Monday, October 25

మన ఋణ వ్యవస్థ - 10

"సూక్ష్మ" ఋణాలు - 10


"ఆరంభింపరు......" అనే సుభాషితాన్ని మననం చేసుకొని, ఈ వ్యాస పరంపరని ముగిద్దామనే నిర్ణయానికొచ్చాను. (నాకేదో విఘ్నాలొచ్చాయని కాదు--ప్రారంభించినదాన్ని పూర్తి చెయ్యలి కదా అని.)

రెండు మూడు విషయాలు వ్రాసి ముగిస్తాను.

"ఇండియాలో జనాలు యెక్కువ తినేస్తున్నారు--అందుకే........" అని ఒబామా అన్నాడంటే, వాడిని తిట్టిపోశాము.

రాశ్శేఖర్రెడ్డి, "దొడ్డు బియ్యం సన్న బియ్యం కన్నా ఆరోగ్యానికి మంచివి, సన్న బియ్యం రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి, అందరూ దొడ్డు బియ్యమే తినండి" అంటే, వాణ్ని కూడా వదలలేదు.

ఇప్పుడు అహ్లువాలియా "జనాలదగ్గర యెక్కువ డబ్బు వుంటే, ప్రతిరోజూ కూరగాయలు కొంటారు, పాలూ, పాల వుత్పత్తులూ యెక్కువగా వినియోగిస్తారు--అందుకే ఆహర ద్రవ్యోల్బణం 16.37 శాతానికి పెరిగింది--ఇప్పుడు కొంచెం తగ్గింది" అంటున్నాడు.

"గత మూడు నెలలుగా రేషన్ బియ్యం అందరూ తీసుకొంటున్నారు (అంతకు ముందు డీలర్లకే వదిలేసేవారట); మార్కెట్ లో సన్న బియ్యం సరఫరా బాగుండడంతో రేట్లు పెరక్కుండా వున్నాయి, పైగా తగ్గుతున్నాయి" అంటూ ప్రభుత్వాధికారులూ, పత్రికలూ అంటున్నారు!

--అంటే, యేమి జరుగుతోందో చిన్నపిల్లవాణ్ని అడిగినా చెపుతాడు! అవునా?

మన రిజర్వ్ బ్యాంక్ యేర్పడ్డాకా, స్వతంత్రం వచ్చాకా, అనేకమంది దిగ్దంతులు గవర్నర్లు గా పని చేశారు--ఎల్ కే ఝా నుంచీ, మన్మోహన్ సింగ్ నుంచీ, బిమల్ జలాన్ ల వరకూ! కానీ ఇప్పుడు వున్నంత దుస్థితిలో ఇంతకు ముందు లేదు--క్రమ క్రమంగా నెట్టివెయ్యబడింది! (పాపం వేణుగోపాల రెడ్డీ, దువ్వూరి సుబ్బారావు ల తప్పేమీ లేదండి!--పాపం అంతా సో కాల్డ్ "అధిష్టానాలదే"--యెక్కువగా కాంగీల!)

లేకపోతే, ఆర్బీఐ కి "లీజింగ్ & ఫైనాన్స్" సంస్థలమీదా, "ఎన్ బీ ఎఫ్ సీ" ల మీదా, "బ్యాంకుల" మీదా, వడ్డీ రేట్ల మీదా, రెపో, రివర్స్ రెపో, రేట్లమీదా, ఎస్ ఎల్ ఆర్, సీ ఆర్ ఆర్ లమీదా, దేనిమీదా కంట్రోలు లేదు!

ఇక, అవసరం లేకపోయినా, తమతోటివాళ్లతో అప్పులు తీసుకున్న స్వ స సం సభ్యులు, ఆ డబ్బులతో బంగారాలు కొనేశారనుకున్నాం కదా. మరి ఆ బంగారాలు యేమయ్యాయి? ఆత్మహత్యలెందుకు? అంటే, వాటిని సూ ఋ సం ల అప్పులు తీర్చడానికి, ముథూట్ ఫైనాన్స్, మణప్పురం గోల్డ్ లలో తనఖా పెట్టారు!

(నేను అడపాదడపా ఈ సంస్థల గురించి హెచ్చరిస్తూనే వున్నాను! మన దేశం లో కాంగ్రెస్ కూడా పుట్టక ముందు నించీ ఇవి "బిజినెస్" చేస్తున్నామని చెప్పుకొంటున్నాయి! యేం బిజినెస్ అని నన్నడక్కండి--యెందుకంటే మన రిజర్వ్ బ్యాంకు తో సహా మనమెవరూ పుట్టలేదు అప్పటికి! మరి ఇప్పుడు, గత రెండేళ్లుగా--పత్రికల్లో మొదటి పేజీలలో ఓ మూల చిన్న ప్రకటన వేసే స్థాయి నుంచి ఇప్పుడు సినీ యాక్టర్లతో ఓ పావుపేజీ ప్రకటనలు ఇచ్చే, టీవీల్లో వార్తలు కూడా "స్పాన్సర్" చేసే స్థాయికి యెలా యెదిగాయో, అనేక బ్రాంచీలని యెలా యేర్పాటు చేసుకొని, వ్యాపారాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకున్నాయో--యెవరికీ తెలియదు, యెవరూ పట్టించుకో లేదు!)

ఇక మన రా నా లు మాత్రం గత ఆరేళ్లు గా సామాన్య జనాన్ని--

"దొరికిన చోట్లల్లా అప్పులు చెయ్యండి, కట్టలేము అని చేతులెత్తెయ్యండి--తరవాత ప్రయోగించడానికి 'మాఫీ అస్త్రం' మేము సిధ్ధం చేస్తాం"!

--అని జనాలని రెచ్చగొట్టడం లో కృతకృత్యులయ్యారు! ఇక ఈ వాగ్దానాలు వోట్లు గా మారతాయో లేదో--కాలమే నిర్ణయించాలి! 

సర్వే జనాస్సుఖినో భవంతు!

Saturday, October 23

మన ఋణ వ్యవస్థ - 9

"సూక్ష్మ" ఋణాలు - 9

ఓ పక్క సూ ఋ సంస్థలగురించి గోల జరుగుతూండగానే, ఇంతకు ముందు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ ఎల్ బీ సీ) లో నిర్దేశించిన మేరకు, మహిళా స్వ స సం లకి ఋణాలు ఇవ్వడానికి "ఆంధ్రా బ్యాంకు" ముందుకు వచ్చి, "గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ" (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవెర్టీ--ఎస్ ఈ ఆర్ పి)--(ఇది ప్రభుత్వ సంస్థో,  ఎన్ జీ వో నో తెలీదు) తో 12-10-2010 న ఓ వొప్పందం కుదుర్చుకుందట!

ఈ "సెర్ప్" పోషిస్తున్న పాత్ర యేమిటో స్పష్టం కాలేదు కానీ, "గతంలో తీసుకున్న ఋణ వాయిదాలని స్వ స సం లు యెప్పటికప్పుడు చెల్లించే విధం గా తాను చూస్తాను" అని హమీ యిచ్చిందట.

ఈ సంస్థ ఒక సర్వే నిర్వహించి, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం లో 4.23 లక్షల స్వ స సం లు రూ.7,698 కోట్ల ఋణం పొందడానికి "అర్హులు" అని తేల్చి, ఆ జాబితాని బ్యాంకులకి అందజేసిందట. వీటిలో, ఆంధ్రా బ్యాంకు 64,271 సంఘాలకి రూ.1,238.86 కోట్లు "ఇవ్వాల్సి" వుందట. ఈ మేరకు వొప్పంద పత్రం మీద "సంతకాలు" చేసిందట.

కొన్ని బ్యాంకులతో ఇలాంటి వొప్పందాలు ఇప్పటికే జరిగితే, ఇంకొన్నిటితో జరగబోతున్నాయట!

ఆగస్టునాటికి రూ.2,200 కోట్లు సంఘాలకి అందాయని "సెర్ప్ అధికారులు" చెప్పారట.

14-10-2010 న సూ ఋ సంస్థల గురించి ప్రత్యేక ఎస్ ఎల్ బీ సీ సమావేశం జరగనుండగా, 12-10-2010 న ఈ బ్యాంకు ఈ వొప్పందం చేసుకోవడం లో మతలబేమిటో మరి.

ఇక మొన్న ముఖ్యమంత్రితో సమావేశం లో సూ ఋ సం ల బాధితులకు వాటినుంచి బయటపడడానికి సాయం చేస్తామని ఆవేశ పడ్డ బ్యాంకులకి, వాస్తవాలు వాటి ముఖం మీద కళ్లెర్రజెయ్యగనే, కాళ్లూ చేతులూ చల్లబడ్డాయట!

వాళ్లని బయట పడెయ్యాలంటే, 10 వేల కోట్ల పైమాటగా కొత్త ఋణాలు ఇవ్వాలనీ, అక్కడితో ఆగకుండా, ఒకళ్లకిస్తే అనేకమంది బ్యాంకులమీద దాడి చేసే అవకాశాలున్నాయనీ గ్రహించి, "ఇది జరిగేపని కాదు" అని తేల్చి చెప్పేశారట ప్రభుత్వానికి. హమ్మయ్య.

రిజర్వ్ బ్యాంకు కమిటీని కూడా యేర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది--చూద్దాం యేమి జరుగుతుందో!

Thursday, October 21

మన ఋణ వ్యవస్థ - 8

"సూక్ష్మ" ఋణాలు - 8


ఇక, ఈ సూ ఋ సంస్థలు "బ్లాంకు చెక్కులు" యెందుకు తీసుకుంటాయి? అవి పూర్తి చేసి బ్యాంకులలో వేసి, తిరిగి వస్తే వాటికి యేమిటి కలిసొచ్చేది? అంటే......

ప్రస్తుతం బ్యాంకులకి సెలవలెప్పుడో నిర్ణయించడానికి మాత్రమే వుపయోగిస్తున్న "నెగోషియబుల్ ఇన్స్త్రుమెంట్ ఆక్ట్" వల్ల ఇంకా వూడిపోని రెండో వుపయోగం ఇదొకటి. యెవరైనా తమ ఖాతాలో సరిపోయిన సొమ్ము లేకుండా, చెక్కులు జారీ చేస్తే, అవి బ్యాంకులో 'బౌన్స్' అయితే, వెంటనే వారిమీద కోర్టులో కేసు వేసి, తమకి రావలసిన మొత్తాన్నీ, పరిహారాన్నీ కూడా పొందవచ్చు.

(అడపాదడపా సినిమా రంగం లోనూ, కొంతమంది సెలెబ్రిటీల విషయం లోనూ ఇలాంటి కేసుల గురించీ, అరెస్టులగురించీ పేపర్లలో చదువుతూ వుంటాం!)

అందుకోసమే--ఈ అవకాశం యెప్పటికైనా అట్టేపెట్టుకోడానికి--బ్లాంక్ చెక్కులు. కానీ, ప్రతీ బ్యాంకులోనూ, చిన్న శాఖలలోసైతం రోజూ 10 చెక్కులైనా తిరిగి వెళుతూంటాయి బౌన్స్ అయి. రాష్ట్ర వ్యాప్తం గా యెన్ని కోర్టులలో, యెంతమంది మీద యెన్ని లక్షల కేసులు నమోదు చెయ్యగలరు ఈ సూ ఋ సంస్థల వాళ్లు? వాటికోసం వాళ్లకీ, ప్రభుత్వానికీ యెంత ఖర్చు అవుతుంది?

అసలే కోర్టులు "పెండింగ్ కేసులు" పేరుకుపోతున్నాయి అని, ముఖ్యమైన కేసులు కూడా వెంటనే నమోదు చేసుకొని నెంబర్లు ఇవ్వడానికి నీళ్లు నములుతున్నాయి! లాయరు రోజూ ప్రయత్నిస్తుంటే, ఏ పది రోజులకో నెంబరవుతున్నాయి! ఇంకెక్కడి చెక్ బౌన్స్ కేసులు!
  
ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఈ చెక్ బౌన్స్ కేసుల్లో వింతలు జరిగేవి--బ్యాంకు తన అధికార ముద్రతో, "సరిపోయే నగదు లేదు" అనేకారణం తో చెక్కులు తిప్పి పంపినా, లాయర్లు కాలయాపన కోసం జడ్జీల చేత ఆ మేనేజర్లకి సమన్లు ఇప్పించేవారు! అక్కడనించి, ఆ మేనేజర్లు తమ పన్లన్నీ ప్రక్కనబెట్టి, ఆ కోర్టు వున్న వూరికి అధికార హోదాలో ప్రయాణించి, అక్కడ రోజంతా పడిగాపులు పడి, మళ్లీ తిరిగి వచ్చి ద్యూటీలో చేరడానికి కనీసం 3 రోజులు పట్టేవి! తరవాత్తరవాత ఇలా సమన్లు జారీ చెయ్యడం మానేశారు జడ్జీలు.

ఈ విధం గా యేడాది క్రితానికే రాష్ట్రం లోని స్త్రీలందరూ ఒక్కొక్కళ్లూ అనేక సంఘాల్లో సభ్యులై, అనేక సంఘాలూ బ్యాంకుల్లో తీసుకున్న అప్పుల్ని పంచుకొనీ, బంగారాలు కొనుక్కొనీ, వైభవం గా శుభ/అశుభ కార్యాలు జరుపుకునీ, గుళ్లనీ, దేవుళ్లనీ, దేవతలనీ భక్తితో వైభవం గా అర్చించీ, రేషను బియ్యాన్ని డీలర్లకి వదిలేసీ, మళ్లీ పొదుపుకీ, అప్పు తీర్చడానికీ సూ ఋ సంస్థల దగ్గర మళ్లీ వ్యక్తిగతం గా అప్పులు చేసీ, మళ్లీ అవి తీర్చడానికి ఇంకో సూ ఋ సంస్థ దగ్గర అప్పులు చేసీ, పీకల మొయ్యా ఋణ వూబిలో కూరుకు పోయారు.

(ఇంకా బ్యాంకర్లు కొత్త గ్రూపులని గుర్తిస్తూనే వున్నారు--తమ టార్గెట్ల కోసం!)

ఇక గత పదేళ్లుగా, స్త్రీలకి వర్తింపజేసిన ఈ సూత్రాన్నే పురుషులకి కూడా వర్తింపజేసి, యువజన సంఘాలూ, సేవా సంఘాలూ, రైతుమిత్ర సంఘాలూ యేర్పరచుకొని, యే హామీ లేకుండా ఒక్కో సంఘానికీ యేకంగా పదేసి లక్షలు (ఒక్కోడికీ ఓ లక్ష) ఇవ్వాలని ప్రభుత్వంచేత సూచనలు జారీ చేయించుకొని, బ్యాంకుల మీద పడ్డారు గానీ, బ్యాంకులు వీళ్లని శక్తివంతంగా నిరోధించగలిగాయి. లేకపోతే, ఈ పాటికి కొన్ని లక్షల కోట్లకి ములిగిపోయి వుండేవి. 

(మెజారిటీ యువజన సంఘాలు యే వ్యాపారం కోసం అప్పు అడిగేవో తెలుసా? మట్టితో ఇటుకలు చేసే వ్యాపారం! వాళ్ల పెట్టుబడీ, హామీలు లేకపోగా, వ్యాపారం లో కూడా ఆస్థులు (స్టాక్, యంత్రాలూ ఇలాంటివి కూడా) లేకుండా, రేపు అప్పు తీరక పోతే బ్యాంకు వాళ్లు పీక్కోడానికి వాళ్ల నెత్తిమీద జుట్టు కూడా లేకుండా వీళ్లకి లక్షల్లక్షలు పందేరం చెయ్యమని 'గవుర్నమెంటోడి ' సూచన! యెంత బాగుందో!)

ఇప్పుడు గత మూడేళ్లుగా, కనీసం "రైతు మిత్ర" గ్రూపులకైనా (కౌలు రైతుల తో యేర్పడేవి) గ్రూపు గ్యారంటీ మీద ఒక్కో గ్రూపుకీ కనీసం 5 లక్షలైనా బ్యాంకులచేత ఇప్పించాలని రా నా ల ప్రయత్నాలు!

ఈ గ్రూపుల గురించి మరోసారి.   

చాలామంది గమనించని ఇంకో చిన్న విషయం కూడా బయటికి వచ్చింది--పత్రికలలో.

"అవసరమైనప్పుడు" బ్యాంకులు ఋణాలు అందించడం లేదు అనీ, "సెప్టెంబరు; డిసెంబరు; మార్చి" నెలల్లోనే ఇస్తున్నారు అనీ, వాటికోసం "చాలాసార్లు"  తిరగాల్సి వస్తోంది అనీ!

దీని వెనకున్న "మతలబు" మరోసారి.

Monday, October 18

మన ఋణ వ్యవస్థ - 7

"సూక్ష్మ" ఋణాలు - 7

ఇందిరా గాంధీ ప్రభుత్వం లో ఆర్థికమంత్రి మొరార్జీ దేశాయ్ బ్యాంకుల జాతీయం కన్నా ముందు, 1960 లలో "బ్యాంకింగ్ సోషల్ కంట్రోల్ ఆక్ట్" (ఈ చట్టం సరిపోతుంది, బ్యాంకులని జాతీయం చెయ్యఖ్ఖరలేదు--అనే పాయింట్ మీదే, ఇందిరతో విభేదించి, మొరార్జీ 1969 లో తన పదవి కి రాజీనామా చేశాడు) తెచ్చిన ఫలితం గా, రిజర్వ్ బ్యాంకు దేశం లోని బ్యాంకులకి కొన్ని నిబంధనలు విధించింది--వాటి మొత్తం ఋణాలలో "ఇంత శాతం" ప్రాధాన్యతా రంగానికి (వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, రోడ్డు/నీటి రవాణా రంగాలు, రిటెయిల్ వ్యాపారాలు--ఇలా) ఇవ్వాలనీ, అందులో తిరిగి "ఇంత శాతం" వ్యవసాయానికి తప్పకుండా ఇవ్వాలి అనీ--ఇలా కేటాయించింది. అలా ఖచ్చితం గా పాటించే బ్యాంకులని బాగా ప్రోత్సహించేది. అందుకని, అప్పటికీ, ఇప్పటికీ ఈ "శాతాలని" ఖచ్చితం గా పాటిస్తున్నాయి మన బ్యాంకులు!

అన్ని బ్యాంకులూ ఈ స్వ స సంఘాలకి ఇస్తున్న ఋణాలని--క్షేత్ర రంగం--ఫార్మ్ సెక్టర్--అంటే వ్యవసాయ ఋణాలుగా చూపిస్తున్నాయి. మొత్తం వ్యవసాయ రంగం కోటా లో ఇంతమేరకు కోత జరుగుతోంది.

ఇక, "ఇందిరమ్మ" పథకం లో మంజూరైన నిధులు అరకొరగా వుండి, ఇళ్లు మొండిగోడలతోనే నిలిచి పోతుంటే, స్వ స సంఘాల సభ్యులకి "బ్యాంకు లింకేజి" క్రింద  ఒక్కొక్కరికీ 20 వేలు అదనం గా మంజూరు చేయమన్నారు. ఇవి "క్షేత్ర రంగం కాని"--నాన్ ఫార్మ్ సెక్టర్--ఋణాలుగా వ్యవహరిస్తారు. అయినా అవి గృహ నిర్మాణానికి ఇస్తున్నవి కాబట్టి, "ప్రధాన్యతా రంగం" గానే పరిగణించబడి, ఆ మేరకి ప్రాధాన్యతా రంగ ఋణాల లో కోత పడుతోంది. వీటికి ప్రభుత్వం చెప్పుకొనే "పావలా వడ్డీ" వర్తించదు!

బ్యాంకు అధికారులు స్వయం గా ఆ లబ్ధిదారులు "ఇందిరమ్మ పథకం" లో వున్నారనీ, ఇల్లు మధ్యలో ఆగిపోయింది అని నిర్ధారించుకుంటేనే వీళ్లకి అదనపు ఋణాలు ఇస్తారు.

మరి వట్టి అంటాడూ--"బ్యాంకు లింకేజీ చాలా ఘోరం గా వుంది" అని. ఆర్డినెన్స్ తరవాత ఈ లింకేజీ ఋణాలు కూడా "విరివిగా" మంజూరు చేయ్యాలంటున్నారు!

ఒక ఇంట్లో, ఒకావిడా, ఇద్దరు కోడళ్లూ, ఇద్దరు కూతుళ్లూ (వాళ్లలో ఒకామె ఇంటరు చదువుతోంది), పక్కింట్లో ఆమె తోడికోడలు, ఆమె కోడలూ, కూతురూ--ఇక్కడికి యెనిమిది మంది అయ్యారు కదా--ఇంకో ఇద్దరు పక్కిళ్లవాళ్లని చేర్చుకొని, ఓ సంఘం స్థాపించుకొని, బ్యాంకుకి అప్పుకోసం వస్తే, ఆ మేనేజరు లోపాలని యెత్తి చూపి ఇవ్వనంటే, "వుంగరాలూ, తెల్లచొక్కలూ, యమహాలూ" వేసుకొచ్చినవాళ్లు ఆయనని "యెందుకివ్వవూ?" అంటూ రచ్చ రచ్చ చేసిన సందర్భాలు వున్నాయి. 

(మామూలుగా కూడా "వ్యక్తులకి" ముఖ్యంగా మధ్య, యెగువ మధ్యతరగతి ప్రజలకి ఇచ్చే ఋణాలని ప్రాధన్యతా రంగం లోనే మంజూరు చేస్తారు--కానీ, "టీజర్ రేట్లు" అనే ముసుగులో, అడిగినవారికల్లా (రియల్ ఎస్టేట్ వ్యాపారులకి కూడా) కొన్నివేల కోట్లు ఋణాలు మంజూరు చేసేస్తున్నాయి--ప్రాధాన్యతా రంగం లో! మరి మన సో కాల్డ్ బ్యాంకింగ్ నిపుణులు--"టిజర్ రేట్లు డిసెంబరు నెలాఖరుదాకా కొనసాగుతాయట" అని ఆనందించేస్తూ వుంటారు.)

మన లోక్ సత్తా జే పీ, 2006 లో బంగ్లాదేశ్ లో యూనిస్ యేర్పాటు చేసిన సూ ఋ వ్యవస్థని పరిశీలించి, "అంతర్జాతీయ సమాజం" నించి "తక్కువ వడ్డీ"కో, గ్రాంటులుగానో తెచ్చి, నిరుపేదలకి "నామ మాత్రపు వడ్డీకి" ఇచ్చే వ్యవస్థ యేర్పాటు చేశారు అనీ, మన రాష్ట్రం లో కూడా కొన్నాళ్లు ఈ వ్యవస్థ బ్యాంకుల ద్వారా చక్కగా జరిగింది అనీ, ఈ సూ ఋ సంస్థల వ్యవహారం "ఓ తప్పుడు నమూనా" అనీ కుండ బద్దలుకొట్టారు.

ఇంకా, 2008 లో ఋణ మాఫీపేరుతో 73 వేల కోట్లు వెదజల్లి, గ్రామీణ పరపతి విధానాన్ని దెబ్బతీశారు--అని కూడా అందరికీ తెలిసిన విషయాన్నే--మరోమారు చెప్పారు!

ఈ విషయం లో యే రైతునైనా కదిలించండి--"యెగ్గొట్టినవాళ్లకి యెదురు డబ్బులిచ్చారు, క్రమం తప్పకుండా కట్టినవాళ్లకి "మొండి" చెయ్యి చూపించారు" అంటారు! (ఇకనించీ మేము కూడా కట్టం అని, అ మాటమీద నిలబడిపోయినవాళ్లు కూడా వున్నారు!)

తక్షశిల రాజు 'అంభి ' తరవాత జాతికి ద్రోహం చేసినవాళ్లలో మొదటివాడు దేవెగౌడ అయితే, రెండోవాడు దేవీలాల్! (ఈ స్థానాలు యెవరిష్టం వచ్చినట్టు వాళ్లు మార్చుకోవచ్చు) వాడు మన దేశం లోని "ఋణ క్రమశిక్షణ" ని తన "మాఫీ" పథకం ద్వారా నాశనం చెయ్యకుండా వుండి వుంటే.....ఇలాంటి పరిస్థితులు దాపురించేవి కాదు దేశానికి!

Sunday, October 17

మన ఋణ వ్యవస్థ

"సూక్ష్మ" ఋణాలు - 6

ఆర్డినెన్సు వచ్చేసింది!

మన బ్యూరోక్రాట్లు (ఈ ఇంగ్లీషు మాటకి సమానార్థకం గా తెలుగు మాట వచ్చినట్టులేదు! పోనీ మన "బుర్రో వాదులు" అని పెట్టుకుందాం--వీళ్లు తమ బుర్రనంతా వుపయోగించి, అందరికీ చక్కగా అర్థమయ్యే చిన్న విషయాన్ని, దాని చుట్టూ తీగలూ లతలూ మెలికలతోటి యెంబ్రాయిడరీ చేసి, మొత్తానికి 'కాంప్లికేట్' చేసేస్తారు కదా! అందుకని) తమ మేధోమథనం సాగించి, వండి వార్చారు ఈ ఆర్డినెన్సుని. 

ఇందులో విషయాలు అందరూ పత్రికలలో చదివే వుంటారు. దీని వల్ల వుపయోగం యెంత? అంటే "మంత్రాలకి చింతకాయలు రాల్తాయా?" అనే ప్రశ్నే!

ఈ సూ ఋ సంస్థల కార్యకలాపాలపై ఆర్బీఐ కూడా ఓ వుపసంఘాన్ని వేస్తున్నాము అని ప్రకటించింది.

మరి ఈ ఆర్డినెన్సు వెనకాల యెంత 'తతంగం' నడిచిందనుకున్నారూ?

పెద్ద బుర్రోవాదులు క్రిందవాళ్లని పరుగులు పెట్టించారు! వాళ్లా పరుగులు పెట్టేది.....నటించారంతే! 

పరుగులెందుకంటే--"మీ యేరియాలో పని చేస్తున్న సూ ఋ సంస్థలెన్ని? స్వ స సం లెన్ని? వాళ్లలో సభ్యులెంతమంది? వాళ్లలో బ్యాంకు ఋణాలు తీసుకున్నదెంతమంది? తిరిగి చెల్లిస్తున్నవాళ్లెంతమంది? చెల్లించలేకపోతున్న వాళ్లెంతమంది? వాళ్లలో యెవరు యెన్ని సూ ఋ సంస్థల్లో యెంతెంత అప్పు చేశారు..............ఇలా 'ముత్యాల ముగ్గు ' సినిమాలో మాడా అడిగినన్ని ప్రశ్నలకీ......వెంఠనే సమాధానాలు పంపించమని తహశీల్దార్లూ, రెండురోజుల్లో అని ఆర్ డీ వో లూ, జాయింట్ కలెక్టర్లూ, వారం లో అని కలెక్టర్లూ, నెలాఖరులోగా అని ప్రభుత్వమూ........ఇలాగన్నమాట!

ఆయనే వుంటే మంగలెందుకన్నట్టు, ఈ సమాచారమంతా మన ప్రభుత్వోద్యోగుల దగ్గర వుంటే, ప్రస్తుత దురవస్తే దాపురించేది కాదు కదా!

ఇప్పుడు సూ ఋ సంస్థలు 30 రోజులలోపల ప్రభుత్వం దగ్గర 'రిజిస్ ట్రేషన్ ' చేయించుకోవాలనీ, అది అయ్యేవరకూ తమ కార్యకలాపాలు సాగించకూడదు అనీ ఆర్డినెన్సు లో మొదటి పాయింటు. పోనీ, ఇప్పటికి వున్న ఇరవై ఒకటో, యాభయ్యో సంస్థలు దరఖాస్తులు రెండురోజుల్లోనే దాఖలు చేస్తే, వెంటనే అనుమతి ఇచ్చేస్తారా? అబ్బే! అలా అయితే బుర్రో వాదులెందుకవుతారు? ఇంకా టైము వుంది కదా, అందరినీ దరఖాస్తులు చేసుకోనివ్వండి చూద్దాం.....అంటారు. మరి నెల్లాళ్లూ ఈ సంస్థలు గోళ్లు గిల్లుకుంటూ కూర్చొనే వుండాలేమో!

వివిధ చట్టాల క్రింద రాష్ట్రం లో నమోదైన సూ ఋ సంస్థలు ఇంకొన్ని బయటికి వచ్చాయి (వీటిలో ఇంతకు ముందు మనం చెప్పుకున్న 13 లో కొన్ని రిపీట్ అవుతాయి--గమనించండి)

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు : 1. ఎస్ కే ఎస్; 2.షేర్; 3. స్పందన; 4.స్పూర్తి; 5.అస్మిత; 6.ఫ్యూచర్; 7.బేసిక్స్; 8.శారద; 

సొసైటీల చట్టం క్రింద : 1.సి సి డి; 2.డౌవ్; 3.గైడ్; 4.సిరి; 5.ఆదర్శ; 6.సెంటర్ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్; 7.కృషి; 8.ప్రగతి; 9.సాధన; 10.స్టార్.

మాక్స్ (మ్యూచువల్లీ ఐడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ) క్రింద : 1.కాంఫెడరేషన్ ఆఫ్ వాలంటీర్స్ అసోసియేషన్; 2.దీపిక మహిళా; 3.ఝాన్సీ రాణి మహిళా; 4.కాకతీయ మహిళా; 5.మదర్ థెరిస్సా మహిళా; 6.వాగ్దేవి మహిళా; 7.ఇందూరు ఇంటిదీపం; 8.పి డబ్ల్యు ఎం ఏ సీ ఎస్

ట్రస్టు ల క్రింద : 1.ది మాక్స్ వెల్త్ ట్రస్ట్; 2.రాష్ట్రీయ సేవా సమితి.

ఇప్పుడీ పేర్లన్నీ, వాటిలో అప్పు తీసుకున్నవాళ్లకి కూడా గుర్తుండవు లెండి. ముందు చెప్పుకున్న 13 లో మాత్రం, ఓ ఐదారు బాగా ఫేమస్!

సరే....మన ప్రభుత్వ వుద్యోగులూ, మీడియా వాళ్లూ యెంత చక్కగా విషయ సేకరణ చేస్తున్నారో పత్రికలలో చదివే వుంటారు. 

వొక సంస్థ దగ్గర అప్పు తీసుకొని, దాని వాయిదా చెల్లించడానికి ఇంకో సంస్థ దగ్గరా--ఇలా చేస్తున్నామని చాలా మంది చెపుతున్నారు. (ఇప్పుడడిగితే, ప్రతీవాళ్లూ నాకు 4, నాకు 5, నాకు 7 సంస్థలు అప్పు ఇచ్చాయి అనే చెపుతారు--యెందుకో వూహించండి!)

'కట్టలేకపోతే, ఆత్మహత్య చేసుకోండి ' అని సూ ఋ సంస్థ ప్రతినిధులు అంటున్నారు (ట). (వాళ్లెంత విసిగి పోతే అలా అంటారో వూహించండి--బీమా మొత్తం వస్తే, అప్పుతీరిపోవడం తోబాటు, కుటుంబానికి ఇంతో అంతో మిగులుతుంది--వుభయతారకం--అనికూడా చెపుతున్నారని అంటున్నారు!)

"ఒకసారి ఈ 'సంస్థల ' అప్పులు తీరిపోతే మళ్లీ జీవితం లో వాటి ముఖం కూడా చూడము" అని సెలవిస్తున్నారట. (వెలుగుతోందా ఇప్పటికైనా, వీళ్లకి తరిఫీదు యెవరు ఇస్తున్నారో?)

ఇదంతా, ఓ పథకం ప్రకారం జరుగుతున్న కుట్ర! రొచ్చుగుంటలని సృష్టించడానికి పంచవర్ష ప్రణాళికలూ, దశవర్ష ప్రణాళికలూ రచించబడ్డాయి! 

"వచ్చే ఐదేళ్లలో, ప్రతీ ఆడకూతుర్నీ లక్షాధికారిని చేస్తాం..........." అని మీ చెవుల్లో ప్రతిధ్వనించడం లేదూ?

వురుమురిమి, మంగలం మీద పడ్డట్టు, ఇప్పుడీ సూ ఋ సంస్థల అప్పుల్ని తీర్చడానికి, మళ్లీ బ్యాంకులే 'పావలా వడ్డీ' ఋణాలని మంజూరు చెయ్యాలట! (ఈ సూ ఋ సంస్థలు వర్థిల్లుతాయి, జనాలూ చేతులు దులిపేసుకుంటారు--పోయేది? ఇంకెవరు? బ్యాంకులే!)

Saturday, October 16

మన ఋణ వ్యవస్థ

"సూక్ష్మ" ఋణాలు - 5


"ఇదేదో రొచ్చు గుంటలా కనపడుతోందే.......అది కూడా 'పేధ్ధది '........భలే బాగుంది.......రండ్రా.......అందరూ చేపలు పట్టేద్దాం!" అంటూ తయారయిపోతున్నారు మన రా నా లు. 

ఒకడేమో, "ఈ సూ ఋ సంస్థల 'యజమానుల్ని వురి తీయాలి', వీళ్లకీ రాహుల్ కీ సంబంధమేమిటో తేల్చాలి" అంటాడు.

ఇంకోడేమో, "దీనంతటికీ చంద్రబాబుదే బాధ్యత...వాడిని వురి తీయండి" అంటాడు.

మరోడు, వసూలు కోసం వచ్చే వాళ్లని "చీపురుకట్టలు తిరగేసి" తరిమి కొట్టండి--అంటాడు.

సామాన్యుడంటాడూ--"వొరే! మీ చుట్టాలూ, తైనాతీలూ నూటికీ నెలకీ మూడు రూపాయల వడ్డీకిచ్చి, వసూలుకోసం వచ్చినాళ్లని ప్రజలు "చీపురుకట్టలతో" తరిమికొట్టాలేంట్రా?" అని!

యెవడి గోల వాడిది!

ఈ లోపల రాష్ట్ర ప్రభుత్వం (మాననీయ ముఖ్యమంత్రి రోశయ్య) గురువారం (14-10-2010) న మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి వర్గం భేటీ అవుతుంది అని ప్రకటించారు.

ఆయన బుధవారం రాత్రే, బ్యాంకరులు, కొందరు మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు(ట). ఈ సమావేశం లో, ము మం "బ్యాంకులనుంచి సకాలం లో ఋణాలు అందకపోవడం, అందినవి అవసరాలకు యేమాత్రం సరిపోవకపోవడం" వల్లే, సూ ఋ సంస్థలు విజృంభించాయంటే....

బ్యాంకర్లు, "బహుళ ఋణాల వూబిలో ఇరుక్కోవడం వల్లే 'పావలా వడ్డీ' ఋణాలని సహితం పేదలు సకాలం లో చెల్లించలేకపోతున్నారు" అన్నారట! (నిజానిజాలు ముంజేతి కంకణమేగా!)

గురువారమే (14-10-2010) సమావేశామవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ ఎల్ బీ సీ) నిర్ణయించిందట! 

ఈ ఎస్ ఎల్ బీ సీ కి సారధ్యం వహించేది రాష్ట్రం లో లీడ్ బ్యాంకు గా వ్యవహరిస్తున్న బ్యాంకే! (నిజానికి ఈ లీడ్ బ్యాంకుల వ్యవహారం, అడాప్టెడ్ విలేజీల వ్యవహారం, బ్యాంకు శాఖలని తెరుచుకొని, మూసుకొనే వ్యవహారం, వడ్డీ రేట్ల వ్యవహారం, ఏ టీ ఎం లని యేర్పరచుకొనే వ్యవహారం--ఇలాంటి వాటినన్నీ రిజర్వ్ బ్యాంకు యెప్పుడో పది పన్నెండేళ్ల క్రితమే యెత్తేసింది!)

కా......నీ....ఈ బ్యాంకులలో వుండే (ఇసుమంతైనా అవగాహన లేని) "బ్యూరోక్రాట్లు" అన్ని విషయాలనీ "రిజర్వ్ బ్యాంకు" మీదకి తోసేస్తూంటారు! వారి చేతికి మట్టి అంటుకుంటుందేమో అని భయంతో!

ఫైనల్ గా, చివరాఖరికి మన లాంటి వాళ్లు యెంత మోసపోతున్నామో తెలుసుకోడానికి--ఈనాడు ఆదివారం అనుబంధం లో (10-10-10) న ప్రచురితమైన 'ఉమాబాల చుండూరు ' వ్రాసిన "అపాత్రదానం" కథ చదవండి.

ఇందులో ఒకావిడ, వాళ్ల పనిమనిషి మీద జాలిపడి, (వాళ్ల నాన్న తనకి ఇచ్చిన, తను అపురూపంగా దాచుకొంటున్న 1500 రూపాయల సొమ్ముని) ఆమె యేడో క్లాసు చదివే కూతురుకి పుస్తకాల నిమిత్తం దానం చేసేస్తుంది! 

ఆ తరవాతోరోజు, ఆ పని మనిషి, "మా అమ్మాయి పెద్దమనిషి అయిందటమ్మా!" అంటే, ఆవిడకి అమాంతం సెలవిచ్చేసి, 'పసుపూ, కుంకం, చీరా, జాకెట్టు గుడ్డా వున్న కవరునిచ్చేసి' ఆనందిచిన ఆ "మధ్య తరగతి" అమ్మ, క్రింది తరగతి కి చెందిన పని మనిషి చేసిన "ఖర్చులని" చూసి (విని) మూర్చపోయినంత పని చేసి "అయ్యో! అపాత్రదానం చేశానా?" అనుకుంటుందట!

అదండీ సంగతి!



Friday, October 15

మన ఋణ వ్యవస్థ

"సూక్ష్మ" ఋణాలు - 4



వచ్చిన గొడవల్లా, ఋణ గ్రహీతల ఆదాయమెంత, ఖర్చు యెంత, పొదుపు యెంత, ఋణాలెంత, గ్రూపు సభ్యులా కాదా, గ్రూపుకి అప్పు వుందా--ఇలాంటివన్నీ వీళ్లకి అనవసరం.

యెందుకంటే, తమ దగ్గర మురుగుతున్న డబ్బుని, యెలాగోలా వితరణ చెయ్యాలి--చట్టబధ్ధం గా! దానికోసం తమ వుద్యోగులకి కూడా లక్ష్యాలు నిర్దేశించి, వాటిని అందుకునేదాకా చంపుకు తిన్నాయి! (ఈ వుద్యోగులకి కనిష్టం 500 నించి గరిష్టం 10 వేల వరకే జీతాలు! అందుకనే, ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా ప్రకటిస్తాయి--నగదు రూపం లో--లక్ష్యాలు చేరిన వాళ్లకి! అదే ఋణ వసూళ్లకైతే, లక్ష్యాలు చేరనివాళ్లకి జీతాలు కోస్తారు! మరి పాపం వాళ్లెలా ఛస్తారు?)

ఇంకేం? నెత్తిమీద జుట్టు కూడా లేనివాడికీ, అప్పటికే గ్రూపులలో వుండి, జుట్టు మాత్రమే కలిగి వున్న వాళ్ల ఆడాళ్లకీ, మేజర్లయిన కొడుకులకీ, కూతుళ్లకీ (కూతుళ్లు రేపు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిపోతారు!) కొండొకచో, మైనర్లకీ (తండ్రినో, తల్లినో గార్డియన్ గా పెట్టుకొని) సూ ఋ లు మంజూరు చేసేశారు!

ఇక నెల నెలా ఠంచనుగా ఋణ గ్రహీత అప్పు చేసిన తేదీ నాడే వాళ్ల చెక్కులని పూర్తి చేసి, బ్యాంకులలో దాఖలు చేస్తారు. (మొదట్లో ఓ ఐదారు వాయిదాలు బాగానే చెల్లిస్తారు--చేతిలో డబ్బులు బాగానే ఆడుతుండడంతో!) ఖాతాలో డబ్బు లేక, చెక్కు తిరిగి వెళితే, ఖాతా వున్న బ్యాంకు వారు ఓ 46 రూపాయలు (సర్వీస్ ఛార్జి + 13% టాక్స్) వసూలు చేస్తారు. సూ ఋ సంస్థ వారు తమకి ఆ నెలలో రావలసిన వాయిదా డబ్బు రాలేదు కాబట్టి, వడ్డీతో లెఖ్ఖగట్టి, మళ్లీ నెల చెక్కుని వాయిదా+వడ్డీ కి వ్రాసి, బ్యాంకులలో జమ చేస్తారు! ఆ నెలా చెక్కు తిరిగి వెళితే--షరా మామూలే!

ఇలాంటి సూ ఋ సంస్థలు మన దేశం లో 21 వుండగా, ఆంధ్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక లలో వ్యాపారం సాగిస్తున్నవి 16. వీటి వ్యాపారం కూడా ఆంధ్ర ప్రదేశ్ లోనే యెక్కువ. (ఇక్కడ విజయాలు సాధిస్తే, అక్కడ విస్తరణ చేసేవి!)

ఆ 16 సంస్థల లో, ప గో జి లో "హెచ్చు" వ్యాపారం చేస్తున్న 13 సంస్థల పేర్లు--1. ఎస్ కే ఎస్ (స్వయం కృషి) 2. అస్మిత 3. స్పందన 4. షేర్ 5. క్రీసా 6. ఫుల్లర్ టన్ ఇండియా (గ్రామ శక్తి) 7. ఎల్ & టీ 8. ఉండమ్మా, బొట్టు పెడతా 9. పంపు కింద బింది, 10. స్వయం 11. ప్రగతి 12. గృహలక్ష్మి 13.హెల్ప్.

వీటిలో ఎస్ కే ఎస్ సంస్థ యజమానులకీ, రాహుల్ గాంధీ కీ సంబంధం వుందని ఇటీవలి ఆరోపణలు!

మొన్నో రోజు ఒకే సారి యెనిమిదో యెంతమందో ఆత్మహత్యలు చేసుకోగానే, రాహుల్ మన మంత్రి వట్టి వసంత కుమార్ ని ఢిల్లీ పిలిపించుకొని, ఆరా తీశాడట! వట్టి యేదో సర్ది చెప్పాడట! ఇదో పిడకల వేట.

అన్నట్టు, ఎస్ కే ఎస్ సంస్థ పబ్లిక్ ఇస్యూ కి కూడా వెళ్లింది--రేపో మాపో లిస్టింగ్ అవుతుంది! ఇంకెంత విజృంభిస్తుందో! ఈ కంపెనీలో పనిచేస్తున్న "గుర్మన్" యేటా రెండు కోట్ల జీతం, 80 లక్షల బోనస్ తీసుకుంటున్నాడట! (చందా కొచ్చార్ కూడా యేడుస్తుందేమో! ఈ మాట వింటే)

ఇక ఆర్ బీ ఐ, సూ ఋ సంస్థల మీద నాకు ఆధిపత్యం లేదు, వడ్డీలు తగ్గించమని వాళ్లకి చెప్పలేను--అంటుంది!

సూ ఋ సంస్థలు, మేము ఎన్ బీ ఎఫ్ సీ (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు) గా రిజర్వ్ బ్యాంకులో రిజిస్టర్ అయ్యాము, నువ్వెవడివిరా కోన్ కిస్కా? అంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని!

(మనకి హర్షద్ మెహతా కుంభకోణం తరవాతో, కేతన్ పరేఖ్ కుంభకోణం ముందో కొన్ని వేల "లీజింగ్ & ఫైనాన్స్" కంపెనీలు పుట్టుకొచ్చాయి దేశ వ్యాప్తం గా--రెండు మూడేళ్లలో వాటా దారులనీ, ప్రజల్నీ మోసగించి, బోర్డులు తిప్పేశాయి! ఇంకా కొన్ని అదేపని చేస్తున్నాయి--వీటి సంగతి క్రమం లో.)

మన కొత్త తరం బ్యాంకులు విచ్చలవిడిగా "వ్యక్తిగత", "వాహన", "క్రెడిట్ కార్డు" ఋణాలిచ్చేసి, వాటి వసూలుకై "గూండాలని" రికవరీ యేజంట్లుగా వినియోగిస్తున్నాయి అని వార్తలు వచ్చినప్పుడే--గత మూడు సంవత్సరాలుగా నేను టపాలు వ్రాస్తూనే వున్నాను--ఇండియాలో "లోన్ షార్కింగ్" మొదలవుతోందనీ, త్వరలో అమెరికా, లాటిన్ అమెరికా, మెక్సికో దేశాల లెవెల్లో కాకపోయినా--ఇది "మాఫియా" లాంటి వాళ్ల చేతుల్లోకి వెళుతోందనీ!

యే దావూద్ ఇబ్రహీమో.........21 టినీ.....పాపం శమించుగాక....ఆ రోజు రాకూడదు!

Thursday, October 14

మన ఋణ వ్యవస్థ

"సూక్ష్మ" ఋణాలు - 3


నిజం గా 2000 వ సంవత్సరం మన ఆర్థిక వ్యవస్థలోనూ, బ్యాంకింగ్ లోనూ ఒక "వాటర్ షెడ్" లేదా "బెంచ్ మార్క్" అని చెప్పుకోవాలి.

రమేష్ గెల్లీ ఆధ్వర్యం లో దూకుడుగా వెళ్లిన గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు నాశనమై పోవడం, ఆ స్థానాన్ని అందిపుచ్చుకోవాలని ఐ సీ ఐ సీ ఐ బ్యాంక్, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్, యూ టీ ఐ బ్యాంక్ వగైరాలు పోటీ పడి, ఋణ వితరణలో అత్యధిక విపణి వాటా (మార్కెట్ షేర్) ని చేజిక్కించుకోవడం తో, ప్రభుత్వ వాణిజ్య బ్యాంకుల దగ్గర ఇబ్బడి ముబ్బడిగా నిధులు పేరుకు పోయాయి.

దాంతో, అప్పటివరకూ "వుత్పాదక ఋణాలు" (ప్రొడక్టివ్ క్రెడిట్) కే ప్రాధాన్యమిచ్చేవి, "వినియోగ ఋణాలకి" (పర్సనల్ క్రెడిట్) కి ప్రాధాన్యతని మార్చుకున్నాయి. ప్రత్యేక "వ్యక్తిగత ఋణ కేంద్రాలు" యేర్పాటు చేసి మరీ, వుద్యోగులకీ, ఇతర నియమిత ఆదాయ వర్గాలకీ కొన్ని వందల కోట్లు వితరణ చేసేశాయి!

(ఒక్కొక్క వుద్యోగీ నాలుగైదు బ్యాంకులనించి వ్యక్తిగత ఋణాలు పొందిన దాఖలాలు వున్నాయి. ఇప్పటికీ, బీ ఎస్ ఎన్ ఎల్ లాంటి ప్రభుత్వ సంస్థల వుద్యోగులు ఇలా రెండు మూడు బ్యాంకుల నించి ఋణాలు పొందుతున్నారు!)

దాంతో ద్రవ్యోల్బణం పెరగడం, సెన్సెక్స్ 8000 పాయింట్లు ఛేదించడం, అది 16000 వేలకి 'అనతికాలం లోనే' చేరుతుందని ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించడం, అదీ నెరవేరడం, మళ్లీ 8000 కి పడి పోవడం--ఇదంతా పాత కథ. అలాగే, వడ్డీలు పెరుగుతున్నాయి, పెరుగుతున్నాయి అనీ, మళ్లీ తగ్గుతున్నాయి, తగ్గుతున్నాయి అనీ, అలాగే ద్రవ్యోల్బణం విషయం లో కూడా, విచారించడాలూ, ఆనందించడాలూ జరగడం కూడా ఓ ప్రహసనం గా మారింది--అవన్నీ వేరే సంగతులు.

ఇక మన ప్రస్తుత విషయానికీ వీటికీ సంబంధం యేమిటంటే--మన సూ ఋ సంస్థల దగ్గరకూడా నిధులు మురిగి పోతున్నాయి కదా? అందుకే వీళ్లు కూడా "వ్యక్తిగత ఋణాలకి" తెర తీశారు. 

కేవలం "రేషన్ కార్డు" జెరాక్సూ, బ్యాంకు అకవుంట్ పాస్ బుక్కూ, చెక్ బుక్కూ వుంటే చాలు--యెవరికైనా 14 వేలు గానీ, 30 వేలు గానీ ఋణాలివ్వడం మొదలెట్టాయి. గమనించవలసిన విషయం యేమిటంటే, రేషన్ కార్డు లో "యజమానురాలు, భర్త, మేజరూ, మైనరూ పిల్లల వివరాలూ, ఇంటి చిరునామా" స్పష్టం గా వుంటాయి. ఇక బ్యాంకు పాస్ బుక్ వుందంటే, వాళ్లు "కే వై సీ" నిబంధనలు పాటించకుండా జారీ చెయ్యరుగా (పాటించే వుంటారు) అని తలంపు!

ఇక చెక్కు బుక్కులెందుకంటే--వాయిదాల వసూళ్ల కోసం! ఇక్కడ మరో మతలబేమిటంటే, బ్యాంకులు తమ సేవింగ్స్ ఖాతాదారులకి వాళ్లు "ఖాతా యెంత మొత్తం తో తెరిచారు" అనే అంశం పై ఆధారపడి, 10 చెక్కులుగానీ, 25 చెక్కులు గానీ జారీ చేస్తారు. 10 చెక్కులంటే 500/-, 25 చెక్కులంటే కనీసం 1000/- తో ఖాతా తెరిచారని అర్థం--స్థూలం గా!

పది చెక్కులవాళ్లకి 14 వేలూ, 25 చెక్కుల వాళ్లకి 30 వేలూ అలవోకగా మంజూరు చేసేస్తారు. పది చెక్కులలో తొమ్మిది వాళ్ల దగ్గర అట్టే బెట్టుకొని (బ్లాంకు గా--ఖాతాదారుడి సంతకంతో) పదో చెక్కుని మాత్రం వాళ్ల బ్యాంకు ఖాతాలో జమ చేసే ఋణ మొత్తం 'విత్ డ్రా' చేసుకోడానికి వుపయోగిస్తారు. (25 చెక్కులలో 24 అట్టేపెట్టుకుంటారు).

అప్పటికే "విషవలయం" మొదలయ్యింది అనే సంగతి సూ ఋ సంస్థలకీ తెలుసు, ఋణ గ్రహీతలకీ తెలుసు, బ్యాంకులకీ తెలుసు!

.................మిగతా తరువాయి.

Wednesday, October 13

మన ఋణ వ్యవస్థ

"సూక్ష్మ" ఋణాలు - 2

నిజం గా పొదుపూ, వ్యాపారం చెయ్యగలిగీ చేయూత కోసం యెదురు చూస్తున్న సంఘాలు--కళ్లు చెదిరే విజయాలు నమోదు చేశాయి. వాటిని తరచూ యెక్జిబిషన్లలో పెట్టేవాళ్ళు.

కానీ ఇవేవీ లేని సంఘాలే యెక్కువ! పూర్తిగా "వాడుక" కోసమే అప్పు తీసుకొనేవి, నెమ్మదిగా తిరిగి చెల్లించుకోవచ్చులే--అని. ఇలాంటివాళ్లతోనే వచ్చింది తంటా!

మొదటి సారి 50 వేలు అప్పుతీసుకోగానే, పది మంది సభ్యులూ ఐదేసి వేల చొప్పున పంచేసుకొనేవారు. కొంతమంది అత్యవసర ఖర్చులు కొంత పోగా, యే నాలుగు వేలో మిగుల్చుకొని, బంగారం కొనేసేవాళ్లు. సగానికి సగం మంది యెచ్చులకి పోయి, కుటుంబాల్లో ఫంక్షన్లకీ, పండగలకీ యెక్కువ మొత్తాలు ఖర్చుపెట్టేసేవారు. కొంతమంది తమ కుటుంబం లోని ఒకరిని పట్నానికో, విదేశానికో పంపించడానికి వాడుకొనేవారు. కొంతమంది, అప్పటికే దుబాయికో, ముంబాయికో వెళ్లడానికి ప్రయత్నాలు చేసుకొంటున్నవాళ్లు, అలాగే యెగిరి పోయేవారు!

ఇవన్నీ అప్పు తీర్చవలసిన మూడేళ్లలో క్రమం గా జరిగిపోతూండేవి!

గ్రూపు లోని మిగతా సభ్యులు కొన్నాళ్లు పొదుపునీ, అప్పునీ జాగ్రత్తగా తిరిగి చెల్లిస్తూ వుంటే, చెల్లించ(ని)లేనివాళ్లు మానేశారు. ఓ యేడాదిపాటు బ్యాంకులో జమలు చేసినా, తరవాత మానేసినా, బ్యాంకు వాళ్లెవరూ పట్టించుకోలేదు. పాపం వాళ్లకి తమ పైవాళ్లిచ్చిన ఋణ వితరణ లక్ష్యాలని పూర్తి చేసే హడావిడిలో, కొత్త గ్రూపులని గుర్తించడం, వాళ్లకి
యాభయ్యేసివేలు అప్పులు ఇవ్వడం లో నిమగ్నమయి వుండిపోయారు!

దాంతో, మూడేళ్లలో గ్రూపులకి ఇచ్చిన అప్పులన్నీ, అన్ని బ్యాంకుల్లోనూ "ఎన్ పీ యే" లు అయిపోయాయి!

యంత్రాంగం పరుగులు మొదలెట్టింది--వ్యూహాలు రచించింది--అక్కడ రంగ ప్రవేశం చేయించారు--ఈ సూక్ష్మ ఋణ సంస్థలని! ప్రభుత్వ యంత్రాంగం సాయం తో గ్రూపులని "రిపేరు" (తప్పుకున్న సభ్యుల స్థానం లో కొత్తవాళ్లని చేర్పించడం--ఇలా) చేయించో, పూర్తిగా రద్దు చేయించి, కొత్త గ్రూపులు యేర్పాటు చెయించో, బ్యాంకులకి పంపించడం
మొదలెట్టారు.

పత్రికలు వ్రాసింది నిజమైతే, ఈ సూ ఋ సంస్థలకి బ్యాంకులు కోట్లలో, "ప్రయారిటీ సెక్టార్" (ప్రాధాన్యతా రంగం) క్రింద, తక్కువ వడ్డీ (7 నించి 8 శాతం) కి అప్పులివ్వడం ప్రారంభించాయి.

ఈ సూ ఋ సంస్థలు, రిపేరు చెయ్యబడ్డ గ్రూపులకి బ్యాంకులలో యెంత ఎన్ పీ యే ఋణం వుందో, దానికి తగ్గట్టు ఋణాలని మంజూరు చేసి, బ్యాంకులలో కట్టించేసేవి. బ్యాంకులకి ఎన్ పీ యే రికవరీ జరిగిపోవడం తో పాటు, ఋణ ప్రణాళిక ప్రకారం అదే గ్రూపుకి మళ్లీ (మొదటి యాభై వేలూ చెల్లించేశారు కాబట్టి) వాళ్ల పొదుపు మీద ఆథారపడి, కొత్తగా ఒక లక్ష నించీ, 3 లక్షలవరకూ ఋణాలు మంజూరు చెయ్యడం మొదలెట్టాయి--సభ్యురాళ్లందరికీ తలా పదివేల నించి, 30 వేల వరకూ! (వీటిని తిరిగి చెల్లించడానికి 5 సంవత్సరాల వ్యవధిని ఇస్తారు)! ఈ డబ్బుతో సూ ఋ సంస్థల అప్పులని తీర్చేసి, నిబంధనల ప్రకారం మళ్లీ వాళ్ల దగ్గరనించి అప్పు తీసుకోవడం మొదలెట్టాయి!

(రిపేరు కాని గ్రూపుల ఋణాలని పారుబాకీల క్రింద రద్దు చేసుకొన్నాయి బ్యాంకులు! మళ్లీ కొత్త గ్రూపులకి యాభయ్యేసి వేల చొప్పున అప్పులు ఇవ్వడం ప్రారంభించాయి!)

హమ్మయ్య! ఇప్పటికి కంతలు కనబడకుండా, వెల్ల వేయడం జరిగింది--అని వూపిరి పీల్చుకున్నాయి బ్యాంకులూ, యంత్రాంగమూ!

(ఇవన్నీ జరిగింది 2000-2005 సంవత్సరాల మధ్య--అప్పటికి రాశ్శేఖర్రెడ్డి అధికారం చెలాయిస్తున్నాడు!)

అంతకు ముందు తెలుగు దేశం ప్రభుత్వం లో, రాష్ట్ర హౌసింగ్ బోర్డు ద్వారా, తమదైన పధ్ధతీ, యంత్రాంగాల ద్వారా, ప్రజలకి గృహ ఋణాలు, సబ్సిడీలూ మంజూరు చేసేవి. వాటి ద్వారా చిన్నా చితకా తెలుగు తమ్ముళ్లు, కోరా సిల్కు పచ్చ చొక్కాలు కుట్టించుకొని, వ్రేళ్లకి వుంగరాలు పెట్టుకొని, పుష్కరాల కాంట్రాక్టర్లుగా అవతారమెత్తేందుకు అవకాశం లభించింది!

మరి రాశ్శేఖర్రెడ్డి వూరుకుంటాడా? "ఇందిరమ్మ" పథకం క్రింద తనదైన శైలిలో కొన్ని లక్షల గృహ ఋణాలని మంజూరు చెయ్యడం మొదలెట్టాడు! దానికి లబ్ధిదారులుగా--ఇంకెవరు--మొగాళ్లయితే తాగేస్తున్నారని, గ్రూపులలోని ఆడవాళ్లకి ఇవ్వమన్నాడు! (రేషన్ కార్డులని కూడా "చెల్లెమ్మల" పేరుతోనే జారీ చెయ్యన్నాడండోయ్!)

ఇంకేం! "థేంక్స్ అన్నా" అంటూ కాంగ్రెస్ తమ్ముళ్లు ఇటు ఇందిరమ్మ ఋణాల మంజూరూ, అటు బ్యాంకులలో గ్రూపు ఋణాల మంజూరూ చేయించడానికి మధ్యవర్తుల అవతారమెత్తి, కొత్త తెల్ల చొక్కలూ, వుంగరాలూ, యమహా బైకులూ కొనుక్కోవడం మొదలెట్టారు!  (తరవాత క్లాస్ వన్ కాంట్రాక్టర్ల అవతారమెత్తారు).


.............మిగతా తరువాయి.

మన ఋణ వ్యవస్థ

"సూక్ష్మ" ఋణాలు

(గత నాలుగు రోజులుగా ఈ టపా వ్రాస్తున్నాను--ఇంకా వ్రాయవలసిన ముఖ్య విషయాలు చాలా వుండటం తో, వాయిదాల వారీగా ప్రచురించాలని నిశ్చయించుకున్నా, ఇంకా ఆలస్యం అవుతూంది--అందుకే ఈ మొదటి వాయిదా! కనీసం ప్రతీ రోజూ ఓ వాయిదా ప్రచురించడానికి ప్రయత్నిస్తాను)

"జనాలకి 'చేపలని' పంచిపెట్టడం కాదు, వాటిని 'పట్టుకోవడం' నేర్పించాలి--అందువల్ల వాళ్ల జీవన ప్రమాణం పెరుగుతుంది, దేశ వృధ్ధి జరుగుతుంది"--అన్నాడట ఇదివరకటికి ఆయన యెవడో!

మరి జనమందరూ గేలాలూ, వలలూ పట్టుకొని, చేపలు పట్టుకొని వండుకొని తినలేరు కదా? చేపలు పట్టేవాళ్లున్నారు, వాటిని కొనీ, అమ్మేవాళ్లున్నారు, యెగుమతులు చేసేవాళ్లున్నారు--వీళ్లందరిమీదా దేశాభివృధ్ధి ఆథారపడి వుంది! మరి జనాలు చేపలు తినడం యెలాగా?

"చేపలు కొనడానికి జనాలకి 'అప్పులు సుళువుగా దొరికే' మార్గం చూపించండి"--అని మధ్యేమార్గం గా చూపించి, నోబెల్ బహుమతి కొట్టేశాడో మహానుభావుడు--మహమ్మద్ యూనిస్ అనీ--ఆయన (తనకొచ్చిన నోబెల్ డబ్బుతో చేపలు కొని తినేశాడో, అమ్ముకున్నాడో, యెంతమందికి చేపలు కొనడానికి ఋణాలకి యేర్పాట్లు చేశాడో ఆయన దేశం లో--మనకి తెలీదు!)

ఇంకేం! మన రాష్ట్ర ప్రభుత్వం (దాంతో రాష్ ట్రం లో లీడ్ బ్యాంకు అయిన ఆంధ్రా బ్యాంకూ) ఆయన్ని పల్లకీలో వూరేగించుకొంటూ తీసుకొచ్చి, 'ఆ విద్య మా జనాలకి నేర్పరూ?' అంటూ కాళ్లా, వేళ్లా పడ్డాయి! (ఓ పది సంవత్సరాల క్రితం)

సరే--బ్యాంకులూ ముందుకు వచ్చాయి--తామిచ్చిన ఋణాలు తిరిగి వసూలవడమే ముఖ్యం వాటికి--దీనికి 'సంఘాల' గ్యారంటీ వుంటుంది కదా అని వాటి నిశ్చింత! (నిజానికి 12 యేళ్ల క్రితమే మన రాష్ట్ర ప్రభుత్వం 'డ్వాక్రా' గ్రూపుల 'కాన్సెప్ట్' మొదలెట్టింది)

రక రకాల ప్రభుత్వ శాఖల సమన్వయం తో ఈ ప్రణాళిక ని పట్టాలకి యెక్కించారు.

ఓ పది మంది స్త్రీలు, ఓ "స్వయం సహాయక సంఘం" సంఘం గా యేర్పడి, ముగ్గురు లీడర్లని యెంచుకొని, వాళ్లలో వాళ్లు (ఇంటర్ సే) వొడంబడిక వ్రాసుకుంటారు. తరవాత, ఒక్కో సభ్యురాలూ నెలకి ఇంత అని నిర్దిష్టం గా 'పొదుపు' చేసి, ఆ పొదుపుని బ్యాంకుల్లో అదివరకే తెరిచిన ఖాతాల్లో జమ చెయ్యాలి. ప్రతీ నెలా మీటింగులు పెట్టుకొని, సాధక బాధకాలని చర్చించుకొని, తీర్మానాలు చేసుకోవాలి. ఇలా సవాలక్ష నిబంధనల క్రింద, ఓ యేడాది పాటు క్రమం తప్పకుండా పొదుపు చేసిన "గ్రూపులకి" అప్పు చెయ్యడానికి అర్హత లభిస్తుంది--అన్నమాట!

మొదట్లో, ఈ గ్రూపులలో--సభ్యులు యెవరెవరు, వాళ్ల చిరునామాలేమిటి, వాళ్ల మధ్య బంధుత్వాలేమిటి, వాళ్ల జీవనోపాధి యెలాగ, పొదుపు యెలా చెయ్యగలుగుతున్నారు--ఇలాంటి విషయాల్నెవరూ పట్టించుకోలేదు!

"నిబంధనల" ప్రకారం బ్యాంకులు మొదటి విడత అప్పుగా నిర్దేశించిన రూ.50,000/- ఆ సంఘాలకి ఇచ్చేశాయి.

ఇచ్చేశాక, వాటికి అందులోని 'లుకలుకలు ' మూడేళ్ల తరవాత బయట పడ్డాయి!

.......అవన్నీ తరవాత.

Thursday, October 7

యెలక్షన్ కమిషనూ......

......ఈ వీ ఎం లూ

మన చంద్రబాబునాయుడుని వెర్రిబాబు నాయుడుని చేసేస్తున్నారందరూ.

హైటెక్ ముఖ్యమంత్రిగా పేరొందిన ఆయనకే ఈ వీ ఎం ల విషయం లో అన్ని సందేహాలుంటే......అంటూ పెదవి విరుస్తున్నారు.

దానికి తగ్గట్టు, ఆయన సంప్రదించిన "మేతావులు" ఈ వీ ఎం లకి ప్రింటర్లని అనుసంథానిస్తే, వోటు వెయ్యగానే, ప్రింట్ అవుట్ వస్తుంది, అలా చెయ్యమని చెపితే, మన యెలక్షన్ కమిషన్ వారు 'అందుకభ్భెంతరమేటుందీ? మా కమిటీల్నీ, నిపుణుల్నీ దీనిమీదికి తోలుతాం!' అన్నారట.

ఇక్కడ విషయాలేమిటంటే--

1. మన ప్రింటర్లు యెంతబాగా పని చేస్తున్నాయో యే కంప్యూటర్ సెంటర్ వాడినడిగినా చెపుతారు. మనం యే రైల్వే టిక్కెట్టో ప్రింటు కావాలని వెళితే, "ఇప్పుడే పాడయ్యిందండీ! ప్రింటు సరిగ్గా రావడం లేదు. సర్వీసు వాళ్లకి ఫోను చేశాం. రేపొస్తానన్నారు" అంటారు. 

2. బ్యాంకుల్లోనూ అక్కడా, పాస్ బుక్ ప్రింటర్లకీ, ఇతర ప్రింటర్లకీ వచ్చే జాడ్యాలకి మందు వెయ్యడానికి ఆ సర్వీస్ వాళ్లు రాక తలలు మొత్తుకుంటున్నారు.

3. సరే--ప్రింట్ అవుట్ వచ్చింది--దాన్నేమి చెయ్యలి? వోటువేసిన వాడు చింపి, మడిచి, జేబులో పెట్టుకొని--హమ్మయ్య, నా వోటు చక్కగా రికార్డు అయ్యింది--అనుకొంటూ బయటికి వెళ్లిపోవాలా? అలా సరి చూసుకోగల వోటర్లు యెంత శాతం?

పీ సీ వో ల్లో ఎస్ టీ డీ మాట్లాడి, డబ్బులిచ్చి, వాడిచ్చిన కాగితమ్ముక్కని పట్టుకొని బయటికి వచ్చి, 'బిల్లెంతయ్యిందో చూడండి ' అని ఓ పది మందిని అడిగి, 29 రూపాయల 24 పైసలు అని అందరూ చెప్పగానే, "ముఫ్ఫై రూపాయలు దొబ్బేశాడు....నా...ంల్లిగాడు" అని గోల చేసేవాళ్ళని యెందర్ని చూడడం లేదు మనం?

4. వాళ్లు ఆ ప్రింట్ అవుట్ ని తీసుకోవడం తెలియకో, మరిచో, బయటికి వచ్చేస్తూంటే, ఆ బూత్ లోని ప్రభుత్వోద్యోగో, యేజంటో వాళ్లకి నేర్పించడానికి లోపలకి వెళ్లి, ఆ ముక్క చింపి, వాళ్ల జేబుల్లో పెట్టే ముందర దాన్ని ఓ లుక్కెయ్యకుండా వుంటాడా?

5. ఇవేమీ జరగలేదు....ముగ్గురో, నలుగురో ప్రింట్ అవుట్లు తీసుకోకుండా వెళ్లిపోయారు....ఐదోవాడిగా నాలాంటి వాడొచ్చాడు....మొత్తం ప్రింట్ అవుట్ ని తీసుకెళ్లి, బయట--నా ముందు వోటు చేసిన నలుగురూ "ఫలానా పార్టీలకి" వోటు వేశారు....లం కొ లని తన్నండి--అంటే?

6. ఇలాంటి "సీక్రెసీ చెడిపోతుంది కదా?" అనే ప్రశ్నలకి, "జన విఙ్ఞాన వేదిక" మేతావులు మళ్లీ ఛానళ్లలోకి వచ్చేశారు--వీళ్లేమంటున్నారంటే, "వోటు వెయ్యగానే, ప్రింట్ అవుట్ వచ్చేసి, ఆటోమేటిక్ గా చింపబడి, బ్యాలట్ బాక్స్ లో పడి పోతుంది. కాబట్టి సీక్రసీకి యే లోపం రాదు!" అని.

ఇలాంటి ప్రత్యేక ప్రింటర్లని గురించీ, ప్రత్యేక బ్యాలెట్ బాక్స్ ల గురించీ ప్రపంచం లో యెవరైనా, యే "మేతావు" అయినా వూహించారా, కనిపెట్టారా, వుపయోగించారా? (కలలు కనండి--వాటిని సార్థకం చేసుకోడానికి ప్రయత్నించండి!)

2012 కో, 2015 కో "పేపర్ లెస్ బ్యాంకింగ్" "చెక్ లెస్ బ్యాంకింగ్" అంటూ "విజన్" లు ప్రకటిస్తున్నవాళ్లు ఇలాంటివాటిని గురించి ఆలోచించరేమో--వాళ్ల మెదళ్లు మోకాళ్లలో వుంటాయి కదా!!!???

ఇది అసాధ్యమని నాలాంటి వాళ్లకి తెలుసు--యెందుకంటే, బ్యాంకు మేనేజర్లు తమ పై అధికారులకి పంపించే నివేదికలూ వగైరాలు "సత్యమేనని" వాళ్ల సంతకాలూ, సీళ్లూ, వ్రేలిముద్రలూ, కాలి ముద్రలూ, ఆడిటర్ సంతకాలూ, సీళ్లూ, వ్రేలి ముద్రలూ, కాలి ముద్రలూ--లేకుండా యెవరూ స్వీకరించరు! యేమో యే పుట్టలో యే పాము (స్కాము) వుందో!

మేతావులూ! మీకు జోహార్లు!
 

Friday, October 1

అర్థం లేని......

"ఆథార్"

అయిపోయింది--అనుకున్నంతా అయిపోయినట్టే!

ఇవాళ (01-10-2010) ఈనాడు 'ఇదీసంగతి'లో శ్రీధర్ కార్టూన్ సర్వస్వం తేట తెల్లం చేస్తే, సంపాదకీయం మిగిలిందాన్ని నగ్నం గా నిలబెట్టింది!

కార్యక్రమం ప్రకారం ఓ పదిమందికి 12 అంకెల "ఆథార్" కార్డులు అందచేశారట మన ప్రథాని.

'వివిధ సంక్షేమ వ్యూహాల ఫలాల్ని సామాన్యులకి చేరవేస్తుందనీ', 'అనేక పత్రాలు సమర్పించే అగత్యాన్ని తప్పిస్తుందనీ' హోరెత్తిస్తున్నారు కానీ, ఇవి జారీ చేసే సంస్థలకి 'జనాభా లెఖ్ఖలూ, రేషన్ కార్డుల సమచారమే' అథారం ట!

పైగా ఈ సంఖ్యకీ ప్రణాళికా సంఘానికీ లంకెపెట్టి, 'మహా సమాచార నిధి ' తయారు చేసే బాధ్యత అప్పగించారు!

అంతేకాదు--ఇప్పటికే జారీ అయిన చెత్తా చెదారం కార్డులకి ఇది యేమాత్రమూ ప్రత్యామ్నాయం కాదట. అన్ని కార్డులూ చెల్లుబాటులో వుంటాయట.

చివరికి పెద్దాయన నందన్ నీలేకణి కూడా, 'సంక్షేమ పథకాల లబ్ధిదారుల్ని యెంపిక చేసే బాధ్యత రాష్ట ప్రభుత్వాలదే' అని తప్పించుకుంటున్నారట.

పైగా, ఆథార్ కార్డు కోసం యెవరైనా తప్పుడు సమాచారం ఇస్తే, ప్రభుత్వాన్నించి 'కఠిన శిక్షలు' వేస్తామని బెదిరింపోటి!

చట్టబధ్ధతేలేని సంస్థకి నాలుగేళ్లలో 45 వేల కోట్ల ప్రాజెక్టుని అప్పగించడం ఓ యెత్తైతే, వచ్చే అయిదేళ్లలో సుమారు నూరుకోట్లమందికి ఈ కార్డులు అందించడానికి యెంతవుతుందో?

మొట్టమొదట మన రాష్ట్రం లోనే, యేడు జిల్లాల్లో మూడుకోట్లమందికి జారీ చేస్తామనీ, మొదటి కార్డు మనరాష్ట్రం లోనే ప్రథాని జారీ చేస్తారనీ, చెప్పినవి వుత్తరకుమార ప్రఙ్ఞలే అని తేలిపోయింది.

ఇంతకీ, మన రాష్ట్రం లో ఈ కార్యక్రమానికి "టెండర్లు పిలవడం" మాత్రమే పూర్తయ్యిందట--మిగతాదంతా నత్తనడకే!

కొసమెరుపేమిటంటే, ఇది "భారతీయులకే ప్రత్యేకం" కాదుట--ఇప్పటికి దేశం లో వున్నవాళ్లందరికీ--వాళ్లేదేశం వాళ్లయినా--కేటాయిస్తారట!

మరింకెందుకో యీ ఆర్భాటం--కోట్లు దండుకోడానికి కాకపోతే!