Saturday, September 25

నిఘా వ్యవస్థ

కొత్త పథకం

చాలా రోజులే అయ్యింది ఈ వార్త చదివి. అప్పణ్ణించీ వ్రాద్దామనుకొని కూడా వ్రాయలేదు. ఇప్పుడు నిమజ్జనాల హడావిడిలో మళ్లీ గుర్తొచ్చి వ్రాస్తున్నాను.

హైదరాబాదులో తీవ్రవాదుల కుట్రల్ని తిప్పి కొట్టేందుకూ, నిఘా విభాగాన్ని పటిష్ట పరచేందుకూ, ఐదు కోట్ల ఖర్చుతో 155 కెమేరాలను కొనుగోలు చెయ్యడానికి టెండర్లు కూడా పిలిచేశారట, ఆగస్ట్ నెలాఖరుకి ప్రక్రియ పూర్తయిపోతుందట.

ఈ కెమేరాలని కీలక స్థానాల్లో పెట్టి, కంట్రోలు రూముకి అనుసంధానం చేస్తారట. అవి వందమీటర్ల దూరం లో వున్నా, వస్తువుని స్పష్టంగా చూపిస్తాయట. యెటుకావాలంటే అటు వీటిని తిప్పుకుంటూ, కంట్రోలు రూము నించే వీటిని నియంత్రించవచ్చట. రాత్రీ, పగలూ, వర్షం, మంచూ యేదైనా, చక్కగా పనిచేస్తాయట.

భవిష్యత్తులో వీటిని ఇతర ప్రాంతాలకి కూడా విస్తరిస్తారట. ఇంకో 12 అదనపు కంట్రోలు రూముల్ని యేర్పరుస్తారట. ఇంకా 5 మొబైల్ వీడియో కెమేరాలని కూడా యేర్పాటు చేసుకొని, (టీవీ వాళ్లలా) సంఘటనల్ని చిత్రీకరిస్తారట!

(పోతే పోయాయి ఓ ఐదు కోట్లు కెమేరాలకీ, మరో యాభై కోట్లు కంట్రోలురూములకీ, మొబైల్ కెమేరాలకీ అనుకున్నా) ఈ నిఘా వ్యవస్థ కార్యరూపం దాలిస్తే, ప్రజలు నిశ్చింతగా వుండొచ్చు! అని ఆ నాటి వార్త.

ఆగస్ట్ నెలాఖరు గడిచింది, సెప్టెంబరు నెలాఖరు కూడా వస్తోంది, నిమజ్జనాలు అయిపోతున్నాయి, మరి ఈ నిఘా వ్యవస్థ యేమయ్యిందో?

అయినా మన పిచ్చి గానీ, మందమైన చర్మం గలిగి, ఆరు చేతులున్న కోతి లా, మిగిలిన నాలుగు ఇంద్రియాల్నీ ఆ చేతులతో మూసేసుకొని వుండే మన వ్యవస్థకి, ఈ కెమేరాలూ అవీ యెందుకు? (ఆయనే వుంటే, మంగలాడెందుకన్నట్టు!)

Wednesday, September 22

సమస్య

కాశ్మీరు

20-09-2010 మొదటిపేజీలో శ్రీధర్ పెద్ద కార్టూను భలే వుంది. మన్మోహన్ నాయకత్వం లో అఖిలపక్షం వాళ్లు, బక్కెట్లతో నీళ్లూ, తువ్వాళ్లతో సహా, షేవింగ్ క్రీములూ, కత్తెరలూ, దువ్వెన్నలూ, రేజర్లూ, అద్దాలూ తీసుకెళుతుంటే, కాశ్మీరువాడు తన గడ్డం, జుట్టూ నిక్కబొడుచుకోగా, వురిమి చూస్తున్నాడు.

ఆయన కార్టూను వేసిన అసలు వుద్దేశ్యం యేమిటోగానీ, ఓ కొత్త అయిడియా వచ్చింది.

నిజం గా కేంద్ర ప్రభుత్వం "కాశ్మీరు సాయిబ్బు బాబులూ--భారతీయ జన జీవన స్రవంతిలో కలవండి--మీకు గడ్డాలూ, జుట్టూ మేము వుచితం గా, నెప్పి తెలియకుండా కత్తిరించి పెడతాము!" అంటూ ఓ పథకం ప్రకటించి, దాని అమలుని అఖిలపక్ష నేతలకి అప్పచెపితే యెంత బాగుంటుంది!

అలాగే, రాష్ట్రాలకి కూడా ఆ పథకాన్ని విస్తరింపచేసి, అక్కడ కూడా అఖిలపక్ష నేతలకి అప్పగిస్తే, ఇంకా బాగుంటుంది.

ఇష్టం లేనివాళ్లకి పాకిస్తానుకో, దుబాయికో లేదా ప్రపంచం లో మీరుకోరుకున్న చోటికి వుచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామంటే, కాశ్మీరు సమస్య శాశ్వతం గా తీరడం తో పాటు, మన దేశ వుగ్రవాద దరిద్రం పూర్తిగా వొదిలి పోతుందేమో!

మరి ఈ పథకానికి మీ వోటు వేస్తారా?

Sunday, September 19

గుర్తింపు కార్డులూ.....

......యూనిక్ నెంబర్లూ

బయోమెట్రిక్, ఐరిస్ వగైరాలతో రేషన్ కి మొదలు, వెంకన్న దర్శనం వరకూ అనేక రకాల కార్డులు అయ్యాయి, అవుతున్నాయి. 

ఇప్పుడు, "చిరునామా నిర్ధారణ" కార్డులట. 

పోస్టాఫీసులో ఓ పదిరూపాయలతో దరఖాస్తు కొనుక్కొని, ఫోటోలూ వగైరాలతో పూర్తిచేసి, ఇంకో రెండువందల నలభై రూపాయలు కట్టి, దాఖలు చేస్తే--ఓ వారం పదిరోజుల్లో పోస్ట్ మేన్ల ద్వారా చిరునామా నిర్ధారణ చేసుకొని, మనకి ఓ కార్డు ఇస్తారట. అది ఓ సంవత్సరం పాటు చెల్లుతుందట. మళ్లీ నవీకరణకోసం నూట నలభై రూపాయలు కట్టాలట. ఇదోరకం కార్డు!

డ్రైవింగ్ లైసెన్సులు కూడా ఇక అంతర్జాలం లో దరఖాస్తు చేస్తే ఇచ్చేస్తారట! ఇప్పటికి బ్రోకర్ల వ్యవస్థని రద్దు చేశామని చెప్పి ఓ ముఫ్ఫై యేళ్లు అవుతున్నా, వాళ్ల ఆఫీసుల్లో వుద్యోగులు సుఖపడుతూ, వాళ్ల స్థానాల్లో తక్కువజీతాలకి ప్రైవేటు వ్యక్తులచేత పనిచేయిస్తూ, కార్యాలయం చుట్టూ తిరిగి, వాళ్ల ముడుపులు చెల్లిస్తేనేగానీ రాని లైసెన్సులు--ఇక ఆన్ లైన్ లో దరఖాస్తు చెయ్యగానే వచ్చేస్తాయంటే--నవ్వుతారా?!

ఇంక, పట్టాదారు పాస్ పుస్తకలమీదా, భూయాజమాన్య హక్కు పుస్తకాలమీదా, "యూనిక్" నెంబర్లు వేస్తున్నారట.

గ్రామ సభల్లో, రైతుల దగ్గరవున్న పుస్తకాల మీద వేస్తే, బ్యాంకుల్లో వున్న పుస్తకాలని బ్యాంకువాళ్లే పట్టుకెళ్లి వేయించుకోవాలట! ఇది ప్రారంభించి నెలన్నర అయినా, మా జిల్లాలో ఇప్పటివరకూ ఓ 15 శాతం మాత్రమే ఇప్పటివరకూ పూర్తయ్యాయట.

సారవా పంటల సీజన్లో, పాసు పుస్తకాలన్నీ బ్యాంకుల్లోనో, సొసైటీల్లోనో, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గరో వుంటాయి అని ఈ ప్రభుత్వానికి తెలియదా?

పైగా ఈ నెంబర్లు లేకపోతే ఆ పాసు పుస్తకాలిక చెల్లవు అని బెదిరింపోటి!

ఇక ఆధార్ సంగతి--ప్రజాపంపిణీ వ్యవస్థతో పెట్టుకుంటే, కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే--అని ఇదివరకే వ్రాశాను. ఇప్పుడు హైదరాబాదులో మొదలుపెట్టారో, పెడతారోనట.

అసలు బుధ్ధున్నవాడెవడైనా, ఓ తేదీని నిర్ధారించి, ఆ రోజునించీ పుట్టిన ప్రతీ శిశువుకీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ అని పెట్టి, వాళ్లకి--సెల్ నెంబర్లలాగా 9 తో మొదలుపెట్టి 16 అంకెల సంఖ్యని ఇవ్వడం ప్రారంభిస్తే, ఇప్పటికి కొన్ని కోట్లు జారీ అయ్యేవి. 

వీటితోపాటు ఇప్పుడున్నవాళ్లకి 0 తో మొదలు పెట్టి జారీ చెయ్యడం మొదలు పెట్టచ్చు. ఇవికూడా ఇప్పటికే కొన్ని కోట్లు జారీ అయ్యుండేవి!

మన అధికార వ్యవస్థతో ఇలాంటివి సాధ్యమంటారా? వీటివల్ల యేమైనా వుపయోగం వుంటుందంటారా?

ఇప్పటికీ రేషన్ కార్డూ, వోటూ లేని నాలాంటివాళ్లెంతమందో! మాకు ఆధార్ సంఖ్య అయినా వస్తుందో రాదో!

అనుభవించేవాళ్లు అనుభవిస్తూనే వుంటారు--మనమూ 'అనుభవిద్దాం' మరి! 



Monday, September 13

కబుర్లు

అవీ ఇవీ - 3

గుజరాత్ హోం మంత్రి అమిత్ షా ని పోలీసులు అరెస్ట్ చేస్తామనడం, తరవాత ఆయన కోర్టులో లొంగి పోవడం, ఇదంతా రాజకీయ కుట్ర అని కొందర రా నా లు ప్రకటనలివ్వడం--ఇవన్నీ మామూలు వార్తలే అని నేను పట్టించుకోలేదు.

అసలు విషయం మాడభూషి శ్రీధర్ నిన్న (12-09-2010) ఈనాడులో వ్రాసిన వ్యాసం చదివాక అవగతమయ్యింది!

సొహ్రబుద్దీన్ (బూటకపు) ఎన్‌కౌంటర్ కేసులో ఆయన్ని అరెస్ట్ చేశారట. సొహ్రబుద్దీన్ నూ, ఆయన స్నేహితుడు ప్రజాపతి ని తరవాత ఆయన భార్య కౌసర్ బీ ని, --ఓ బస్సులోంచి దింపి తీసుకెళ్లి, కాల్చి, అత్యాచారం చేసి, విషం ఇచ్చీ చంపేశారట పోలీసులు.

అసలు సొహ్రబుద్దీన్, ప్రజాపతి అమిత్ షా అనుచరులేనట. వాళ్లిద్దరూ అనేకమంది పోలీసు అధికారులతో కలిసి, బలంతపు వసూళ్లు లంటి నేరాలకి పాలుపడేవారట. తరవాత యెందుకో వీళ్లకి చెడి, ఎన్‌కౌంటర్ చెయించేశాడట.

ఇంకా అమిత్ షా మీద 197 కేసులు వున్నాయట. కొన్ని వేల గంటల ఫోను సంభాషణలు సాక్ష్యం గా దొరికాయట.

మానవహక్కుల న్యాయవాది ముకుల్ సిన్‌హా, ఆయన భార్య నీర్జారీ, జన సంఘర్ష్ మంచ్ అనే సంస్థ ద్వారా ఈ కేసులన్నీ బయటికి వచ్చేలా చేసి, సీ బీ ఐ సుప్రీం కోర్టులో కేసు పెట్టేలా చేశారట.

ఇదీ--ఓ హోం మంత్రి చరిత్ర.

మనదేశ టెలికామ్ పితామహుడు శాం పిట్రోడా, వచ్చే ముఫ్ఫై యేళ్లలో కాగితం డబ్బు మాయమౌతుందనీ, ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్ రూపం లోనే జరుగుతాయి అనీ తన తాజా గ్రంధం లో వ్రాశారట. ఇవన్నీ మోబైల్ ద్వారానే జరుగుతాయని కూడా అన్నారట. సాధ్యమేనా అని సందేహం వున్నా, ఆయన అన్నాడు కాబట్టి నిజం కావచ్చేమో అనిపిస్తుంది.

మహమ్మదీయులు చేసే ప్రార్థనని 'నమాజ్' అంటారు. దాన్ని వాళ్లు ప్రతీరోజూ ఐదు సార్లు చెయ్యాలి. సాధారణం గా పెద్దవాళ్లూ, చాందసులూ తప్ప, మిగిలినవాళ్లందరూ ఇలా ఐదుసార్లు చెయ్యరు. ఈ నమాజ్ ఇంట్లో అయినా, వీధిలో అయినా, ఆసమయం లో యెక్కడ వుంటే అక్కడ చెయ్యచ్చు. ఆడవాళ్లు ఇంట్లోనే చెయ్యాలి.

ఇక పర్వదినాల్లో, సామూహికం గా నమాజ్ చెయ్యడానికి 'మసీదు 'లు యేర్పాటు చేస్తారు. అంటే ఓ ఖాళీ స్థలం లో ఓవైపు, మక్కా యెటువైపు వుందో సూచిస్తూ ఓ గోడకడతారు. దానికి యెదురుగా నమాజ్ చేస్తే సరిగ్గా మక్కా వైపు తిరిగి చేసినట్టు. అంతే. (స్థలం యెక్కువ వుంటే, వంటశాలలూ, భోజన శాలలూ, కార్యాలయాలూ కూడా కట్టచ్చు)

మహాత్ములూ, ప్రవక్తలూ, వాళ్ల అవశేషాలూ సమాధి చేసిన చోట్లని 'దర్గా'లు అంటారు. ఆ దర్గాల్లో, ఆ సమాధుల దగ్గర ఆ మహాత్ములని ప్రార్థిస్తే, కోరికలు తీరుతాయని నమ్మకం. సాధారణం గా అన్ని మతాలవారూ వీటికి వెళ్తారు.

వీటిలో యేకోవకీ చెందని 'తాజ్ మహల్' దగ్గర మహమ్మదీయులు ప్రార్థనలు చెయ్యడం ఇదివరకు లేదు. మరి ఇప్పుడు అక్కడకూడా రంజాన్ సందర్భంగా ప్రార్థనలు చేస్తున్నట్టు పత్రికల్లో ఫోటోలు వచ్చాయి!

ఫరవాలేదు--వాళ్ల మతం లో కూడా మూఢనమ్మకాలు బాగానే వ్యాప్తి అవుతున్నాయన్నమాట.

శుభం! ముబారక్!

........గణానాంత్వా


బెంగళూరు లో మా పౌత్రుడి వినాయకుడు



వీడి వయసూ యేడాదిన్నరే!

"ఓమ్ బోం, బోం, బోం, నమః" అనేస్తున్నాడు.

సమస్త సన్‌మంగళాని భవంతు.

Sunday, September 12

విఘ్నరాజా




అట్లాంటాలో మా దౌహిత్రులు పూజకి సిధ్ధం చేసుకున్న వినాయకుడు.


"పూజ బా చేశాను కదా?" అంటున్న మా దౌహిత్రుడు (ఇద్దరిలో చిన్నవాడు)

ఇంకా అన్ని మాటలు పూర్తిగా రావు లెండి--వాడి వయసు యేడాదిన్నర.

సర్వేజనా సుఖినో భవంతు!



కబుర్లు

అవీ ఇవీ-2

అతడే ఓ సైన్యం! పేరు జూలియన్ పాల్ అస్సాంజ్. ఆస్ట్రేలియన్.

చేసిందేమిటి? ప్రపంచ ప్రఖ్యాత వికీలీక్స్ స్థాపకుడు. ప్రపంచానికి తెలియని, అమెరికా యెవరికీ తెలియ కూడదనుకున్నవీ, తన వెబ్ సైట్ లో విడియోలతో సహా పెట్టి సంచలనం సృష్టించాడు. అగ్రరాజ్యం వెన్నులో వణుకు పుట్టించాడు.

అన్నిదేశాల మాజీ పోలీసు అధికారులూ, అసమ్మతి నేతలూ, ప్రభుత్వోద్యోగులూ, మానవహక్కుల కార్యకర్తలూ అనేకమంది "అఙ్ఞాతం" గా, తమంతట తామే, రహస్య సమాచారం అందిస్తున్నారట ఈ వెబ్ సైట్ కి. (మన అఙ్ఞాతలు నేర్చుకుంటే బాగుంటుంది!)

విషయమేమిటంటే, అస్సాంజ్ సృష్టించిన 'ద ఆనియన్ రూటర్ ' అనే ప్రొటోకాల్ వల్ల, అసలు సమాచారం యెక్కడినించి వచ్చిందో పట్టుకోవడం అసాధ్యం ట.

అఫ్గాన్ యుధ్ధానికి సంబంధించిన 90 వేల కీలక పత్రాలను బయటపెట్టాడు ఇప్పటివరకూ!

ఇప్పుడు ఇక, ఇరాక్ యుధ్ధ రహస్యాలని బయట పెడతాననీ, అవి మూడు రెట్లు తీవ్రమైనవి అనీ ప్రకటించాడట. బెస్టాఫ్ లక్ చెపుదామా?

ఇదివరకులా కాకుండా, పాకిస్తాన్ ప్రభుత్వ పాలకుల తప్పిదం (దింపేసిన పాలకుణ్ని వురి తీసెయ్యకపోవడం) వల్ల, ఇప్పుడు ముషారఫ్ మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి  వస్తాడట. కొత్తపార్టీ పెట్టి, 2013 యెన్నికల్లో పాల్గొంటాడట. దీన్ని పాక్ పార్టీలన్నీ వ్యతిరేకిస్తూ, దేశరాజకీయాల్లో ఆయనకు స్థానం లేదంటున్నారట! తీరిగ్గా ఇప్పుడు వగచి లాభమేమిటో!

అన్నట్టు, పాకిస్థాన్ లో నిన్న విడుదల అవవలసిన సల్మాన్ ఖాన్ చిత్రం 'దబాంగ్' నిషేధించారట. ఇంకా తమ అన్ని టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే భారతీయ కార్యక్రమాలన్నీ నిషేధించారట.

ఓ పక్క పండగరోజునే వేర్పాటువాదులు శ్రీనగర్ లో ప్రభుత్వ కార్యాలయాల్ని దహనం చేసే కార్యక్రమం మొదలు పెట్టారు.

భద్రతాదళాల ప్రత్యేక చట్టాన్ని రద్దు చెయ్యడం కాదు, వాళ్లకి మరిన్ని అధికారాలు ఇచ్చి, వాళ్లని యేరిపారేసే ప్రయత్నం చేస్తే బాగుండును.

అసలు మన సిగ్గులేని ప్రభుత్వం పాకిస్తాన్ ని "శాశ్వత శత్రు దేశం" గానూ, బంగ్లాదేశ్ ని 'అవాంఛిత దేశం ' గానూ ప్రకటించేస్తే, దేశం లో మూడు వంతులు నేరాలు తగ్గిపోతాయేమో!

అదేదో దేశం లో, హేరిస్ మూర్ అనేవాడు చిన్నా పెద్దా దొంగతనాలకి అలవాటు పడ్డాట్ట. ఓ సారి అలా పోలీసుల్నించి పారిపోతూ, దగ్గర్లో వున్న విమానాశ్రయానికి చేరి, అక్కడున్న ఓ విమానం యెక్కి, దాన్ని యెగరేసుకుంటూ తీసుకెళ్లిపోయి, బహమాస్ లోని అబాకో ఐర్లాండ్ లో దింపాడట.

"విడియోగేములు ఆడిన అనుభవం తో, ఇంటర్నెట్ ద్వారా నేర్చుకున్న విద్యతో" ఆ పని చేశానని చెప్పాడట.

అంతేకాదు--అలా మొత్తం ఐదుసార్లు విమానాలని యెత్తుకెళ్లాడట!

ఇదేదో "నమ్మూ-నమ్మకపో" లో వుండవలసిందిగా కనపడడం లేదూ? కనీసం బులేనా లైనా నమ్మేలాగుందా?

యేమో!

.......అవీ ఇవీ ఇంకోసారి.

(బ్లాగ్ మిత్రులు చాలా మంది, నా అన్ని బ్లాగుల్లోనూ, వినాయక చవితి శుభాకాంక్షలు అందించారు. చాలా సంతోషం. వాళ్లందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు అనుగ్రహించబడాలని ఆశిస్తాను. విడివిడిగా అందరికీ జవాబు ఇవ్వలేకపోతున్నందుకు క్షంతవ్యుణ్ని.)

Saturday, September 11

కబుర్లు

అవీ ఇవీ

మహా మేథావులకైనా, చిన్న చిన్న విషయాలు తట్టవు.

ఐన్ స్టయిన్ తన పిల్లి ఇంట్లో స్వేచ్చగా తిరగాలని, అన్ని తలుపులకీ పిల్లి పట్టే కన్నాలు చేయించాడట.

తరవాత, ఆ పిల్లికి యేడు పిల్లలు పుట్టగానే, మళ్లీ అన్ని తలుపులకీ, పెద్ద కన్నం పక్కనే యేడేసి చిన్న కన్నాలు పెట్టించాడట!

మన మన్మోహన్ గారిని అత్యున్నత న్యాయ స్థానం ముక్కిపోయి సముద్రం లో పారబోసే కన్నా, అహారాన్ని వుచితంగా పంపిణీ చెయ్యమంటే, అది జరిగేపని కాదు--దారిద్ర్యరేఖ క్రింద వున్న వాళ్లందరికీ అవి పంపిణీ చెయ్యాలంటే, ఒక్కొక్కళ్లకీ ఓ చెంచాడు మాత్రమే వస్తాయి--అన్నాడట.

పైగా, న్యాయస్థానాలు మా అధికారాల్లో వేలుపెట్టడమేమిటీ అని చుర్రుబుర్రులాడాట్ట.

అంతేగానీ, కనీసం కరవుజిల్లాల్లోనైనా పేదలకి వాటిని వుచితం గా పంచిపెట్టవచ్చని ఆయనకి తోచ లేదు.....సలహాదారులెవరూ ఆయనకి సూచించలేదు!

మొన్న వుపాధ్యాయ దినం....సారీ....దినోత్సవం నాడు మా జిల్లాలో ఓ 75 కి పైగా వుత్తమ వుపాధ్యాయులకి, ఓ నలుగురైదుగురు రా నా లూ, అధికారులూ బహుమతి ప్రదానం చేస్తూ, వరసగా పేపరంతా ఫోటోలు వేయించుకున్నారు.

అది చూస్తుంటే, రేలంగి పాట--"నీ చెయ్ పైనా, నా చెయ్ క్రిందా....ఇచ్చి పుచ్చుకొను ఋణమే బాబూ" అన్న పాట గుర్తొచ్చింది నాకు! పొట్ట చింపితే అక్షరమ్ముక్క వుందోలేదో గానీ, పదవుల వల్లే కదా వాళ్లది పై చెయ్యి అయ్యింది!

మొన్నోసారి యెప్పుడో వ్రాశాను--ఓ పదేళ్ల క్రితం, నాలుగేళ్ల వయసులోనే, ప్రపంచ దేశాల పేర్లనీ, వాటి రాజధానులనీ, జెండాలనీ గుర్తుంచుకొని, టకటకా చెప్పేసిన చైల్డ్ ప్రాడిజీ ఇప్పుడేమి చేస్తున్నాడో--అని.

మన మీడియా సృష్టిస్తున్న తెలుగు తేజాల గురించి కూడా అలాగే అనుకుంటుంటే, మొన్న ఈనాడు ఆదివారం వారు ఓ వ్యాసం ప్రచురించారు.

అందులో, మన రూపాయికి గుర్తుని రూపొందించిన ప్రొఫెసర్ ఉదయ్; ఆధార్ సంఖ్యకి లోగో ని సృష్టించిన సుధాకర్ రావ్ పాండే; మొదటి నానో కారు దక్కించుకున్న ప్రకాశ్ విచారే; టీ20 జోగిందర్ శర్మ; ఫోర్త్ ఇడియట్ ఓమీ వైద్య; రాహుల్ అణువొప్పందం తో లింకు పెట్టిన కళావతి; ఐఐటీ బుడతడు సాహల్ కౌశిక్; స్మైల్ పింకీ ల గురించి ప్రస్తావించారు. బాగుంది.

ఇక ఇండియన్ ఐడల్ కాలేకపోయిన కారుణ్య--అప్పట్లో ఎస్సెమ్మెస్ కి రెండో, నాలుగో రూపాయలు చార్జ్ వుండేది. అయినా, మా ఇంటిల్లపాదీ, యెవరికి గుర్తొస్తే వాళ్లు నా మొబైల్ లోంచి ఓ ఎస్సెమ్మెస్ ఇచ్చి, ఓ రెండు మూడు వందలు తగలేశాం--ఇప్పుడెక్కడ?

ఎస్సెమ్మెస్ లు వుచితం గా అందడంతో గెలిచిన శ్రీ రాం రేపెక్కడో?

ఇంకా అవీ ఇవీ......మరోసారి!

Sunday, September 5

రాజకీయం

యెత్తుగడలు

యతులూ, ప్రాసలతో అనర్గళం గా గంటలతరబడి ప్రసంగించగల మా తరం రాజకీయుడు వెంకయ్యనాయుడు, వారసత్వ పదవుల్నీ, మన్మోహన్నీ విమర్శిస్తూనేవున్నాడు.

పెద్దతరం రా నా లు, ఇంకా పెద్ద రాజకీయం చెయ్యబోతున్నారని యువతరం రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు!

అణు వొప్పందాన్ని పట్టాలకెక్కించిన వాజపేయీ పుణ్యమాని, యూ పీ యే ప్రభుత్వం మళ్లీ అణుబిల్లు ని పాస్ చేయించగలిగింది--భా జ పా సమర్ధ్ధనతో!

దీనిభావమేమి? అని విశ్లేషిస్తున్నవారు చెపుతున్నదేమిటంటే--

యూ పీ యే చిన్నా చితకా పార్టీల మద్దతుతో కొనసాగుతోంది. ముఖ్యం గా, లాలూ, ములాయం, మాయావతి, మమత, కరుణానిధి, ఫరూఖ్, కొండొకచో యెర్ర పార్టీలు దానికి "అంశాలవారీగా" మద్దతు ఇస్తున్నాయి.

వీళ్లందరినీ బతిమాలే బదులు, భా జ పా తో ఓ చిన్న అవగాహనకి వస్తే--వచ్చే వందేళ్లపాటు అధికారం మనదే కదా అని ఆలోచిస్తూందట--రాజమాత!

నిజానికి ఆవిడకి కావలసింది--బాధ్యతలు లేని అధికారం! (రేపు తన కొడుక్కు అప్పచెప్పాలనుకుంటున్నది కూడా అదే!)

పదవిలో వుండి తన అత్తగారు, మొగుడూ యేం బావుకున్నారు? బలయి పోవడం తప్ప! ఆ బాధ లేకుండా అధికారం అంటే యెంత రంజుగా వుంటుంది!

అందుకే యీ వ్యూహం! భా జ పా మద్దతు ఇస్తే, తమ అధికారానికి యేమీ ఢోకా వుండదు కదా! యే యెన్నికలో అయినా తమ పార్టీకి, లేదా భా జ పా కే వోట్లు పడతాయి. మిగిలిన చిన్నా చితకా పార్టీలకెన్ని వోట్లు పడ్డా, యెన్ని సీట్లు వచ్చినా, వీళ్లిద్దరినీ కొట్టలేరు కదా?

భా జ పా వారినించి చిన్న అడ్జస్ట్ మెంట్ యేమిటంటే, రేపు మన్మోహన్ స్థానం లో కొన్నాళ్లు అద్వానీ, కొన్నాళ్లు మళ్లీ మీవాడూ, తరవాత అరుణ్ జైట్లీ, కొన్నాళ్లు మీవాడూ, తరవాత సుష్మా స్వరాజ్.........ఇలా ప్రథానులుగా కొనసాగవచ్చు--అని వొప్పుకోవడమే! (అధికారం మాత్రం సోనియా, రాహుల్, రాహుల్ పెళ్లి చేసుకొని కొడుకునో కూతుర్నో కంటే వాళ్లకీ.........ఇలా అన్నమాట!)

బాగుంది కదూ! మరో ఇరవై యేళ్లలోనే భారత్ అగ్రరాజ్యం నెంబర్ వన్ అవుతుంది--స్థిరమైన రాజకీయ నాయకత్వం తో! 

(ఈ లోపల జగన్ ఓ ఐదు వందల కోట్లో యెంతో ఖర్చుపెట్టి, 420 పైచిలుకు ఎంపీలని కూడగట్టకుండా వుంటే)

Friday, September 3

తెలుగోడు

సాగిలపడ్డం లో వెరయిటీ

తిరుపతి ఎం పీ డాక్టర్ చింతా మోహన్, చిత్తూరు జిల్లా మన్నవరం లో యేర్పాటవుతున్న 'భెల్' పరిశ్రమకి 'రాజీవ్ గాంధీ' పేరూ, మన్నవరానికి 'మన్మోహనపురం' అనీ పేరు పెట్టాలని ప్రతిపాదించారట (30-08-2010 న).

(అప్పటికే మన్నవరానికి వై యెస్ ఆర్ పురమని పేరుపెట్టేసి, పరిశ్రమ స్థలం వద్ద బోర్డులు కూడా పెట్టేశారుట. ఈ సంగతి ఆయనకి తెలియదేమో మరి!)

ఇదో వెరయిటీ కాదూ?

ఇంతకీ మన్మోహన్ కి కొడుకులు యెవరైనా వున్నారో లేదో, వాళ్లు రాజకీయాల్లో వున్నారో లేదో, ఆయన భార్య సోనియా అవుతుందో లేదో--ఇవన్నీ చూసుకోవద్దూ?

అలా సాగిలపడిపోవడమే???!!!

అన్నట్టు.....నా "క్యామెడీ చానెల్" లో ఇంతకు క్రితం వ్రాసిన టపాకి యేమీ స్పందనలు రాలేదు.

క్రింద లింకు ఇస్తున్నాను--అందరూ చదవలేదేమోనని.


చదవండి మరి.