Thursday, June 25

నేనూ......నా రాక్షసి--6

"టాపు లేచి పోద్దే....."

మేము....హర్యాణాలో వుండే మా ఆఖరి చెల్లెలు ఇంటికి వెళ్లినప్పుడు, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యాణా, రాజస్థాన్‌, యూ పీ వగైరాలకి టూర్లు వేసేవాళ్లం. 

(మా చెల్లెలు పిల్లలు షమ్మీ, సౌమ్య, మాతోపాటే వచ్చేవారు. ఉదయం 5 కే బయల్దేరి, యేవేవో చూసి, మళ్లీ యే రాత్రి 3 గంటలకో ఇంటికి చేరే వాళ్లం. ఇంకా జీపులో అందరూ దిగడం, సామాన్లు తీసుకుని ఇంట్లోకి రావడం అయ్యేసరికి, మా ఆవిడ అప్పుడే, తన చీర మార్చేసుకొని, యెదురు వచ్చేది మాకు.) 

మా షమ్మీ, ఓ సారి టీవీ పెట్టి, "ఆ పాట" రాగానే, 'మాంమయ్యా.....నువ్వెప్పుడు ఈ పాట రాశావు'?  అని అడిగేది. (దానికి తెలుగు బాగా వచ్చు--కొంచెం హిందీ యాసతో మాట్లాడుతుంది అంతే.)

"ఆ పాట నేను వ్రాయడం యేమిటిరా?......యెవరు చెప్పారు?" 

అనగానే, సౌమ్య......"మామాజీ....జరా పాట సునో.....'రాయె రాయే నా రాకాశి, నువ్వలా పైటేసి, ఇలా దోపేస్తే......' బోల్తా హైనా.....?" (ఈ పిల్లకి తెలుగు రాదు....కానీ మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది). "పర్, అత్తా ఐసాహీ కర్తాహైనా?" 

"కదా మాంమయ్యా......అత్త కొన్ని క్షణాల్లోనే......టింగ్...టింగ్....టింగ్....అని మూడు యాక్షన్‌ లలో, చీర మార్చేసుకొని, వచ్చేస్తుంది కదా? అందుకే......తను.....నీ 'కమ్‌ బెనారస్' కదా? అందుకే నువ్వే ఈ పాట రాసి వుంటావు.....నిజం చెప్పు....!" అని షమ్మీ సౌమ్యకి తోడొస్తే, ఇంకేమి చెప్పను.....?

"అత్తా ని గిన్నిస్ బుక్ లో--ఫాస్టెస్ట్ శారీ ఛేంజర్--అని యెక్కించెయ్యచ్చు కదా?" అంటారు ఇద్దరూ!

(........ఇంకోసారి)

Monday, June 22

నేనూ.....నా రాక్షసి-5

"క్విడ్ ప్రో కో"......అనే....."నీకది, నాకిది"......!

సీ ఐ బీ జేడీ లక్ష్మిన్నారాయణ తను దర్యాప్తు చేసిన కేసుల్లో ఈమధ్య ఈ మాట ప్రవేశ పెడితే, మీడియావాళ్లు అందుకున్నారేమో గానీ, మాకిది యెప్పుడో తెలుసు.

భోజనానికి కూర్చోగానే, మా ఆవిడ....."ఇవాళ మామిడికాయ పప్పూ, దోసకాయ పచ్చడీ, దొండకాయ కూరా, చారూ పెట్టాను......పెరుగు యెలాగూ వుంది....." అంటుంది. సుష్టుగాలాగించేస్తాను. సరే.

మర్నాడు......"ఇవాళ ముద్దపప్పూ, బెండకాయ కూరా, పప్పులుసూ, పెరుగూ....నిన్న ఫ్రిజ్ లో పెట్టిన దోసకాయ పచ్చడీ......'మీకు'. 'నాకివాళ'.......పొద్దున్నే మడిగా......కాస్త ఆవకాయా, మాగాయా బయటికి తీసుకున్నాను లెండి....."!

ఆ మర్నాడు......"ఇవాళ గోంగూర పప్పూ, బంగాళ దుంప పోపు వేసిన ఉప్మా కూరా, పచ్చి చారూ, పెరుగూ.....ఇదిగో....'మొన్నటి దోసకాయ' పచ్చడి కొంత మిగిలింది.....అవి 'మీకూ'; 'నాకు' మాగాయా..."!

(మా ఇంట్లో ఓ పోర్షన్‌లో, మా తమ్ముడు వుంటాడు.....వాడి పిల్లలు కీర్తీ, శ్రావణీ చిన్నప్పట్నుంచీ మా దగ్గరే పెరుగుతూ, నా భోజనం టైముకి వచ్చేసి, నా గోరుముద్దలు తింటారు....ఇప్పటికీ! ....వాళ్లకు 20; 18 యేళ్లు వచ్చినా!....వాళ్లకి చిన్నప్పట్నుంచీ నన్ను "మయ్యా" అని పిలవడం అలవాటు). 

మా ఆవిడ......."పప్పులుసూ" (అదే....సాంబారు లాంటిది) అనగానే, ఇద్దరూ....."రాత్రికి మయ్యాకి ఇడ్లీలా దొడ్డా".......? అనేస్తారు.

మా ఆవిడ......"బంగాళ దుంపల".....అనగానే, ఇద్దరూ....."రాత్రికి మయ్యాకి చపాతీలా దొడ్డా....."? అనేస్తారు!

పచ్చళ్ల ప్రహసనం లో......"మర్నాడు"......'మా అమ్మ బీరపొట్టు పచ్చడి చేసింది.....వేసుకో మయ్యా' అనీ, "ఆ మర్నాడు", 'మా అమ్మ ఆనపగింజల పచ్చడి చేసింది....వేసుకో మయ్యా'.....అనీ.....తెచ్చిస్తూ వుంటారు!

(నేను 1985 లో--30 యేళ్ల క్రితమే--రాత్రి భోజనం మానేశాను. లైట్ టిఫిన్‌ మాత్రమే! అప్పటి నుంచీ కూడా, మా ఆవిడ ప్రతి రోజూ రాత్రి.....ఇడ్లీ, ఉప్మా, దోశ, చపాతీ, పెసరట్లూ, సేమ్యా ఉప్మా, గారెలూ, ఆవడలూ,....ఇలా వెరైటీ మార్చి వెరైటీ.....వడ్డిస్తుంది నాకు! దానికి, యెప్పటికీ మా ఆవిడకి ఋణపడి వుంటాను నేను!)

(.......మళ్లీ ఇంకోసారి.)