Wednesday, August 26

ఫుణ్యభూమి

యుగాలూ—భూమి
‘శ్రీమద్భాగవతం’ లో కృతయుగాదిగా జరిగిన పరిణామాలూ, అవతారాలూ వర్ణించబడ్డాయి.  


వేదాలు రచింపబడడం, మత్స్యావతారుడు వాటిని సోమకాసురుణ్ణించి రక్షించడం—ఇది జరిగింది కృతయుగం చివరి కొన్నివేల సంవత్సరాల్లో. యెందుకంటే, అప్పటికి ‘శ్రీ మహావిష్ణువు’ ‘స్థితికారుడు’ గా స్థాపించబడ్డాడు.  


అప్పటికి, భూమి లేదు—అంటే, ఉత్తరఖండం, దక్షిణఖండం మాత్రమే, పూర్తిగా మంచుతో కప్పబడివుండేవి. అక్కడక్కడా దక్షిణఖండంలో మనుషులుండేవారు. ఉత్తరఖండంలో మనుషులు లేరు.  


తరవాత, కృత యుగం లోనే, కూర్మావతారం కూడా జరిగింది. (అప్పటికి మానవ స్త్రీలు కూడా ‘గుడ్లు’ పెట్టేవారు—దేవతలవంటివాళ్ళ సంగతి తెలియదు. ఉదా:- అనూరుడూ, గరుత్మంతుడూ—వీళ్ళు పుట్టాక దేవతల సేవకి వెళ్ళిపోయారు!)  

తరవాత, వరాహావతారం అవసరం వచ్చి, తన కోరలమీద భూమిని (దక్షిణ ఖండాన్ని) తేల్చి, జరిపుకుంటూపోవడం తో ఆ ఖండం దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఇండియా, ఆస్ట్రేలియా మొదలైన ఖండాలుగా విడిపోయి, ‘ఉత్తరఖండాన్ని’ కలిసి (ఢీకొని) నేటి అఖండ ప్రపంచం, మధ్యలో సముద్రాలతో యేర్పడింది. (ఇప్పటి భూకంపాలకీ, అగ్నిపర్వతాలకీ, సునామీలకీ ఇదేకారణం!)  


అలా ఢీకొన్న రెండు భూభాగాల వల్లనే, ‘ఆండీస్’, ‘ఆల్ప్స్’, ‘హిమాలయాలు’ లాంటి మహాపర్వతాలు యేర్పడ్డాయి.  


ఇక ‘భరత ఖండానికి’ వస్తే, ఆగస్త్య మహర్షి పూనుకొనేవరకూ హిమాలయ పర్వతాలూ, వింధ్య పర్వతాలూ, తూర్పు-పడమర కనుమలూ పెరుగుతూనేవున్నాయి. 


హిమాలయాలకీ, వింధ్యకీ మధ్యలో సముద్రం యెక్కువగా వుండి పోవడంతో, అగస్త్యుడు ఆ సముద్రాన్ని ‘అవుపోసన’ పట్టి, తన కమండలంలో నిక్షిప్తం చేసి, వింధ్యపర్వతాలని దాటుతూ, తన కాలి బొటనవేలితో వింధ్యుడి నెత్తిమీద నొక్కి, ‘నేను మళ్ళి నీ నెత్తిమీదకి వచ్చేదాకా నీ పెరుగుదల ఆగిపోవుగాక!’ అని దక్షిణానికి వచ్చేశాడు.  


అలా ‘భరతఖండం’ మధ్యలో సముద్రాలు లేకుండా, ఒకటిగా నిలిచింది.  


తరవాత సంగతి మరోసారి. 




Tuesday, August 25

గాయత్రి

మంత్రాలూ—గాయత్రి
మంత్రాలనేవి ‘కర్మలు ’ చెయ్యడానికి మాత్రమే వుద్దేశించబడ్డాయి! (అవి ‘బ్రహ్మ’ కర్మలైనా, ‘అపర’ కర్మలైనా!) 

యెవరికి వారు మంత్రాలన్నీ నేర్చుకొని సరిగ్గా ఆ కర్మలు నిర్వహించుకోలేరని, పురోహితులు వాటిని నేర్చుకొని, ప్రజలచేత చేయిస్తారు.

 చెయ్యవలసిన కర్మ యేమిటో, యెందుకు చేస్తున్నామో ‘సంకల్పం’ చెప్పుకుంటారు ముందు. అదే పురోహితులు చెప్పి, మధ్యలో కర్మిష్టుల్ని ‘మమ’ అనుకోమంటారు అందుకే!

 ఇక మంత్రాలని ‘చదవ కూడదు’ ‘జపించాలి’ లేదా, ‘అనుష్టించాలి’. గాయత్రి విషయానికొస్తే, అది వూరికే చదివేది కాదు. యెందుకంటే— 

శిశువు జన్మించినప్పటినించీ (ఆడైనా, మగైనా) కొన్ని ‘జాతక కర్మలు’ నిర్దేశించారు—బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకి—వీటిలో కొన్ని ఆడ శిశువులకీ, కొన్ని మగ శిశువులకీ ప్రత్యేకం.

 ఇక మగ పిల్లలకి ‘గర్భాష్టమం’ లో చేసే జాతక కర్మ పేరు—వుపనయనం. (దాన్నే ‘ఒడుగు’ అంటారు) ఇది యెందుకు చేస్తారంటే—శిశువుకి 8 సంవత్సరాలు వయసు (తల్లి గర్భం లో వున్న 9 నెలలతో సహా—అంటే పుట్టిన 7 సంవత్సరాల 3 నెలలు) నిండేసరికి ఙ్ఞానార్జనకి సమయం అయినట్టు. అంతే కాకుండా, బాలారిష్టలన్నీ గడిచి, ఒక ధీమా వస్తుంది—అందుకని, ఆ ఒడుగు లో పుట్టినప్పటి నించీ చేసిన జాతక కర్మలని అదే క్రమం లో మళ్ళీ జరిపిస్తారు—అంతకు ముందు యేవైనా సరిగ్గా జరగకపోయినా వాటి ప్రభావం పిల్లవాడి మీద వుండకుండా!

 ఇక ఙ్ఞానార్జనకి మూలం ‘విద్య’. దాన్ని ఆర్జించాలంటే వాక్శుద్ధి లాంటివి కావాలి—వాటికోసం, ఒడుగు లోనే ‘బ్రహ్మోపదేశం’ చేయిస్తారు—తండ్రి చేతగానీ, ఆ అర్హత వున్నవాళ్ళ చేత గానీ. ఆ ఉపదేశం లో భాగంగానే, యఙ్ఞోపవీత ధారణ చేయించి, గాయత్రి ని ఉపదేశిస్తారు! అక్కడితో, విద్యార్జనకి అర్హత లభించినట్టే!

 అక్కడి నించి, అనుష్టానాలు మొదలు అవుతాయి—ఇరు సంధ్యలా సంధ్యా వందనం మొదలైనవి!

 టూకీగా అదీ సంగతి.

 ఇక ‘భూర్భువహ్ స్వహ్’ అంటే, మన భూమికి పైన వుండే మొదటి మూడు లోకాలు. వాటి పైన ఇంకో 4 లోకాలు వుంటాయంటారు. అలా భూమికి పైన 7, భూతలం కింద 7 మొత్తం 14 లోకాలు వుంటాయంటారు.

 పైనుండేవి క్రమం గా 1.భూ లోకం, 2.భువర్లోకం, 3.స్వర్లోకం, 4.మహర్లోకం, 5.జనలోకం, 6.తపోలోకం, 7.సత్యలోకం (ఈ లోకం లోనే బ్రహ్మ వుంటాడుట).

 వీటిని మంత్ర రూపంలో—‘ఓం భూ: ఓం భువ: ఓం స్వ: ఓం మహ: ఓం జన: ఓం తప: ఓం~ సత్యం’ అని చెప్పి ‘ఓం తత్సవితుర్వరేణ్యం…….’ ఇలా సాగుతుంది.

 గాయత్రిలో మనకి ముఖ్యమైన 3 లోకాలనే చెప్పాడు. అవి భూలోకం (అంటే మనం వున్నది—ఇది అందరికీ తెలిసిందే) భువ:+లోకము= భువర్లోకం అంటే, మేఘాల క్రింది అంచువరకూ వ్యాపించినది. ఇక స్వ:+లోకము=స్వర్లోకం అంటే, మేఘాలకి పైన వున్నది. (దీన్నే పొరపాటుగా ‘స్వర్గం’ అని వ్యవహరిస్తున్నారు—నిజానికి స్వర్గము అంటే స్వర్లోకానికి గమించడం అంటే వెళ్ళడం) మనిషి చనిపోయాక, జీవుడు (అంటే ఆత్మ) ఇక్కడవరకూ చేరడమే కష్టం. ఆతరవాత ‘ఆటోమేటిక్ ప్రమోషన్లు’—ఒక్కో లోకం లో నిర్దేశింపబడిన కాలం తీరేక! స్వర్లోకం చేరిన వాళ్ళకి పునర్జన్మ వుండదంటారు!

 అదిగో—అదీ గాయత్రి వుద్దేశ్యం! విశ్వామితృడు త్రిశంకుణ్ణి బొందితో స్వర్లోకానికి పంపలేకపోయినా, ఇతర జీవులు బొందిలేకుండానైనా స్వర్లోకాన్ని చేరడాన్ని సులభతరం చేశాడు ఈ మంత్రం తో!

 ఇక ‘మంత్రాలకి చింతకాయలు రాల్తాయా’ అనకుండా వాటిని విశ్వసించేవారికి, వాటి మహిమపై నమ్మకం వుంటే, ఆ మంత్రాన్ని జపించకుండా వూరికే చదివితే ‘సైడ్ ఎఫెక్టు’లూ, బెడిసికొట్టడాలూ కూడా వుంటాయని నమ్మాలికదా మరి?

 ఇంకొక మాట—ఇవన్నీ నమ్మినా, నమ్మకపోయినా—నేను ముందే చెప్పినట్టు ఇవన్నీ మన ప్రాచీన సంస్కృతిలో భాగాలు. కాబట్టి నిశ్చయం గా నిర్దేశించబడినట్టు ఆచరించవలసిందే!

 యేమంటారు?

 (ఇందులో కొంత పదార్థం (మేటర్) నా ‘హేతువాదం’ బ్లాగులో రావలసింది—సందర్భం వచ్చింది కాబట్టి ఇందులోనే పోస్ట్ చేశాను.)


Monday, August 24

విశ్వసనీయత

కాకుల్లెక్కలు
నిజం గా కాకుల్లెక్కలైతే, లెక్క ఓ పదివేలదాకా అటూ ఇటూ అయినా యెవరికీ నష్టం వుండదు.

కాని అతి ముఖ్యమైన విషయాల్లో ప్రభుత్వ లెక్కల్లోనే తేడాలు వుంటే?

స. హ. చట్టం పుణ్యమాని, మన వున్నత న్యాయస్థానం పుణ్యమాని—ఇలాంటి విచిత్రాలు బయటకొస్తున్నాయి!

ఎం బీ టీ నేత అంజదుల్లా ఖాన్ ముఖ్యమైన మూడు అంశాలమీద ఆయన తెప్పించుకున్న సమాచారం కాకుల్లెక్కలని మించి పోవడం తో ఆయన మన వున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు!

ఆ ప్రశ్నలు—1. రాష్ట్రం లో యెంత మంది ‘ఆయుధాలు’ కలిగి వున్నారు? 2. క్రిమినల్ చరిత్ర వున్నవారికి ఆయుధాలున్నాయన్న మాట వాస్తవమేనా? 3. లైసెన్స్ లు మంజూరు చేసే అధికారం యెవరెవరికి వుంది?—ఇవీ!

యెంత ముఖ్యమైన ప్రశ్నలో వేరే చెప్పాలా!

2007 లోనే దరఖాస్తు చేసినా, స్పందన కరువై, స. హ. శాఖ కమిషనరుకి అప్పీలు దరఖాస్తు చేశారట. మొదటి అప్పీలుకి స్పందన లేక, రెండో అప్పీలు చేస్తే, ఆయన ‘వారం లోగా’ సమాచారం అందించాలని రాష్ట్ర హోం శాఖని ఆదేశించారట!

హోం శాఖ లెక్కల ప్రకారం క్రిమినల్ కేసులున్న వాళ్ళెవరిదగ్గరా లైసెన్స్ లు లేవన్నారట!

మరి ఆయన అంతకు ముందే కలెక్టర్లూ, పోలీసుల దగ్గర్నించీ తెప్పించుకున్న సమాచారం ప్రకారం—కర్నూలు లో లైసెన్స్ వున్న వ్యక్తి పై 17 క్రిమినల్ కేసులు వున్నట్టు చెప్పారట!

ఇంకా విచిత్రం యేమిటంటే, హోం శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తం గా 19,757 లైసెన్స్ లుండగా, జిల్లాల లెక్కల ప్రకారం 21,324 వున్నాయట!

మరి దాదాపు 2,600 లైసెన్స్ లు హోం శాఖకి తెలియకుండా, యెవరు జారీ చేశారో!

లైసెన్స్ లకి సంబంధించి సరైన రికార్డులు నిర్వహించేలా హోం శాఖ ని ఆదేశించాలనీ, అప్పటివరకూ కొత్త లైసెన్స్ లు మంజూరు చేయడం గానీ, గడువు ముగిసినవాటిని పునదుద్ధరించడం గానీ చేయకుండా వుత్తర్వులు ఇవ్వాలని వున్నత న్యాయ స్థానాన్ని కోరారట.

విచారణ చేపట్టబడింది.

అంత సుకుమారమైన గేదె శరీరాలు యెవరికున్నాయో బయట పడుతుందా? లేక దున్నపోతుమీద వానేనా!?

చూద్దాం!


Tuesday, August 11

మాయగాడి మరో మోసం

‘కోలా కృష్ణమోహనరావు’
—యూరో లాటరీ తగిలిందని నమ్మించి, కొంతమందిని కోట్లలో ముంచి ఇంకా పదేళ్ళు కూడా కాలేదేమో!
వాడి కేరేక్టరుతో సినిమాలు కూడా తీశారు! చట్టం వాడినేమీ చెయ్యలేకపోయిందని గుర్తు.

అప్పటిలో వాడు సంపాదించినదానితోనే యేమో, ఇథియోపియా లో 120 యెకరాల ప్రభుత్వ భూముల్ని కొని, గులాబీ తోటలు పెంచుతున్నాడట!

ఇప్పుడు మళ్ళీ ‘ఇథియోపియా లో వుద్యోగాలు’ పేరుతో తన www.srisaiflora.com ద్వారా ఓ 65 మంది నిరుద్యోగుల నించి దాదాపు ఒకటిన్నర కోట్లు వసూలు చేసి, వాళ్ళని ముంచాడట! (పాపం నిరుద్యోగులు మరి!)

ఓ పది మంది బాధితులు వీడ్ని ఎల్బీనగర్ చౌరస్తాలో పట్టుకొని, పోలీసులకప్పగిస్తే, వీరు ‘విచారించి’, ఎస్ ఆర్ నగర్ పోలీసులకప్పగిస్తాం, వారూ ‘విచారిస్తారు’ అంటున్నారట!

ఈ వరస చూస్తుంటే, ఈ సారి కూడా వాడికేమీ అవదు అనిపించట్లేదూ?

‘తోటకూర నాడే’ వాడి కాళ్ళు విరగ్గొట్టి వుంటే, ఇప్పుడు తీరిగ్గా ‘విచారించ’ వలసిన అవసరం తప్పేది కదా?

అయినా ఇప్పటికీ ‘బంగారం మెరుగు పెడతాం’ అంటూ వచ్చే అపరిచితులకి ఇంట్లో బంగారం అంతా అప్పచెప్పి, తరవాత లబో దిబో మంటున్న ఆడ మళయాళం వున్నారంటే, యేమనుకోవాలి!

అదంతే!

Monday, August 10

గుళ్ళో పాటల భక్తి

పాటల భక్తి
ఈ మధ్య ప్రతీ గుడిలోనూ అనేక రకాలైన భక్తి రికార్డులు గంటలతరబడీ వాయించేస్తున్నారు!
వీటిలో రకరకాల పాటలు వుంటున్నాయి! ‘జజ్జనకడి జనారే’ వరసలతోసహా….
ఇవి కాక ‘చ్హాంట్’ లంటూ ఒకే పదాన్నో, మంత్రాన్నో పదే పదే వల్లించే రికార్డులు కొన్ని!
అసలు ఆడవాళ్ళకి గాయత్రీ మంత్రానికి అర్హత లేదు—వాళ్ళు జంధ్యాలు వేసుకో కూడదు కదా?
అయినా, ఓ ఆడమేళం గాయత్రీ మంత్రాన్ని, వాళ్ళిష్టం వచ్చినట్టు ‘చ్హాంట్’ చేస్తున్న రికార్డొకటి!
అది ఇలా సాగుతుంది—“ఓం భూర్ భువహ స్వాహా! తత్స వితుర్వ రేణ్యం! భరుగో దెవస్య ధీమహీ! ధియో యోనహా ప్రత్యోదయాత్!”
పీటమీద కర్రతో తాళం వాయించుకుంటూ, అదే వరసలో పాడడం వల్ల ‘వచ్చిన రాగాలూ, తీసిన దీర్ఘాలూ’ ఇవి! (శంకరాభరణం శంకర శాస్త్రిగారికీ, పట్టాభి భాగవతార్ కీ క్షమాపణలతో!)
‘భూర్ భువహ్ స్వహ్’ అంటే అవి ‘భూ, భువ, స్వ’ (భూలోక, భువర్లోక స్వర్లోకాలు) లోకాలు అనీ, ‘స్వహ్’ కీ ‘స్వాహా’ దేవికీ యేమీ సంబందం లేదనీ—వీళ్ళకి యెవరు చెపుతారు?
‘భరుగో దెవస్య’ కాదు ‘భర్గో దేవస్య’ అనాలని యెవరు చెపుతారు?
‘ధియో యోనహా’ కాదనీ, “ధీయోయోనహ్’ అనీ యెవరు చెపుతారు?
‘ప్రత్యోదయాత్’ అనక్కర్లేదు ‘ప్రచోదయాత్’ అనాలని యెవరు చెపుతారు?
మనం చెప్పినా వాళ్ళు వింటారా! రికార్డుని మార్చి మగాళ్ళతో సరిగ్గా పాడిస్తారా! ఇప్పటి వరకూ అమ్ముడైన రికార్డులని నాశనం చేస్తారా! ఈ గుళ్ళలో వాటిని వేయడం మానేస్తారా! ఒరే వెధవల్లారా ఇది తప్పు అని యెవరైనా వాళ్ళకి చెప్పేస్తారా!
మన పిచ్చి గానీ, యేదైనా యెంత భ్రష్టు పడితే జనాలకి అంతానందం!
ఇవి వింటూంటేనే మనశ్శాంతి కలిగి, జన్మ తరించినట్టనిపిస్తోందట కొంతమందికి మరి!
యెవరి పిచ్చి వాళ్ళకానందం అని యెవరన్నారో!

Sunday, August 9

యెన్నికల యంత్రాలు

వోటేసే యంత్రాలు
మనం వోట్లు వెయ్యడానికి పనికొచ్చే యంత్రాలని, ‘వాటంతట అవే వాటికి కావలసినవాళ్ళకి వోట్లు వేసే యంత్రాలు’ అని ప్రచారం చేసి, వాటిని నిషేధించాలంటున్నారు కొంతమంది నయా మేథావులు!

వీళ్ళకి వంత పాడుతున్నారు—రాజకీయ పార్టీలవారు! (మరి రిగ్గింగులకీ, సైక్లింగులకీ కుదరడం లేదుగదా! బూత్ కేప్చరింగు చేద్దామన్నా, పోలింగు అధికారి ఒకే బటన్ నొక్కి, పోలింగుని రద్దు చేసేస్తున్నాడు! బేలట్ పెట్టెల్లో ఇంక్ పొయ్యడానికి లేదు—అందుకని, గొడ్డళ్ళతో ఈ వీ ఎం లని నాశనం చేసినా, ఫలితం రీ పోలింగే! అందుకని, ఆడలేక మద్దెల ఓడు అంటూ, తమ స్వయంకృతాలని కప్పిపుచ్చుకోజూస్తున్నారు!)
2004 యెలక్షన్లకి మీదగ్గర సిబ్బంది పేర్లు ఇస్తే, యెలక్షన్ డ్యూటీలు వేస్తాం అని రిటర్నింగు అధికారి అడగగానే, మా బ్యాంకు బ్రాంచిలో తనతో సహా అందరి సిబ్బంది పేర్లూ వ్రాసిచ్చేశాడు—తెలిసీ తెలియని మా మేనేజరు!

దాంతో, అందరికీ, యెలక్షన్ విధులు కేటాయిస్తూ, ఫలానా రోజు మీటింగుకీ, శిక్షణకీ రమ్మని తాఖీదులొచ్చేసరికి, కళ్ళు తేలేశాడు—బ్యాంక్ యెలా నడిపించాలి సిబ్బంది లేకుండా—అనుకుంటూ!

సరే—తరవాత, పొరపాటుని అధికారులకి విప్పిచెప్పి, బ్యాంకు నడవడానికి ఇబ్బంది లేకుండా చూసుకున్నామనుకోండి!

కానీ శిక్షణ తరగతులకి మాత్రం తప్పనిసరిగా హాజరవ్వాలని చెప్పడంతో, మా సబ్ మేనేజరూ, నేనూ కూడా శిక్షణకి హాజరవ్వడం, మా అదృష్టం కొద్దీ ఈ వీ ఎం లని క్షుణ్ణంగా పరిశీలించి వాటితో రకరకాల ప్రయోగాలు చేసి, మొదటిసారి దేశ వ్యాప్తంగా నిజమైన యెన్నికలు జరగబోతున్నాయి అని సంతోషించాము!
తీరా పోలింగు రోజున పొద్దున్నే టీవీలో ‘ఫలానా చోట ఈ వీ ఎం లు మొరాయించాయి’ ‘ఫలానా చోట ఈ వీ ఎం లు లేటుగా ప్రారంభమయ్యాయి’ అంటూ వార్తలు వస్తుంటే, ఆశ్చర్యపోయాను!

ఇక్కడో మాట చెప్పుకోవాలి—అంతకు ముందే కొత్తగా ‘టీవీ 9’ ప్రారంభమై, వెలుగులోకి వస్తోంది! (నిజానికి టీవీ 9 రావడంతోనే మీడియా వెర్రితలలు వెయ్యడం మొదలు పెట్టింది! ముఖ్యం గా రవిప్రకాష్ మొదట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు—తరవాత తల బొప్పి కట్టాక మానేశాడానుకోండి!) మొట్టమొదట ఈ వీ ఎం లు మొరాయించాయి అని అన్నవాడు రవి ప్రకాషే!

నిజానికి ఈ వీ ఎం లు ‘మొరాయించవు’—వాటిని ప్రారంభించడానికి ముందు చెయ్యవలసిన ప్రక్రియలు—అభ్యర్థుల లిస్ట్ అందులో యెక్కించడం, మిగిలిన బటన్లని డమ్మీలుగా చెయ్యడం, నెంబర్లనీ వాటినీ నోట్ చేసుకొని, ‘టాంపర్ ప్రూఫ్’ గా సీలు చెయ్యడం—ఇలాంటివి! యెంత శిక్షణ పొందినా, పోలింగు సిబ్బంది ఈ విషయాల్లో తడబడం సహజం! అప్పుడు ఇతర అధికారులో, కంపెనీ వారో వచ్చి, వాటిని సరిగా ప్రారంభించేలాగ చేసేవారు—దానికి కొంత సమయం పట్టేది!

నేను చాలెంజి చేసి చెపుతున్నాను—వీటిని టాంపర్ చెయ్యడం యెవరి తరమూ కాదు!

మరి ఈ మధ్య ‘జనచైతన్య వేదిక’ వారు కొంత మంచి చేస్తున్నారు—మూఢ నమ్మకాలకి వ్యతిరేకంగా జనచైతన్యం కలిగించడం మొదలైనవి చేస్తూ.

వీరికేమొచ్చిందో—ఈ వీ ఎం లు టాంపర్ చెయ్యడం ద్వారా, పోలైన ప్రతీ అయిదో వోటో, ఎనిమిదో వోటో--ఇలా ఒకే అభ్యర్థికి పడేలా చెయ్యచ్చు అంటున్నారు!

వాళ్ళు సొంతంగా వాళ్ళకి తోచినట్టు ఈ వీ ఎం ల్లాంటివి తయారు చేసి, ప్రదర్శనలు కూడా ఇస్తున్నారు! సుప్రీం కోర్టుకి కూడా వెళ్ళారు కొంతమందితో!

మనిష్టం వచ్చినట్టు మనమే ఓ మెషీను తయారు చేసుకొని, దాన్ని వక్రం గా నడిపించి, అసలు మెషీన్లు కూడా ఇలా వక్రం గానే నడుస్తాయి అంటే, అది యేం నిరూపించినట్టూ?

మరి వీళ్ళెవరికి కొమ్ముకాస్తున్నట్టు?

(కొన్ని రోజుల క్రితం నేను తయారు చేసుకున్న టపా—కొన్ని తుదిమెరుగులు దిద్ది ప్రచురించాలని వుంచినది—ఇప్పుడు ప్రచురిస్తున్నాను! మెరుగుల సంగతి తరవాత!)




Saturday, August 8

నైతికత

తప్పుడు బిల్లులు
తప్పుడు మెడికల్ బిల్లులు సమర్పించి లక్షల రూపాయలు సంపాదించిన మాజీ ఎం ఎల్ యే యెర్నేని రాజా రమచందర్—తప్పు చెయ్యడం, నాకు తెలియక చేశానననడం బాగానే వుంది.

చిన్న కోర్టు దగ్గరనించీ, రాష్ట్ర వున్నత న్యాయ స్థానం దాకా ఇది తప్పు అని చెప్పాక కూడా, ఈ సిగ్గులేని గవర్నమెంట్ ప్రత్యేకం గా ఓ జీ ఓ వెలువరించి అతను నిర్దోషి అంది!

శాసన సభ నైతికవిలువల కమిటీ, కేసు ఉపసం హరించుకోమని సలహా ఇచ్చింది!

ఇప్పుడు దేశ సర్వోన్నత న్యాయ స్థానం వీళ్ళందరికీ అక్షింతలు వేసింది!

చిన్న ప్రభుత్వోద్యోగి ఎల్టీసీ వాడుకుని, బస్ టిక్కెట్లలో ఓ టిక్కెట్ పొరపాటుని పారేసుకొని, దాని బదులు ఇంకో టిక్కెట్ సంపాదించి బిల్లు పెట్టుకొంటే, తరవాత వాడి ఉద్యోగం తీసేసిన కేసులు వున్నాయి!

మరి ఎం ఎల్ యే అయితే వూడి పడ్డాడా!




Friday, August 7

జూదాలు

ఫ్యూచర్స్
ఫ్యూచర్స్ ఎక్స్చేంజీలవల్లే ధరలు పెరగలేదు’ అంటున్నాడు—నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ ఎం డీ, సీ ఈ వో శ్రీ ఆర్ రామశేషన్!

‘ప్రస్తుతం సరకుల ధరలు భగ్గుమనడానికి ఈ ఎక్స్చేంజీలూ కొంతవరకూ కారణమనే అభిప్రాయం ప్రజల్లో వుంది. కానీ అందులో యేమాత్రం నిజం లేదు.సరకుల ధరలు పెరగడానికి గిరాకీ-సరఫరాల్లో అంతరాలే కారణం.’ అని ఆయన స్పష్టం చేశారుట.

‘మా పని కేవలం సరకుల ఫ్యూచర్స్ కాంట్రాక్టుల వర్తకానికి వీలు కల్పించడమే…సరకుల ధరల హెచ్చు తగ్గుల్లో మాకు ప్రమేయం వుండదు.’ అన్నారటాయన.

‘ఈ ఎక్స్చేంజీలలో రైతుల భాగ్యస్వామ్యం పెరగడానికి ఇంకా సమయం పడుతుంది. ఇతరదేశాలతో పోలిస్తే మాత్రం మనదేశం లో రైతుల భాగస్వామ్యం అధికం గానే వుంది’ అని కూడా అన్నారట!

ఇలా పరస్పర విరుద్ధ అభిప్రాయాలనీ, నోటికొచ్చిన లెఖ్ఖలనీ వల్లించేవాళ్ళని చెప్పుతో కొట్టాలా వద్దా?

యే ఎక్స్చేంజీ లోనైనా యే ఒక్క రైతు అయినా సభ్యుడిగా వున్నాడేమో చెప్పమనండి! వున్నది అందరూ స్పెకులేటర్లూ, కాంట్రాక్టర్లూ కాదా? గిరాకీ సరఫరాల్ని నియంత్రిస్తున్నది వీళ్ళ ఫ్యూచర్స్ కాంట్రాక్టులు కాదా?
ఇక రెయిన్ ఫాల్ ఇండెక్స్ ప్రవేశ పెడతారట! అంటే యేమిటో!

ఫలానా నెలలో ఫలానా రోజుని ఫలానా చోట వర్షం వస్తుందా రాదా—వస్తే యెంత వస్తుంది—వస్తే యెంత ఇస్తావు—రాకపోతే నేనెంత ఇవ్వాలి—ఇలాంటి పందాలా?

క్రికెట్ లో ఫలానారోజు ఫలానా ఆటగాడు సెంచరీ కొడతాడనీ, కొట్టడనీ, సెంచరీ సంగతి దేవుడురుగు అసలు డక్ అవుట్ అవుతాడనీ, అవడనీ—ఇలా పందాలు వేసుకోవడం చట్టవిరుద్ధం!

మరి వీటినికూడా యే గేం స్ ఇండెక్స్ పేరుతోనో ఓ ఎక్స్చేంజీ లో పెట్టేస్టే, కోట్లు సంపాదించుకోవచ్చేమో—రామశేషన్ లు ఆలోచించాలి!

చిన్న పిల్లల్ని కాసేపు అల్లరి చెయ్యకుండా, యేడవకుండా కాలక్షేపం చేయించడానికి, ఓ బొమ్మలు/ఫోటోలు వుండే పుస్తకం తీసుకొని, ఒక్కొక్క పేజీని చేతితో మూసి, ‘బొమ్మొస్తుందా రాదా?’ అని, వాళ్ళు వొస్తుంది అంటే, పేజీ తిప్పి బొమ్మ వస్తే—నువ్వే నెగ్గావు—నా అరచేతిమీద ఒకటి కొట్టు అనీ, బొమ్మ రాకపోతే—నేనే నెగ్గాను—నీ అరచేతిమీదొకటి కొడతాను—అనీ—ఇలాంటి ఆట ఙ్ఞాపకం రావడం లేదూ?

దీంతొటే మనం చిన్నపిల్లలకి ‘స్పెక్యులేషన్’ నేర్పిస్తున్నామా?

అయినా ఇలాంటి చాలెంజి లు లేకపోతే సరదా యేముంది అనేవాళ్ళు కూడా వున్నారు—వాళ్ళనేమనాలి?


Wednesday, August 5

నెత్తిన చేతులు

ఇంకో మహా మాయగాడు!
గుడిపల్లి చంద్రశేఖర రెడ్డి అని, నల్గొండవాసి తన భార్య, మరదలితో కలిసి చేస్తున్న మోసాలకి అంతులేదట!

ఈయన చేసేదేమిటంటే, ఓ పట్నం లో, ఖరీదైన ప్రాంతం లో కుటుంబంతో సహా అద్దెకుదిగి, రెండుకార్లూ, సెల్ఫోన్లూ వాడుతూ, ఫోన్ లో అవతలవాళ్ళతో అస్తమానూ కోట్లాది రూపాయల లావాదేవీలు గురించి మాట్లాడుతూ, డాబూ దర్పం ప్రదర్శించి, యెదటివారిని--అడగగానే, అడిగినంత డబ్బు ఇచ్చేలాగ మాయ చేసి, తరవాత రాత్రికి రాత్రే మకాం యెత్తేస్తాడట!

ఈయన చేసినవాటిలో కొన్ని—

ప్రొద్దుటూరు లో ఓ మహిళ బ్యాంకు ఖాతాలో పది లక్షలు వున్నాయని గమనించి, వారం లోజుల్లో ఇచ్చేస్తానని 7 లక్షలు తీసుకున్నాడట.

ఆయన భార్య కూడా, తిరుపతిలో పెళ్ళికి వెళ్ళివచ్చేక ఇచ్చేస్తానని, ఆవిడ దగ్గరే ఓ 3 తులాల బంగారు నెక్లెస్ తీసుకుందట.

మరదలు తక్కువ తిందా!—కొంత బంగారం కొని, కొంత మొత్తం చెల్లించి, 30 వేలు అరువేసి, దానికి ఆవిడని జామీనుగా పెట్టిందట.

ఇంకొకావిడని వీ ఐ పీ దర్శనం చేయిస్తానని తిరుమల తీసుకెళ్ళి, 15 తులాల బంగారం కాజేశాడట.

ఇవన్నీ చేసి, రాత్రికి రాత్రి మకాం యెత్తేశాడట—ఓ కారులో—రెండో కారూ, ఓ మోటర్ సైకిలూ వదిలేసి!

పోలీసులు కూపీ లాగుతుంటే, 2007 నించీ అనేక చోట్ల ఆయనమీద దాఖలైన కేసులన్నీ బయటకొస్తున్నాయట!

ఇవన్నీ ఒకెత్తు, ఓ ఆఫీసు పెట్టి, ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులనించి (పాపం నిరుద్యోగులు!) భారీగా డబ్బు గుంజి, 27-07-2009 న పరారయ్యాడట.

శభాష్!

మోసపోతున్నవాళ్ళలారా—ఇకనైనా మేలుకుంటారా?