ బోగీలు, ఓ పేంట్రీ కార్, ఓ పదిహేను ‘రిజర్వుడు‘ బోగీలు—ఇదీ ఆ రైలు. అన్నీ ‘సిట్టింగ్ సీట్లే!’

ఉదయంపూట ఆహ్లాదం గా ప్రయాణం, దాదాపు నాలుగ్గంటల్లో గమ్యం చేరతాం కదా అని ముచ్చటపడి రిజర్వేషన్ చేయించుకొని, యెక్కాము చెన్నై లో.

రిజర్వేషన్ లో నే తమాషా వుంది. ఒక్కో బోగీలో దాదాపు 100 సీట్లు వున్నాయి. మనం యెన్ని సీట్లు రిజర్వ్ చేసుకున్నా, రెండుకన్నా యెక్కువ సీట్లు ఒకేచోట రావు. నాలుగు సీట్లు చేసుకుంటే, నాలుగు చోట్ల వస్తాయి—ఇంకా నయం—ఒకే బోగీ లో వస్తాయి. ఉదాహరణకి, 17, 49, 62, 83 వచ్చాయి అనుకుందాం. మనం కాస్త మంచివాళ్ళలా కనిపించే వాళ్ళ ప్రక్కన మనకి రిజర్వ్ అయిన సీటు చూసుకొని, లగేజి పెట్టుకొని, అక్కడనించి నెంబర్లు వెతుక్కుంటూ మన పక్కసీట్లలోకి వచ్చేవాళ్ళని బతిమాలి, మన ఇతరనెంబర్లలో వాళ్ళని కూర్చోమని, వాళ్ళ నెంబర్లో మనం సెటిల్ అవుతాము. కాట్పాడి వచ్చేవరకూ, ఈ తతంగం సరిపోతుంది.

టీటీ వచ్చి, రిజర్వేషన్లు చెక్ చేస్తాడు—యే నెంబరు సీటు లోనూ అది రిజర్వు చేసుకున్నవాళ్ళు వుండరుగా? ఓకే,ఓకే అంటూ టిక్కులుపెట్టేసుకొని, వెళ్ళిపోతాడు. మాకు ఓ తమిళ ఆచారి వచ్చాడు టీటీ గా.

జాలార్ పేట వచ్చేసరికి, రిజర్వేషన్లున్నవాళ్ళు యెక్కడం పూర్తి అయిపోతుంది. ఈ లోపల, అనేకమంది, రిజర్వేషన్ లేనివాళ్ళు బోగీలో జొరబడిపోయి, సీట్లమధ్యనా, తలుపుల దగ్గరా, టాయిలెట్ల ముందూ, పిల్లా, మేకా, తట్టా బుట్టా తో సెటిల్ అయిపోతారు!

ఆ మధ్యలోనే, పద్మవ్యూహాల్లోని అభిమన్యుళ్ళలా, అనేకమంది—టీ, కాఫీ, వడా, సమోసా, దోశ దగ్గర నించి, పూసలూ, పిల్లలబొమ్మలూ, పుస్తకాలూ, పళ్ళూ, కూరగాయలూ—ఇలా అవతారాలుమార్చుకుంటూ—హాకర్లు! వాళ్ళు అమ్మని వస్తువంటూ వుండదు.

ఈ లోపల, టీ టీ రిజర్వు చేసుకొని రైలు యెక్కలేకపోయిన వాళ్ళ సీట్ల నెంబర్లు గుర్తిస్తాడు. (అప్పటికే, రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేస్తున్నవాళ్ళు కొంతమంది ఆయనని ‘సార్! మాకు నాలుగు సీట్లు, మాకు రెండు సీట్లు—అంటూ దేబిరిస్తూ వుంటారు.) అలాంటివాళ్ళదగ్గర, వీలైనంత గుంజి, ఖాళీ సీట్లు కేటాయిస్తాడు. అవి కూడా ఒక చోట వుండవు కదా? మళ్ళీ వాళ్ళు వచ్చి, ‘ఆడవాళ్ళు వున్నారు, ప్లీజ్—మీరు యెదురుసీట్లో సర్దుకుంటారా?’ ఇలా అడ్జస్ట్ మెంట్లు మొదలు! (మా ‘పందాచారి ‘ అయితే, ఇలాంటివాళ్ళకి మద్దతు ఇచ్చి, రిజర్వు చేసుకున్న సీట్లవాళ్ళని దౌర్జన్యం గామీ సీటులోకి మీరు వెళ్ళిపోండి అని తరిమేశాడు!)

సరే—బంగారుపేట లో కూడా, యెక్కేవాళ్ళు యెక్కుతూనే వుంటారు—రిజర్వేషన్ లేకుండా! ఇక కే ఆర్ పురం వస్తుందనగా, మొదలవుతాయి యుధ్ధాలు—సెటిల్ అయిపోయిన వాళ్ళకీ, దిగేవాళ్ళకీ!

ఒకావిడ, తన బేగ్ క్రింద వేసుకొని, దానిమీద గుమ్మానికి అడ్డం గా కూర్చొని, ఒళ్ళో పిల్లాణ్ణిపెట్టుకొని, అందరినీ చెరిగేస్తోంది! ఆవిడకి మద్దతు—చుట్టూ నిలుచున్నవాళ్ళు—గుమ్మానికి అడ్డం గా!

ఓ పెద్దమనిషి పాపం, నిలుచున్నవాళ్ళలో ఒకణ్ణి, ‘మీరు ఇక్కడ దిగుతారా?’ అనడిగాడు—లేదు అంటే, కొంచెం జరగమనే వుద్దేశ్యం తో. దానికి అతని సమాధానం—‘నేనే కాదు—ఇంకో అయిదువందల మంది దిగుతారు. రైలు ఐదు నిమిషాలు ఆగుతుంది—అప్పుడే అందరూ దిగాలి!’ అని.

అడ్డం గా కూర్చున్న ఆవిడని ఇంకోపెద్దమనిషి, ‘కొంచెం పక్కకి తప్పుకో, మేము దిగాలి‘ అంటే, ఆవిడ సమాధానం ‘నేనుకూచోడానికే చోటు లేక పోతే, నీకు దిగడానికి చోటివ్వాలా? దిగితే దిగు, లేకపోతే మానెయ్యి!’ అని. పట్టు వదలని విక్రమార్కుడిలా ఆయన, ‘లోపల సీట్లు ఖాళీ అవుతున్నాయికదా, వెళ్ళి కూర్చో, మాకు దారి ఇవ్వు‘ అంటే, ఆవిడ, ‘నువ్వెవరు—నాకు చెప్పడానికి?’ అంటూ కళ్ళెర్రజేసింది!

ఇక రైలు అగేసరికి, ఒకళ్ళనొకళ్ళు గెంటుకుంటూ, తోసుకుంటూ, గుద్దుకుంటూ, తన్నుకుంటూ, అతికష్టం మీద బయట పడి, యెవరినో బతిమాలి, లగేజీలు కిటికీల్లోంచి బయటపడెయ్యమని, అందుకొంటూ, కదులుతున్న రైలు ప్రక్కన పరిగెడుతూ—బ్రతుకు జీవుడా! అని ప్రయాణం ముగించాలి!

యెలా వుందండి మన ‘పందావన్ ఎక్స్ ప్రెస్?’

Tuesday, May 11

'చొప్పించబడ్డ వార్తలు '

చెల్లింపు వార్తలు

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 'చెల్లింపు వార్తల'పై మరిన్ని అధికారాలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కి కట్టబెట్టాలని సూచించిందట. ప్రెస్ కౌన్సిల్ చట్టాన్ని సవరించాలని ప్రభుత్వానికి సూచించిందట.

కొన్ని వార్తా సంస్థలు తమ పత్రికలోని వార్తల స్థలాన్ని అమ్ముకుంటున్నాయని ఆ కమిటీ తన నివేదికలో వెల్లడించిందట.

ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి, పార్లమెంటు వ్యవస్థకు పెనుముప్పని హెచ్చరించిందట.

సవరణ చట్టాన్ని వెంటనే తీసుకు రావాల్సిన అవసరముందని స్పష్టం చేసిందట.

ప్రెస్ కౌన్సిల్ ఉపకమిటీ ఇచ్చిన నివేదిక పై యేం చర్యలు తీసుకున్నారో తెలెపాలని మంత్రిత్వ శాఖని కమిటీ కోరిందట.

మరి శాఖ యేం చెపుతుందో!

Thursday, May 6

"ప్రకటన"

చేస్తున్నవారు : "ఏకే రైట్ టు జస్టిస్.కామ్"

ప్రకటన యేమిటంటే :

"యెనభై ఆరో యెన్నో అభియోగాలు నిజమని నిరూపింపబడి, దోషిగా నిర్ధారణ అయిన 'అజ్ మల్ కసబ్' కి సరైన శిక్ష విధించే అవకాశం మా .కామ్ కి ఇవ్వాలని తగిన న్యాయస్థానం లో పిటిషన్ వెయ్యబోతున్నాం.

"ఆ శిక్ష అమలుచెయ్యడానికి ఉత్సాహపడే పౌరులెవరైనా ముందుగా మా .కామ్ లో రిజిష్టర్ చేసుకోవాలి. (రిజిష్ట్రేషన్ వివరాలకోసం మా .కామ్ సందర్శించండి)

"ఆ నేరస్థుడికి కూడా మానవహక్కులు వుంటాయనేవాళ్ళెవరైనా వుంటే, వాళ్ళని కూడా వీడితో సమం గా శిక్షించడానికి మాకు అనుమతి ఇవ్వాలని కూడా అదే న్యాయస్థానం లో పిటిషన్ వెయ్యబోతున్నాం.

"వాడికి విధించాలనుకుంటున్న శిక్ష యేమిటంటే--

"ఇండియా గేట్ లో మృతవీరుల స్మారక చిహ్నం యెదురుగా, ఓ స్థంభం పాతి, వాడిని గొలుసులతో కదలడానికి వీల్లేకుండా కట్టేస్తాం. అతని దగ్గరకి వెళ్ళడానికీ, అతని ముందు ఒకే సెకన్ వుండడానికీ, తిరిగి రావడానికీ ఒకే మనిషి పట్టే విధంగా క్యూ లైన్ యేర్పాటుచేసి, నడవక్కర్లేనివిధం గా యాంత్రిక పరికరాలని నిర్మిస్తాం.

"శిక్ష యేమిటంటే, యెవరైనా సరే తమ దగ్గర వున్న ఆయుధాలతో అతన్ని, తమకి తోచిన అతని అవయవాన్ని, కొయ్యడం గానీ, పొడవడం గానీ చెయ్యవచ్చు.

"అవి యెంత పదునైన ఆయుధాలైనా అయి వుండవచ్చు. 

"ముఖ్య నిబంధన యేమిటంటే--యే ఆయుధం అయినా 'మూడంగుళాలు పొడవూ, ఒక అంగుళం వెడల్పూ మించి వుండకూడదు '. (ఆయుధాలు ముందుగానే పరిశీలించబడి, అనుమతించబడతాయి).

"ఈ శిక్ష అమలవుతూండగా, మా సొంత టీవీ ఛానెల్లో 24 గంటలూ, ప్రపంచ వ్యాప్త 'లైవ్' కవరేజ్ వుంటుంది. (మధ్యలో ప్రకటనలకి మా వాణిజ్య విభాగాన్ని సంప్రదించండి)

"వాణ్ణి సమర్ధించే 'మానవహక్కులవాళ్ళకి' కూడా, వాడి ప్రక్కనే, ఇలాంటి శిక్షలకే యేర్పాట్లు చెయ్యబడతాయి.

"వాడి సానుభూతిపరులెవరైనా వున్నా, క్యూ లైన్లలో అందరితోపాటు వెళ్ళి, ఇదివరకు యెవరైనా కోసిన చోట కుట్లు వేసుకోవచ్చు, పొడవబడ్డ చోట, మందులు రాసుకోవచ్చు!

"ఈ మొత్తం కార్యక్రమం 48 గంటలపాటు మాత్రమే అమలవుతుంది. ఇంకొక్క సెకను కూడా పొడిగింపబడదు. గమనించండి. (ఒకళ్ళిద్దరు అటూ యిటూగా 1,72,800 మందికి మాత్రమే అవకాశం!) తొందరపడండి.

"గమనిక : ఈ శిక్షల ముఖ్యోద్దేశ్యం--ప్రపంచం లో యే తల్లైనా, 'తోటకూర నాడే' తన బిడ్డని 'ఉగ్రవాదివి కాకురా కన్నా!' అని వేడుకోవాలని.

"తరవాత మీ యిష్టం".

(ప్రకటన ఫూర్తయింది)

సూచన : యేమీ చెయ్యలేని నా కడుపు మంటని తీర్చుకోడానికి మాత్రమే ఈ ప్రకటనని రూపొందించాను. ఇది నిజమని యెవరూ నమ్మవద్దని నా మనవి. ఇట్లు : కృష్ణశ్రీ)

Sunday, May 2

పెట్రో ధరలు

వడ్డనకిది సమయమా?!

'ఆహార ద్రవ్యోల్బణం ఓ రెండు మూడు నెలల్లో అదుపులోకి వస్తుంది' అని శరద్ పవార్ చెప్పి ఆ సమయం గడిచిపోయింది అనుకుంటా.

తరవాతోసారి, 'నా వ్యవసాయ శాఖకీ, ద్రవ్యోల్బణానికీ యేమిటి సంబంధం?' అని విసుక్కున్నాడు.

ఇప్పుడు 'చూశారా! తగ్గిపోతోంది?' అంటున్నాడు.

(పాపం ఆయన క్రికెట్ కుంభకోణాలనే పట్టించుకుంటాడా, తన మంత్రిత్వ శాఖనే పట్టించుకుంటాడా, తరువాత ప్రథాని కావడానికి యెత్తులే వేస్తాడా! యెన్నని చూసుకోగలడు ఒకేసారి! మధ్యలో ఫోను ట్యాపింగులొకటీ!)

ఇదే సమయం లో యూ పీ యే ప్రభుత్వం 'పెట్రో ధరల నియంత్రణ ఎత్తివేత ' గురించి గంభీరం గా ఆలోచిస్తోందట. కేంద్ర మంత్రులతో సాధికార కమిటీని నియమించేశారట. దీని నాయకుడు, ఇంకెవరు--ప్రణబ్ ముఖర్జీయే! (వీరు తీసుకొనే నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం అమోదం అఖ్ఖర్లేదట!)

మే 7 తో పార్లమెంట్ సమావేశాలు ముగిశాకే నిర్ణయం వెలువడుతుందట.

ఈ చర్య వల్ల పెట్రోలు ఓ 6 రూపాయల చిల్లరా, డిజిల్ ఓ 5 రూపాయల చిల్లరా మాత్రమే పెరుగుతాయట. ఇక వంట గ్యాస్ ఓ 270 రూపాయలూ, కిరొసిన్ ఓ 18 రూపాయల చిల్లరా మాత్రమే పెరుగుతాయట.

ఇంకా, ఒకవేళ అంతర్జాతీయ ధరలకు అనుగుణం గా దేశీయ చిల్లర ధరల్ని పెంచాల్సి వస్తే, ఈ సాధికార సంఘం విడతలవారీగా పెంచొచ్చుట!

సరైన సమయం లో సరైన నిర్ణయాలకి పెట్టింది పేరైన ఈ ప్రభుత్వం నిర్ణయం సబబేనంటారా?

గత ఎన్ డీ యే హయాములో, కొన్ని కోట్లతో ఆయిల్ పూల్ ఎకౌంట్ నిర్వహించి, దాంట్లో పెట్రో ధరల హెచ్చు తగ్గుల్ని సరిదిద్దేవారు. తరవాత, విపరీతమైన హెచ్చు తగ్గులు వుండవు అని నిర్ధారణ అయ్యాక, ఆ పూల్ రద్దు చేసి, ధరలని నిర్ణయించే అధికారం ఆ కంపెనీలకే వదిలేశారు అనుకుంటా. 

అప్పట్లో, ఫలానా రోజు నించి ధర 2 పైసలు తగ్గింది, మళ్ళీ ఫలానా రోజు నించి 5 పైసలు పెరిగింది--ఇలా రెండేసి మూడేసి రోజులకి కూడా మారుతూ వుండేవి ధరలు.

మరి యూ పీ యే వచ్చాక, ఆయిల్ పూల్ అవసరం అనిపించలేదనుకుంటా! పైగా, మురళీ దేవరా అస్తమానూ--పాతిక పెంచుతాను, యాభై పెంచుతాను అనుమతి ఇవ్వండి--అని అడుగుతూ వుంటాడు ప్రభుత్వాన్ని. 

ఇదిగో--ఇప్పుడు పులిమీద పుట్ర!

ఇంకెక్కడి ధరలు తగ్గడం!

తూర్పుకి తిరిగి దణ్ణం పెడదామా?

Sunday, April 25

అవినీతి.....

........తిమింగలాలు

కమండలం లో చిక్కిన చేప, ఇంటికి తీసుకెళ్ళేసరికి దానంతా పెరిగిపోయిందట. అలా చివరికి సముద్రం లో పడవేయ వలసివచ్చేంత పెద్దది అయిపోయిందట. అది మత్శ్యావతారం.

*  *  *

వందల్లో లంచం, వేలల్లో లంచం, లక్షల్లో లంచం, ఇప్పుడు కోట్లూ, వందల కోట్ల లో లంచం--ఇలా పెరిగిపోతున్నాయి లంచావతార చేపలు.

మెడికల్ కాలేజీలకి లైసెన్స్ లు ఇచ్చే సంస్థ అధిపతి కేతన్ దేశాయ్ ఓ రెండు కోట్లు మాత్రమే లంచం అడిగి, పట్టుబడ్డాడట.

*  *  *

నేను చదివిన ఓ ఇంగ్లీష్ క్రైం నవల లో ఓ వూళ్ళో ఓ పెద్దమనిషి ఇంట్లో నిలువెత్తు ఇత్తడి విగ్రహాలు--జీవకళ వుట్టిపడుతూ కనువిందు చేసేవిట.

నిజానికి వాడి నేలమాళిగలోనో యెక్కడో ఓ యంత్రం వుంటుంది. వూళ్ళో తనకి అందుబాటులో వున్న అందమైన ఆడ పిల్లలనీ, యెవరిమీదైనా కోపం వస్తే వాళ్ళనీ, మాయచేసి, ఆ యంత్రం క్రింద నిలబెడితే, పైనించి కరిగిన ఇత్తడి లోహం క్రింద మనుషులమీద చక్కగా పరుచుకొని, ఓ ఇత్తడి బొమ్మ తయారయి పోతుందట--సజీవులై వుండగానే!

*  *  *

క్రితం సంవత్సరం ఇవే రోజుల్లో, ఇంజనీరింగు కాలేజీలకి అనుమతులిచ్చే పెద్దమనిషిని లంచం అడిగాడనే అరెష్ట్ చేశారు. విచారించారు. ఇప్పటిదాకా ఆ కేసు యేమయిందో తెలియదు.

*  *  *

ఐ పీ ఎల్ అని పెట్టి, కూరగాయలు కొన్నట్టు క్రికెట్ ఆటగాళ్ళని కోట్లతో కొని, టీముల్ని తయారు చేస్తున్నప్పుడు అధికారులెవరికీ ఆ కోట్లు యెక్కడినించి వస్తున్నాయని అనుమానం కూడా రాలేదట.

ఇప్పుడు ఓ మంత్రీ, అతని ప్రియురాలూ, లలిత్ మోడీ అనే ఐ పీ ఎల్ అధ్యక్షుడూ--ఇలా వొకళ్ళ గుట్టు వొకళ్ళు బయటపెట్టుకుంటుంటే, 'అయ్యబాబోయ్! మనీ లాండరింగ్' జరిగిపోయింది అని గుండెలు బాదుకుంటున్నారు.

మీరు ఆశ్చర్య పోతారేమో--మొన్ననే నేను ఓ ఇన్స్యూరెన్స్ కంపెనీ లో ఓ లక్ష రూపాయలకి పోలసీ కావాలంటే, 'పీ ఎం ఎల్ రూల్స్ ప్రకారం మీకు ఆ అదాయం వచ్చినట్టు ఋజువు చూపించాల్సిందే' అని తిరస్కరించినంత పని చేశారు! 

మరి వందల వేల కోట్ల లో సంపాదిస్తున్నవాళ్ళకీ, నిలవ చేస్తున్న వాళ్ళకీ, దాన్ని మళ్ళీ అవినీతి మార్గాల్లోకి మళ్ళిస్తున్నవాళ్ళకీ ఈ పీ ఎం ఎల్ కనీసం కాలిక్రింది నల్లి లా కూడా కనిపించదేమో! యేమి మాయ!

*  *  *

హైస్కూలు పిల్లాణ్ణి అడిగితే చెపుతాడు--ఫలనా సంస్థ లో అవినీతి, అక్రమాలు జరగడానికి యెలా ఆస్కారం వుంటుంది? అని అడిగితే!

మన సీ బీ ఐ, ఏ సీ బీ వాళ్ళకి మాత్రం, ఇంజనీరింగు కాలేజీల అధిపతి యెలా మెక్కాడో, ఆ పధ్ధతీ అవీ క్షుణ్ణం గా పరిశీలిస్తేగానీ, ఇప్పుడు మెడికల్ కాలేజీల అధిపతి యెలా మెక్కాడో తెలియదు మరి!

*  *  *

ఇప్పటికి ఓ పధ్ధెనిమింది వందల ఒక్క కోటీ యాభై లక్షలు మాత్రమే సంపాదించినట్టు తేలిందట--కేతన్ దేశాయ్. ఇందులో ఓ పదిహేనువందల కేజీల బంగారం, ఇంకా నగదూ మాత్రమే వున్నాయట. బహుశా ఇంకో రెండు మూడు వందల కోట్లు బయట పడచ్చుట.

ఆ వూళ్ళో, ఆ పెద్దమనిషి కనిపెట్టిన యంత్రం క్రింద ఈ దేశాయ్ ని నిలబెట్టి, 1500 కేజీ ల కరిగిన బంగారం పోత పోస్తే, యెంత అందమైన--సజీవమైన దేశాయ్ విగ్రహం యేర్పడుతుందో కదా! 

ఆ స్వర్ణ కేతనుణ్ణి ఇంచక్కా నాలుగురోడ్ల కూడలి లో నిలబెట్టి, అక్కడో బోర్డు వేళ్ళాడదీస్తే, ఇంకెవరూ ఇలా అక్రమాలకి పాలు పడరు కదా? అంటాడు మా రుద్ర కోటీశ్వరుడు.

యెలా వుంది?

Thursday, April 22

పైరసీ

తాటాకు చప్పుళ్ళు

ఆ మధ్య ఓ యువహీరో తన అభిమానులతో సహా పైరసీ పేరుతో సీడీ షాపుల మీద దాడి చేసి తల బొప్పి కట్టించుకున్నాడు.

ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం పరిశ్రమకి సపోర్టు చెయ్యాలి అనీ, పైరసీ ని నిరోధించి, కోట్లలో నిర్మాతలకి వస్తున్న నష్టాన్ని నివారించాలి అనీ కోరితే, మన ము. మం. గారు, 'అలాగే, అలాగే, అలాగలాగే' అన్నారట.

{తమిళనాడులో ఓ జాతీయ నాయకుడు (వీడు కాంగీరేసు కాదు--ఇందిరాగాంధీని నాయకత్వం లోకి రాకుండా శతవిధాల ప్రయత్నించిన, తన 'ప్లాన్ ' తో నెహ్రూ మంత్రివర్గాన్ని కాపాడిన, తన పేర ఓ కాంగ్రెస్ స్థాపించిన--కామరాజ్ నాడార్!) యెవరేమడిగినా, నవ్వుతూ ఒకే మాట అనేవాడట--'పార్కలాం' అని. అంటే 'చూద్దాం' అని! అలాగ మన ము. మం. కి కూడా 'అలాగే, అలాగే, అలాగలాగే' అనేది వూతపదం అయిపోతుందేమో!}

ఇంతకీ ఇంత గోలకీ కారణమేమిటి?

కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాం, మేం తీసిన సినిమాని మేం చెప్పినన్ని డబ్బులు ఖర్చుపెట్టేవాళ్ళు మాత్రమే చూసి, మాకు కొన్ని పదులో, వందలో కోట్లు మాత్రమే కురిపించాలి--అనే వాదన నిర్మాతల్నించీ, నిర్మాతలు మా స్టార్ వాల్యూ తో మమ్మల్ని బుక్ చేసి, కొన్ని కోట్లు ఇస్తున్నారు, అలా ఇవ్వాలంటే--వాళ్ళు ఇచ్చిన కోట్లకి కొన్ని రెట్లు రాబట్టుకోవాలికదా? అది జరగాలంటే, నిర్మాతల వాదన నిజమే! కాబట్టి.....అంటారు యువ, ముసలి హీరోలు!

అసలు మిమ్మల్ని అన్ని కోట్లు ఖర్చుపెట్టి, అంత ఖరీదైన హీరోల్ని (పాత హీరోల, దర్శకుల, సంగీత దర్శకుల, హాస్య నటుల, కొడుకుల్నీ, మనమల్నీ హీరోలుగా) పెట్టి సినిమాలు తియ్యమని యెవరు దేబిరించారు?

తీశారుపో, ఫలానావాళ్ళే, ఫలానా అంత డబ్బుచెల్లించే, చూడాలని అనడానికి మీకేం హక్కుంది?

మీరు చేస్తున్నది వ్యాపారం అయితే, అందరూ చేసేది వ్యాపారాలే కదా? వాళ్ళు బాగు పడకుండా, మీరే బాగుపడాలని, దానికి ప్రభుత్వం సహాయపడాలని కోరడం యెంతవరకూ సబబు?

(మిగతా ఇంకోసారి!)

Monday, April 5

చొప్పించబడ్డ వార్తలు

బీటీ--2

(కాయతొలుచుపురుగు రోగనిరోధక శక్తిని పెంచుకోవడం పై, పరిష్కారం యేమిటి అని అడిగిన ప్రశ్నకు)

గుజరాత్ తో పాటు చుట్టుపక్కల వున్న రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ల లో (6 రాష్ ట్రాల్లో--యెన్నివేల యెకరాల్లోనో!) 'బోల్గార్డ్-1' రెండు మూడేళ్ళు మానేసి, 'బోల్గార్డ్-2' వెయ్యాలట. (ఈ రెండూ మొనోశాంటో నే అమ్ముతుంది మరి!)

ఈ సాగులో కూడా, పత్తికాయలు అభివృధ్ధి చెందే సమయం లో, "కనీసం రెండు మూడు సారులు పురుగు మందు పిచికారీ చెయ్యాలట."

6 రాష్ట్రాల్లోని వేల యెకరాల్లో, రెండు మూడేళ్ళపాటు వాళ్ళ పంటనే వేస్తూ, పురుగు మందులు కూడా చల్లుతూ వుండడానికి యెంత ఖర్చు అవుతుంది? మరింక బీటీ యెందుకు?

చైనాలో నిబంధనలు చాలా కఠినం గా వుంటాయట. రైతులకు రెఫ్యూజియా విత్తనాలను సరఫరా చెయ్యవలసిందే నట. (లేక పోతే మొనోశాంటో కి పగులుతుంది మరి!)

బీటీ వల్ల దిగుబడి పెరగలేదంటున్నారు కదా అన్న ప్రశ్నకి, ఆయన యెంత అందం గా జవాబిచ్చాడో చూడండి.

దిగుబడి పెరగదు--అన్నాడు. కాని, ఓ మొక్కకి 100 గ్రాముల దిగుబడిని ఇవ్వగల శక్తి వుంటే, బీటీ వల్ల జన్యుబలం పెరగడం వల్ల, పూర్తి స్థాయి దిగుబడి వచ్చి తీరుతుంది--అంటున్నాడు. (అంటే వందకి వంద గ్రాములు అన్నమాటేకదా?) ఇదెలా సాధ్యం?

విత్తనాలకి మొనోశాంటో మీదే ఆధార పడాల్సి వస్తుంది కదా అంటే, బోల్గార్డ్ మాత్రమే మోనోశాంటోవి--ఇంకా చైనా, ఖరగ్ పూర్, ధార్వాడ్, బెంగుళూరు ల నించి కూడా మొత్తం 4 రకాల బీటీ లని తిసుకున్నారట. ఇంకో మూడు రకాలు పరీక్ష దశలో వున్నాయట. మరి ఇవన్నీ యెవరు అమ్ముతున్నారు? యెప్పటికి అందరికీ అందుబాటులోకి వస్తాయి?

1996 లో బీటీ పత్తి, మొక్కజొన్న, ఆలుగడ్డ పంటలు వచ్చాయి గానీ వివిధకారణాలవల్ల ఆలుగడ్డ ఆగిపోయిందట. (ఈ మొక్క జొన్న, ఆలుగడ్డ లని కోళ్ళకీ, పశువులకీ మాత్రమే వాడారని, అదికూడా ఇప్పుడు అనేక దేశాల్లో మానేశారనే నిజాన్ని దాచిపెడుతున్నాడీయన.)

వంకాయ మనకి ముఖ్యమైన కూరగాయ. మన పెరటితోటల్లో పెంచుకునే కూరగాయ! దాదాపు అన్నికాలాల్లోనూ లభిస్తుంది. సీజన్లో తక్కువ రేటుకే దొరుకుతుంది. అలాంటిదాన్ని బీటీ చేసి, మేమే అమ్ముకుంటాం, మీరు చచ్చినట్టు తినండి (దీన్ని పశువులమీదకూడా ప్రయోగించం--మీ పాట్లు మీరు పడండి!) అంటే--వొప్పుకోడానికి మనకన్నా వెఱ్ఱివెధవలు యెవరూ వుండరనుకున్నాడేమో!

ఇలాంటి ఆలోచనలని చీల్చి చెండాడండి! 

Saturday, April 3

వివాహ......

సహజీవనం

ఈ మధ్య మన సర్వోన్నత న్యాయ స్థానం సహజీవనాలని సమర్థించింది.

ఇంతకు ముందు నా టపాల్లో సహజీవనం లో వున్న లాభాలని చర్చించడం జరిగింది. మన ప్రభుత్వం 'మైత్రీ కరార్' లని చట్టబధ్ధం చేస్తే బాగుండును.

సహజీవనం మాటెలా వున్నా, 'రాధాకృష్ణులు కూడా' అని న్యాయస్థానం ప్రస్తావించడాన్ని గురించి పిసుక్కుంటున్నారు కొంతమంది స్వాములూ, పీఠాధిపతులూ!

ఆ మాటకొస్తే, 8 మందిని వివాహం చేసుకున్న కృష్ణుడు, మరో పదహారువేల ఒక్క మంది స్త్రీలతో సహజీవనం చేసేవుంటాడు (రాధ తో కలిపి).

ఆ పదహారువేలమందీ 'గోపికలు' అని కొంతమందీ, జరాసంధుడి చెరలోంచి విడిపించిన కన్యలు అని కొంతమందీ స్వాములూ, పీఠాధిపతులూ అంటారు.

ఈ మధ్యలో సందట్లో సడేమియా గా సానియా మీర్జా ఒకతి వచ్చింది--తనకి ఇంతకుముందు జరిగిన నిశ్చితార్ధం రద్దు చేసుకొని, పాకిస్తాన్ పౌరుడు, ఆ దేశం తరఫున క్రికెట్ ఆడే షోయబ్ ని పెళ్ళి చేసుకుంటానంది.

ఓ స్త్రీ తన కన్యాత్వాన్నీ యెవరితో పోగొట్టుకోవాలో, యెవరితో సంసారం చెయ్యాలో పూర్తిగా ఆమె ఇష్టం అని మరిచిపోయిన వాళ్ళు--ఇండియాలో నీకు మగాడే దొరకలేదా? అని అడుగుతున్నారు!

ఆమె ఇప్పటికే అతడితో అనేకసార్లు కొన్ని కొన్ని రోజులపాటు సహజీవనాలు సాగించింది అని కూడా వార్తలు వచ్చాయి.

అది ఆమె ఇష్టం--కాని పెళ్ళి మాత్రం భారతీయుణ్ణే చేసుకోవాలి అని అనేవాళ్ళని యేమనాలి?

మూర్ఖాగ్రేసర చక్రవర్తులు అనచ్చేమో!