Monday, November 21

కొలతలూ......3



......మానాలూ

ఇంకా, దమ్మిడీనే 'పైస' అని కూడా అనేవారేమో. యాగాణీ అంటే రెండు పైసలు అనుకుంటా. (ఈ నాణాలు నేను చూడలేదు. యెన్ని గవ్వలైతే ఒక పైసాగా పరిగణించేవారో కూడా నాకు తెలీదు).  

అప్పట్లో, పెద్ద కాణీలు, జార్జి 5 త్ కింగ్-ఎంపరర్ బొమ్మతో వుండేవి. ఆయన భారతదేశానికి వచ్చినప్పుడే "గేట్ వే ఆఫ్ ఇండియా" ఆయనకి స్వాగతం చెప్పడానికి అప్పటి బొంబాయిలో నిర్మించారు(ట). విశ్వకవి రవీంద్రుడు ఆ సందర్భంగానే, "జనగణమన" వ్రాశాడు అని కొంతమంది వ్రాసిన చరిత్ర!  

రెండో ప్రపంచ యుధ్ధం రోజుల్లో, పొదుపు కోసం చిన్న సైజు కాణీలూ, తరవాత "చిల్లు కాణీలు" ప్రవేశపెట్టారు. అంటే యేమీలేదు--కాణీలో మధ్యభాగాన్ని తొలగించి, అంచుమాత్రమే ముద్రించేవారు. ఆ కాణీలని పిల్లల మొలత్రాళ్లలో కూడా కట్టేవారు--దిష్టి తగలకుండా(ట)! 

తరవాత, జార్జి 6 త్ తో కూడా కాణీలు ఇతర నాణాలూ వచ్చాయి. స్వతంత్రం వచ్చాక, ఆ చిన్న కాణీల మీద  పరుగెడుతున్న గుర్రం బొమ్మ ముద్రించేవారు.

కాణీ పైన వుండే అర్థణా దగ్గరనుంచీ, రూపాయి వరకూ చివర 'కాసు' చేర్చేవారు--అర్థణాకాసు, అణాకాసు......ఇలా. 

ఇంకా, అణాకాసుని 8 వృత్తాకార కోణాలతో, వెనుకవైపు చక్కటి డిజైన్ మధ్య ఇంగ్లీషులో వన్ అణా అనీ, తెలుగులో ఒక అణా అనీ ముద్రించేవారు! ఇవి దేశవ్యాప్తంగా చలమణీలో వుండేవి అని మరిచిపోకండి--అదీ అప్పట్లో తెలుగుకి వున్న గుర్తింపు. 

ఇప్పుడు ఒక రూపాయి, రెండు రూపాయలూ, ఐదు రూపాయలూ నాణాలన్నీ ఒకే సైజులో గుండ్రంగా ముద్రించేబదులు, ఇలా చక్కటి డిజైన్లలో ముద్రిస్తే యెంత బాగుండును? మళ్లీ అలాంటి అందమైన నాణాలని చూడగలమా? దువ్వూరివారేమంటారో! 

ఇంక, అణా కి 12 పైసలు. రూపాయికి 16 అణాలు--అంటే, రూపాయికి 192 పైసలు. 

లెఖ్ఖల్లో, 1000 పైసలని, రూపాయలూ, అణాలూ, పైసలూ లోకి మార్చమనీ--ఇలా మా ప్రాణాలు తీసేవారు! (మీరెవరైనా చెయ్యగలరేమో ప్రయత్నించండి!)

(బ్రిటిష్ వాళ్ల పౌండ్ కి 20 షిల్లింగులు, ఒక్కో షిల్లింగుకి 12 ఓ 16 ఓ పెన్నీలు వుండేవి. ఆ లెఖ్ఖలు కూడా మమ్మల్ని చంపేవి! తరవాత వాళ్లు కూడా పౌండ్ కి 100 పెన్నీలుగా మార్చుకున్నారు--ఇంటర్నేషనల్ కరెన్సీగా మారాక)

ఇంకో చిత్రమేమిటంటే, నిజాం పాలనలోనేకాదు....మనకి స్వతంత్రం వచ్చాకా, నిజాం రాష్ట్రం మన దేశంలో విలీనం చెయ్యబడ్డాక కూడా, "తెలంగాణా వంద" చాలకాలం చెలామణీలో వుండేది. అంటే వంద వస్తువులు అంటే వాళ్ల లెఖ్ఖ 192!

(మా పెద్ద దొడ్డ, పెళ్లికాగానే భర్తతో నిజాం పాలనా కాలంలోనే హైదరాబాదు వెళ్లిపోవడంతో పక్కా తెలంగాణా భాషా, యాసా, కట్టూ బొట్టూ, ఆచారాలు వచ్చేశాయి ఆవిడకి. ఆవిడ, మనకి ఆవకాయలకోసం మామిడికాయలు 'మన వంద' 3 రూపాయలకి ఇస్తున్నారంటే, "మాకూ మూడు రూపాయలే--కానీ, తెలంగాణా వంద! ముక్కలు కొట్టి కూడా ఇస్తారు!" అని మా అమ్మని వుడికించేది! తనకి పిల్లలు చిన్నగా వున్నప్పుడే భర్తృవియోగం కలగడంతో, ఆవిడే మార్కెట్ కి వెళుతూండేది. తేడా అల్లా ఆవిడ చెప్పులు వేసుకొనేది కాదు. దాంతో మార్కెట్లో అందరూ "ఆంధ్రావాలీ" అని గుసగుసలు పోయేవారట. పిల్లలైతే, గేలి చేస్తున్నట్టుగా చిత్రంగా చూస్తూ వెనుకబడేవారట! అలా అని ఆవిడని యెవరూ అవమానించడమో, వివక్ష చూపడమో జరిగేది కాదట! ఇప్పటి "ప్రత్యేక తెలంగాణా వాదులకి" ఈ విషయాలు తెలుసోలేదో మరి)

యెక్కడో ములిగి యెక్కడో తేలాం అనుకుంటా. 

కరెన్సీ, నాణాలూ గురించి ఈ మాత్రం చాలనుకుంటా.

.....కొనసాగింపు మరో టపాలో

కొలతలూ......2



......మానాలూ

మనదేశంలో 20వ శతాబ్దం మొదట్లో కూడా, గవ్వలకి కూడా (చిల్లి గవ్వలకీ, గుడ్డి గవ్వలకీ కూడా!) విలువ వుండేది!

ఢిల్లీ పరిపాలకుడు షేర్షా సూరీ అనుకుంటా--దేశం మొత్తమ్మీద "నాణాలని" ప్రవేశపెట్టాడు. 

సముద్ర గుప్తుడూ వగైరాలు అప్పట్లో బంగారునాణాలు చలామణీలోకి తెచ్చారు.

బ్రిటీష్ వాళ్లు ద్రవ్యం "లీగల్ టెండర్" ప్రవేశపెట్టి, నాణాలూ, నోట్లూ ముద్రించేవారు (అంతకు ముందు నోట్లు లేవు--ఒక్క తుగ్లక్ విడుదలచేసిన 'తోలు' నోట్లు తప్ప!).

మా చిన్నప్పుడు "విచ్చు రూపాయి" అని ఖచ్చితంగా ఒక్క తులం వెండితో ఒక రూపాయి నాణాలు వుండేవి. ఒక సారి మా వైజయంతీ హాలులో నేను సినిమా టిక్కెట్లు తీసుకొన్నప్పుడు చిల్లర తిరిగి ఇస్తూ, ఓ వెండి రూపాయిని కూడా మామూలు వాటితో ఇచ్చేశాడు. (అది ఇప్పటికీ మా అమ్మగారు తన డబ్బుల పెట్లో జాగ్రత్త చేశారు!)

మహమ్మదీయ రాజులు ప్రవేశపెట్టిన నాణాల్లో అతి చిన్నది "దమడీ" (దమ్మిడీ) అనుకుంటా. తరవాత కాణీ, యాగాణీ--ఇలా వుండేవనుకుంటా నాణాలు. (దమ్మిడీ ముండకి యాగాణీ క్షవరమా? అనే సామెత అప్పుడు పుట్టింది--ఇప్పటికీ వాడుకలో వుంది!)

నా చిన్నప్పటి నాణాలూ, నోట్లూ విషయానికొస్తే.......

ద్రవ్యానికి (డబ్బుకి) మానం :

2 కాణీలు = ఒక అర్థ అణా
2 అర్థణాలు = ఒక అణా
2 అణాలు = ఒక బేడ
2 బేడలు = ఒక పావలా
2 పావలాలు = ఒక అర్థ రూపాయి
2 అర్థరూపాయలు = ఒక రూపాయి

ఒకరూపాయి నాణాలూ, నోట్లూ కూడా వుండేవి. తరవాత రెండూ, ఐదూ, పదీ, వందా, వెయ్యీ--మాత్రమే నోట్లు వుండేవి. పాత సినిమాల్లో ఇవన్నీ చూడొచ్చు.....వినొచ్చు!  

.....కొనసాగింపు మరో టపాలో

Sunday, November 20

కొలతలూ......


(వీ సాంబశివరావు అనే ఒకాయన భాగవతం మీద రీసెర్చ్ చేసి, సాంఖ్య శాస్త్రంలో యెంతో కృషి చేస్తున్నారు. ఆయన నన్ను మన పాతా, కొత్తా, మానాలు, కొలతలగురించి, వాటిని
"మార్చడం" గురించీ "సూత్రాల"కోసం అడిగారు. చాలా సంతోషం. అందుకే ఈ టపాలు. వీటిల్లో యేమైనా తప్పులు వ్రాసినా, విజ్ఙ్ఞులు నా దృష్టికి తీసుకురావాలని నా మనవి.)

మా చిన్నప్పుడు = ఈ గుర్తుని "ఈజ్ ఈక్వల్ టు" అంటే "ఖచ్చితంగా సమానం" అని వ్యవహరించేవారు. అప్పటికి నానోలు కాదుకదా, మైక్రో వగైరాలు కూడా లేవు. డెసిమల్ స్థానాల్లో కూడా మొదటి రెండింటినీ గుర్తించి, మిగిలినవి వదిలేసేవారు. తరవాత్తరవాత, ఇంకా ఖచ్చితమైన లెఖ్ఖలు అవసరం పడడంతో, మా పిల్లల చదువులు వచ్చేసరికి, అదే గుర్తుని "ఈక్వల్స్" అనడం మొదలెట్టారు--అంటే "సమానం అవుతుంది" అని! అంతేగానీ, ఖచ్చితంగా సమానం అని కాదు!

మరి నిజమేకదా?

బ్రిటిష్ వాళ్లనుంచి మనకి స్వాతంత్ర్యం వచ్చాక పది పన్నెండేళ్లవరకూ వాళ్ల ఎఫ్.పీ.ఎస్ పధ్ధతినే (ఫుట్; పౌండ్; సెకండ్) అనుసరించేవారు మనదేశంలో. 1959 లో అనుకుంటా "మెట్రిక్" పధ్ధతి సీ.జీ.ఎస్ (సెంటీ మీటర్; గ్రామ్; సెకండ్) కి మార్చారు మన ప్రభుత్వంవారు. అప్పుడే "నయా పైసా"లు వచ్చాయి. తరవాత ఇందిరాగాంధీ టైములో అనుకుంటా, "నయా" తొలగించారు!

మనదేశంలో అప్పటి కొలతలకి సంబంధించిన మానం : (ద్రవాలకి కూడా)

2 అరగిద్దలు = ఒక గిద్ద
2 గిద్దలు = ఒక అరసోల
2 అరసోలలు = ఒక సోల
2 సోలలు = ఒక తవ్వ
2 తవ్వలు = ఒక శేరు
2 శేర్లు = ఒక అడ్డ లేదా మానిక
(5 శేర్లు = ఒక వీశ--తూకంలో)
2 అడ్డలు = ఒక కుంచం
24 కుంచాలు = ఒక బస్తా

దూరానికి మానం :

12 అంగుళములు = ఒక అడుగు
3 అడుగులు = ఒక గజము
220 గజములు = ఒక ఫర్లాంగు
8 ఫర్లాంగులు = ఒక మైలు

అప్పటి "తూకాలకి" సంబంధించిన మానం ఇదివరకు నా టపా.....

http://krishnasree.blogspot.com/2008/11/4-2-1-2-1-2-2-1-2-1-2-1-2-1-8-1-20-1.html

లో వ్రాశాను.

.....కొనసాగింపు మరో టపాలో

కొనసాగింపు.....


మానాల గురించి

(వీ సాంబశివరావు అనే ఒకాయన భాగవతం మీద రీసెర్చ్ చేసి, సాంఖ్య శాస్త్రంలో యెంతో కృషి చేస్తున్నారు. ఆయన నన్ను మన పాతా, కొత్తా, మానాలు, కొలతలగురించి, వాటిని "మార్చడం" గురించీ "సూత్రాల"కోసం అడిగారు. చాలా సంతోషం. అందుకే ఈ టపాలు. వీటిల్లో యేమైనా తప్పులు వ్రాసినా, విజ్ఙ్ఞులు నా దృష్టికి తీసుకురావాలని నా మనవి.) 

మా చిన్నప్పుడు = ఈ గుర్తుని "ఈజ్ ఈక్వల్ టు" అంటే "ఖచ్చితంగా సమానం" అని వ్యవహరించేవారు. అప్పటికి నానోలు కాదుకదా, మైక్రో వగైరాలు కూడా లేవు. డెసిమల్ స్థానాల్లో కూడా మొదటి రెండింటినీ గుర్తించి, మిగిలినవి వదిలేసేవారు. తరవాత్తరవాత, ఇంకా ఖచ్చితమైన లెఖ్ఖలు అవసరం పడడంతో, మా పిల్లల చదువులు వచ్చేసరికి, అదే గుర్తుని "ఈక్వల్స్" అనడం మొదలెట్టారు--అంటే "సమానం అవుతుంది" అని! అంతేగానీ, ఖచ్చితంగా సమానం అని కాదు!

మరి నిజమేకదా?

బ్రిటిష్ వాళ్లనుంచి మనకి స్వాతంత్ర్యం వచ్చాక పది పన్నెండేళ్లవరకూ వాళ్ల ఎఫ్.పీ.ఎస్ పధ్ధతినే (ఫుట్; పౌండ్; సెకండ్) అనుసరించేవారు మనదేశంలో. 1959 లో అనుకుంటా "మెట్రిక్" పధ్ధతి సీ.జీ.ఎస్ (సెంటీ మీటర్; గ్రామ్; సెకండ్) కి మార్చారు మన ప్రభుత్వంవారు. అప్పుడే "నయా పైసా"లు వచ్చాయి. తరవాత ఇందిరాగాంధీ టైములో అనుకుంటా, "నయా" తొలగించారు! 

మనదేశంలో అప్పటి కొలతలకి సంబంధించిన మానం : (ద్రవాలకి కూడా)

2 అరగిద్దలు=ఒక గిద్ద
2 గిద్దలు=ఒక అరసోల
2 అరసోలలు=ఒక సోల
2 సోలలు=ఒక తవ్వ
2 తవ్వలు=ఒక శేరు
2 శేర్లు=ఒక అడ్డ లేదా మానిక
(5 శేర్లు=ఒక వీశ--తూకంలో)
2 అడ్డలు=ఒక కుంచం
24 కుంచాలు=ఒక బస్తా

దూరానికి మానం :

12 అంగుళములు = ఒక అడుగు
3 అడుగులు         = ఒక గజము
220 గజములు     = ఒక ఫర్లాంగు
8 ఫర్లాంగులు        = ఒక మైలు

అప్పటి "తూకాలకి" సంబంధించిన మానం ఇదివరకు నా టపా.....


లో వ్రాశాను.

.....కొనసాగింపు మరో టపాలో

Wednesday, November 16

బాలల.......



......చదువులు

బాలల దినోత్సవం రోజున--14-11-2011 న--ఈనాడులో శ్రీధర్ కార్టూన్....కాస్త నవ్వు పుట్టించినా, కళ్లనీళ్లు గిర్రున తిరిగాయి. అందులో....

ఓ పిల్లాడు ప్రథానిని "అప్పుడు పేదవాళ్లకు లాంతర్లూ, కిరోసిన్, పుస్తకాలూ, చదువూ....అందుబాటులో వుండేవా సార్?" అని అమాయకంగా, దీనంగా, హాచ్చెర్రెంగా అడుగుతున్నాడు!

నిజంగా, తన తలపాగాని అలాగే వూడదీసి, ఆ చిప్పలో నీళ్లు నింపుకొని, అందులో దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనిపించాలాయనకీ.....అది చూస్తే.

"మీరలా అనడాన్‌కి గుట్కా లేదు....రూల్స్ వొప్పుకోవు.....మన అధిష్టానమ్మ పెర్మిషన్ లేకుండా అలాంటి నిర్ణయాలు దీసుకోరాదు. కోర్ కమిటీలో చర్చించాక, మీకు ఆదేశాలిస్తాం...అంతవరకూ, తలపాగా తగిలించేస్కొని, వెయిట్ చెయ్యండ్రి" అని కి కు రె అన్నట్టు ఆయనకి వినిపించిందేమో! ఆయన ఆ పని చెయ్యడానికి ప్రయత్నించలేదు. 

నా అయిదో యేట, విజయదశమినాడు, మా నాన్నగారి ఆధ్యాత్మిక గురువు చల్లా కృష్ణమూర్తి శాస్త్రి (ఆయనపేరే నాకు పెట్టారు.) చేత నా అక్షరాభ్యాసం మొదలై, అదేరోజు, జీడీఎం (గోదావరి డెల్టా మిషన్) ఎలిమెంటరీ స్కూలుకి (పసుపుగోచీ అలాగే వుంచుకొని, దానిమీద నిక్కరు చొక్కా వేసుకొని, చంకలో పలకతో, అప్పటికే ఆ స్కూల్లో చదువుతున్న మా అన్నయ్య స్నేహితులతో, పరుగు పరుగున స్కూలుకి వెళ్లడం నా కళ్లకి కట్టినట్టు కనిపిస్తూంది....ఇప్పటికీ!) వెళ్లి, ఒకటో తరగతిలో, పిల్లలందరికీ పప్పు బెల్లాలూ, కణికలూ, ఐదారుమందికి పలకలూ, సీనియర్ విద్యార్థులకి యెక్కాల పుస్తకాలూ పంపిణీ పూర్తయ్యాక, మరియా టీచర్ నా పలక మీద "అ, ఆ" అని వ్రాసిచ్చి దిద్దుకోమని చెప్పడం, వెనుక ఖాళీగావున్న ఓ "నేలబల్ల" మీద కూర్చొని, నేను దిద్దడం మొదలెట్టడం...పావుగంటైనా నేను దిద్దుతూనే వుండడం...ప్రక్కనున్నవాడు 'తీసుకెళ్లి టీచరుకి చూపించు' అనడం, నేను (అప్పటికే ఆవిడ చుట్టు మూగి వున్న పిల్లల్లో కాస్త చోటుచెసుకొని) పట్టుకెళ్లి  చూపించడం, ఆవిడ అవి చెరిపేసి, మళ్లీ "అ, ఆ" లు వ్రాసిచ్చి దిద్దమనడం.....నా మూడో యేటనే అ ఆలు నేర్చేసుకొని వుండటంతో ఆ "చదువు"ని ఎంజాయ్ చెయ్యడం.....! ఇవన్నీ ఇప్పటికీ "డేజావూ" నాకు!

.......మరోసారి.

Monday, August 15

ఆర్య వైద్యశాల, కొట్టక్కళ్



ప్రపంచ ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యశాల

కేరళలోని తిరువనంతపురంలో వుంది ఈ వైద్య శాల. కొన్ని తరాలుగా తమ కుటుంబంలో వస్తున్న ఆయుర్వేద విద్యతో, వైద్య రత్నం పీ ఎస్ వరియర్ అనే ఆయన మొదటిసారిగా యేర్పాటు చేశాడు ఈ వైద్య శాలని. అప్పటినుంచీ ఈ వైద్య విధానాన్ని కొనసాగిస్తూ, పరిశోధనలతో ఇంకా అభివృధ్ధి చేస్తూ, మన భారతీయ వైద్యానికి ప్రాచుర్యం కల్పించడమే కాదు, తక్కువ ఖర్చుతో అనేక మొండి రోగాలని సైతం నయం చేస్తూ, ప్రపంచదేశాలలోని ప్రజలని ఆకర్షిస్తోంది ఈ వైద్య శాల. ఇప్పటి ముఖ్య వైద్యుడు పీ కే వరియర్ కి భారత ప్రభుత్వం "పద్మ విభూషణ్" ఇచ్చి గౌరవించింది.

వారికి కేరళలోనే, అలువ (అల్వేయి), కొచ్చి (కొచ్చిన్) లలోనే కాకుండా, బెంగుళూరు, ఢిల్లీల్లో కూడా శాఖలు వున్నాయి.

లాభార్జన ధ్యేయం కాకుండా, ప్రజా సేవ ముఖ్యంగా కొనసాగుతున్న ఈ వైద్యశాలలు ఇంకా అభివృధ్ధిలోకి రావాలి అని కోరుకుందాం.

Thursday, August 11

స్టాప్ గేప్



.....యేమయిపోయారో???

నాటపాల్లో చాలా గేప్ వచ్చింది--యెందుకు అనుకుంటున్నారా?

జూన్ 11న బయల్దేరి, బెంగుళూరు వెళ్లాము. అక్కడనించే మా నాలుగో హనీమూన్, మేము చక్కగా చేసిన హనీమూన్, ప్రారంభం అయ్యింది!

రెండునెలలు దక్షిణ భారత దేశమంతా తిరిగి, ఓ పెద్ద ఘన కార్యం సాధించి, తిరిగి మొన్న 4న తిరిగి వచ్చాము. ఓ వారం రోజులు ఇంటా బయటా వ్యవహారాలు చక్కబెట్టి, ఇప్పుడు మళ్లీ నా టపాలు మొదలు!

యేమంటారు? మూడు తరవాతే నాలుగు అంటారా? వోకే! అవీ, ఇవీ అన్నీ--సరేనా?







Monday, July 11

మా మూడో హనీమూన్ అనే.......-16

మొన్నటి మా యాత్ర

సినిమా అయి బయటికి వచ్చాక, ఇంక మ్యూజియంలో "క్లైమాక్స్"! 
 
"మొత్తం మ్యూజియానికీ, గుడికీ, ఢిల్లీకీ, దేశానికీ, ప్రపంచానికీ 'హై లైట్'; అది చూడని వాళ్ల జన్మ వ్యర్థం: మన సంస్కృతి గురించి మనం తెలుసుకోవాలి కదండీ?" ఇలాంటి కామెంట్లు అనేకం పొందిన "నదీ యాత్ర". 
 
అంటే, ఓ పది పదిహేను మంది పట్టే బోటులో కూర్చోపెట్టి, దానిని అండర్ గ్రవుండ్లో వున్న ఓ నదిలాంటి ప్రవాహంలోకి, పెద్ద చైన్లూ, పళ్ల చక్రాలూ సాయంతో, పంపిస్తారు. అక్కడ, 'సబ్ డ్యూడ్' లైటింగులో, ఈ ప్రక్కా, ఆ ప్రక్కా లైఫ్ సైజు బొమ్మలతో, వాటిమీద స్పాట్ లైట్లతో ప్రదర్శన కొనసాగుతుంది. స్పీకరులో, అది సరయూ నదిలోనో, గంగా నదిలోనో, మన జీవన వాహినిలోనో జరుగుతున్న యాత్ర అంటూ, ఒక్కొక్క దృశ్యాన్నీ, అందులోని వాళ్ల పేర్లనీ, చరిత్ర (ఇతిహాసం) నీ చెపుతూ, వూరేగిస్తారు మనని. 
 
రామాయణ భారతాలదగ్గరనుంచీ, ఆర్యభట్టు, వరాహమిహిరుడు, చరకుడూ, శుశ్రుతుడూ దగ్గరనుంచి, అక్బరూ, షాజహాన్ల నుంచి, ఝాన్సీ లక్ష్మీ, శివాజీ, ఇతర రాజులూ, స్వతంత్ర పోరాటం నుంచి, అన్నీ చూపించి, చివరగా, ఇదంతా ఆ "స్వామినారాయణుడి" చలువ--అనే సందేశంతో ముగుస్తుంది ఆ యాత్ర. బోట్లు పైకి వచ్చి, మనం బయటికి! 
 
హమ్మయ్య! మ్యూజియం అయిపోయింది. 
 
కొంచెం గాలి పీల్చుకొంటూ, కారిడార్లలో నడుస్తూ, అసలు "గుడి" ని చేరతాం. 
 
గుడి చుట్టూ అనేకవందలమంది జనాలు--యెవరి వ్యాసంగంలో వాళ్లు. ఓ ప్రక్క అభివృధ్ధిలో భాగంగా, పాడయిపోయిన "టైల్స్" స్థానంలో క్రొత్తవి వేస్తూ, కొన్నిచోట్ల సిమెంటూ, కాంక్రీటు తో ఇంకేవో కడుతూ, పనివాళ్లు. చెప్పులు వదిలే స్టాండ్లలో రద్దీ. 
 
మేము మా చెప్పులని, కొంతమందిలాగ, ఓ ప్రక్కన పెట్టి, ఇంతకుముందే గుడి చూసేసిన మా ఢిల్లీ బావగారిని వాటికి కాపలా పెట్టి, ఇదివరకు "బిర్లా" టెంపుళ్లూ, "ఇస్కాన్" టెంపుళ్ల మెట్లెక్కినప్పటి అనుభూతులని తలుచుకొంటూ, అనేక మెట్లెక్కి, మధ్యలో ఆగుతూ, ఆయాసపడుతూ, చివరికి గుడి లోకి చేరాం. 
 
అక్కడ, క్రమ అష్టభుజకారంలో అనుకుంటా, ఓ నిర్మాణం. అందులో ఓ నలభై అడుగులో యెంతో యెత్తున్న "స్వామి నారాయణుడి" విగ్రహం. విగ్రహమంతా అనేక విలువైన రాళ్లతో అలంకరించబడి వుంది. నాకు విగ్రహంలో వివేకానందుడి చాయలు కనిపించాయి--లేదంటే, ఓ మహారాజు గెటప్ లో!. 
 
ఆ ఆష్ట భుజాలకీ మళ్లీ ఎక్స్టెన్షన్లు! వాటిలో అనేక మతాల శైలులూ, సీలింగుతో సహా అనేక "నీల కంఠ చరిత్ర" దృశ్యాలూ, అంతా బంగారం, వెండీ, విలువైనవనిపించే రాళ్లూ--అదీ ఆయన వైభోగం! (ఆ "దేవుడికి" భక్తిగా దణ్నం పెట్టినవాడెవడూ కనపళ్లేదు--నోరు తెరుచుకొని అద్భుతాలని చూస్తున్నవాళ్లు తప్పితే!) 
 
ఫోటోలు, వీడియోలు తీసుకోడానికి లేదు. తాజ్ మహల్ దగ్గరలోలా, ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఫోటోగ్రాఫర్లు లేరు! ఆ గుడివాళ్లు అమ్మే ఫోటోలూ అవీ మాత్రమే 'కొనుక్కోవాలి!' వాటిల్లో మనం వుండం కదా! 
 
ఆ వందల యెకరాల నిర్మాణంలో మా ఆడవాళ్లకి నచ్చింది యేమిటంటే--ఆ గుడిచుట్టూ వున్న ఆవరణని, కొన్ని వందలమంది మధ్యలోనుంచి, చాకచక్యంగా నడుపుకుంటూ, వెనుక తిరుగుతున్న "బ్రష్"లతో, డిటర్జెంటూ, నీళ్లూ కలిపిన నీళ్లతో, నేలని శుభ్రం చేస్తూ పోతున్న చిన్న చిన్న రోలర్ల లాంటి మెషీన్లు! ఇలాంటివి మనక్కూడా వుంటే, ఇల్లు వొత్తుకోడం బాధ తప్పేదికదా? అంటూ నిట్టూర్చారు వాళ్లు! 
 
మళ్లీ బయటికి వెళ్లే దారిలోంచి బయలుదేరిన చోటికి వచ్చేసరికి అక్కడ--బయటే వుండిపోయిన మా కాకినాడ బావగారి దర్శనం, పరామర్శలూ!      

.......తరువాయి మరోసారి.

Saturday, July 2

మా మూడో హనీమూన్ అనే.......-15


మొన్నటి మా యాత్ర

ఇంక ఆ సినిమాలో విషయం యేమిటంటే........సరిగ్గానే వూహించారు.....స్వామినారాయణ్ గా మారిన నీలకంఠ అనేవాడి కథే! (నీలకంఠుడంటే తెలుసుకదా? శివుడు).

ఆ కుర్రాడు సరయూ నదీతీరంలో ఓ పల్లెలో జన్మించాడట. చిన్నప్పుడే చేపలు పట్టుకొనేవాళ్లని తిట్టీ, తుఫానులు ఆపీ, ఇంకా యేవేవో చేశాడు. యెనిమిదేళ్ల వయసులో ఓ రాత్రి, ఓ నిశ్చయానికి వచ్చి, అర్థరాత్రి వర్షం కురుస్తూ వుండగా పొంగి ప్రవహిస్తున్న సరయూనదిలో దూకేశాడు--తన అన్వేషణ కొనసాగించడానికి వీలుగా. (శంకరాచార్యులు తన యేడవ యేటనే సన్యాసం స్వీకరించడానికి నిశ్చయించి, తల్లి వొప్పుకోకపోవడంతో వూరుకుని, ఒకరోజు కాలడిలో ఓ నదిలో తనకాలు మొసలి పట్టుకుంటే, 'అమ్మా! యెలాగా చనిపోయేలా వున్నాను. నాకు సన్యాసానికి అనుమతి ఇవ్వవూ?' అనివేడుకొంటే, ఆవిడ ఇచ్చేసిందనీ, చిత్రంగా మొసలి వెళ్లిపోయి, ఆయన అప్పుడే సన్యసించాడనీ విన్నారా?) అక్కడినుంచీ ఆయన ప్రయాణం, దారిలో జరిగిన బోళ్లు అద్భుతాలూ........(నాకు గుర్తున్నంతవరకూ కొన్ని)

ఒక వూళ్లో అదేదో ప్రసిధ్ధ దేవాలయం, ఓ మఠం వుంటుంది. సాయంత్రం అయ్యేటప్పటికి అందరూ ఇళ్లలో జొరబడి, తలుపులు మూసేసుకుంటారు. కారణం--ఓ భయంకరమైన సిం హం ఆ వూల్ళొకి వచ్చి, కనిపించినవాళ్లని చంపి తినేస్తూంటుంది. నీలకంఠ సాయంత్రంపూట ఆ వూరు చేరి, గుడిముందర ఓ చెట్టు చుట్టూ వున్న చపటామీద కూర్చొని, తపస్సులో ములిగిపోదామనుకుంటాడు. వూరి జనమందరూ, చివరికి ఆ మఠం ప్రథాన్ కూడా అతణ్ని హెచ్చరిస్తారు, బ్రతిమాలుతారు--అయినా వినడు. కాసేపటికి సిం హం రానే వస్తుంది! దానితో వాడు, "నాలో నీమీద ప్రేమ మాత్రమే వుంది! నీక్కూడా నామీద ప్రేమ మాత్రమే వుండాలి" అనడంతో అది తోకముడిచి, అతన్ని నాకుతూ కుక్కలా పడి వుంటుంది తెల్లవార్లూ. ప్రొద్దున్న చూసిన జనాలకి.....అద్భుతం!

హిమాలయ పర్వతాల్లో వున్న ఓ వూళ్లో, మంచు పడడం ప్రారంభమయ్యే సమయానికి, అక్కడి గుళ్లనీ, మఠాలనీ, ఆశ్రమాలనీ, జనావాసాలనీ ఖాళీ చేసి, కొండల క్రిందరికి వెళ్లిపోతూంటారు అందరూ. అందరూ అలా క్రిందికి దిగిపోతూ వుండగా, పైన ఓ మహంతుడు వుంటాడు....నీలకంఠ పైకె యెక్కి వస్తూండడం చూస్తాడు. వెంటనే అందరినీ తోసుకొంటూ క్రిందకి వచ్చేసి, 'బాబూ! అందరూ క్రిందికి వెళ్లిపోతున్నారు. నీవేమిటి పైకి వస్తున్నావు?' అనడుగుతాడు. వాడు 'నేను పైకే వెళతాను.' అంటాడు. "అహా! యేమినాభాగ్యమూ! నీవేనా నా తండ్రీ! యెప్పటినించో నీకోసం యెదురు చూస్తున్నాను! ఆ మహానుభావుడివి నీవేనన్నమాట! ఇంకెవ్వరూ వూరు వదిలి పోవలసిన పని లేదు. స్వామి వచ్చేశాడు!" అని ప్రకటించేస్తాడు. అందరూ సుఖంగా అక్కడే వుండిపోతారు. (ఇంక మంచు పడనే పడదు! మరి గంగా, సింధు, బ్రహ్మపుత్ర లాంటి జీవనదుల గతి ఆ సంవత్సరం యేమయ్యిందో?!)

అంతలాగ అన్ని ఆశ్రమాలలోనూ, మఠాలలోనూ సాక్షాన్నారాయణ స్వరూపుడిగా పరిగణించబడ్డవాడు, రామానుజుల ఆశ్రమానికి వచ్చి, ఆయన యెక్కడో పర్యటనలో వుంటే, ఆశ్రమాన్ని చీపురుతో శుభ్రం చేస్తూ, చిన్న చిన్న పనులు చేస్తూ వుంటాడు. రామానుజులు తిరిగి రాగానే, ఆయన ఇంకా సముద్రంలోనో, నదిలోనో వుండగానే తెలిసేసుకొని, "నీలకంఠా! ఇప్పటికి వచ్చావా! ఇంక ఈ ఆశ్రమం నీదే. అన్ని బాధ్యతలూ నీవే!" అంటూ.....ప్రాణాలు విడుస్తాడు (అనుకొంటా!)

మధ్యలోనో, చివర్లోనో, వాడు యువకుడై, ఓ రాజుగారి దర్బారుకి వెళితే, అక్కడ ఆ రాజుగారు తన వారసుడిగా వీణ్ని ప్రకటించో యేదో.......మొత్తానికి రత్న ఖచిత; వజ్ర వైడూర్య భూషిత; స్వర్ణ సిం హాసనారూఢుడై, "ఆయనే స్వామి నారాయణుడు!" అనిపించుకొంటాడు.

నా దృష్టిలో ఈ సినిమా "హైలైట్" యేమిటంటే, "ఎగ్ జాక్ట్ గా" శంకరాచార్యుడిలాగానే, నీలకంఠ కూడా--సరయూనదీ తీరం నుంచి బయలుదేరి, అరేబియా సముద్రం నుంచీ, హిందూకుష్ పర్వతాలూ, టిబ్బెట్, నేపాల్, బెంగాల్ మీదుగా కన్యాకుమారి వరకూ చేరి, మళ్లీ బయలుదేరిన చోటుకే రావడం--ఆయన "అడుగుజాడల" రూపంలో ఆ మార్గాన్ని స్క్రీన్ మీద చూపించడం!

నాకు అర్థమైనది, శంకరుడు శైవుడు! ఆయనకి ప్రతిగా స్వామి నారాయణుడు! దానికోసం ఇంత "కల్ట్ బిల్డింగ్!". అదీ.

మన సోకాల్డ్ "సర్వసత్తాక గణతంత్ర, స్వతంత్ర, 'సర్వమతసమభావనా', 'సర్వసౌభ్రాతృత్వ ' ప్రజాస్వామ్య భారత దేశంలో ఇవన్నీ అవసరమా??!!    

.......తరువాయి మరోసారి.

ప్లాస్టిక్ (సంచుల) నిషేధం


ఆంధ్రలో అత్యుత్సాహం

ఆంధ్రదేశంలో ఇవాళ (01-07-2011) నుంచీ  అమల్లోకి వచ్చిందట--40 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ సంచులపై నిషేధం! (ఇప్పటికే 20 మైక్రాన్లపై విజయం ఇరగదీశారట! తరవాత 70 మైక్రానులలోపు పై నిషేదమట!). మళ్లీ దండుకోడాలు మొదలన్నమాట. 
 
ఇంక పత్రికలవాళ్లు చెప్పిన కారణాలే చెపుతూ, సమస్యా పరిష్కారాలు సూచిస్తూ, పండగ చేసుకొంటున్నారు. వాళ్ల రాతల ప్రకారం, ప్లాస్టిక్ నిషేధంలో చెన్నై మొదటి స్థానం లో వుందట. రెండో స్థానం బెంగుళూరుదట. అసలు వీళ్లకీ సమాచారం యెవరిస్తారో? 
 
గత సంవత్సరం ఇవేరోజుల్లో నేను చెన్నైలో ఓ వారం పదిరోజులు వున్నాను. అక్కడ మెయిన్ రోడ్లతో సహా పెద్ద హోటళ్ల దగ్గరనుంచీ, పళ్ల దుకాణాల దగ్గరనించీ, బజ్జీ బళ్లవరకూ అందరూ ప్లాస్టిక్ కవర్లలోనే విక్రయిస్తున్నారు! ఈ యేడాదిలోనే నిషేధంలో ప్రథమ స్థానానికి వెళ్లిపోయింది అని నేను అనుకోను. 
 
బెంగుళూరులో కూడా అదే పరిస్థితి. అది రెండో స్థానంలో యెలా వుందో మరి! బెంగుళూరులో మాత్రం, ఆ సంచులు తయారుచేసేవాళ్లమీద మాత్రమే కేసులు పెడుతున్నారు అనీ, వినియోగదారుల మీద పెట్టడం లేదు అనీ అంటున్నాయి పత్రికలు. అదేమయినా కొంత నిజమేమో. 
 
ఇంక మొన్నటి మా మూడో హనీమూన్ లో భాగంగా, ఢిల్లీ, హర్యాణా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, యూపీ, రాజస్థాన్ లలో అనేకచోట్ల పర్యటించాము. అన్నిచోట్లా యధేచ్చగా సంచుల వినియోగం జరుగుతూంది. ప్రసిధ్ధ పర్యాటక స్థాలాల్లో సైతం, పర్యావరణం పేరుతో తలతిక్క విధానాలు అవలంబించడం తప్ప, ప్లాస్టిక్ నిషేధం లేదు. యెక్కడా 'రీసైకిలు కోసం చెత్తబుట్టలు ' అంటూ కనపడలేదు. 
 
బెంగుళూరులో మాత్రం, యెంపికచేసిన కొన్ని యేరియాల్లో, మహానగరపాలికె పారిశుధ్య పనివాళ్లు పోగుపడిన చెత్తని--కాయితాలు వేరుగా, అట్టపెట్టెలు వేరుగా, లోహపు మూతలూ, వస్తువులూ వేరుగా, ప్లాస్టిక్ కవర్లూ, పాలపేకెట్లూ వేరుగా, ప్లాస్టిక్ సీసాలు వేరుగా, గాజు సీసాలు వేరుగా--ఇలా తమ చేతులతో బస్తాల్లో నింపి మోసుకెళ్లడం చూశాను. తరువాత అవి యేమి చేస్తున్నారో. 
 
ఇంక మా నరసాపురం లాంటి చిన్న వూళ్లలో, మునిసిపాలిటీ వుద్యోగులు మాత్రం విశ్వరూపం ప్రదర్శిస్తారు--నిషేధం అమలుకోసం జనాలని ఇరగదీస్తూ. 
 
ఇప్పటికి మాత్రం, కమీషనరుగారి ఇంటి చుట్టుప్రక్కలా, ప్రభుత్వాధికారుల ఇళ్ల చుట్టు, రోజుకి మూడు నాలుగుసార్లు చెత్త యెత్తీ, ఇళ్లనుంచి సేకరించీ, ట్రాక్టరు తొట్లలో నింపి, తిన్నగా డంపింగ్ యార్డులో దిమ్మరించి వస్తున్నారు. ఆ సోకాల్డ్ యార్డులు నిండిపోయి, చెత్త ఓ పర్వతం అంత యెత్తు అయిపోయాక, కొత్త డంపింగ్ యార్డు కోసం భూసేకరణ చేస్తున్నారు. (వీటిల్లో కూడా కుంభకోణాలు మామూలే!). మరి ఆ మాత్రానికి 20 మైక్రానులైతే యేమిటి; వెయ్యి మైక్రానులైతే యేమిటి? సామాన్య జనాలని వేధించడం తప్ప! 
 
ఇంకో గమనార్హమైన విషయం యేమిటంటే, ఇదివరకు "మానుష వ్యర్థాలని" సేకరించే పని చేసే కులం వాళ్లే ఇప్పుడు కూడా పారిశుధ్య కార్మికులుగా పని చేస్తున్నారు. ఇంకా "సెప్టి క్లీన్"లు నిర్వహిస్తున్నవాళ్లు కూడా వాళ్లే! మరి ఆ కులంవాళ్లని యేమి వుధ్ధరించినట్టు? 
 
ఇప్పటికైనా ప్రభుత్వాలు వూరికే మీడియాలో ప్రచారం కోసం కాకుండా, చిత్తశుధ్ధి తో "సరైన చర్యలు" తీసుకొంటే మంచిది. 
 
ప్రజలందరూ సంతోషిస్తారు.   

Sunday, June 26

మా మూడో హనీమూన్ అనే.......-14




మొన్నటి మా యాత్ర



......తినే, తాగే పదార్థాలేవీ అనుమతించబడవు*.



*పురాతన కాలం నుంచీ, మన ఆచారాల ప్రకారం, సూర్యోదయాత్పూర్వమే నిద్రలేచి, అనుష్టానాలన్నీ కానిచ్చుకొని, "ఖాళీ కడుపుతో" (ఇంకా అరగడం మొదలెట్టని, సగం అరిగిన, ఇంకా అరుగుతున్న, పూర్తిగా అరిగిన--పదార్థాలేవీ కడుపులో లేకుండా); యూరినరీ బ్లాడర్ కూడా ఖాళీగా, (అందుకే పుష్కరిణిలో స్నానం చెయ్యమనేవారు. అక్కడ బ్లాడర్ ఖాళీ అయిపోతుంది యెవరికైనా! ఆ నీళ్లు నిరంతరం పుష్కరిణిలోంచి బయటికి వెళ్లిపోయి, కొత్తనీళ్లు పైనుంచి నిండే యేర్పాట్లు వుండేవి. ఇప్పుడా యేర్పాట్లు మృగ్యమై, ఆ "పవిత్ర" పుష్కరిణిల్లోనే మునిగి, చర్మ, ఇతర రోగాలు తెచ్చుకుంటున్నారు!) దైవదర్శనానికి వెళ్లేవారు. సూర్యోదయం అయ్యేటప్పటికి దర్శనం ముగించుకొని బయటికి వచ్చేవారు. ఇప్పుడు మన సినిమాలూ, మీడియా పుణ్యమా అని, భక్తి వెర్రితలలు వేసి, "గుళ్లోకి వెళ్లడం" పుట్టిన రోజు, పెళ్లిరోజుల్లాంటి యేదో ఒక సందర్భమో, లేదా, ఒక దేవుడికి ప్రత్యేకించిన వారం కాబట్టి ఆ దేవుడి గుడికి వెళ్లడమో, ఓ "రిచువల్" గా కొనసాగిస్తూ, పొద్దున ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేచి, టిఫిన్లూ గట్రా లాగించి, గెస్టులనీ, వేడుకలనీ ముగించి, (దాంతోటే ముఖం కడుక్కునేవాళ్లు ఓ పెగ్గు బిగించి), తీరుబడిగా నిక్కీ, నీలిగీ, డ్రైవరు వచ్చాక (వాడు అంతకు ముందే వాడి ఇష్టదైవం గుళ్లోకి వెళ్లి, ముఖాన బొట్టూ, చెవిలో పువ్వూ వగైరాలతో వచ్చేసి వుంటాడు) అప్పుడు బయలుదేరుతారు. అప్పటికే స్వామికి భోగం అయిపోయి, భక్తులకి తీర్థ ప్రసాదాలు ఇచ్చేసినా, దర్శనమూ, మిగిలిన "ప్రసాద వినియోగమూ" జరుగుతూనే వుంటుంది మధ్యాహ్నం 3-00 అయినా! అలాగే ఈ స్వామి నరాయణ్ గుడివద్దా, పాపం దూరం నుంచీ వస్తారుకదా--క్యూ లైన్ల చుట్టూ వున్న అనేక రెస్టారెంట్లూ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లూ, బేకరీలూ, ఇతర షాపులూ పూర్తి రద్దీగా వుండి, గబగబా తినేసి, అప్పుడు క్యూలలో చేరుతున్నారు! (లోపల అనుమతించబడవుకదా? ఓ నాలుగైదు గంటలపాటైనా 'గ్రైండరు ' ఆడకుండా వుండడమే!? అమ్మో!



ఇక, మ్యూజియం లోకి అంటే మొదటగా వున్న ఓ చిన్న గదిలోకి వెళతాము. అర్థ చంద్రాకారంలో బెంచీలు (ఓ 50 మంది కూర్చోడానికి సరిపోతాయి) వేసివున్నాయి. గది చీకటిగా వుంటుంది. అందులో, 10,000 వాట్ పీ ఎం పీ వో స్పీకర్లూ, యెక్కడినుంచో స్పాట్ లైట్ పడే యేర్పాటూ, మధ్యలో ఓ 'పెద్ద ' మనిషి, ఓ 'పెద్ద ' రాతిని చెక్కడానికి ప్రయత్నిస్తూ వున్న శిల్పం, వెనక "బ్రహ్మ ప్రతీ మనిషినీ ఇలా చెక్కుతాడు....." లాంటి యేదేదో వ్యాఖ్యానం, "వాడే స్వామి నారాయణుడు" అంటూ ఓ పది నిమిషాల్లో ముగింపూ, అక్కడ లైట్లు వేసేసి, అందరినీ ఇంకో ప్రక్క గదిలోకి తోలడం!

ఆ రెండో గదిలో, ఓ అరణ్యం, నదీ సెట్టింగూ, సహజత్వం వుట్టిపడే ఆవులూ దూడలూ, ఓ ప్రక్క నీలకంఠ అనేవాడి ఇంటి సెట్టూ, వాళ్ల అమ్మా నాన్నానో, పెంచినవాళ్లో--వాళ్ల బొమ్మలూ, ఇంకో మూల, ఓ ఆశ్రమంలో ఋషులకి ఙ్ఞానోదయం కలిగిస్తున్న నీలకంఠ. వెనుక వ్యాఖ్యానం మామూలే....నీలకంఠ ఆ వూళ్లో ఆ ఇంట్లో పుట్టాడు, ఆ నదిలో ములిగేవాడు, చిన్నవయసులోనే ఋషులకి బోధించి, ఙ్ఞానోదయం చేసేవాడు.....వగైరా! మళ్లీ మూడో గదిలోకి తోలడం.

మూడో గది ఓ కారిడార్ లా వుండి, మళ్లీ అడవి జంతువుల బొమ్మలూ, చెట్లూ, నదీ, అద్దాలలో నీలకంఠ, ఋషులూ, రాజులూ వగైరా బొమ్మలూ, తరవాత గదిలోకి ప్రవేశం. అక్కడ ఓ ప్రక్క సామాన్య జనం బొమ్మలూ, మధ్యలో రామానుజాచార్యులో యెవరో, ఆయన శిష్యులూ, ఈ ప్రక్క రాజుగారి దర్బారూ! అక్కడ, రామానుజులు--ఇప్పటినుంచీ నీపేరు 'స్వామి నారాయణ్' అని ప్రకటించడం, జనం 'సాధు, సాధు ' అనడం, రాజుగారు లేచొచ్చి, "స్వామి నారాయణునికి స్వాగతం" అనడం, వగైరా. తరువాత ఇంకో గది.

(అప్పటివరకూ, యే గదిలో యేమి వుంటుందో, యెక్కడ కూచోవాలో, యెక్కడ నుంచుంటే చక్కగా అన్నీ కనిపిస్తాయో, బయటికి యెప్పుడువెళ్లాలో--ఇలాంటి కన్ ఫ్యూజన్ లో వుంటారు జనం. అక్కడికి వచ్చేసరికి వాళ్ల "బ్రెయిన్ ట్యూనింగ్" దాదాపు పూర్తి అయి, సుశిక్షిత సైనికుల్లా ముఖాన ఆశ్చర్యానందాలతో సాగిపోతూ వుంటారు!)

ఆ గదిలో ఓ చెరువూ, అందులో చేపలు పట్టేవాళ్లూ, ఓ పర్వతం, దాని దగ్గర నీలకంఠా, "చేపలని పట్టుకోవద్దు. వాటిని చంపి తినొద్దు" అంటూ నీలకంఠ వాటిని నదిలో పారెయ్యడం, పల్లెవాళ్లు ఆగ్రహించడం, అంతలో పెద్ద తుఫాను రావడం, నీలకంఠ నీళ్లలో దూకి, పైకి వచ్చేసరికి ఆ పల్లెవాళ్లు ధనవంతులయిపోవడం! ఇలా యేదో. (ఆ బొమ్మల కదలికలూ, మాటలూ, తుఫాను వగైరాలు చిన్న పిల్లలకి అద్భుతంగా వుంటాయి. వొప్పుకోవచ్చు.)

అలా ఓ పది గదులో యెన్నో వున్నాయి. (అక్కడ తెగుతున్న టిక్కెట్లని బట్టి, తరవాత గదుల్లో టైములు అడ్జస్ట్ చెయ్యబడతాయి). అవన్నీ పూర్తయితే, మళ్లీ ఓ మినీ థియేటరు లోకి ప్రవేశం. అందులో ఓ యేడెనిమిది వందలమంది పడతారు. 70' X 70' అనుకుంటా--పెద్ద స్క్రీను. ఫుల్ స్టీరియో డొల్బీ సౌండ్ సిస్టం వగైరాలతో. ఆ థియేటరు నిండేవరకూ, గ్యాప్. టాయిలెట్లకి వెళ్లేవాళ్లూ, అక్కడ దొరికే ఐస్క్రీములూ, చాక్లెట్లూ లాంటివి కొనుక్కొని తినేవాళ్లూ, పిల్లలని రిలాక్స్ చేసేవాళ్లూ....థియేటరులో కూర్చొని సేదదీరేవాళ్లూ...ఇలాగ. నేను నా సెల్ఫ్ హిప్నోసిస్ లోకి వెళ్లి, ఓ ఇరవై నిమిషాలు రిలాక్స్ అయ్యాను. అప్పుడు సినిమా మొదలు. ఆ సినిమా యెవరు తీశారో, తీయించారోగానీ, థియేటర్లలో రిలీజు చేస్తే, రెండో ఆటకి జనం వుండరు! చిత్రం మాత్రం అద్భుతంగా వుంది!



.......తరువాయి మరోసారి.

Saturday, June 25

మా మూడో హనీమూన్ అనే.......-13




మొన్నటి మా యాత్ర



అలా వుదయం 6-00 కల్లా బయలుదేరి, టోలుగేట్లకి కట్నాలు సమర్పించుకుంటూ, దారిలో యేమీ తినకుండా, మంచినీళ్లు మాత్రమే త్రాగుతూ, 9-30 కల్లా అక్షరధామ్ అనే స్వామి నారాయణ్ టెంపుల్ కి చేరాం. దారి వెతుక్కుంటూ ఎంట్రెన్స్ గేటు దగ్గరకి వెళ్లేటప్పటికి, అక్కడే మమ్మలనందరినీ దిగిపొమ్మన్నారు. కారుని మాత్రం, మెటల్ డిటెక్టర్లతో తణిఖీ చేసి, పార్కింగులో పెట్టుకోమన్నారు. కారు లోపలికి వెళ్లిపోయింది. మేము నడుచుకుంటూ లోపలికి వెళ్లేటప్పటికి, అప్పటికే క్యూలలో అనేకమంది జనం! ఆ క్యూలెందుకనుకున్నారు? మన బ్యాగులూ, సెల్ ఫోనులూ, కెమేరాలూ వగైరా 'డిపాజిట్' చేసి, రసీదు పొందడానికి! ఇంకా స్పీకర్లలో భయంకరమైన "సూచనలు"! (పర్యావరణం పేరుతో కొన్ని, పవిత్రత అనే వేలం వెర్రితో కొన్ని!)--వినేవాళ్లలో కన్ ఫ్యూజన్!

"......స్వాగతం!.....క్యూలలో జేరండి.....మంచినీళ్ల బాటిళ్లు తప్ప, తినే, తాగే పదార్థాలేవీ అనుమతించబడవు*. ఇంకా సెల్ ఫోనులూ, కెమేరాలూ, ఇతర ఎలెక్ట్రానిక్ వస్తువులూ అనుమతించబడవు. తోలు బెల్టులు.......బడవు!......" ఇలా. మా ఢిల్లీ చెల్లెలు ఇదివిరకు అనేకసార్లు వచ్చిన అనుభవంతో, మా సెల్ ఫోన్లూ వగైరాలన్నీ తన హేండ్ బ్యాగ్ లో పెట్టేసి, కవుంటర్లో డిపాజిట్ చేసి రసీదు తీసుకోడానికి వెళ్లింది. తన వెనకే మా బావగారు. మేము కొంచెం నీడన నిలుచుంటే, సెక్యూరిటీవాళ్లు వచ్చి "పొండి, పొండి....ఇక్కడ నిలబడొద్దు....వచ్చేవాళ్లకి అడ్డం!" అంటూ తోసెయ్యడం. తీరా అక్కడ అంత ట్రాఫిక్ వుందా? అదంతే! ఈలోపల మా డ్రైవరు వచ్చి, కారు పార్క్ చేసి వచ్చాను, నన్నేమి చెయ్యమంటారు? అనడం, నువ్వు వస్తే టెంపుల్ లోకి రా, టిక్కెట్లు తీసుకుంటాము, లేకపోతే పార్కింగులోనే వుండు....సాయంత్రం వస్తాం అన్నాము. వాడు నేనూ ఇదివరకు చూడలేదు. వచ్చేస్తాను. అన్నాడు. సరే. గంట గడిచి 11-00 అవుతూంది.....చెల్లీ, బావగారూ వూడి పడరేం? అనుకుంటూండగానే, మరో సందేహజీవి, "సార్! నా 'ఈసైజు ' బెల్టు పెట్టుకోవచ్చా? లేక డిపాజిట్ చెయ్యాలా?" అనడగడం, "నాకు తెలీదు నాన్నా! స్పీకర్లో వచ్చేది విను అంతే!" అని నేను చెప్పడం. మొత్తానికి, మావాళ్లందరూ క్యూలో నిలబడేటప్పటికి 11-30! నేను జర్కిన్ వేసుకొన్నాను. అందులో ప్రతీ పాకెట్ లో ఒక్కో సిగరెట్టు పెట్టా, వేరే చోట్ల అగ్గిపెట్టెలూ, ఇంకొన్ని పాకెట్లలో సిగర్ లైట్లూ వగైరా పెట్టుకొని తయారయిపోయాను. (నాకు స్వతంత్ర భారత పౌరుడిగా, ఇలాంటి నియంత్రణలంటే చిరాకు. స్వతహాగా నాకు నేను నియంత్రించుకోవాలిగానీ, యెవడు చెప్పినా, చివరికి ఆ బ్రహ్మదేవుడు చెప్పినా, నేను వొప్పుకోను!). మా ఆవిడ పాపం ఓ పాతిక గ్రాముల త్రివేణీ వక్కపొడి పొట్లం తన జేకెట్లో దాచుకొంది. (కొంగున ఓ పాతిక గ్రాములు ముడి వేసుకొని, బొడ్లో దోపుకొంటుంది యెప్పుడూ!). ఇంక లోపలికి వెళుతూంటే, ఆడవాళ్లకి వేరే క్యూ (సెక్యూర్టీ చెకప్), మగవాళ్లకి వేరే క్యూ (చెకప్)! నేను ఆ క్యూలో వెళ్లేటప్పుడు, ఓ చిన్న కంచంలాంటి ప్లాస్టిక్ చిప్ప ఇచ్చి, మీ బెల్టూ, తోలు పర్సూ వగైరా అందులో పెట్టండి అని చెప్పి, దాన్ని ఓ జారుడు బల్లమీద పడేశాడు ఒకడు. నేను కొంచెం క్రిందికి దిగగానే, నా వొళ్లంతా తడుముతూ, "మీరు చెప్పెయ్యండి.....నాపని సుళువు అవుతుంది....యేమి తెచ్చారు?" అంటూ వొళ్లంతా తడిమి, నా జర్కిన్ పైజేబులో వున్న సిగరెట్టుపెట్టా, అగ్గిపెట్టా తీసుకొని, "ఇవీ నేను అడిగినది.....మళ్లీ తిరిగి వచ్చినప్పుడు తీసుకొంటారా? ఇప్పుడే పారెయ్యమంటారా? తిరిగి తీసుకెళ్లాలంటే, మళ్లీ క్యూ మొదటినుంచీ రావాలి!" అని హెచ్చరించాడు. నాకంత వోపిక లేదురాబాబూ, పారెయ్యి అని అవి వొదిలేసి, నా బెల్టూ, పర్సూ తీసుకొని, (అక్కడ ఓ ఇద్దరు ముగ్గురు యువకులు 'ఇదేమి చెక్కింగో' అనుకుంటూంటే, 'యెవడో ఒక తింగరాడు ఛస్తాడు....మనల్ని ఇలా బలి చేస్తారు! అని హిందీలో జోక్ చేశాను) లోపలికి వెళ్లిపోయాను. మా ఆవిడ జాకెట్లో పెట్టుకొన్న 25 గ్రాముల త్రివేణీ వక్కపొడి కూడా పారేశారట. మా కాకినాడ బావగారు, నిరంతరం ఆకూ, వక్కా, సున్నం, ఇంకేవో నములుతూ వుంటారు. ఆ క్యూ వాళ్లు అవన్నీ తీసుకురాకూడదు అంటే......"వీడో పెద్ద దేవుడూ......వీడికింత సీనూ......నేను రానే రాను" అని వెనక్కి వెళ్లిపోయారుట. ఇక మా కాకినాడ చెల్లెలు....పాపం ఆయన యేమి చేస్తున్నారో! మనం తిరిగి వచ్చేటప్పటికి సాయంత్రం అయిపోతుంది.....యెలా గడుపుతారో! అని వొకటే దిగులు. సరే....అందరిలాగే లోపలకి వెళ్లి, అక్కడ వున్న టేప్ లలో మంచినీళ్లు త్రాగి, బాటిళ్లలో పట్టుకొని, దూరంగా కనిపిస్తున్న ఆ గుడినీ, దగ్గరలో వున్న కళాఖండాలనీ చూస్తూ, ఓ క్యూ దగ్గరకి చేరాం. మా ఢిల్లీ బావగారు వెంటనే క్యూలో చేరిపోయారు. మా ఢిల్లీ చెల్లెలు చెప్పింది--అది మ్యూజియం చూడడానికి టిక్కెట్లు అమ్మే క్యూ అని. టిక్కెట్టు ఒక్కొక్కరికీ రూ.170/- అట! మా అందరికీ దాదాపు 1500/-! యెవరు తిన్నట్టు? నేను వద్దని గొడవపెట్టాను. కానీ వాళ్లు "అసలు చూడవలసింది ఈ మ్యూజియమే! చూడని వాళ్ల జీవితాలు వేస్ట్!" అని బలవంతం చేశారు. నలుగురితోపాటు నారాయణా.....స్వామి నారాయణా అనుకుంటూ వాళ్లని అనుసరించాను.



తరువాయి....."కల్ట్ బిల్డింగ్" గురించి మరోసారి.

Tuesday, June 7

మా మూడో హనీమూన్ అనే.......-12



మొన్నటి మా యాత్ర

*మనం అన్నంతినే కంచం అంత సైజులో "పిడకలు"--

నిజంగా అంతంత సైజు పిడకలు వేస్తారు. అంతేకాదు.....వాటిని ఒకదానిమీదొకటి వరుసలుగా పేర్చి, రక రకాల ఇళ్ల (ఎస్కిమోల ఇగ్లూలు, డాబాలు, కుతుబ్షాహీ సమాధులూ వగైరా) అకారాల్లో నిలబెట్టి, అవి పూర్తవగానే వాటి మీద మట్టి మెత్తేసి, వర్షాలొచ్చినా పాడవకుండా కాపాడతారు. దానికి అదేదో "ఆర్ట్" అనే పేరుంది. పెళ్లి సంబంధాలు మాట్లాడేటప్పుడు ఆడపిల్లకి ఆ ఆర్ట్ లో యెంత ప్రవేశం వుందో పరీక్షిస్తారట!


& పాలు--ఫ్రిజ్ లో పెట్టడానికి కరెంటు యెప్పుడు వుంటుందో, యెప్పుడు వుండదో తెలీదు. కేన్లకొద్దీ పాలు మాత్రం వచ్చేస్తాయి రెండుపూటలా! దాంతో మా పెసరట్ల పేరమ్మ, ప్రొద్దున లేచినప్పటినుంచీ, అర్థరాత్రివరకూ, "పాలు మిగిలిపోతున్నాయి.....కాఫీ పెట్టనా, టీ పెట్టనా? పోనీ చిక్కగా 'బూస్ట్' కలిపివ్వనా?" అంటూంటే, దానిబాధ చూడలేక, ఆరారగ కాఫీ టీలు త్రాగినా, ఒక్కోసారి, 'సరే బూస్ట్ ఇచ్చెయ్యి ' అనేవాణ్ని. 

మా ఆవిడ, "చూశారా! ఇంట్లో యే రెండు మూడుసార్లో, అదీ రెండు చుక్కలచొప్పునే కాఫీ తాగే ఈయన, గ్లాసుడు చిక్కని బూస్ట్ తాగుతారట!" అంటూ ఆశ్చర్యపోయేది!
  

@"అక్షరధామ్"--దీందో పెద్దకథ. మొదట్లో, "అక్షరానికి" ప్రతీకగా, యే దేవుడూ దేవతా లేకుండా, శూన్య మందిరం నిర్మిస్తాము అని దానికి అక్షరధామ్ అని పేరుపెట్టి, నిర్మాణం కొనసాగించారు. యెటొచ్చీ, దానికి "భారతదేశ హిందూ సంస్కృతికి యేకైక ప్రతీక"గా బిల్డప్ ఇవ్వడంతో, అది నిర్మాణంలో వుండగానే, పాకిస్థాన్ వుగ్రవాదులు దానిమీద దాడి చేశారు! రక్తపాతం సృష్టించారు! నిజానికి అంత సీను లేదక్కడ. కానీ, తరవాతేమయిందో, ఆ నిర్మాణాన్నీ, స్థలాన్నీ, "స్వామినారాయణ్ ట్రస్ట్" అధీనంలోకి తీసుకొని, పెద్ద "గుడి" కట్టేశారు. అందులో బంగారు "స్వామినారాయణ్" విగ్రహాన్ని ప్రతిష్టించేశారు! (ఇక, దాని ప్రమోషన్ కోసం, 'కల్ట్ బిల్డింగ్ ' (నీలకంఠ అనేవాడు స్వామినారయణ్ గా యెలా మారాడు మొదలైనవాటి) కోసం వాళ్లు పడుతున్న పాట్లగురించి మరో టపా!) 

"లోటస్ టెంపుల్"--ఓ నలభై యేళ్లక్రితం, అదేదో మతానికి చెందిన "బహాయీ" తెగవారు కట్టించారు ఈ గుడిని. అందులో దేవుడు వుండడు...అక్కడి నిశ్శబ్దమే దేవుడు. విచ్చుకున్న కమలం (లోటస్) ఆకారంలో కట్టిన ఆ గుడిలో, ధ్యానం చేసుకుంటారు. అప్పట్లో, ఈ 'ఓం శాంతి '; 'పిరమిడ్ ధ్యానం '; 'శ్వాసపై ధ్యాస ' లాంటి వాటి ప్రసక్తి లేదు. అందుకని అది అప్పట్లో చాలా ప్రసిధ్ధి చెందింది. ఇప్పుడు దానికి అంత సీను లేదు. ఆ చుట్టుప్రక్కల చాలామందికి కూడా దాని సంగతి తెలీదు! మన ఇండియా టూరిజం వాళ్ల వివరణల్లో మాత్రం, ఢిల్లీ అంటే, మొట్టమొదట లోటస్ టెంపుల్ అని కనిపిస్తూంటుంది! (ఆ టెంపుల్ దర్శించడానికి మేము చేసిన ప్రయత్నాలు మరోసారి!)
  
..........ఇంకా తరువాయి.

Monday, June 6

మా మూడో హనీమూన్ అనే.......-11

మొన్నటి మా యాత్ర

నాకు నిద్ర పెద్ద ముఖ్యం కాదు. కేవలం విశ్రాంతి/రిలాక్సేషన్ ముఖ్యం. అవసరమైతే, యెంతటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా, "సెల్ఫ్ హిప్నొటైజ్" చేసుకొని, (ఆ విద్యకోసం ఓ 20 యేళ్లక్రితం రూ.1500/- పెట్టుబడి పెట్టాను--అది ఇప్పటికీ అక్కరకొస్తూంది!) ఓ గంట గడిచాక, "ఫ్రెష్"గా లేవగలను.

4-30 లోపలే, "యేమండీ! నెమళ్లు వచ్చాయి చూస్తారా? ఫోటోలూ, విడియో తీస్తారా?" అంటూ మా ఆవిడ పిలుపు. 

మన గోదావరి జిల్లాల్లో ఇళ్ల ముందు "కోళ్లు" యెలా మేస్తూ తిరుగుతూంటాయో, అక్కడ అలా ప్రతీరోజూ వుదయం, సాయంత్రం "నెమళ్లు" అలా మేస్తూ తిరుగుతూ వుంటాయి. (వాళ్లు ప్రతీ ఇంటి ముందూ, *మనం అన్నంతినే కంచం అంత సైజులో "పిడకలు" వేసి యెండబెడుతూంటారు! వాటిలో పురుగులని యేరుకు తింటూ వుంటాయవి!)

తప్పుతుందా? బ్యాటరీలూ అవీతో కెమేరా రేడీ చేసుకొని వెళ్లేసరికి, మాగన్నుగా మాత్రమే వెలుగుంది. అయినా, తీసేశాను.....వాటి వెనకాలే వెళుతూ, పిడకలని తప్పించుకొంటూ! (అవన్నీ చూపించి మిమ్మల్ని బోరుకొట్టన్లెండి!)

తరవాత, వీళ్ల ఇవతల గోడా, అవతల గోడా ప్రక్కల వున్న మా బావగారి అన్నా, తమ్ముడూ లని "హాయ్!" అంటూ కొసరు పలకరింపులూ. (అసలు పలకరింపులు వేరే వుంటాయి లెండి. వ్రాస్తానుగా!)

"ఇంకివాళ యెక్కడికీ వెళ్లలేము. రేప్పొద్దున్నే అందరూ బయలుదేరి ఢిల్లీ వెళ్లిపోదాము" అని ఆడాళ్ల డిక్లరేషనూ, మళ్లీ రాత్రికి "భోజన" యేర్పాట్లూ!

"సింపుల్ గా" అంటూ బంగాళదుంపల వేపుడూ, కొత్తిమీర చారూ! మళ్లీ మా బావగారు వాళ్ల స్కూలు హాస్టలునించి, ఓ 50 రొట్టెలూ, 2 రకాల సబ్జీలూ! ఇంకా, చారులోకి అప్పడాలూ, వడియాలూ, పచ్చళ్లూ, వూరగాయలూ....పెరుగూ! (మేమక్కడ వున్నన్నాళ్లూ, కేన్లతో పాలు మాత్రం వచ్చేసేవి. పాడి పంటలకి లోటులేదుగా వాళ్లకి! ప్రతీరోజూ, & పాలు మిగిలిపోతున్నాయి, యేం చేద్దాం? అనే ప్రశ్నే!)

వంటలూ అవీ పూర్తయ్యే లోపల, అరారగా టీలూ, కాఫీలూ త్రాగుతూ, రేపటి కార్యక్రమం గురించి ప్లాన్లూ. బావగారుకూడా, ఓ డ్రైవర్ని తీసుకొని, 9-30 కల్లా వచ్చేశారు. "రేపు మీకూ సెలవే కాబట్టి, మీరుకూడా మాతో రావలసిందే" అని అందరూ పట్టు. ఆయన సరేనని, "ప్రొద్దున్నే 5-00 కల్లా బయలుదేరి, @"అక్షరధామ్" చూసి, మధ్యాహ్నం "లోటస్ టెంపుల్" చూసి, ఇంకా వీలైతే కొన్ని సైట్లు చూసి, రాత్రికి తిరిగి వచ్చేద్దాం" అని ఆయన ప్రపోజల్. బాగుంది అంటే బాగుంది అన్నాం అందరూ. డ్రైవరుకి తగిన సూచనలు ఇచ్చేసి, 4-30 కల్లా బండి పెట్టెయ్యమని చెప్పి, పంపించేశారు. 

(ఆయన స్వంతానికి కొనుక్కొన్న "మహీంద్రా మ్యాక్స్"--యెంతమందినైనా, యెంత లగేజినైనా భరించేస్తుంది--సువిశాలంగా వుంటూ. మేము వచ్చేరోజే దాన్ని గ్యారేజ్ కి పంపించారు--ఇంజన్ వగైరాలు చెక్ చెయ్యమని. అది మర్నాడుగానీ రాదు. వాళ్ల స్కూలుకోసం ఓ ఐదారు బొలేరోలూ, క్వాలిస్ లూ కాంట్రాక్టు క్రింద వున్నాయి. పదో, పదిహేనో బస్సులు కూడా వున్నాయి--ఒకటి రెండు స్వంతమూ, మిగిలినవి కాంట్రాక్టూ. ఓ పాతికమంది డ్రైవర్లు వుంటారు వాటికన్నిటికీ! వాళ్లనీ, బళ్లనీ మేనేజ్ చెయ్యడమే కీలకం!

వాళ్లు నిజంగా కోటీశ్వరులే!--యెలాగో తరవాత వ్రాస్తాను. అలా అని, మన కోటీశ్వరుల్లాగ "గాలి"లో తిరుగుతూ, కళ్లు నెత్తిమీద వుండి, కాళ్లు నేలకి ఆనకుండా వుండేవాళ్లు కాదు--దే ఆర్ జస్ట్ లివింగ్ హేండ్ టు మౌత్!)

అప్పుడింక మా పెసరట్ల పేరమ్మ వడ్డింపులూ, మా భోజనాలూ, తరవాత "రేపటికి" వంటలూ, సర్దుళ్లూ, జోకులూ, వ్యంగ్యాలూ, యెత్తిపొడుపులూ, సమర్థింపులూ, వికవికలూ, పకపకలూ, పూర్తయ్యేసరికి 2-30. అప్పుడైనా నిద్దరపోతారా? లేదే! యెక్కడలేని సంగతులూ అప్పుడే గుర్తుకొస్తాయి......చెప్పేసుకోవాలి! అందరూ మణిగేటప్పటికి 4-00!

4-30 కల్లా వచ్చేశాడు డ్రైవరు--బొలేరోతో సహా! అప్పుడు గబగబా స్నానాలూ, మేకప్పులూ, చీరల సెలెక్షన్లూ, సామాన్ల లోడింగులూ, మజ్జిగ/మంచినీళ్ల బాటిళ్లూ, హేండ్ బ్యాగ్లూ....బావగారి టాబ్లెట్లూ, (ఒకళ్లిద్దరి "నువ్వూ రాకూడదా?...వూహ్ఁ. నేనురాను" లూ), అన్నీ పూర్తయి, బండి బయలుదేరేటప్పటికి దగ్గర దగ్గర 6-00!

..........ఇంకా తరువాయి.

Friday, May 20

మా మూడో హనీమూన్ అనే.......-10



మొన్నటి మా యాత్ర

# పటౌడీ--ఇదొక పట్టణం. ఓ కోట, అందులో మహమ్మదీయ నవాబులతో పరిపాలించబడేది. బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని పరిపాలిస్తున్నరోజుల్లోనే, ఈ కోట ఓ వెలుగు వెలిగింది. ఆ రోజుల్లో పటౌడీ నవాబు "అఖ్తర్ ఆలీ ఖాన్" (సీనియర్ పటౌడీ అంటారు) మన దేశ క్రికెట్ జట్టుకి సారధి. (మన తెలుగువాడు సీ కే నాయుడు కూడా అప్పట్లో మన జట్టుకి సారధి!)పటౌడీ జూనియర్ "మన్సూర్ ఆలీ ఖాన్" కూడా మన క్రికెట్టు జట్టుకి సారధి గా వ్యవహరించాడు. ఆయనే బాలీవుడ్ హీరోయిన్ షర్మిలా టాగోర్ (ఆవిడ హిందూ--బెంగాలీ) ని వివాహం చేసుకొన్నాడు. నేటి హీరో "సైఫ్ ఆలీ ఖాన్" (వీడు పటౌడీ అని పెట్టుకోలేదెందుకో!) వాళ్ల కొడుకు. 

ఇప్పుడు వాళ్ల పేలస్ ని ఫైవ్ స్టార్ హోటల్ గా మార్చేశారు. అప్పుడప్పుడూ వాళ్లు వచ్చి, అక్కడ బస చేసి వెళుతూంటారట. మేము ఆ కోటని బయటినించే చూశాము. పేలస్ ని చూడ్డానికి ప్రయత్నించాము.

(ఆ విషయాలు ఇంకోసారి.)

ఢిల్లీలోనే సఫ్దర్జంగ్ హాస్పిటల్ దగ్గరలోనే ఓ "ఉడిపీ" హోటెల్ వుంది అనీ, కరోల్బాగ్ ఆర్యనివాస్ తరవాత అంత ఫేమస్ అనీ, అక్కడ టిఫిన్లు చేసి వెళదామనీ మా చెల్లెలు ప్రపోజల్. తీరా డ్రైవరుకి ఆ హోటెల్ రూట్ తెలియదట. తన సెల్ లో తనకి తెలిసున్నవాళ్లందరినీ అడిగేసి, చాలా ఖష్ట పడుతున్నాడు.

నేను, "మాకు ఆకళ్లు లేవు, వద్దులే, ముందు మీ యింటికి చేరే మార్గం చూడు" అనేశాను. 

వాళ్ల వూళ్లో రోజు విడిచి రోజే కరెంటు వుంటుంది. అదీ పగలు వుండదు. అందుకని వాళ్లు ఎల్ పీ జీ తో పనిచేసే గీజరు పెట్టుకొన్నారు. దాంతో వాళ్ల అమ్మాయి వేడి చేసి వుంచిన నీళ్లతో మా స్నానాలకి యేర్పాట్లు చేసేశారు. ఇల్లంతా నీట్ గా సర్ది వుంది. పాపం మా చెల్లెలు పిల్లలూ, వాళ్ల నాన్నా యెంత కష్టపడ్డారో! వాళ్లకి మేము తెచ్చిన కానుకలు అందించేశాము--యెంత సంతోష పడ్డారో--ఆ చిరు కానుకలకే!

అప్పటికి 11-30 అయ్యింది. వాళ్లు నడిపిస్తున్న స్కూల్ హాస్టల్ నించి మాకు టిఫిన్లు తెచ్చేశారు మా బావగారు. పూరీ, కాలీఫ్లవర్/బఠాణీ సబ్జీ. లాగించేశాము.

అక్కడనించీ, "అక్కా! యేమి వండమంటావు?"

"చెల్లీ! సింపుల్గా పప్పు చేసి, చారు పెట్టెయ్యి. వూరగాయలు తెచ్చాము--టమాటా, గోంగూరా, కందిపొడీ, చల్ల మిరపకాయలూ, వడియాలూ......"

"మరి పప్పులోకి యేం వెయ్యమంటావు? టమాటానా, దోసకాయా.....ఇంకా మామిడికాయలు రావడంలేదు మాకు....!"

"అవేమీ వద్దు. ముద్దపప్పు చేసేయ్యి. నేను చల్ల మిరపకాయలూ, వడియాలూ వేయించేస్తాను. వదిన చారు పెట్టేస్తుంది."

"అయ్యో! మీరందరూ అవన్నీ చేసేస్తుంటే, చారు పెట్టలేనా! నేను పెట్టేస్తానమ్మా!" అని మా ఆవిడ.

వంటలు పూర్తయ్యేసరికి 2-00! ఈ లోపల మా బావగారు వాళ్ల స్కూలు హాస్టలు నించి, భోజనం లోకి ఓ యాభై "రోటీ"లూ, క్యాప్సికం/టమాటా కూరా, క్యాబేజీ/ఆలూ కూరా పట్టించుకొచ్చేశారు!

నేనూ, మా కాకినాడ బావగారూ--"అయ్యబాబోయ్!" అనేశాము!

మా కాకినాడ చెల్లెలుకి నేను పెట్టిన పేరు "పెసరట్ల పేరమ్మ". ఆట్లు వేసేసి అందరికీ తినిపించేస్తుంది. తను ఆఖరున యేమైనా మిగిలితే తింటుంది. అలాగే, అందరినీ మాటల్లో పెడుతూ, పనిలోపనిగా అన్నమూ, కూరలూ, పచ్చళ్లూ వగైరా వడ్డించేస్తూ, పీకల్దాకా మింగబెట్టేస్తుంది......మొదటిరోజు అలాగే బలయ్యిపోయాము మా ఇద్దరు బావగార్లతోసహా!

భోజనాలయ్యేటప్పటికి మూడున్నర! నాకు బయట హాల్లో పడకకి ఇచ్చిన మంచం మీద  కొంచెం యెండ పడుతూంటే, నా కాళ్ల సాక్స్ తీసేసి, ఆ యెండలో నా కాళ్లు పెట్టుకొని కాసేపు పడుక్కున్నాను.     

..........ఇంకా తరువాయి.

Wednesday, May 18

మా మూడో హనీమూన్ అనే.......-9



మొన్నటి మా యాత్ర

ఢిల్లీ లో పడ్డాం అని చెప్పనుకదా. అక్కడనుంచీ వెయిటింగ్. రెండుగంటలు దాటిపోయింది. మళ్లీ ఫోను చేస్తే, మా చెల్లెలు "ఇక్కడ హైవేలో పొగమంచు వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అరగంటనుంచీ వెయిట్ చేస్తున్నాం. కాసేపట్లో క్లియర్ అయ్యేలా వుంది. ఇంకో గంటలో వచ్చేస్తాను" అని చెప్పింది.

ఇక్కడ చలిలో మా పాట్లు మేము పడుతూ, (మగాళ్లం అరగంటకోసారి కాఫీలు తాగుతూ...ఆడవాళ్లు నడవలేక, కాఫీలు తాగలేక అపసోపాలు పడుతూ) నిరీక్షించాము. 

గంటా గడిచింది. మళ్లీ ఫోను. "ఇంకో అరగంటదాకా క్లియర్ అయ్యేలా లేదు. మీరోపని చెయ్యండి. ఓ టాక్సీ మాట్లాడుకొని మాకు యెదురు వచ్చెయ్యండి!" అని. 

సరే! నేనెలాగూ క్రింద ఎంట్రన్స్ గేటు దగ్గరకీ, వెయిటింగురూముకీ మధ్య తిరుగుతూ, అప్పటికే ఓ అర పెట్టి సిగరెట్లు తగలేశాను. (వెయిటింగు రూములో నిషేధం మరి!) క్రిందకి వెళ్లి టాక్సీ ల కోసం చూస్తూ, అప్పుడే వచ్చి యెవరినో దింపిన ఓ టాక్సీ వాణ్ని (అప్పటికే టాక్సీ స్టాండులో వున్న వాళ్లని అడిగితే, చాలా యెక్కువ డబ్బులు అడుగుతారు) కుదరగడుతూండగా, మళ్లీ ఫోను.

"మా డ్రైవరు చాకచక్యంగా వేరే దారిలో వచ్చేస్తున్నాడు. ఇంక టాక్సీ వద్దు" అని.

యెట్టకేలకి 7-45 కి మా చెల్లెలు, వాళ్ల బావగారి అబ్బాయి, డ్రైవరులతో వచ్చి, అందర్నీ వాటేసుకొని, వాళ్లు మాకు పాదాభివందనాలు చేసేసి, భయంకర అనుభవాలు చెపుతూ, ఆలస్యానికి సారీలు చెపుతూ, "మీకేమీ అసౌకర్యం కలగలేదు కదా?" అని నొచ్చుకొంటూ, సామాను వాళ్ల "బొలేరో" లో వేసి, యెక్కాము అందరూ.

పొగమంచు ఇంకా యెక్కువగా వున్నా, ప్రయాణం బాగానే సాగుతూంది హైవేలో--ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వరకూ. ఇంక "గురుగామ్" దగ్గరకొచ్చేసరికి, జామ్ ఇంకా క్లియర్ కాలేదు. అడ్డం పడినవి అన్నీ "రెడీమేడ్ కాంక్రీటు" వ్యాన్లే--ప్రముఖ కంపెనీలవి! 

మళ్లీ గురుగామ్ వూళ్లోంచి, అడ్డదారుల్లో వెళుతూ, మళ్లీ ఢిల్లీ ఎంట్రన్సు చేరి, ఇంకో కచ్చా రోడ్డు ద్వారా, మారుతీ ఫేక్టరీ, హీరో హోండా ఫేక్టరీ, అనేక రైల్వే స్టేషన్లూ, యార్డులూ దాటుతూ, # "పటౌడీ" చేరేసరికి 9-00 అయిపోయింది. అక్కడనుంచీ, రోడ్డు బాగుంది. వాళ్ల వూరు ఇంక 51 కిలోలే. (ఇంతాచేసి, ఢిల్లీ నుంచి హర్యాణాలో వున్న వాళ్ల వూరు "షేర్ పూర్" కేవలం 150 కిలోలు మాత్రమే!)

9-30 కల్లా వాళ్ల వూరు, వాళ్లింటికి చేరాం.

బొలేరో దిగి, ఇంట్లోకి వెళుతూ, అలవాటు చొప్పున బయట చెప్పులు వదిలేసి, ఇంట్లో అడుగుపెట్టానా.....అరికాళ్ల దగ్గరనించి తొడలదాకా "ఫ్రీజ్" అవడం మొదలెట్టాయి. నా వెనక్కాలే మా ఆవిడ నన్ను ఫాలో అయిపోతుంటే, ఖంగారుగా మా చెల్లి "వొదినా! చెప్పులు వదలొద్దు! అన్నయ్యా! వేసేసుకో! అప్పుడు లోపలికి రండి!" అనగానే, మళ్లీ చెప్పులు వేసేసుకొని, ఇంట్లో ప్రవేశించాం.  

..........ఇంకా తరువాయి.

Friday, May 13

ప్లాస్టిక్ వినియోగం-2



సంచులపై నిషేధం

ప్రపంచ వ్యాప్తంగా, "ఫాసిల్ ఫ్యూయెల్స్" (మరో మాటలో చెప్పాలంటే--పెట్రో వుత్పత్తులు) అత్యధికంగా "తగలేసే" దేశం అమెరికా.

ఇప్పటికీ, వాళ్ల దేశాధ్యక్షుడు కూడా, తన విశ్రాంతి సమయంలో "చెట్లు నరుకుతాడు" తన యింట్లో "ఫైర్" కోసం! అది వాడికి "పేస్ టైమ్"!

మన దేశంలో, ఓ నలభై యేళ్ల క్రితమే, "ఓజోన్ పొరకి" చిల్లు పేరుతో, అమాయక గిరిజనులు అడివిలో యెండుపుల్లలు యేరుకొస్తూంటే, కేసులు పెట్టేవారు! "పొగలేని పొయ్యిలని" కనిపెట్టి, ప్రచారం చేసి, సబ్సిడీతో వాటిని ఇచ్చీ, ఇలా చాలా వేషాలు వెయ్యడం మొదలెట్టారు.

(మీకు అనుమానమైతే, అప్పటి "సన్‌డే"; "ది వీక్"; "ఇండియా టుడే"; "ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ" లని వెదికి చూడండి--నెట్ లో దొరక్కపోవు)

ఈ రోజున, అమెరికాలో ప్రతీ "5 సెకన్లకీ" సుమారు "60 వేల" ప్లాస్టిక్ సంచులని వినియోగిస్తున్నారట! అంటే సెకనుకి 12 వేలు! అంటే రోజుకి, నెలకి, సంవత్సరానికి--యెన్నిమిలియన్లు?

మరి మనకెందుకండీ--ప్లాస్టిక్ సంచుల నిషేధం?.....గొంతులూ, గుడ్డలూ చించుకోడానికీ, వుద్యోగులు దండుకోడానికీ కాకపోతే?

పర్యావరణం వెర్రితో వింతపోకడలు పోతున్నాము మనం.....టూరిష్టు స్థలాలతో సహా!

ఆలోచించండి!  

Thursday, May 5

ఈనాడు/న్యూస్ టైమ్



రామోజీరావు

వార్తా పత్రికలు చదవడం నేర్చుకున్నప్పటి నుంచీ, "ఆంధ్ర పత్రిక" చదివేవాడిని. ఆ పత్రిక ఆగిపోయాక, "ఆంధ్ర ప్రభ". 

ఈనాడు పత్రిక మొదటి సంచిక/సంపుటి నుంచీ అదే చదువుతున్నాను తెలుగులో. (ఇంగ్లీషులో కొన్నాళ్లు "న్యూస్ టైమ్" చదివేవాణ్ణి.....చక్కగా కంటికింపైన "ఫోంట్స్" తో, పొందిగ్గా వెలువడే ఆ పేపర్, ఇప్పటికీ "ది బెస్ట్!". కొన్ని వూళ్లలో అది దొరకకపోవడంతో మానేశాను. ఇప్పుడు వెలువడుతోందో లేదో మరి.)

అందుకే, ఈనాడులో కూడా "పెయిడ్ న్యూస్" వస్తోందని బాధపడ్డాను. వారికేమి ఖర్మ అని?! 

ఇప్పటికీ, కొన్ని ఆడంబరాలూ, భేషజాలూ లేకపోతే, "క్రెడిబిలిటీ" సరిపోయినంతగా వార్తలు ఇచ్చేది ఈనాడు వొక్కటే.

కానీ, ఇప్పుడు కొందరు విలేకర్లు అధికారులతో "కుమ్మక్కై" వాళ్లగురించి గొప్పవార్తలే వ్రాస్తున్నారు. 

గత మూడురోజులుగా, మా ఆర్డీవో ఆఫీసుల్లో జరుగుతున్న తతంగాన్ని వారి దృష్టికి తెచ్చినా, ఇప్పటివరకూ అధికారులని నిలదియ్యలేదు! వార్త రాలేదు!

ఇంకా, రామోజీరావు ది యూనివర్సిటీల్లో డాక్టరేట్ కోసం "రీసెర్చ్" చెయ్యవలసిన వ్యక్తిత్వం.

తెలుగు వాళ్లలో చట్టబధ్ధంగా మొట్టమొదటి కోటీశ్వరుడు ఆయన. యే పని చేపట్టినా, యే రంగం లోనైనా,  నిబధ్ధతతో, చక్కగా ప్రణాళిక రచించే వాళ్లని "రిక్రూట్" చేసుకొని, "సక్సెస్" అనే పిరమిడ్ పైనే నిలిచాడు యెప్పుడూ! (అలాంటివాళ్లకు కూడా కొన్ని "ఫెయిల్యూర్స్" వుండే వుంటాయి--నాకు గుర్తు లేవు).

2001 లో అనుకుంటా, ఆయన మొత్తం యేడో, పదకొండో (బుడుగు లెఖ్ఖల్లో) "ఈనాడు" యెడిషన్లని హైదరాబాదులో కూర్చొని, "టచ్ స్క్రీన్" తో "ఆవిష్కరించడం", వెంటనే పేపర్లు ప్రింటయి వస్తున్నట్టు టీవీలో కనిపించడం (చెన్నై యెడిషనే కొంచెం ఆలస్యం అయిందనుకొంటా--సాంకేతిక కారణాలతో) "అత్యద్భుతం"!

అలాంటి "సక్సెస్" గురూ కి పాదాభివందనాలు!

(ఇప్పటికే యెక్కువ వ్రాసేశాననుకుంటా. వుండవిల్లి యేమంటాడో? మార్గదర్శి ఫైనాన్సియర్స్ మీద పడ్డాడుగానీ, "ముథూట్"; "మణప్పురం" ల మీద పడే ధైర్యం వుందా?)

Wednesday, April 20

మా మూడో హనీమూన్ అనే.......-8



మొన్నటి మా యాత్ర

$భోజనాలు

ఓ రాత్రీ, ఓ పగలూ అప్పటికే ప్రయాణించడంతో ప్యాంట్రీ కారు వాడికి నా సంగతి కొంత బాగానే తెలిసింది. రాత్రి 'డిన్నర్' అంటూ వాడో పుస్తకం, పెన్సిలూ పట్టుకొని వచ్చేసరికి వాడిని విషయించేశాను. "డిన్నర్లో యేమి ఇస్తావు? యెప్పుడు ఇస్తావు? రోటీ చావల్ అయితే యెంతా? వట్టి రోటీనే అయితే యెన్ని ఇస్తావు? యెంతా? వట్టి చావల్ అయితే యెన్ని కప్పులు ఇస్తావు? కూరలు ఇస్తావా? వూరగాయే గతా?" ఇలా ముత్యాల ముగ్గులో మాడా లాగ! 

వాడు బెదిరిపోయి, రెండు భోజనాలు--రోటీలతో, రెండు భోజనాలు వట్టి చావల్ తో అని చెపితే......ఒక ప్లేటులో రెండు+రెండు=4 చపాతీలూ, సబ్జీ తెచ్చాడు--100 రూపాయలకి! సరే, మరి చావల్ మాటేమిటి అంటే, మళ్లీ రొట్టెలు లేకుండా, చావల్ తోనే రెండు ప్లేట్లు తెచ్చాడు--ఒక్కోటీ 80 రూపాయలకి!

అలాగే అడ్జస్ట్ అవ్వక తప్పింది కాదు మరి!

*వెయిటింగ్ రూములకి

ఒకటో ప్లాట్ ఫామ్‌కీ, బయటికి వెళ్లడానికి క్రిందికి దిగవలసిన మెట్లకీ మధ్యలో వున్నాయి వెయిటింగ్ రూములు. ముందు ఓ చిన్న రూము--వాష్ బేసిన్ల గట్లతో. ఆ ప్రక్కన పార్టిషన్. దాని వెనకాల యేముందో చూడలేదు నేను. వాష్ బేసిన్ల దగ్గర కొంతమంది పళ్లు తొమేసుకొంటున్నారు. సబ్బులతో ముఖాలు కడిగేసుకుంటున్నారు. ఆ రూముకి బోర్డు యేమీ లేదు. (బహుశా--ఆ మ కా వాళ్లకోసమేమో?)

తరవాత "జనరల్" రూము. విశాలంగా వుంది. ఫేన్లూ గట్రా వున్నాయి. స్టీలు బెంచీలు వున్నాయి....వాటిమీద పడుకోకుండా ప్రతీ సీటుకీ మధ్య 4 అంగుళాల యెత్తు స్టీలు గోడలు కూడా వున్నాయి. కిటికీల వద్ద కూడా కొంచెం యెత్తుగా గట్టుల్లా వున్నాయి. మేము వెళ్లేసరికి, అలాంటి కిటికీ గట్టు మీద అప్పటివరకూ నిద్రించినవాళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. దానిముందు వున్న స్టీలు బెంచీ ఖాళీగానే వుంది. సరే. కిటికీల దగ్గర లగేజీలు పెట్టుకొని బెంచీమీద కూర్చొన్నాం. 

ఆ రూముకి ప్రక్కనే "జంట్స్" రూము వుంది. జనరల్ లో టాయిలెట్లూ వగైరాలు లేవు. అందుకని ఇంకేదైనా రూములోకి వెళ్లవలసిందే. మేము మిక్సెడ్ డబుల్స్ కావడంతో, జనరల్ లోనే కూర్చొన్నాము. 

దాని ప్రక్కనే, "లేడీస్" రూము వుంది. వివరణ అఖ్ఖర్లేదుగా.

ఇక్కడ విశేషమేమిటంటే, వెయిటింగు రూములు యెంత వెడల్పుతో వున్నాయో వాటి ముందు "కారిడార్" అంత వెడల్పూ వుంది! అంటే, కావాలంటే ఇంకో నాలుగు వెయిటింగ్ రూములు కట్టొచ్చు! లేదా వున్నవాటినే పెద్దవి చెయ్యొచ్చు! (మన బుర్రోవాదులకి ఇలాంటివి తట్టవు కదా! యెంత 'వేస్ట్' ఐతే అంత మంచిది గుత్తేదారులకి మరి!) 

ఆడవాళ్లు లేడీస్ కి వెళ్లి, బ్రష్ లూ, అవీ చేసేసి వచ్చారు. కాఫీలు అక్కడకి రావు కదా? నడవలేరు, మెట్లు దిగలేరు, యెక్కలేరు! మరెలా? ప్లాట్ ఫామ్ ఒకటి మీదగానీ కాఫీ షాప్ లేదు! అవసరం అలాంటిది. యెక్కడలేని వోపికా తెచ్చుకొని, వెళ్లి, కాఫీలు తాగి వచ్చారు. పైగా, కాఫీ చాలా బాగుంది! మీరూ వెళ్లండి అని సలహా!

మేము తక్కువ తిన్నామా? జంట్స్ లోకి వెళ్లి, పనులయ్యాక మెట్లు దిగి, క్రిందకి....బయటికి వెళ్లే మార్గంలో వెళ్లి, అక్కడ ఓ 24 గంటల రెస్టారెంట్ వుంటే, అందులో సెల్ఫ్ సర్వీస్ కాఫీలు కొనుక్కొని, కూర్చొని, ఆస్వాదిస్తూ త్రాగి, వెనక్కి వచ్చాం. 

విషయమేమిటంటే, ఈ వెయిటింగ్ రూములు కనీసం స్లీపర్ క్లాస్ టిక్కెట్లు వున్నవాళ్లకే. కానీ యెవడూ చెక్ చేసిన పాపాన పోవడం లేదు. "సర్వమంగళ తన మాంగల్యమునెంత మదినమ్మినిదో!" అన్నట్టు. యే టెర్రరిస్ట్ అయినా...!....పాపము శమించుగాక!

#ఇంకో విషయం వ్రాయడం.

పగలు జర్నీలో మన రాష్ట్ర సరిహద్దుల్లో యెక్కడో ఒక ముసలవ్వ (కనీసం 60 యేళ్లు వుంటాయి) యెక్కింది--ఓ పెద్ద బుట్టని ఇద్దరు మగాళ్లు మోసుకొచ్చి, యెక్కించగా. ఆబుట్టలో ఓ ఐదారు వందల కమలాఫలాలు (సంత్రాలు) వుంటాయి--రకరకాల సైజుల్లో, రకరకాల 'పండిన' స్థితుల్లో. చాకచక్యంగా వాటిని --ఒకే సైజువి, బాగా పండినవి కొన్నీ, కొంచెం తక్కువ పండినవి కొన్నీ--ఇలా వేరే ప్లాస్టిక్ కవర్లలో ఓ ఐదేసి చొప్పున సర్దేసి, పట్టుకొచ్చి, "బాబూ! సంత్రాలు! ఇరవై రూపాయలకే!" అంటూ అమ్మొచ్చింది. అప్పటికి ఓ రాత్రీ, ప్రొద్దున్నా ప్రయాణం చేసి, ప్యాంట్రీ కార్ వాడు పెట్టిన టిఫిన్లు తినీ, కాఫీ టీలు తాగీ, జిహ్వ చచ్చిపోయి వున్నారేమో--అందరూ కొనేశారు. మళ్లీ ఆవిడ రెండో రవుండ్ తిరగడం, మళ్లీ అందరూ కొనెయ్యడం! మధ్యాహ్న భోజనాలు అయ్యాక కొంత గేప్. మళ్లీ ఆవిడ, కొంచెం పెద్ద సైజు పళ్లనీ, కొంచెం తక్కువ పండిన వాటినీ ఐదేసి చొప్పున పట్టుకొచ్చి, "బాబూ! సంత్రాలు! 15 రూపాయలకే!" అంటూ వస్తే, మళ్లీ అందరూ......హాం ఫట్! సాయంత్రం 4 గంటలకల్లా బుట్ట ఖాళీ చేసుకొని, డబ్బులని రొండిలో దోపుకొని, దిగి వెళ్లిపోయిందామె! నిజంగా, ఆ వయసులో ఆమె కష్టానికీ, తెలివికీ తగిన ఫలితం వచ్చిందా.......అంటే.....యేమో! ఆ పైవాడికే తెలియాలి!

..........ఇంకా తరువాయి.

Saturday, April 16

మా మూడో హనీమూన్ అనే.......-7



మొన్నటి మా యాత్ర

ఇంక ఆ రాత్రి $భోజనాలు చేశాక, నిద్రపోయాం. రాత్రి పదింటికే చలి మొదలయ్యింది. ఫ్యాన్లు కట్టేసి, పేంట్లు, చొక్కాలు, స్వెట్టర్లూ, సాక్సూ, జర్కిన్లూ, మఫ్లర్లూ, శాలువాలూ  వగైరాలతో బందోబస్తు చేసి దుప్పట్లు ముసుగేసినా, ఇంకా వణికిస్తున్న చలి. తెల్లవారుజామున 3 గంటలకే రైలు నిజాముద్దీన్ చేరాలి. అప్పుడు హడావిడిగా యెందుకని, ముందే అన్నీ సర్దేసుకున్నాము. 

ఈ ఆడవాళ్లు అసలు నిద్రపోతేనా! అలారం పెట్టుకొన్నది రెండున్నరకి. మధ్యలో యేవేవో మెస్సేజిలూ వాటి సౌండ్లూ, లేచి చూసుకోడాలూ, గుడగుడలూ. మమ్మల్ని కూడా లేపేశారు--రెండున్నర లోపలే! (నాకు ఇంకో నాలుగు సిగరెట్లు యెక్కువ ఖర్చయ్యాయి.)

అలా మొత్తానికి కొంచెం లేటుగా 4 గంటలకి చేరింది రైలు. ఢిల్లీలో పడ్డాం. లగేజీలు దింపుకొని, అక్కడవుండే మా మూడో (ఆఖరి) చెల్లెలుకి ఫోను చేద్దును కదా--డ్రైవరు ఇప్పుడే వచ్చాడు. నేను బయలుదేరి వస్తున్నాను. మీరు వెయిటింగ్ రూములో వుండండి. యెంతోకాదు....ఓ రెండుగంటల్లో వచ్చేస్తాను--అంది. 

సరే, మళ్లీ 180 రూపాయలకి పోర్టరుని మాట్లాడుకొని, ఒకటో ప్లాట్ ఫామ్ ప్రక్కన వుండే *వెయిటింగ్ రూములకి చేరాము. (ఆ స్టేషనుకి బయటికి వెళ్లడానికి రెండువైపులా మార్గాలు వున్నాయి. మేము దిగినది 'నిజాముద్దీన్ ' వైపు అంటారు. ఇంకోవైపుని 'సయ్యద్ కాలేషా' అనో యేదో అంటారు). 

మరిచాను దారిలో ఇంకో #చిన్న విషయం వ్రాయడం.

..........ఇంకా తరువాయి.

Saturday, April 9

మా మూడో హనీమూన్ అనే.......-6



మొన్నటి మా యాత్ర

......ఓ పోలీసు......@"యేం చేసి వచ్చారు?" అంటూ!

@ "పిచ్చోడిలా వున్నావే! యేమి చేసి వస్తారు?"

(సంభాషణ హిందీలో జరుగుతూంది).

"స్మోక్ చేసి వచ్చారు."

"మీరు చూశారా?"

"చూడక్కర్లేదు. మీ జేబులోని సిగరెట్టు పెట్టే చెపుతూంది" అంటూ, ఆ పెట్టెని తీసేసుకొని, తన పేంటు జేబులో పెట్టేసుకున్నాడు.

(ఆ సమయంలో మా పెట్టెలోని టాయిలెట్లలో యెవరో వుండడంతో, వెస్టిబ్యూల్ దాటి, ప్రక్క పెట్టెలోని టాయిలెట్లోకి వెళ్లాను. మా సంభాషణ వెస్టిబ్యూల్ లో జరుగుతోంది.)

"జేబులో పెట్టె నేరం కాదుకదా?"

"ఇక్కడ బోర్డు చూడండి--250/- రూపాయల జుర్మానా!"

"అది 'పబ్లిక్ ప్లేసులో' తాగిన వాళ్లకి. టాయిలెట్లో తలుపు వేసుకున్నాక, అది నా ప్రైవేట్ ప్లేసు. అది నేరం అని యెవరు చెప్పారు? పైగా నువ్వు చూడలేదు కదా?"

"ఇప్పుడే చలాన్ వ్రాయగలను. 250/- కట్టండి."

"నీదగ్గర రుజువేముందని కట్టమంటావు? సిగరెట్టు పెట్టె నీజేబులో వుంది!"

(అప్పుడే పెట్టెలో టీలు అమ్మేవాడొకడు అక్కడికి వచ్చాడు. ఆ పోలీసు తనజేబులోంచి ఆ సిగరెట్టు పెట్టెని తీసి, మళ్లీ నా చొక్కాజేబులో పెట్టడం చూశాడు. నేను వాణ్ని అడిగాను)

"బాబూ! నువ్వేమి చూశావో వ్రాస్తాను. సంతకం పెట్టు" 

"మధ్యలో నన్ను ఇరికించకండి బాబూ" అంటూ వాడు వెళ్లిపోయాడు. 

(అక్కడ చీకటిగా వుండడంతో వాడి నేం ప్లేట్ కనిపించడంలేదు.)

"అసలు నీ పేరేమిటి? నువ్వు డ్యూటీలోనే వున్నావా? నీ ఐడీ కార్డు యేది?"

"అవన్నీ అడిగితే, ఇప్పుడే కేసు వ్రాసేసి, వచ్చే స్టేషనులో ఆర్పీఎఫ్ వాళ్లకి అప్పగిస్తాను!"

"యేమని వ్రాస్తావు కేసు?" (యెదురుగా కనిపిస్తున్న ప్రయాణీకులని కూడా అడిగాను.) "బాబూ! మీరుకూడా చూశారుకదా? సిగరెట్టుపెట్టెని నా జేబులో పెట్టబోయాడు. పైగా కేసు అంటున్నాడు! ఇందాకా జరిమానా అన్నాడు."

"సరే! జుర్మానా కట్టెయ్యండి. కేసు వ్రాయను."

"నేను లుంగీ, షర్టులో వున్నాను. నాదగ్గర డబ్బుల్లేవు. అయినా, అసలు నీ బాధ యేమిటి? నేను నిజంగా నేరం చేసినా, ప్రథమ తప్పిదం క్రింద వార్నింగ్ ఇచ్చి వదిలెయ్యాలి, మళ్లీ అదే నేరం చేస్తే పట్టుకోవాలి."

"సరే. వదిలేస్తాను. పదినిమిషాల్లో జరిమానా కట్టండి! లేకపోతే వచ్చే స్టేషనులో......"

"డబ్బులకోసం మా ఆడవాళ్లదగ్గరికి వెళ్లానంటే, గొడవ అవుతుంది. అందరూ వచ్చేసి దెబ్బలాడతారు. నీ కేసు సంగతి యేమవుతుందో చూసుకో!"

"సరే. ఓ పావుగంటలో ఓ 100 తెచ్చి ఇవ్వండి. లేకపోతే.....! మీ బెర్త్ నెంబరు చెప్పండి."

"నాది ఇవాళ అంటే 04-03-2011 న, విశాఖ-హజ్రత్ నిజాముద్దీన్ దక్షిణ్-లింకు ఎక్స్ ప్రెస్ లో, ఎస్ 2 లో బెర్త్ నంబరు 65" కాస్త గట్టిగానే, అందరూ వినేలా చెప్పాను.

(నిజానికి ఈ "కరప్ట్" వాళ్లందరూ పేరూ, డెజిగ్నేషన్ అడగ్గానే లొంగిపోతారు. కానీ మనం కూడా అనువుగానిచోట అధికులమనరాదు కదా? ఆర్పీఎఫ్ వాళ్లు కేసులు పెట్టడానికి ఈ స్టేషను కాదని ఆ స్టేషనూ అంటూ, మన ప్రయాణాన్ని ఆపేసి, తిప్పడం పేపర్లలో చదువుతూ వుంటాము కదా? అందుకని, కామ్‌గా మా ఆవిడని అడిగి, ఓ వంద తీసుకెళ్లి, వాడి జేబులో పెట్టాను.)

"మీ పెట్టె మీరు తీసేసుకోండి!" అని నా జేబులో పెట్టబోయాడు. 

"నీదగ్గరే వుంచు. మళ్లీ అవసరం వచ్చినప్పుడు తీసుకొంటాను కదా!"

"నేను ఇంకో గంటలో రైలు దిగిపోతాను. ఈ లోపల మీ యిష్టం."

"మరి రాత్రి భోజనం సంగతి తరవాత మాటేమిటి?"

(అప్పటికి ఝాన్సీ స్టేషన్ రాబోతూంది. ఆరూ యేడు లోపల వచ్చేస్తుందని మా ప్రక్కవాడు--మమూలు టిక్కెట్టు కొనుక్కొని, రిజర్వేషన్ బోగీ యెక్కినవాడు--చెప్పాడు.)

"మీరు యెలాగైనా కాల్చుకోండి--కానీ పోలీసులెవరూ లేకుండా చూసుకొని కాల్చండి!" అని అమూల్యమైన సలహా ఇవ్వడం కొసమెరుపు. తరవాత వాడెప్పుడు దిగిపోయాడో నేను చూడలేదు. వాడి సలహా మాత్రం పాటించాను.   

..........ఇంకా తరువాయి.

Thursday, April 7

మా మూడో హనీమూన్ అనే..... -5



మొన్నటి మా యాత్ర

విజయవాడ దాటాక, టిఫిన్లూ, పెరుగన్నాలూ లాగించాక, నిద్రకి పడ్డాం. నాకు సాధారణంగా కారు/రైలు/బస్సుల్లో నిద్ర రాదు. అలాంటిది ఆ రోజెందుకో, భలే నిద్ర పట్టేసింది. 

మర్నాడు ప్రొదున్న, ఆడవాళ్లిద్దరూ బ్రష్ చేసేసి, ఆరింటికే ఒకసారి కాఫీ వస్తే తాగేశారు. తరవాతెప్పుడో నిద్రలేచిన మాకు 10-30 దాకా కాఫీ రాలేదు....టీ వాడు మాత్రం నిమిషానికోసారి.....తాగుతారా? ఛస్తారా? అన్నట్టు మా చుట్టే తిరిగాడు. 

అప్పటికి మహారాష్ట్రలోనో యెక్కడో తేలాం. 

నాష్తా అంటూ "వెజ్ కట్లెట్; సమోసా; బ్రెడ్ పకోడా" అని అరుస్తూ ఒకడు తిరిగాడు అంతసేపూ. ఈటార్సీ దాటామనుకొంటా. 

అప్పుడొకడు వచ్చాడు--"రోటీ భాజీ" అంటూ. నాలుగు ప్లేట్లు 80 రూపాయలకో యెంతకో 
కొనుక్కొని, అందరూ తినేశాం. (ఐ ఆర్ సీ టీ సీ వాళ్లు టిక్కెట్లలో మోసం చేస్తున్నారు--చర్య తీసుకోండి అంటే, వాళ్లని కేటరింగు నించి కూడా తప్పించి, మమతాదీ ఫేవరెట్లకి 'ప్రైవేటు ' కేటరింగ్ కి ఇచ్చేశారు--అదీ మన దౌర్భాగ్యం!)

ఇంకో గంటలో, "లంచ్?" అంటూ ఒకళ్లిద్దరు తిరగడం మొదలెట్టారు. టైము ఇంకా 12 కూడా కాలేదేమో. "లంచ్ లో యేమిస్తావు?" అనడిగాను (కానీ యెప్పుడిస్తావు అనడగలేదు!) "చపాతీ, సబ్జీ--యా చావల్, దాల్" అన్నాడు. సరే అనుకొని, రెండు చపాతీ సబ్జీ చెప్పాను. ఐదు నిమిషాల్లోనే హాజరు! 

ఆడాళ్లనిద్దరినీ తినెయ్యమన్నాను--వాళ్లు ఆకలికి తట్టుకోలేరుకదా అని. ఓ పావు గంట తరవాత కూడా, "లంచ్?" వాళ్లు తిరుగుతున్నారు! సరేలే, ఇంకేమీ దొరకదేమో అని, రెండు చావల్, దాల్ కి ఆర్డరు ఇచ్చాను. అప్పుడుకూడా, యెప్పుడిస్తావు అని అడగలేదు. 

మళ్లీ పది నిమిషాల్లోనే ప్రత్యక్షం! మా బావగారు పాపం, టేబ్లెట్లు వేసుకోవాలంటే తినక తప్పదని, తినేశారు--ఇంతకీ అది మన "పోపన్నం!" దాల్ పేరుతో ఓ నీళ్ల ద్రావకం, ఓ చిన్న వూరగాయ పౌచ్ ఇచ్చాడు! వాటికి రెండింటికీ 80 రూపాయలు! (నేను తిననే లేదు!)

మధ్యాహ్నం రెండు గంటలకి మళ్లీ మా వాళ్లు ముగ్గురూ కాస్త పెరుగన్నం తిన్నారు. (అప్పటికి ఇంకా 'బస్తాల ' అవసరం రాలేదు.)

నేను మళ్లీ నిద్రకి పడ్డాను.నాలుగింటికి మెలుకువ వచ్చింది. ఓ సిగరెట్టుకాల్చుకొద్దామని టాయిలెట్ కి వెళ్లాను. పని అయిపోయాక బయటికి వద్దును కదా........ఓ పోలీసు......@"యేం చేసి వచ్చారు?" అంటూ!  

..........ఇంకా తరువాయి.

Saturday, April 2

మా మూడో హనీమూన్ అనే..... -4



మొన్నటి మా యాత్ర

(ఇలా అయితే యాత్ర విశేషాలు యేడాదైనా తెమలవుగానీ, టూకీగా వ్రాసేసి, వివరణ అవసరమైనచోట్ల * గుర్తో యేదో వేసేసి, వేరే వ్రాస్తాను. సరేనా?)  

.......రైలు కూత వినపడింది* కదా?

*"రైలు కదిలిపోతూంది! యెక్కెయ్యండి" అని గోల. ఇంతకీ అది ప్రక్క లైనులోంచి వెళ్లిపోయిన ఓ గూడ్స్ రైలు! గూడ్స్ రైలు కూతకీ, ప్యాసింజరు రైలు కూతకీ (కారుకూతలకీ, రైలు కూతలకీ) తేడా చాలామందికి తెలియదు. తీరా నేను చూసేసరికి అప్పుడే మా రైలుకి సిగ్నలు ఇచ్చారు. వెంటనే యెక్కేశాను. 

అయినా, ఈ రైళ్లలో దిగి యెక్కడాలూ, సిగ్నళ్లు ఇవ్వడాలూ, కూతలు వెయ్యడాలూ, యే యే స్టేషన్లలో లగేజి లోడింగులు జరుగుతాయి, అక్కడ అవి అయ్యేవరకూ బ్రహ్మదేవుడు చెప్పినా రైళ్లు కదలవూ, యెక్కడెక్కడ, యెన్నెన్ని రైళ్లూ, గూడ్స్లూ, ఇంజన్లూ క్రాసింగులు అవుతాయి, అవతల లైన్లో యే రైలుని వొదిలారూ, మన రైలు యెప్పుడు వదులుతారూ--వగైరాలన్నీ నాకు 30 యేళ్లు వచ్చేటప్పటికే అవుపోశన పట్టేశాను. అందుకే నాకు భయం లేదు యెక్కలేకపోతానని!

రైలు నెమ్మదిగా బయలుదేరి, రాత్రి పదిగంటల ప్రాంతంలో విజయవాడ చేరింది. అప్పటిదాకా ఆకళ్లు యెవరికీ లేవు. (ఐదారుసార్లు కాఫీలు లాగించాము కదా!) కానీ, ఇంక నిద్రపోవాలికాబట్టి, తినెయ్యాలి. అక్కడ షెడ్యూల్డ్ స్టాప్ 20 నిమిషాలు. క్రిందికి దిగి, ప్లాట్ ఫామ్ మీద చూస్తే, ఓ వంద గజాల దూరం లో "ఇడ్లీ, వడా, దోశా" అని అరుస్తున్నారు. 

దిగబోతూ అందరినీ అడిగాను--యేమి తెమ్మంటారు? అని. "మాకేమీ వద్దు" అని కోరస్! నేను మాత్రం టిఫిన్ తెచ్చుకోదలిచి, ఓ వెండర్ని అడగ్గానే, 9 X 4 తగరం ప్లేట్లలో ప్యాక్ చెయ్యబడ్డ "వడా, దోశ" ని చూపించి, 25 రూపాయలు ఇమ్మన్నాడు. 

యెందుకైనామంచిదని రెండు ప్యాకట్లు తీసుకున్నాను.  

ఇదివరకు, ప్రతీ ప్లాట్ ఫామ్ మీదా, వేరే వేరే తట్టల్లో ఇడ్లీ, వడా, దోశా, పులిహోర, పెరుగన్నం--ఇలా అమ్మేవారు. ఓ ఆకులో రెండు ఇడ్లీ, రెండు వడా పెట్టించుకొని, నీళ్ల చట్నీ వేయించుకొని, అది కారిపోకుండా పెట్టెలో తమవాళ్లకి ఇవ్వడానికి యెన్నో ఫీట్లు చెయ్యాల్సి వచ్చేది!

విజయవాడ స్టేషన్ క్యాంటీనంటే--ప్రపంచం మొత్తమ్మీద 'అదుర్స్!' 

విజయవాడలో నెలకి వందా రెండువందలు జీతం సంపాదించుకొంటూ, అద్దెలు భరించలేనివాళ్లు--స్తేషన్లోనే వుంటూ, టిఫిన్లూ, భోజనాలూ చౌకగా తింటూ కాలం వెళ్లబుచ్చేవారు! ఇప్పుడా క్యాంటీనుకి అంత సీను వుందో లేదో చూసే భాగ్యం ఈ మధ్య కలగలేదు.

ఇప్పుడు, ఇడ్లీ, వడా, దోశా--మనిష్టం కాదు--వాళ్లు "వడా-దోశా"; "ఇడ్లీ-పులిహోరా"; "బ్రెడ్-పెరుగన్నం" లాంటి చిత్రమైన కాంబినేషన్లలో--యేమి పెడితే అది తినాల్సిందే! ఇక @చట్నీదో ప్రహసనం. పైగా, ఆ ప్యాకెట్లమీద ఆ రోజు తారీఖూ, ఎం ఆర్ పీ స్టాంప్ చేసి వున్నాయి! (ఎం ఆర్ పీ 20/- అయితే, వాడు 25/- వసూలు చేసి నన్నే మోసం చేసాడన్న విషయం తినే ముందు తెలిసింది!)   

..........ఇంకా తరువాయి.

Friday, April 1

మా మూడో హనీమూన్ అనే..... -3



మొన్నటి మా యాత్ర

హమ్మయ్య. 

రైలు (అన్నట్టు రైలు మన తెలుగు శబ్దమేకదూ? లేక "ధూమశకటం" అందామన్నా, ఇప్పుడు బొగ్గులూ లేవు, ధూమం లేదు మరి. డీజెల్ కి తెలుగు పేరు పెట్టబడినట్టు లేదు--ఆ శకటం అందామన్నా) బయలుదేరింది. 

బ్యాగులూ గట్రా సీట్ల క్రిందకి తోసేసి, అవసరమొచ్చేవి ప్రక్కనే పెట్టుకొని, హేండ్ బ్యాగులు ఆడవాళ్ల ప్రక్కన పెట్టుకొని, 'అందరికీ' ఫోనులు చేసేసి 'బండి యెక్కేశాం, కదిలిపోయింది, మళ్లీ తరవాత చేస్తాం' అని చెప్పేసి (ఇదివరకు యెవరినైనా బండి యెక్కించి, 'చేరగానే కార్డు ముక్క రాయండి' అనేవారు--ఆ కార్డు ముక్క చేరితే సంతోషం, లేదా చేరక ....స్తారేమిటీ...అని ఓ ధీమా వుండేది. ఇప్పుడా ధీమా కరువై, గంటగంటకీ మనం చెయ్యకపోతే వాళ్లే ఫోను చేసేసి, హమ్మయ్య అనుకొంటూ రాత్రంతా గడిపేస్తారు. తెల్లవార్లూ కంపార్ట్ మెంట్లో అందరి సెల్లులూ మోగుతూనే వుంటాయి--ముచ్చటైనవేకాదు భయంకరమైన రింగ్ టోన్లతో సహా--మాట్లాడుతూనే వుంటారు), కాస్త రిలాక్సుడుగా కూర్చొనే సరికి, "చిన్నన్నయ్యా! బావగారు బ్రెడ్ తెచ్చారుగానీ, జామ్ మర్చిపోయారు. తరవాత అరిటిపళ్లు కూడా కొనుక్కుంటే బాగుంటుంది" అని ఓ సలహాత్మక సూచన. 

ఇంతలో వచ్చింది--యేమిటీ? మూర్చా?--కాదు రాజమండ్రి.....అంటే నిజంగా మనదగ్గరకి వచ్చింది అనికాదు.....మన రైలు రాజమండ్రి అనే వూర్లో వున్న స్టేషనుకి చేరింది.....అని! 

సరే.....పళ్లూ అవీ అంటూ రైలు దిగబోతే, మా ఆవిడ "యేమండీ.....మీరు దిగొద్దు. కిటికీ ప్రక్కకి వస్తే కొందాము.....అంతే!" అనీ, చెల్లెలు కూడా "వొద్దు......దిగొద్దు....మళ్లీ యెక్కడం కష్టం" అనీ సతాయింపు. 

అయినా మనం వింటామా! రాజమండ్రిలో యెంత ముష్టి రైలు అయినా ఓ 10 నిమిషాలు ఆగకపోదు. ఆ టైములో ప్లాట్ ఫామ్ మూడుసార్లు చుట్టి రావచ్చు! అందుకని దిశేశా (ఇది మా మనవడి మాట--దిగేశా కి బదులు). 

తీరా చూస్తే, మనది ఇంజను ప్రక్క బోగీ! అంటే ప్లాట్ ఫామ్ కి ఓ చివర--ముష్టివాళ్లు పడుక్కొని విశ్రాంతి తీసుకొనేచోట ఆగుతుంది. వెనక్కి నడుచుకొంటూ వెళితే, ఓ అర ఫర్లాంగు దూరం లో "కిసాన్" వాళ్ల స్టాల్. ఇంకో ప్రక్క ఓ బండీ, దానిమీద అరటిపళ్లూ. ఆకు పచ్చ అరటిపళ్లు తగ్గాయి ఈ మధ్య యెందుకో. అలాంటివే పసుపుపచ్చవి వస్తున్నాయి. 

డజను 40 కి బేరమాడి (నా మొహం! బేరమేమిటీ.....అన్నీ ఫిక్సెడ్ రేట్లు.....కొనౌపోతే నీ ఖర్మ!) రెండు డజన్లు తీసుకొని, ఇంకో ప్రక్కన వున్న "కిసాన్" వారి స్టాల్ కి వెళితే, ఓ డజను యెండిపోయిన యాపిల్స్, ఈకలు పీకేసిన కోళ్లలా వ్రేళ్లాడగట్టబడ్డ రెండో మూడో అనాసపళ్లూ మాత్రం వున్నాయి. జామ్ లూ గట్రా యేమీ లేవు. సరే, వెనక్కి నడిచి, కిటికీలోంచి పళ్లు అందించేలోగా రైలు కూత వేసింది! 

..........ఇంకా తరువాయి.

Wednesday, March 30

మూడో హనీమూన్ అనే.... - 2

మొన్నటి మా యాత్ర

మాది ఓ చిన్న చక్రాల సూట్ కేస్; ఓ బిగ్ షాపర్ లో రెండు దుప్పట్లూ, లుంగీ, టవలూ వగైరా రైల్లో వాడుకునే వాటితో--అంతే లగేజి.

కాకినాడలో మా చెల్లెలుదీ, బావగారిదీ రెండు చిన్న ఎయిర్ బ్యాగులు. అంతే. తరవాత, కాకినాడలో షాపింగ్ చేసి, మా ఢిల్లీ చెల్లెలు ఆదేశం ప్రకారం--వాళ్ల అత్తగారూ, తోటికోడళ్లూ వాళ్లకి మేము పెట్టవలసిన బట్టలూ, తను మాకు పెట్టవలసిన బట్టలూ (అక్కడ మంచి చీరలూ వగైరా దొరకవు కాబట్టి), తనకో వాచీ వగైరాలు కొనేసి, ఇంకో పెద్ద ఎయిర్ బ్యాగ్ నింపేశారు. 

అది కాకుండా, వెళ్లేది ఢిల్లీ వైపు కాబట్టి, మన తిండి దొరకదు అని ఇంకో బిగ్ షాపరూ! అందులో........

(నేను అంటానూ--మర్నాడు పొద్దున్న వరకూ అంధ్రాలోనే వుంటాము, ప్యాంట్రీ కార్ కూడా వుంది.....యెంతైనా వాడు పెట్టేవి కాస్త తినబుల్ గానే వుంటాయి కాబట్టి అన్నీ మోసుకెళ్లఖ్ఖర్లేదూ అని. మా బావగారేమో--నాకసలు తిండి ప్రాబ్లెం లేదు--ప్రతీ స్టేషన్లోనూ "బ్రెడ్ ఆమ్‌లెట్" దొరుకుతుంది--అని ప్రకటించేశారు. ఆయన చిన్నప్పటినించీ వాళ్ల నాన్నగారి వుద్యోగరీత్యా యెప్పుడూ రైలు ప్రయాణాలు చెయ్యడంతో, ఆకలికి మండినప్పుడు ఆమ్‌లెట్లు తినడం అలవాటు చేసుకొన్నారు! ఆయనవీ, వాళ్ల నాన్నగారూ, అమ్మగారూ వాళ్ల ప్రయాణాలగురించి వ్రాయాలంటే ఓ పెద్ద గ్రంథమౌతుంది!)

ఇంక సమస్యల్లా ఆడవాళ్ల గురించే. ఇద్దరూ ఒకలాంటివాళ్లే! మా ఆవిడ మసాలా వాసన దూరం నించి సోకినా, చేతిలో వున్నది పారేస్తుంది! చెల్లెలైతే, "పార్టీల్లోనూ అక్కడా అయితే మొహమాటానికి యెంగిలి పడతాం. మన ఇంట్లోనూ, ప్రయాణం లోనూ యెలాగ?" అంటుంది. అందుకని, బయలుదేరిన రోజు రాత్రీ, ఆ మర్నాడు ప్రొద్దున్నా, ఆ రాత్రీ కి సరిపడా అన్నం వండేసి, పెరుగులో కలిపేసి, ఓ పెద్ద కేసెరోల్ లో పెట్టేశారు. (తరవాత్తరవాత ఆ కేసెరోలే 8, 9 మంది ఆకలి తీర్చింది మరి!)

అది కాకుండా, మా బావగారు కాకినాడలో ఓ ప్రసిధ్ధ దుకాణం లో ఓ బస్తాడు--కారప్పూసా, మిక్స్చరూ, జంతికలూ, చెగోడీలూ వగైరా--అన్నీ అరకేజీలనుకుంటా--ఇంకా బ్రెడ్డులూ (స్లైస్డూ, ఫ్రూటూ, బన్నులూ) 
........నింపేశారు. అక్కడకి ఓ సూట్ కేసూ, మూడు ఎయిర్ బ్యాగులూ, రెండు బిగ్ షాపర్లూ, ఆడవాళ్లిద్దరివీ రెండు బస్తాల్లాంటి హేండ్ బ్యాగులూ--అవీ మా లగేజి.

మా డ్రైవరు చాకచక్యం పుణ్యమా అని అంత లగేజీతో మేం నలుగురూ మా అల్టో కారులో సామర్లకోట చేరాం అన్నమాట. అక్కడేమో మా బండి మూడో ప్లాట్ ఫాం మీదకి (అంటే ప్రక్కకి) వస్తుంది! మళ్లీ కూలీలకి ఓ వంద రూపాయలకి బేరమాడి, (రైలు రాగానే వాళ్లే మా కంపార్ట్ మెంటులో లగేజి యెక్కించేలా) ప్లాట్ ఫాం మీద ఓ కిలో మీటరు నడిచి (కంపార్ట్ మెంట్ ఇంజను దగ్గరే వుంటుంది మరి!), రైలు రాగానే దాంట్లో పడ్డాం.

..........ఇంకా తరువాయి.

Monday, March 28

మూడో హనీమూన్ అనే



మొన్నటి మా యాత్ర  

ఈ మధ్య ఒకటి రెండు తప్ప, వరసగా టపాలు వ్రాయలేకపోయాను. యెందుకంటే.....మీరు సరిగ్గానే వూహించారు.....దేశమ్మీద తిరగడానికి పడ్డాను. 

హర్యాణాలో వుంటున్న మా ఆఖరు చెల్లెలు యెప్పటినించో రమ్మంటుంటే, వుద్యోగం లో సెలవలు లేవని వాయిదా వేస్తూ వచ్చాను. ఇప్పుడు వుద్యోగానికి గుంటకట్టి గంటవాయించాను కాబట్టి, సరదాగా తిరిగొద్దామని బయలుదేరాను. 

మా రెండో చెల్లెలు, బావగారు కాకినాడ నుంచి బయలుదేరతామనడం తో, మార్చి 3వ తారీఖున "నిజాముద్దీన్ లింక్/దక్షిణ్ ఎక్స్ ప్రెస్" కి సామర్లకోటనించి నలుగురికీ రిజర్వేషన్ చేయించాను. 

రెండో తారీఖుని మా కారులో బయలుదేరి, ఆ రాత్రి కాకినాడలో చిన్న చిన్న షాపింగులు చేసుకొని, ఆ మర్నాడు మధ్యాహ్నం 3-30 గంటలకి సామర్లకోట బయలుదేరాము. రైలు 4-20 కి. కొంచెం లేటుగా వచ్చి, సుమారు 5-00 కి బయలుదేరింది మా రైలు.

ఢిల్లీ, హర్యాణా, హిమాచల్, యూపీ, రాజస్థాన్లు తిరిగి, మొన్న 24 న మధ్యాహ్నం 2-30 కి తిరిగి సామర్లకోటచేరి, కాకినాడలో ఆ రాత్రి వుండి, మర్నాడు వుదయం బయలుదేరి ఇంటికి వచ్చాము. 

మిగతా ఒక్కొక్క టపాలోనూ వ్రాయడానికి ప్రయత్నిస్తాను. 

Thursday, February 24

ప్లాస్టిక్ వినియోగం



సంచులపై నిషేధం

ఇదొక ప్రభుత్వ, బుర్రోవాదుల వెర్రి!

20 మైక్రాన్ల లోపు మందంగల ప్లాస్టిక్ సంచులని నిషేధించగానే యేమిజరిగింది?

చిన్నసైజు ప్రభుత్వోద్యోగుల పంట పండింది! కొంచెం పెద్ద ఫ్యాన్సీ, కిరాణా, డిపార్ట్ మెంటల్ స్టోర్లూ వగైరాలనించి ఖచ్చితంగా వెయ్యి రూపాయలూ, కొంచెం చిన్న షాపుల నుంచి రూ.500/-, చిన్న చిన్న బజ్జీలబళ్లూ, కూరగాయల దుకాణాలూ, పళ్ల కొట్లూ వగైరాలనించి రూ.250/- యెవరికీ మినహాయింపు ఇవ్వకుండా, వసూలు చేసుకున్నారు!

మరి కేసుల మాటేమిటి?

చుట్టుప్రక్కల పల్లెలనించి పనికోసం పట్టణాలకి వచ్చి, సాయంత్రం తిరిగి వెళుతూ తమ సంపాదనలోంచి కావలసిన వస్తువులు కొనుక్కొని, సంచీ తెచ్చుకోలేదు కాబట్టి, ఓ పావలా పెట్టి ప్లాస్టిక్ సంచీ కొనుక్కొని, దాంతో ఇంటికి బయలుదేరినవాళ్లని, ముఖ్యంగా ఆడవాళ్లని పట్టుకొని, రూ.100/- కడతావా చస్తావా అని బెదిరించి, సంచీలో సరుకులతోసహా "స్వాధీనం" చేసుకొని కేసులు వ్రాశారు!

మళ్లీ ఓ పదిహేనురోజుల తరవాత షాపులని చుట్టేసి, "మేం కవర్లు వాడడం మానేశాం మొర్రో" అంటున్నా, "బోర్డు పెట్టలేదు" అనో, మేమూ కేసులు వ్రాసుకోవాలికదా, ఓ 500 ఇవ్వండి, 250 కి రసీదు ఇస్తాములెండి! అంటూ మళ్లీ దండుకున్నారు.

ఇప్పుడింక, 40 మైక్రానుల వరకూ నిషేధించే యోచన చేస్తున్నారట!

అసలు ఈ "నిషేధం" యెందుకు?

వాళ్లు చెప్పే కారణాలు--పర్యావరణానికి నష్టం కలుగుతుంది అనీ, పశువులు వాటిని తినేసి, చచ్చిపోతున్నాయి అనీ, వాటిలో వేడి వేడి పదార్థాలు పట్టుకెళ్లడంతో, రసాయనిక చర్య జరిగి, ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారనీ--అంతే!

ఈ అంశాలకి తగ్గ ఋజువులు వున్నాయా? వుండవు. పర్యావరణం సంగతి ప్రక్కనపెట్టి, మిగిలినరెండిటి గురించీ మాట్లాడుకొంటే--యే పశువులు చచ్చిపోతున్నాయి? పోషించుకునేవాళ్లెవరూ అంత నిర్లక్ష్యంగా ప్లాస్టిక్ సంచులు కలిపి వాటికి ఆహారం పెట్టరు కదా? యెటొచ్చీ, రోడ్లమీద తిరుగుతూ, ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తూ, రోడ్లప్రక్కన అడ్డమైన చెత్తా తింటూ, రోడ్డు మధ్యన తీరిగ్గా పడుకొని నెమరు వేసుకొనే--యెవరికీ చెందని పశువులేనేమో!

ఇంక, వేడి పదార్థాలవల్ల ఆరోగ్యం చెడిపోయి, హాస్పటళ్లలో పడ్డవాళ్ల సంఖ్య యెంత? రికార్డులేమైనా వున్నాయా?

ఇంక పర్యావరణం విషయానికొస్తే--నిజమేనండీ, వొప్పుకున్నాం--"ప్లాస్టిక్" వల్ల (కేవలం సంచులవల్లనే కాదు!) నష్టం జరుగుతుంది. ఒక ప్లాస్టిక్ సంచి, భూమిలో శిథిలమవడానికి "లక్ష సంవత్సరాలు" పైగా పడుతుందంటారు. సరే. 

దీనికి పరిష్కారంగా, "బయో డిగ్రేడబుల్ ప్లాస్టిక్" కనిపెట్టారు. అంటే, అది భూమిలో తొందరగా శిథిలమైపోతుందన్నమాట. కానీ అది చాలా ఖరీదైన వ్యవహారం! అందుకని దానితో ఇప్పటివరకూ సామాన్యులు వాడే వస్తువులేమీ తయారు చెయ్యబడడంలేదు. 

ఇక రెండో పరిష్కారం, "రీ సైక్లింగ్". అంటే, ఓ సారి వాడేసిన వస్తువులని, మళ్లీ కరిగించి, ఆ ప్లాస్టిక్ తో మళ్లీ కొన్ని వస్తువులని తయారు చేసి అమ్ముకోవడం. 

ఇప్పటికీ, కొన్ని కోట్ల కోట్ల "వాటర్ బాటిళ్లూ"; "కూల్ డ్రింక్ బాటిళ్లూ"; కాఫీ, టీ, మంచినీళ్ల గ్లాసులూ; ప్లాస్టిక్ తోనే తయారవుతున్నాయి. ఇంకా, వాల్ మార్ట్, స్పెన్సర్స్, పీటర్ ఇంగ్లండ్, పార్క్ అవెన్యూ, వాన్ హ్యూసెన్ లాంటివాళ్లూ, బట్టల షాపులవాళ్లూ పెద్ద పెద్ద (పైన తాళ్లతోసహా) ప్లాస్టిక్ సంచులలోనే వాళ్ల వస్తువులని కొనుగోలుదార్లకి ఇస్తున్నాయి! (మన చందనా బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్, ఇంకా చిన్న పట్టణాల్లోని బట్టల షాపుల వాళ్లూ--రెండు కర్రలతో, బిగ్ షాపర్ అనబడే--గోగునార, జనపనార సంచులని ఇచ్చేవి. ఇప్పుడు అవి కూడా మానేశాయి అనుకుంటా).

ఇంక, పరుపులూ, దిళ్లూ నించి, ఎఫ్ ఎం సీ జీ లవరకూ, ఎలెక్ట్రానిక్ వుత్పత్తులవరకూ అన్నీ యెంతెంత పెద్ద ప్లాస్టిక్ కవర్లలో అమ్మబడుతున్నాయో అందరికీ తెలుసు! ప్రతీ బడ్డీ కొట్టులోనూ దండలు, దండలుగా వ్రేళ్లాడే వక్కపొడి, గుట్కా (ఈమధ్య సుప్రీం కోర్టు వీటిమీద కళ్లెర్రజేసింది!) షాంపూ, కేశతైలం, లేస్, బింగో, హల్దీరామ్‌స్, ఇంకా స్థానిక వుత్పత్తులు--పచ్చళ్లూ, అప్పడాలూ, జంతికలూ, చెగోడీలూ, పప్పుచెక్కలూ--లాంటివాటిగురించి చెప్పనఖ్ఖరలేదు.

మరి, 20 మైక్రాన్లో యెంతో వున్న సంచులు చేసుకున్న పాపం యేమిటీ?

ఇక్కడో చిన్న లెఖ్ఖ--ఒక పచ్చి అరటిపండు ముగ్గవేస్తే, రెండోరోజుకి (అంటే ఒకరోజులో) పండిపోతుంది. మరి ఓ గోదాములో లక్ష పచ్చి అరటి పళ్లని ముగ్గవేస్తే, అవి యెన్నాళ్లకి పండుతాయి? మామూలు లెఖ్ఖ ప్రకారం లక్ష రోజులేకదా?

........మిగతా మరోసారి.

Monday, February 21

'సీ' నియర్లు



ముగ్గురు ముసలి మూర్ఖులు

ఒకళ్ల రహస్యాలొకళ్లు భలే బయట పెట్టేసుకొంటారు--ఆ ముగ్గురూ!

ఓ సారి ఒకాయన రష్యాలో అధ్యక్ష భవనం ముందర నుంచొని, గట్టిగా, "బ్రెజ్ నెవ్ వట్టి మూర్ఖుడు!" అని గట్టిగా అరిచినందుకు, 1+15 సంవత్సరాలు జైలు శిక్ష వేశారట. అలా యెందుకు అని అడిగితే, అధ్యక్షుణ్ణి తిట్టినందుకు ఒక సంవత్సరం, జాతీయ రహస్యాన్ని బయటపెట్టినందుకు 15 సంవత్సరాలూ అని జవాబిచ్చారట!

అలాగ--మొన్నోసారి కాకా "సోనియా షుడ్ గో" అని అని కరాఖండీగా చెప్పేశాడు. 

వెంటనే, కేకే, ఆయన నోట 'వినరాని మాటలు' వినవలసి వచ్చింది అనీ, ఆయన 'యేమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియని స్థితిలో' మాట్లాడారు అనీ, 'కన్‌ఫ్యూజ్డ్, డిస్టర్బ్ డ్ మైండ్ తో' వున్నట్టు కనిపిస్తోంది అనీ, 2-3 యేళ్లక్రితం కేవీపీ సోనియాకి డబ్బుల మూటలు పంపిస్తే, ఆయన 'అప్పుడే యెందుకు మాట్లాడలేదు?' అనీ, చెరిగేశాడు.

ఇంకోడు--వీ హెచ్, 'రాష్ట్రపతి పదవి ఇవ్వలేదనే అక్కసు తోనే' ఆయన అలా మాట్లాడడనీ, 'ముదిమి మీద పడడంతో' అలా మాట్లాడాడనీ, 'బాగా తిని, అబ్బే యేమీ తినలేదు' అన్నట్టు ఆయన వ్యవహారం వుంది అనీ, రాజ్యసభ సభ్యులుగా తామందరూ 'ఏకగ్రీవంగా' యెన్నిక కావడానికి 'చిరంజీవే కారణం' అనీ, ఒక్క యెన్నికలోకూడా పోటీ చెయ్యని తెరాస తో పొత్తుకు 2004 లో 'నువ్వెలా వెళ్లావు?' అనీ, ఇలా మండిపడ్డారు.

నిన్న (20-02-2011), 'గవర్నరు తెలంగాణా ప్రజలని మానసికంగా హింసించబట్టీ', బయట ప్రజలంతా 'సహయనిరాకరణలో తలమునకలై' వీధుల్లో వుంటే, తన ప్రసంగంలో గవర్నర్ కనీసం తెలంగాణా ప్రసక్తికూడా తేవకపోవడమే వాళ్లకి మానసిక హింస అనీ, బయట వున్నవాళ్లకే అంత బాధ వుంటే, లోపల వున్న ఎమ్మెల్యేలకి యెంతబాధ వుంటుందో కదా, అందుకే వాళ్లు 'అలా చేశారు' అనీ, అలా అని వాళ్లని తాను సమర్థించను అనీ, జేపీ సభలో చర్చిల్ ని పొగిడాడు అనీ, అసెంబ్లీ 'గూండాల అడ్డా'గా మారిందని అన్నాడనీ, అందుకే వాళ్లు 'అలా చేశారు' అనీ, మరి గూండాలూ, వెధవలూ వున్న సభలో ఆయన ఎందుకు వున్నారు? అనీ, ఆయనతోపాటు ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావుని కూడా కొట్టినా, దానిగురించి యెవరూ మాట్లాడలేదు అనీ "ఆవేదన చెందారు"ట.

ప్రసంగం అనేది యెవరుచేసినా, తమ వుద్దేశ్యాన్ని సభాసదులకి వెల్లడించడానికే అనీ, తన ప్రభుత్వం అనుసరించబోయే విధానాల గురించిమాత్రమే ఆయన చెపుతాడనీ, అందులో తెలంగాణా గురించో, తోటకూర గురించో మాట్లాడవలసిన అవసరం లేదనీ, అలామాట్లాడాలని కోరే హక్కు యెవరికీ లేదనీ, అంతకు వారం రోజులముందునించీ, తెరాస వాళ్లు గవర్నరు ప్రసంగాన్ని అడ్డుకుంటాము అనీ, ప్రసంగ ప్రతులు చించి వాడి ముఖాన కొడతాము అనీ, ప్రసంగం సాగకుండా బలప్రయోగమైనా చేస్తాము అనీ ప్రకటిస్తున్నారు అనీ, వాళ్ల ప్రజలు చేస్తున్న సహాయ నిరాకరణల్లా, బస్సుల్లో టిక్కెట్టు కొనకుండా ప్రయాణించడమే అనీ, జేపీ యెంతమందికి, యెలాంటివాళ్లకి నాయకుడైనా, గూండాగా మారక తప్పదని హెచ్చరిస్తున్నాననీ, పాలడుగుని కొట్టినా తప్పులేదుగానీ, దాన్ని గురించి మాట్లాడకపోవడం పెద్ద తప్పనీ, ఇలాంటి మాటలవల్ల మీడియా వాళ్లముందూ, ప్రజలముందూ తనకి 'మతిస్థిమితం లేదు' అని ప్రకటించుకుంటున్నాను అనీ--ఆయన మరిచిపోతూంటాడు.

వీటినిబట్టి మనం అర్థం చేసుకోవలసినది యేమిటీ?

"పోవయ్యా! నువ్వేమిటి అర్థంజేసుకొనేది! మేము యేదో మాట్లాడతాం. కోడిగుడ్డుకి ఈకలు పీకడం యెందుకు? రేపు మళ్లీ మేమే ఖండించుకుంటాం.....ఆమాత్రానికి నీ టపా వోటి.....పోవయ్యా" అంటారు ఆ 'త్రయం'. నాకు తెలుసు. 

(వీళ్ల గురించి సోనియాకి యెవరూ సరిగ్గా చెపుతున్నట్టు లేదు. చెప్పివుంటే ఈపాటికి ఒకడు తిహార్ లోనూ, ఒకడు చంచల్ గూడా లోనూ, ఒకడు చర్లపల్లి లోనూ వూచలు లెఖ్ఖపెడుతూ వుండేవారేమో!)

Friday, February 18

సమూల నాశనానికి



శ్రీకారం చుట్టుకొన్నారా?

అజాత శత్రువు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మీద లాఠీ దెబ్బలు పడ్డాయి....ఇందిరా గాంధీ మళ్లీ అధికారం లోకి రావడానికి, బురదల్లో యేనుగు మీద "బెల్చి" కి యాత్ర చెయ్యవలసి వచ్చింది.

ఇప్పుడు మరో జే పీ 'తల మీద ' దెబ్బలు పడ్డాయి. మరి చాణక్యుడు నందవంశ నిర్మూలనానికి శపథం చేసినట్టు, ఈయన "ప్రత్యేక తెలంగాణా అంశాన్ని భూస్థాపితం చేసేవరకూ, కే సీ ఆర్ పార్టీని సమూలంగా నాశనం చేసేవరకూ, నా జుట్టు కత్తిరించుకోను" అని యేమైనా భీషణ ప్రతిఙ్ఞ చేస్తాడా?

ఇప్పటికైతే చెయ్యలేదు. ముందు సంగతి చూద్దాం!

Thursday, February 17

స్కామాయణం



కుంభకోణాలు

ఒక దాని గురించి రాద్దామనుకొంటూండగానే ఇంకొకటి బయటికి వస్తూంది!

కామన్వెల్త్, ఆదర్శ్, 2జీ, ఇప్పుడు ఎస్ బ్యాండ్!

ఇంకా రాష్ట్రంలో--జగనే కాకుండా ఎమార్, ఇప్పుడు దిలారా!

మన్మోహనేమో, అమాయక చక్రవర్తిలా మొహం పెట్టి, మీడియా వాళ్లు ఇలా బయటపెట్టుకుంటూ పోతే, మన దేశం 'స్కాముల దేశం' గా ప్రసిధ్ధికెక్కేస్తుంది--మీరు బయట పెట్టొద్దు అంటున్నాడు!

2జీ లో, రాజాకి 'నిబంధనలకి దూరంగా యేమీ చెయ్యద్దు' అని మాత్రమే సలహా ఇచ్చాడట ఆయన. ఆ తరవాతేమి జరిగిందో తనకి తెలియదట. పైగా మీరందరూ "ఆ శెట్టిగారిలా" మాట్లాడితే యెలా? అని విసుక్కుంటున్నాడట!

ఆ శెట్టిగారి కథేమిటి అంటారా? వెనకటికి "ఇవాళ పొద్దున్నే లక్ష రూపాయల నష్టం" అన్నాడట. అదెలా? అనడిగితే, "నేను కొన్న భాగ్యలక్ష్మీ లాటరీ టిక్కెట్టుకి నిన్న తీసిన డ్రా లో లక్ష రూపాయల బంపర్ ప్రైజు తగల్లేదు. మరి రావలసిన సొమ్ము రాకపోవడం నష్టమే కదా?" అన్నాట్ట.

మన్మోహన్ కూడా, రావలసిన 1,76,000 కోట్లు రాలేదని అదంతా నష్టం అంటే యెలాగ? అని క్రొశ్నిస్తున్నాడు!

మరి ఎస్ బ్యాండుకి సంబంధించి, ఓ రెండు లక్షల కోట్లట! ఆ శాఖకి మంత్రి ఆయనేనట! 2005 నించో యెప్పటినించో ఆ వ్యవహారం జరుగుతుంటే, ఇప్పుడింకా ఆ వొప్పందాన్ని రద్దు చెయ్యాలా వద్దా అని కమిటీలు వెయ్యడం లోనే వున్నారు. పైగా కాంట్రాక్టు రద్దు చేస్తే వాళ్లకి నష్టపరిహారం ఇచ్చుకోవద్దూ? అని ఓ వాదన!

ఇంక దర్యాప్తులూ శిక్షల సంగతి ఆ దేవుడే యెరుగు.

మన రాష్ట్రం విషయానికొస్తే, దిలారా వ్యవహారం లో, బొటానికల్ గార్డెన్, బర్డ్ పార్క్, ఇంకేదో నిర్మిస్తామని, స్టార్ హోటెళ్లూ, మల్టీప్లెక్స్ లూ, పబ్బులూ, బార్లూ కట్టేస్తున్నారట. పైగా యెవడాపుతాడో చూస్తామంటూ, గోతులు తవ్వేస్తున్నారట!

ఈజిప్టు తరహా ఆందోళన మన దేశం లో రాదు యెందుకంటే మనది అల్రెడీ ప్రజాస్వామ్య దేశం కదా! అని కూడా మన ప్రథాన మంత్రే సెలవిచ్చారు. యెంత ధీమానో!  

బాగుంది కదూ?

Tuesday, January 18

మన ఆచారాలు - 10

......భోజనాలు

తంబోలా నడుస్తూండగానే, భోజనాల ప్రహసనం ముగియగానే, పదార్థాలని వొబ్బిడి చెయ్యడం మొదలెడతారు--వంటపుట్టీ, అతని సహాయకులూ, నిర్వాహకుల్లో ఆ శాఖ చూసేవారూ. 

సాధారణంగా పదార్థాల్లో తక్కువ తక్కువగా మిగిలేవి--బాగున్న కూరలూ, బండ పచ్చడీ, అన్నం, సాంబారూ. ఇవన్నీ, చుట్టుప్రక్కలవాళ్లకీ, పాత్రలు తోమడానికీ, ఆకులు యెత్తడానికీ వొప్పుకున్నవాళ్లకీ చెల్లించేస్తారు.

ఇంక, యెక్కువగా మిగిలేవి--పులిహోరా, కాస్త కారం యెక్కువైన కూరా, రసం, పెరుగూ! అవి కావలసిన వాళ్లు వాళ్ల ఇళ్ల దగ్గర దింపేసుకుంటారు--పులిహోరా, వుంటే పెరుగూ మాత్రం ముఖ్య నిర్వాహకుల ఇళ్లకి చేరతాయి. (నిర్వాహకులూ, వాళ్ల కుటుంబాలూ వొళ్లు హూనం అయిపోయి వుంటారు కాబట్టి, ఆ రాత్రికి వాటితో సరిపెట్టుకుంటారు!)

ఇవీ, మిగతా పాత్ర సామానూ, టెంటూ వగైరాలు అన్నీ వ్యానుల్లో సర్దించబడి, ఆ తోట ఖాళీ చెయ్యబడేసరికి రాత్రి 8.00 అవుతుంది. 

వ్యానులూ, నిర్వాహకుల వాహనాలూ బయలుదేరతాయి--వీలైతే మళ్లీ యేడాది వస్తామేం? అని తోటకి టాటా చెపుతూ.

మర్నాడు, మిగిలిన బహుమతుల వస్తువులూ, సంభారాలూ తిరిగి ఇచ్చేసి, వాళ్ల ఎకవుంట్లు సెటిల్ చేసి, లెఖ్ఖలు చూసుకొంటే, కటా కటిగా సరిపోతాయి వసూలు చేసిన డబ్బులు. పదో పరకో పడితే, నిర్వాహకులే వేసుకొంటారు, మిగిలితే, మళ్లీ సంవత్సరానికి బ్రాటోవరు.

ఇళ్లకి వెళ్లేవాళ్లు "చాలా బాగా జరిపించారండీ!" అంటూ ఇచ్చే సర్టిఫికెట్ కన్నా నిర్వహకులకి కావలసిందేముంటుంది?