Thursday, March 27

మా కొత్త కాపురం - 2


నేనూ, నా రాక్షసి

భోజనాలసంగతలా వుంచితే, విజయవాడ జీవితం చాలా బాగుండేది. 

మా గాంధీనగర్ బ్రాంచి లో నాతోపాటు కొత్తగా చేరినవాళ్లు (కొద్దిగా ముందూ వెనకా) మణి అనే అమ్మాయీ, లక్ష్మీనారాయణ, రమణ, సోమయాజులు, కనకరత్నం అనే ఓ అమ్మాయి, ఉదయ శంకర్ అనే ఓ ప్రొబేషనరీ ఆఫీసరు. సీనియర్లు కవుంటర్లు చూసుకుంటూంటే, ఆ ప్రక్క సీట్లలో మమ్మల్ని కూర్చోబెట్టి, పని నేర్చుకునే అవకాశం కలిగించేవారు. సీనియర్ ఆఫీసర్ చౌదరి గారయితే, "ఇది బ్రాంచి కాదు ప్రొబేషనర్స్ ట్రెయినింగ్ కాలేజ్" అంటూ గంటకోసారి బహిరంగంగా గట్టిగా విసుక్కొనేవారు.

ముఖ్య విషయం యేమిటంటే, సినిమా డిస్త్రిబ్యూటర్ ల ఆఫీసులన్నీ గాంధీనగర్ లోనే వుండి, వాళ్ల ఎకవుంట్లన్నీ మా బ్రాంచి లోనే వుండేవి. సినిమావాళ్ల ఎకవుంట్లన్నీ మద్రాసులో మా టి నగర్ బ్రాంచి లో వుండడంతో, రోజూ టీ టీ ల ద్వారా కొన్ని లక్షలు (ఒక్కొక్కళ్లూ 1 నుంచి 5 లక్షలు) రోజూ పంపిస్తూ వుండేవారు. దానికోసం బస్తాలకొద్దీ రకరకాల నోట్లు జమ చేసేవారు. వాళ్లకి చేసిన సర్వీసుకి సంతోషించి, కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలకి మొదటిరోజు, మొదటి ఆట టిక్కెట్లు ముందే మాకు యెన్ని అడిగితే అన్ని ఇచ్చేసేవారు. దాంతో, ఆ వూళ్లో వున్న ఇతర బ్రాంచీలవాళ్లు కూడా మాకు ఫోన్లు చేసి మరీ రిజర్వు చేసుకొనేవారు. ప్రతీ కొత్త సినిమాకీ 20 నుంచి 30 టిక్కెట్లు వుండేవి మా బ్యాంకు వాళ్లవి. 

గవర్నర్ పేట బ్రాంచిలో ప్రసాద్, రాజబాబు కూడా మా క్లోజ్ ఫ్రెండ్స్. ఇంక సినిమాహాల్లోకి వెళ్లగానే, మారాజబాబు తన పని ప్రారంభించేవాడు. మేం యెవరు చెప్పగానే అన్ని టిక్కెట్లూ యెప్పటికప్పుడు చెపుతూండడంతో, సీట్లు నాలుగోచోటా, ఐదో చోటా, ఇంకొన్ని ఇంకోచోటా, వేరే వేరే వరసల్లో వచ్చేవి. దాంతో, మా పక్క సీట్లవాళ్లని బతిమాలి, సీట్లు మార్పిస్తూ, మా వాళ్లందరినీ ఒకే వరసలో కూర్చోబెట్టే సరికి అరగంట పట్టేది. "ఇంకో అరగంట టైమిస్తే, మీ సత్యనారాయణపురం వాళ్లందరినీ ఒక వరసలోకి చేర్చేగలను" అంటూ కాలరెగరేసేవాడు.

రెండు మూడు వారాలయ్యేటప్పటికి, మొదటిరోజే యెగబడని వాళ్లకి పాస్ లు పంపించేవారు. ఒక్కో పాస్ మీదా నలుగురు వెళ్లిపోవచ్చు. అలా వెళ్లడానికి వీలు పడని వాళ్లు అవి మళ్లీ మాకు ఇచ్చేసేవారు. మేము మళ్లీ తయార్. (ఇప్పుడు ఇలాంటి వాటిని కూడా లంచాలు అంటారేమో).

నాకు అంతకు ముందు సినిమాల మీద అంత వ్యామోహం వుండేదికాదు గానీ, కొత్త వుద్యోగం, కావలసినంతా సమయం, అదే ముఖ్యమైన వినోదం కావడంతో, అందరితోపాటే నేనూ. అందరిలోకీ ముందుగా పెళ్లి చేసుకున్నవాణ్ని నేనే. చెప్పద్దూ, మా ఆవిడకి చిన్నప్పటి నుంచీ ప్రతీ సినిమా చూడడం అలవాటు అని తరవాత తెలిసింది. ఇప్పటికీ పాత సినిమాలలో చెలికత్తెల వరకూ అందరిపేర్లూ చెప్పేస్తుంది. గొంతు అంత బాగుండదుగానీ, పాటలు వరస యేమాత్రం తప్పకుండా పూర్తిగా పాడేస్తుంది. 

ఇంకేముంది......దొందూ దొందే అన్నట్టుగా సాగేవి మా వినోద కార్యక్రమాలు.

ఇంకొంత మరోసారి.

Wednesday, March 19

మా కొత్త కాపురం



నేనూ, నా రాక్షసీ......

"పోదురూ బడాయి. అందరూ నిజమనుకోగలరు. ఈ వయసులో కొత్తకాపురం యేమీటీ?" అంటూ ముసిముసిగా బుగ్గలు నొక్కుకొంది నా రాక్షసి.

"మొన్ననే కదా మన మూడో హనీమూన్‌ గురించి వ్రాశాను. మరేం ఫర్వాలేదులే. అయినా నేను వ్రాస్తున్నది మన  'అప్పటి' కొత్త కాపురం గురించిలే". అన్నాను.

"అయినా ఆ శీర్షిక యేమిటీ" అంది కొరకొరా చూస్తూ. 'అదంతేలే' అని నీళ్లు నమిలేశాను. 

అప్పుడెప్పుడో శ్రీశ్రీ ఆరుద్ర గురించి చెప్పినట్టు, 'రాక్షసి' అంటే మా ఆవిడ ఒప్పుకోదు, నా భార్యా 'మణి' అంటే నేనొప్పుకోను. ఈ తగాదా యెవరు తీర్చేను!

1975 నుంచీ నిత్యనూతనంగా (అంటే యెప్పటికప్పుడు పరగడుపే) సా......గుతున్న మా కొత్తకాపురం సంగతులే వ్రాస్తున్నవి.

విజయవాడలో తను కాపురానికి వచ్చేసరికి, అవడానికి మా అన్నయ్యా, వదినా తో కలిసే అయినా, వాళ్లు యెక్కువగా వుండేవారు కారు. దాంతో మా 'ప్రత్యేక' కాపురం "గువ్వా గూడెక్కె, రాజూ మేడెక్కె".

ఉదయం యేదో టిఫిన్‌ చేసి, వేడివేడి బెడ్ కాఫీతో నిద్రలేపితే, టిఫిన్‌ తిన్నాక, మరోసారి కాఫీ త్రాగి, 7.45 కల్లా బ్యాంకుకి బయల్దేరి, 8.00 కి నా సీట్లో వుండేవాడిని. మళ్లీ లంచి కి 12.30 కి బయలుదేరి, ఇంట్లో భోజనం చేసి, కాసేపు విశ్రాంతి. మళ్లీ 3.00 కి బ్రాంచి. (అది షిఫ్ట్ బ్రాంచి. సాయంత్రం 5.30 వరకూ వుండేది.)

అప్పట్లో గ్యాస్ కొత్త. మా యింట్లో "నూతన్‌" స్టవ్వే. నేను లంచికి ఇంటికి చేరేసరికి, వేడివేడిగా అన్నం, పప్పూ, కూరా, చారూ వడ్డించేది. అందుకోసం నిమిషాలతో సహా ప్లాను వేసుకొనేదనుకుంటా. కంచం లో వడ్డిస్తూ, "ఐదువేళ్లూ దోపెయ్యకండి. వేడి" అంటూ వార్నింగూ. ప్రక్కనే టేబులు ఫ్యాన్‌ తిరుగుతున్నా, నెమ్మదిగా వూదుకుంటూ నేను పప్పు కలుపుకొని తినేసరికి, తను మజ్జిగలోకి వచ్చేసేది! తనకి అంత వేడి కావాలి మరి! 

తరవాత గ్యాసూ, కుక్కరూ వచ్చిన తరవాతకూడా, అన్నీ కుక్కర్లోనే పెట్టేసి, వేడి వేడిగా వడ్డించవలసిందే.

నేను సరదాగా యెలాగైనా తన భోజనం ఆలస్యం అవ్వాలని ప్లాన్లు. 

నేనసలే మితభాషిని. "అన్నం పెట్టు" అనడానికి 'అన్నమెట్టు' ని షార్ట్ కట్ లో ".....మెట్టు" అనీ, "నెయ్యి వెయ్యి" అనడానికి 'నెయ్యెయ్యి'  ని "...యెయ్యి" అనీ, "నూనె వెయ్యి" అనడానికి ".......నెయ్యి" అనీ, "కూర వెయ్యి" అనడానికి ".....రెయ్యి" అనీ, "చారొయ్యి" అనడానికి ".....రొయ్యి" అనీ, "పచ్చడెయ్యి" అనడానికి "....డెయ్యి" అనీ, "పులుసొయ్యి" అనడానికి ".....సొయ్యి" అనీ, "మజ్జిగ పొయ్యి" అనడానికి "....గొయ్యి" అనీ, "పెరెగెయ్యి" అనడనికి "......గెయ్యి" అనీ........ఇలా ఒకదానికీ మరోదానికీ చిన్న తేడాలతో కన్‌ఫ్యూజ్ చేసేవాడిని. 

మొదట్లో తాను కూడా ఎంజాయ్ చేస్తూవుండేది గానీ, రాను రానూ నా కుట్రని కనిపెట్టేసింది. నా వొకాబులరీలో ఎక్స్ పర్ట్  అయిపోయి, తన భోజనం మాత్రం ఒక్కనిమిషం ఆలస్యం కాకుండా చూసుకొంటూనే, నాకు వడ్డించేది. 

ఇలాక్కాదు అని, 'నెయ్యి' అని, తను నూనె వడ్డించగానే, "అదేమిటి? నేను నెయ్యి అంటే నువ్వు నూనె వేస్తావేమిటీ" అని క్రాస్ ఎక్జామినేషన్‌ మొదలెట్టేవాణ్ని. దానికి సమాధానం చెప్పేసరికి కొంత కాల నష్టం. దాంతో, "ఇంక నేను చెప్పను బాబూ" అనేది. చెప్పకపోతే, నేను తినడం మానేస్తాను అని నా మారాం. కొన్నాళ్లు కొనసాగింపు. 

ఇంకొన్నాళ్లకి "మీరు తినకపోతే మానెయ్యండి బాబూ, నా అన్నం చల్లారిపోతుంది" అనేదాకా వచ్చించి. నేను తక్కువ తిన్నానా. "చెప్పేవరకూ నిన్నూ తిననివ్వను" అని తన చేయి పట్టేసుకునేవాణ్ని. ఇంక తప్పక నేను ప్రశ్న వెయ్యకముందే తను వ్యాఖ్యానం చెప్పేసి, తను తినెయ్యడం మొదలెట్టింది! ఇంక ఆఖరి అస్త్రం కూడా అయిపోవడంతో నేను పని కానిచ్చేసేవాడిని. 

కానీ, ఓ వార్నింగ్ మాత్రం అప్పుడే ఇచ్చేసింది. "మీరేం వేషాలు వేసినా మనిద్దరం వున్నప్పుడే. మూడో మనిషి ముందు.......జాగ్రత్త!" అని.

తరవాత మాపిల్లలు పుట్టాక కూడా, ఇప్పటికీ అదే మా మధ్య లక్ష్మణ రేఖ. యెవరిముందయినా సరదాలూ, వేళాకోళాలూ బంద్. ఇంకేం చేస్తాము? యేకొన్ని నిమిషాలో తప్ప, యెప్పుడూ యమ సీరియస్.

ఇప్పుడిప్పుడు, తన పని కొంత తగ్గించుకొనేందుకు పప్పూ కూరా వగైరాలు కొంచెం ముందు వండేసి, అన్నం మాత్రం కుక్కర్లో కరెక్టుగా తినడానికి 20 నిమిషాల ముందు మాత్రమే పడేస్తుంది. 

నేనూ ఓ ట్రిక్ నేర్చుకోక తప్పలేదు. పప్పూ అవీ వేడిగానే వున్నా, వేళ్లు కాలేంత కాకపోవడంతో, అన్నం వడ్డించగానే దానిమీద పప్పు పరిచేసి, చల్లబరిచేసుకుంటాను. 

అలా మా అన్యోన్య భోజనాలు కానిస్తున్నాము.

..................మరి కొంత మరోసారి.