Monday, July 11

మా మూడో హనీమూన్ అనే.......-16

మొన్నటి మా యాత్ర

సినిమా అయి బయటికి వచ్చాక, ఇంక మ్యూజియంలో "క్లైమాక్స్"! 
 
"మొత్తం మ్యూజియానికీ, గుడికీ, ఢిల్లీకీ, దేశానికీ, ప్రపంచానికీ 'హై లైట్'; అది చూడని వాళ్ల జన్మ వ్యర్థం: మన సంస్కృతి గురించి మనం తెలుసుకోవాలి కదండీ?" ఇలాంటి కామెంట్లు అనేకం పొందిన "నదీ యాత్ర". 
 
అంటే, ఓ పది పదిహేను మంది పట్టే బోటులో కూర్చోపెట్టి, దానిని అండర్ గ్రవుండ్లో వున్న ఓ నదిలాంటి ప్రవాహంలోకి, పెద్ద చైన్లూ, పళ్ల చక్రాలూ సాయంతో, పంపిస్తారు. అక్కడ, 'సబ్ డ్యూడ్' లైటింగులో, ఈ ప్రక్కా, ఆ ప్రక్కా లైఫ్ సైజు బొమ్మలతో, వాటిమీద స్పాట్ లైట్లతో ప్రదర్శన కొనసాగుతుంది. స్పీకరులో, అది సరయూ నదిలోనో, గంగా నదిలోనో, మన జీవన వాహినిలోనో జరుగుతున్న యాత్ర అంటూ, ఒక్కొక్క దృశ్యాన్నీ, అందులోని వాళ్ల పేర్లనీ, చరిత్ర (ఇతిహాసం) నీ చెపుతూ, వూరేగిస్తారు మనని. 
 
రామాయణ భారతాలదగ్గరనుంచీ, ఆర్యభట్టు, వరాహమిహిరుడు, చరకుడూ, శుశ్రుతుడూ దగ్గరనుంచి, అక్బరూ, షాజహాన్ల నుంచి, ఝాన్సీ లక్ష్మీ, శివాజీ, ఇతర రాజులూ, స్వతంత్ర పోరాటం నుంచి, అన్నీ చూపించి, చివరగా, ఇదంతా ఆ "స్వామినారాయణుడి" చలువ--అనే సందేశంతో ముగుస్తుంది ఆ యాత్ర. బోట్లు పైకి వచ్చి, మనం బయటికి! 
 
హమ్మయ్య! మ్యూజియం అయిపోయింది. 
 
కొంచెం గాలి పీల్చుకొంటూ, కారిడార్లలో నడుస్తూ, అసలు "గుడి" ని చేరతాం. 
 
గుడి చుట్టూ అనేకవందలమంది జనాలు--యెవరి వ్యాసంగంలో వాళ్లు. ఓ ప్రక్క అభివృధ్ధిలో భాగంగా, పాడయిపోయిన "టైల్స్" స్థానంలో క్రొత్తవి వేస్తూ, కొన్నిచోట్ల సిమెంటూ, కాంక్రీటు తో ఇంకేవో కడుతూ, పనివాళ్లు. చెప్పులు వదిలే స్టాండ్లలో రద్దీ. 
 
మేము మా చెప్పులని, కొంతమందిలాగ, ఓ ప్రక్కన పెట్టి, ఇంతకుముందే గుడి చూసేసిన మా ఢిల్లీ బావగారిని వాటికి కాపలా పెట్టి, ఇదివరకు "బిర్లా" టెంపుళ్లూ, "ఇస్కాన్" టెంపుళ్ల మెట్లెక్కినప్పటి అనుభూతులని తలుచుకొంటూ, అనేక మెట్లెక్కి, మధ్యలో ఆగుతూ, ఆయాసపడుతూ, చివరికి గుడి లోకి చేరాం. 
 
అక్కడ, క్రమ అష్టభుజకారంలో అనుకుంటా, ఓ నిర్మాణం. అందులో ఓ నలభై అడుగులో యెంతో యెత్తున్న "స్వామి నారాయణుడి" విగ్రహం. విగ్రహమంతా అనేక విలువైన రాళ్లతో అలంకరించబడి వుంది. నాకు విగ్రహంలో వివేకానందుడి చాయలు కనిపించాయి--లేదంటే, ఓ మహారాజు గెటప్ లో!. 
 
ఆ ఆష్ట భుజాలకీ మళ్లీ ఎక్స్టెన్షన్లు! వాటిలో అనేక మతాల శైలులూ, సీలింగుతో సహా అనేక "నీల కంఠ చరిత్ర" దృశ్యాలూ, అంతా బంగారం, వెండీ, విలువైనవనిపించే రాళ్లూ--అదీ ఆయన వైభోగం! (ఆ "దేవుడికి" భక్తిగా దణ్నం పెట్టినవాడెవడూ కనపళ్లేదు--నోరు తెరుచుకొని అద్భుతాలని చూస్తున్నవాళ్లు తప్పితే!) 
 
ఫోటోలు, వీడియోలు తీసుకోడానికి లేదు. తాజ్ మహల్ దగ్గరలోలా, ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఫోటోగ్రాఫర్లు లేరు! ఆ గుడివాళ్లు అమ్మే ఫోటోలూ అవీ మాత్రమే 'కొనుక్కోవాలి!' వాటిల్లో మనం వుండం కదా! 
 
ఆ వందల యెకరాల నిర్మాణంలో మా ఆడవాళ్లకి నచ్చింది యేమిటంటే--ఆ గుడిచుట్టూ వున్న ఆవరణని, కొన్ని వందలమంది మధ్యలోనుంచి, చాకచక్యంగా నడుపుకుంటూ, వెనుక తిరుగుతున్న "బ్రష్"లతో, డిటర్జెంటూ, నీళ్లూ కలిపిన నీళ్లతో, నేలని శుభ్రం చేస్తూ పోతున్న చిన్న చిన్న రోలర్ల లాంటి మెషీన్లు! ఇలాంటివి మనక్కూడా వుంటే, ఇల్లు వొత్తుకోడం బాధ తప్పేదికదా? అంటూ నిట్టూర్చారు వాళ్లు! 
 
మళ్లీ బయటికి వెళ్లే దారిలోంచి బయలుదేరిన చోటికి వచ్చేసరికి అక్కడ--బయటే వుండిపోయిన మా కాకినాడ బావగారి దర్శనం, పరామర్శలూ!      

.......తరువాయి మరోసారి.

Saturday, July 2

మా మూడో హనీమూన్ అనే.......-15


మొన్నటి మా యాత్ర

ఇంక ఆ సినిమాలో విషయం యేమిటంటే........సరిగ్గానే వూహించారు.....స్వామినారాయణ్ గా మారిన నీలకంఠ అనేవాడి కథే! (నీలకంఠుడంటే తెలుసుకదా? శివుడు).

ఆ కుర్రాడు సరయూ నదీతీరంలో ఓ పల్లెలో జన్మించాడట. చిన్నప్పుడే చేపలు పట్టుకొనేవాళ్లని తిట్టీ, తుఫానులు ఆపీ, ఇంకా యేవేవో చేశాడు. యెనిమిదేళ్ల వయసులో ఓ రాత్రి, ఓ నిశ్చయానికి వచ్చి, అర్థరాత్రి వర్షం కురుస్తూ వుండగా పొంగి ప్రవహిస్తున్న సరయూనదిలో దూకేశాడు--తన అన్వేషణ కొనసాగించడానికి వీలుగా. (శంకరాచార్యులు తన యేడవ యేటనే సన్యాసం స్వీకరించడానికి నిశ్చయించి, తల్లి వొప్పుకోకపోవడంతో వూరుకుని, ఒకరోజు కాలడిలో ఓ నదిలో తనకాలు మొసలి పట్టుకుంటే, 'అమ్మా! యెలాగా చనిపోయేలా వున్నాను. నాకు సన్యాసానికి అనుమతి ఇవ్వవూ?' అనివేడుకొంటే, ఆవిడ ఇచ్చేసిందనీ, చిత్రంగా మొసలి వెళ్లిపోయి, ఆయన అప్పుడే సన్యసించాడనీ విన్నారా?) అక్కడినుంచీ ఆయన ప్రయాణం, దారిలో జరిగిన బోళ్లు అద్భుతాలూ........(నాకు గుర్తున్నంతవరకూ కొన్ని)

ఒక వూళ్లో అదేదో ప్రసిధ్ధ దేవాలయం, ఓ మఠం వుంటుంది. సాయంత్రం అయ్యేటప్పటికి అందరూ ఇళ్లలో జొరబడి, తలుపులు మూసేసుకుంటారు. కారణం--ఓ భయంకరమైన సిం హం ఆ వూల్ళొకి వచ్చి, కనిపించినవాళ్లని చంపి తినేస్తూంటుంది. నీలకంఠ సాయంత్రంపూట ఆ వూరు చేరి, గుడిముందర ఓ చెట్టు చుట్టూ వున్న చపటామీద కూర్చొని, తపస్సులో ములిగిపోదామనుకుంటాడు. వూరి జనమందరూ, చివరికి ఆ మఠం ప్రథాన్ కూడా అతణ్ని హెచ్చరిస్తారు, బ్రతిమాలుతారు--అయినా వినడు. కాసేపటికి సిం హం రానే వస్తుంది! దానితో వాడు, "నాలో నీమీద ప్రేమ మాత్రమే వుంది! నీక్కూడా నామీద ప్రేమ మాత్రమే వుండాలి" అనడంతో అది తోకముడిచి, అతన్ని నాకుతూ కుక్కలా పడి వుంటుంది తెల్లవార్లూ. ప్రొద్దున్న చూసిన జనాలకి.....అద్భుతం!

హిమాలయ పర్వతాల్లో వున్న ఓ వూళ్లో, మంచు పడడం ప్రారంభమయ్యే సమయానికి, అక్కడి గుళ్లనీ, మఠాలనీ, ఆశ్రమాలనీ, జనావాసాలనీ ఖాళీ చేసి, కొండల క్రిందరికి వెళ్లిపోతూంటారు అందరూ. అందరూ అలా క్రిందికి దిగిపోతూ వుండగా, పైన ఓ మహంతుడు వుంటాడు....నీలకంఠ పైకె యెక్కి వస్తూండడం చూస్తాడు. వెంటనే అందరినీ తోసుకొంటూ క్రిందకి వచ్చేసి, 'బాబూ! అందరూ క్రిందికి వెళ్లిపోతున్నారు. నీవేమిటి పైకి వస్తున్నావు?' అనడుగుతాడు. వాడు 'నేను పైకే వెళతాను.' అంటాడు. "అహా! యేమినాభాగ్యమూ! నీవేనా నా తండ్రీ! యెప్పటినించో నీకోసం యెదురు చూస్తున్నాను! ఆ మహానుభావుడివి నీవేనన్నమాట! ఇంకెవ్వరూ వూరు వదిలి పోవలసిన పని లేదు. స్వామి వచ్చేశాడు!" అని ప్రకటించేస్తాడు. అందరూ సుఖంగా అక్కడే వుండిపోతారు. (ఇంక మంచు పడనే పడదు! మరి గంగా, సింధు, బ్రహ్మపుత్ర లాంటి జీవనదుల గతి ఆ సంవత్సరం యేమయ్యిందో?!)

అంతలాగ అన్ని ఆశ్రమాలలోనూ, మఠాలలోనూ సాక్షాన్నారాయణ స్వరూపుడిగా పరిగణించబడ్డవాడు, రామానుజుల ఆశ్రమానికి వచ్చి, ఆయన యెక్కడో పర్యటనలో వుంటే, ఆశ్రమాన్ని చీపురుతో శుభ్రం చేస్తూ, చిన్న చిన్న పనులు చేస్తూ వుంటాడు. రామానుజులు తిరిగి రాగానే, ఆయన ఇంకా సముద్రంలోనో, నదిలోనో వుండగానే తెలిసేసుకొని, "నీలకంఠా! ఇప్పటికి వచ్చావా! ఇంక ఈ ఆశ్రమం నీదే. అన్ని బాధ్యతలూ నీవే!" అంటూ.....ప్రాణాలు విడుస్తాడు (అనుకొంటా!)

మధ్యలోనో, చివర్లోనో, వాడు యువకుడై, ఓ రాజుగారి దర్బారుకి వెళితే, అక్కడ ఆ రాజుగారు తన వారసుడిగా వీణ్ని ప్రకటించో యేదో.......మొత్తానికి రత్న ఖచిత; వజ్ర వైడూర్య భూషిత; స్వర్ణ సిం హాసనారూఢుడై, "ఆయనే స్వామి నారాయణుడు!" అనిపించుకొంటాడు.

నా దృష్టిలో ఈ సినిమా "హైలైట్" యేమిటంటే, "ఎగ్ జాక్ట్ గా" శంకరాచార్యుడిలాగానే, నీలకంఠ కూడా--సరయూనదీ తీరం నుంచి బయలుదేరి, అరేబియా సముద్రం నుంచీ, హిందూకుష్ పర్వతాలూ, టిబ్బెట్, నేపాల్, బెంగాల్ మీదుగా కన్యాకుమారి వరకూ చేరి, మళ్లీ బయలుదేరిన చోటుకే రావడం--ఆయన "అడుగుజాడల" రూపంలో ఆ మార్గాన్ని స్క్రీన్ మీద చూపించడం!

నాకు అర్థమైనది, శంకరుడు శైవుడు! ఆయనకి ప్రతిగా స్వామి నారాయణుడు! దానికోసం ఇంత "కల్ట్ బిల్డింగ్!". అదీ.

మన సోకాల్డ్ "సర్వసత్తాక గణతంత్ర, స్వతంత్ర, 'సర్వమతసమభావనా', 'సర్వసౌభ్రాతృత్వ ' ప్రజాస్వామ్య భారత దేశంలో ఇవన్నీ అవసరమా??!!    

.......తరువాయి మరోసారి.

ప్లాస్టిక్ (సంచుల) నిషేధం


ఆంధ్రలో అత్యుత్సాహం

ఆంధ్రదేశంలో ఇవాళ (01-07-2011) నుంచీ  అమల్లోకి వచ్చిందట--40 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ సంచులపై నిషేధం! (ఇప్పటికే 20 మైక్రాన్లపై విజయం ఇరగదీశారట! తరవాత 70 మైక్రానులలోపు పై నిషేదమట!). మళ్లీ దండుకోడాలు మొదలన్నమాట. 
 
ఇంక పత్రికలవాళ్లు చెప్పిన కారణాలే చెపుతూ, సమస్యా పరిష్కారాలు సూచిస్తూ, పండగ చేసుకొంటున్నారు. వాళ్ల రాతల ప్రకారం, ప్లాస్టిక్ నిషేధంలో చెన్నై మొదటి స్థానం లో వుందట. రెండో స్థానం బెంగుళూరుదట. అసలు వీళ్లకీ సమాచారం యెవరిస్తారో? 
 
గత సంవత్సరం ఇవేరోజుల్లో నేను చెన్నైలో ఓ వారం పదిరోజులు వున్నాను. అక్కడ మెయిన్ రోడ్లతో సహా పెద్ద హోటళ్ల దగ్గరనుంచీ, పళ్ల దుకాణాల దగ్గరనించీ, బజ్జీ బళ్లవరకూ అందరూ ప్లాస్టిక్ కవర్లలోనే విక్రయిస్తున్నారు! ఈ యేడాదిలోనే నిషేధంలో ప్రథమ స్థానానికి వెళ్లిపోయింది అని నేను అనుకోను. 
 
బెంగుళూరులో కూడా అదే పరిస్థితి. అది రెండో స్థానంలో యెలా వుందో మరి! బెంగుళూరులో మాత్రం, ఆ సంచులు తయారుచేసేవాళ్లమీద మాత్రమే కేసులు పెడుతున్నారు అనీ, వినియోగదారుల మీద పెట్టడం లేదు అనీ అంటున్నాయి పత్రికలు. అదేమయినా కొంత నిజమేమో. 
 
ఇంక మొన్నటి మా మూడో హనీమూన్ లో భాగంగా, ఢిల్లీ, హర్యాణా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, యూపీ, రాజస్థాన్ లలో అనేకచోట్ల పర్యటించాము. అన్నిచోట్లా యధేచ్చగా సంచుల వినియోగం జరుగుతూంది. ప్రసిధ్ధ పర్యాటక స్థాలాల్లో సైతం, పర్యావరణం పేరుతో తలతిక్క విధానాలు అవలంబించడం తప్ప, ప్లాస్టిక్ నిషేధం లేదు. యెక్కడా 'రీసైకిలు కోసం చెత్తబుట్టలు ' అంటూ కనపడలేదు. 
 
బెంగుళూరులో మాత్రం, యెంపికచేసిన కొన్ని యేరియాల్లో, మహానగరపాలికె పారిశుధ్య పనివాళ్లు పోగుపడిన చెత్తని--కాయితాలు వేరుగా, అట్టపెట్టెలు వేరుగా, లోహపు మూతలూ, వస్తువులూ వేరుగా, ప్లాస్టిక్ కవర్లూ, పాలపేకెట్లూ వేరుగా, ప్లాస్టిక్ సీసాలు వేరుగా, గాజు సీసాలు వేరుగా--ఇలా తమ చేతులతో బస్తాల్లో నింపి మోసుకెళ్లడం చూశాను. తరువాత అవి యేమి చేస్తున్నారో. 
 
ఇంక మా నరసాపురం లాంటి చిన్న వూళ్లలో, మునిసిపాలిటీ వుద్యోగులు మాత్రం విశ్వరూపం ప్రదర్శిస్తారు--నిషేధం అమలుకోసం జనాలని ఇరగదీస్తూ. 
 
ఇప్పటికి మాత్రం, కమీషనరుగారి ఇంటి చుట్టుప్రక్కలా, ప్రభుత్వాధికారుల ఇళ్ల చుట్టు, రోజుకి మూడు నాలుగుసార్లు చెత్త యెత్తీ, ఇళ్లనుంచి సేకరించీ, ట్రాక్టరు తొట్లలో నింపి, తిన్నగా డంపింగ్ యార్డులో దిమ్మరించి వస్తున్నారు. ఆ సోకాల్డ్ యార్డులు నిండిపోయి, చెత్త ఓ పర్వతం అంత యెత్తు అయిపోయాక, కొత్త డంపింగ్ యార్డు కోసం భూసేకరణ చేస్తున్నారు. (వీటిల్లో కూడా కుంభకోణాలు మామూలే!). మరి ఆ మాత్రానికి 20 మైక్రానులైతే యేమిటి; వెయ్యి మైక్రానులైతే యేమిటి? సామాన్య జనాలని వేధించడం తప్ప! 
 
ఇంకో గమనార్హమైన విషయం యేమిటంటే, ఇదివరకు "మానుష వ్యర్థాలని" సేకరించే పని చేసే కులం వాళ్లే ఇప్పుడు కూడా పారిశుధ్య కార్మికులుగా పని చేస్తున్నారు. ఇంకా "సెప్టి క్లీన్"లు నిర్వహిస్తున్నవాళ్లు కూడా వాళ్లే! మరి ఆ కులంవాళ్లని యేమి వుధ్ధరించినట్టు? 
 
ఇప్పటికైనా ప్రభుత్వాలు వూరికే మీడియాలో ప్రచారం కోసం కాకుండా, చిత్తశుధ్ధి తో "సరైన చర్యలు" తీసుకొంటే మంచిది. 
 
ప్రజలందరూ సంతోషిస్తారు.