Thursday, April 30

ఆత్తావియో ఖత్రొ

ఆత్తావియో ఖత్రొ చ్చి కి సీ బీ ఐ క్లీన్ చిట్!

‘ప్రతిపక్షాల అనవసర రాద్ధాంతం’ అంటున్న హెచ్ ఆర్ భరద్వాజ్!

Monday, April 27

తమిళపులి

దెబ్బతిన్న బెబ్బులి?

శ్రీలంక లో తమిళపులి ‘వేలుపిళ్ళై పిరభాకరన్ ‘ పట్టుబడడానికి సమయం దగ్గరకొచ్చిందంటున్నారు!

శాంతికాముకులకీ, తీవ్రవాద వ్యతిరేకులకీ చాలా సంతోషం గా వుంటుంది!
మన దేశం లో తమిళ రాజకీయులకి చాలా బాధగా వుంటోది!

మరి పిరభాకరన్ యెందుకు దెబ్బ తిన్నాడు?

ఒకటే సమాధానం—యే దేశమైనా తన సార్వభౌమత్వానికి సవాలు యెదురైతే, సహించలేదు, సహించ కూడదు!

భౌగోళికం గా, చారిత్రకం గా ఒక దేశం లో వుంటూ, సాంస్కృతిక కారణాలవల్లొ, మత సంబంధమైన కారణాలవల్లొ, వేరే దేశం గా విడిపోతామంటే అది విపరీతం! పైగా దానికి యెంచుకున్న పద్ధతి మరీ ముఖ్యం!

తెల్లవాడి ‘విభజించి పాలించు’ జిత్తులకి తలొగ్గకుండా, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యానికి తొందరపడకుండా వుంటే, ‘రెండు డొమీనియన్లు’ కి అంగీకరించకుండా వుంటే, మన పక్కలో బల్లెం—పాకిస్థాన్ తో మనకీ పాట్లు వుండేవి కాదు!

1948 లో పాక్ ని నియంత్రించడానికి జనరల్ కరియప్పకి అవకాశమిచ్చి వుంటే, కాంగ్రెస్ అతి నమ్మకంతో ఐక్యరాజ్య సమితికి పోకుండా వుంటే, మన కాశ్మీర్ సమస్యే వుండేదికాదు!

తరవాత, 1965, 1971 యుద్ధాల గురించీ, ప్రభుత్వం నిర్వాకం గురించీ ముందే మాట్లాడుకున్నాం!

భుట్టో మన దేశం మీద ‘వెయ్యేళ్ళ పవిత్ర యుద్ధం’ ప్రకటించడానికి కూడా ఈ సూత్రమే కారణం!

ఇక పద్ధతులకి వస్తే, తమిళ పులి యెంచుకున్నది—సాయుధ పోరాటం! అదీ ముక్కుపచ్చలారని పిల్లలతో! ఇంకా తీవ్రవాదాన్ని నమ్ముకోవడం!

రాజకీయం కోసం అప్పటిదాకా ‘ఈళం’ కి మద్దతు ఇచ్చిన రాజీవ్, మధ్యలో తెడ్డు జాపినట్టు ‘ఐ పీ కే ఎఫ్’ పేరుతో జొరబడి, చివరకి హత్య చెయ్యబడ్డాడు!

ఇక వాళ్ళ ప్రధాన మంత్రుల్నీ వదల్లేదు వాళ్ళు! హత్యలూ, హత్యా ప్రయత్నాలూ సాగించారు!

వాళ్ళ ప్రభుత్వం యెన్ని సార్లు చర్చలకోసం చెయ్యి సాచినా, యేదో వంకతో దాన్ని తిరస్కరించడం, కాల్పుల విరమణని పాటించకపోవడం లాంటివి కోకొల్లలు!

చివరికి ‘అల్టిమేట్ డెస్టినీ’ కి చేరక తప్పదు కదా?

ఇది ప్రతీ ఉద్యమానికీ, ఉద్యమ నాయకునికీ, ప్రభుత్వాలకీ, విద్రోహులకీ ఓ గుణపాఠం కావాలి!

అయితే బాగుండును!

పీ ఎస్ :- ఇప్పుడే అందిన వార్త--కరుణానిధి చిదంబరం మీదా, చిదంబరం మన్మోహన్ సింగ్ మీదా, మన్మోహన్ సోనియా మీదా, సోనియా భారత ప్రభుత్వం మీదా తెచ్చిన వత్తిడి ఫలితంగా, భారత ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వం మీద తెచ్చిన వత్తిడి ఫలించి, ఆ ప్రభుత్వం 'కాల్పుల విరమణ ' ప్రకటించిందట!

కరుణ తన 'నిరాహార దీక్ష ' విరమించారట!

Wednesday, April 22

జీవితం ఉచితం

ఉచితాల గురించి

‘కేపిటలిజం’-- నియంత్రణలేని విపణి వుండాలనీ, విపణిలో పరిస్థితులు ‘సరఫరా—గిరాకీ’ ల మీదే అధారపడాలనీ, సబ్సిడీలూ, ఉచితాలూ వుండకూడదు—అంటుంది!

కానీ, కొన్ని పరిస్థితులకి లోబడి, రాజకీయ లభ్ధి కోసం, అమెరికా లాంటి దేశానికి కూడా తప్పలేదు—కొన్ని ‘ఉచితాలు’ ప్రకటించకుండా!

అమెరికా లో వుండేవాళ్ళకి చాలా ముఖ్యమైనది ‘సోషల్ సెక్యూరిటీ నెంబరు’.

అక్కది ఉచిత పథకాల్లో ఒకటి, ‘సోషల్ సెక్యూరిటీ పధకం’.

దీని కింద, ఉద్యోగం కోల్పోయిన వాళ్ళకి (పింక్ స్లిప్డ్ ఎంప్లాయీస్ అంటారు వాళ్ళని) నెలకి ఇంత అని ప్రభుత్వమే నిరుద్యోగ భృతి ఇవ్వడమే ఈ పథకం!

కొన్ని పరిణామాలవల్ల అక్కడి మాఫియా బలపడి, ‘మనీ లాండరింగ్’ లాంటివి పెరిగిపోయాయి అక్కడ! ‘స్లాట్ మెషీన్లు’, 'వెండింగు మెషీన్లు’ మొదలైనవి వాళ్ళ కంట్రోల్ లోనే వుంటాయి.

ఈ పధకంతో ‘లోన్ షార్కింగ్’ మొదలయ్యింది!

ఇప్పటికే, మనదేశం లో మాజీ ఫ్యాక్షనిష్టులూ, నడమంత్రపు సిరి రాజకీయులూ, మాఫియా లెవెల్లో వ్యవహారాలు నడిపిస్తున్నారు. మనీ లాండరింగు కి మంచి ఉదాహరణలు సత్యం రామలింగ రాజూ, వై యెస్ జగన్ కంపెనీలూ!

ఇంక ఉచిత నగదు బదిలీ పధకం వస్తే, మనకి కూడా లోన్ షార్కింగ్ మొదలవుతుంది!

ఇప్పటికే, ప్రైవేటు బ్యాంకులూ, కొన్ని వ్యాపార సంస్థలూ వాటి వసూళ్ళకి గూండాలని ఉపయోగించుకుంటున్నాయి.
ఇక ప్రతీ వూళ్ళోనూ వీధికో డజను చొప్పున వెలిసిన ‘మైక్రో ఫైనాన్స్’ సంస్థలు యెలా విచ్చలవిడిగా అప్పులిస్తున్నాయో, యెలా వసూలు చేసుకుంటున్నాయో తెలుసు కదా?

లోన్ షార్కింగ్ అంటే, ప్రజలకి వచ్చే నియమిత అదాయానికి ఇన్నిరెట్లు అని అప్పు ఇచ్చి, ప్రతీ నెలా ఆ అదాయం రాగానే, వడ్డీ వసూలు చేసుకు పోవడం! అసలు మాట దేవుడెరుగు, వడ్డీ కూడా పూర్తిగా కట్టలేక చేతులెత్తేసి, మాఫియా చేత వికలాంగులుగా చెయ్యబడ్డవారూ, చంపబడ్డవారూ కోకొల్లలు అక్కడ. ఒక మనిషిని నేల మీద బోర్లా పడుకో బెట్టి, మోకాళ్ళ మడతల్లోంచి పెద్ద పెద్ద మేకులు మోకాలి చిప్పలగుండా నేలలో దిగేలా కొట్టేశారంటే—వాళ్ళు యెంత కౄరంగా ప్రవర్తిస్తారో అర్ధం చేసుకోవచ్చు!

మరి మన దేశం లో కూడా అలాంటి పరిస్థితులు రావని నిశ్చింతగా వుండగలమా?

ఇప్పటికే మైక్రో ఫైనాన్స్ వల్లా, గ్రూప్ లెండింగ్ ద్వారా ద్రవ్య సరఫరా పెరిగిపోయి ద్రవ్యోల్బణం పెరిగి పోయింది!

ప్రభుత్వమూ, మీడియా ద్రవ్యోల్బణం రేటు ‘సున్నా’ దగ్గరకి వచ్చేసింది అనీ, వ్యతిరేక ద్రవ్యోల్బణం రావచ్చు అనీ, అది చాలా ప్రమాదకారి అనీ, ఓ ఊదరగొట్టేస్తున్నాయి!

ప్రభుత్వమేమో, కాకుల్లెక్కలు చెపుతూ, రిజర్వ్ బ్యాంకు మీద వత్తిడి తెచ్చి, బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించేలాగ బోళ్ళు చర్యలు తీసుకొనేలాగ చేస్తోంది!

మరి కొన్ని లక్షలు మార్కెట్ లోకి వచ్చేస్తే అప్పుడు ద్రవ్యోల్బణం సంగతేమిటి?

ఉచితాలకి తోడు, ఋణ మాఫీలు కూడా ప్రకటిస్తుంటే, ఇక బ్యాంకుల అప్పులెవరు తీరుస్తారు? బ్యాంకుల లోని ప్రజా ధనానికి భద్రత యేముంటుంది?

పైగా, బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు తగ్గుతూవుంటే, ద్రవ్యోల్బణం పెరుగుతూ వుంటే, జనం డబ్బెందుకు దాస్తారూ? యెప్పటికప్పుడు ఖర్చు పెట్టెయ్యరూ!

అలోచించండి మరి!

Wednesday, April 15

ఫ్యాషన్

ఫ్యాషన్

సరిగ్గా నలభై యేళ్ళ క్రితం, మేం పీయూసీ లో వుండగా, మా బిజినెస్ ఆర్గనైజేషన్ ఉపన్యాసకులు చెప్పిన జోక్ ఇది!

(ఆ మహానుభావుడికి అప్పట్లో ఓ 35 యేళ్ళు వుండి వుంటాయి. నీటుగా టక్ చేసుకొని వచ్చి, కుర్చీలో కదలకుండా కూర్చొని, ఉపన్యాసం ఇచ్చేవారు! మేము ఈ మాత్రం వాణిజ్యం గురించి నేర్చుకున్నామంటే, అది ఆయన భిక్షే! నేను చెయ్యెత్తి నమస్కరించేవారిలో ఆయనొకడు. ఆ తరవాత కాలేజ్ ప్రిన్సిపాల్ గా కూడా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇంతకీ ఆయన ఆ సంవత్సరంపాటూ మాకు చెప్పింది—సోల్ ట్రేడర్, పార్ట్ నర్ షిప్, జాయింట్ స్టాక్ కంపెనీలగురించి మాత్రమే!)

ఇక జోక్!

ఒక యువకుడు పారిస్ నగర వీధుల్లో, చంకలో ఓ ప్యాకెట్ పెట్టుకొని వేగం గా పరుగెడుతున్నాడట.

అంతలో ఓ స్నేహితుడు కనిపించి అడిగాడట “యెందుకలా కొంపలు మునిగిపోయినట్టు పరిగెడుతున్నావు?” అని.

పరుగు ఆపకుండానే జవాబిచ్చాడట ఆ యువకుడు—“మా ఆవిడ లేటెస్ట్ ఫేషన్ గౌను తెమ్మంది—పట్టుకెళ్తున్నాను—ఇంటికి చేరేలోగా మళ్ళీ ఫేషన్ మారి పోతే, మళ్ళీ ‘లేటెస్ట్’ ఫేషన్ తెమ్మంటుంది—అందుకే ఫేషన్ మారేలోగా ఇల్లు చేరాలి” అని వగర్చుకుంటూ పరుగు సాగించాడట!

అదీ జోకు!

మరి ఇప్పుడో?

ఈ నాటికికూడా ఫేషన్ రాజధాని పారిస్ మాత్రమే అంటే అతిశయోక్తి కాదు కదా?

Sunday, April 12

......ఉచితం

జీవితం ఉచితం

మహాభారత యుద్ధం లో శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా అన్నాడు.
“ఏమయ్యా! అనవసరమయిన బెంగలు పెట్టుకోక నన్నే నమ్ముకుని ఉండు. నీ పనులన్నీ నేనే చేస్తాను.” అని.

తమిళనాడు ముఖ్యమంత్రిగారు దాదాపు అలాంటి హామీనే తమిళ ప్రజలకు ఇచ్చారు. “మీరేమీ అందోళనలు పడక నాకే ఓటు వెయ్యండి. మీ అవసరాలన్నీ నేను తీరుస్తాను.” అని.

ఫ్రజలు ఆయనకు ఓటు వేశాక ఆయన ఇటీవలే పదేళ్ళ లోపు పిల్లలందరికీ ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేశారు. ఆపని కోసం ప్రభుత్వ సిబ్బంది నానా హైరానా పడుతూ కృషి చేస్తున్నారు. కొందరు గిన్నెలు, గరిటెలు, మూకుళ్ళు, విస్తళ్ళు, కొనే పని మీద వున్నారు. కొందరు పిల్లలు కూర్చోడానికి షెడ్లు కడుతున్నారు. మరికొందరు ఆవాలు, ధనియాలు, పప్పులు కొనుక్కొచ్చే హైరానాలో వున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల వయస్సులు సరిగ్గా లెక్కవేసుకొని అక్కడ భోజనాల బంతుల్లో పిల్లల్ని కుర్చోపెట్టే హడావుడిలో ఉన్నారు.

ఇదిలా ఉండగా మరొక ఉచిత సౌకర్యం ముఖ్యమంత్రిగారు చేస్తున్నారు—అక్టోబరు రెండవ తేదీ నుంచి పిల్లలందరికి పళ్ళపొడి ఉచితంగా ఇస్తారు. దీని కోసం 48 లక్షలు ఖర్చు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఈ ఉచిత పళ్ళపొడి దక్కడానికి పిల్లల పళ్ళు త్వరగా ఊడిపోకుండా జాగ్రత్త పడతారు. అందరూ పళ్ళు తోముకుని – ముఖ్యమంత్రిగారు రాగానే చిరునవ్వుల్తో కనిపిస్తారని నా నమ్మకం. మా ఆవిడ ఈ వార్త చదివి, “ఉచితంగా పెద్దలకి వక్కపొడి ఇస్తే బాగుణ్ణు” అంది. అప్పుడు నాకనిపించింది – రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగారు ఆయా వయస్సుల వాళ్ళకి వక్క, కారబ్బూంది, సున్నుండలు, మిరపకాయబజ్జీలు, కోడి పలావు, చివరగా ఉచిత బ్రాంది సదుపాయాలు చేస్తారని ఆనంద పడ్డాను.


అయితే మంచి వెనుక ఏదో ఒక లోపమో చెడో జరగవచ్చు. దాన్ని ఎవరు ఆపలేరు. అప్పుడే పప్పుధాన్యాలు దొంగతనంగా అమ్ముకుంటున్న ఒక మనిషి అరెస్టయ్యాడట. ఆబాధ భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడట. ఏపనీ చెయ్యకుండా మందుకొట్టి మొదట్లో కూర్చున్న పిల్లల తండ్రి రెండు పూట్లా ఈ సంతర్పణలకి పిల్లల్ని పంపి ఇంటి దగ్గర చిన్న సైజు “అన్న దుకాణం” తెరిచినా ఆశ్చర్యం లేదు. అన్నీ ఉచితంగా దొరికిన పేద వాళ్ళు ఏంచేయాలో తెలీక సరదాగా చిల్లర దొంగతనాలూ, సరదా హత్యలూ, చిన్న చిన్న దోపిడీలు చేసినా తప్పులేదు. సుఖం మనిషికి ధైర్యాన్నిస్తుంది. నిరుద్యోగులకి బోనస్ లు లభించే స్కీము ఆధారం చేసుకుని – చిన్న సైజు గుండాయిజం నీగ్రోలు వుంటున్న ప్రాంతాల్లో అమెరికాలో ప్రారంభమయిందని మనం చదువుకున్నాం. రాత్రి పదిగంటలకి మద్రాసు నగరంలో కొన్ని ప్రాంతాల్లో నడవడం కూడా కష్టమని అస్మదాదులకి తెలుసు.

మనిషికి ఏదో ఒకటి సాధించడం అన్నది తృప్తినిస్తుంది. సాధించాలన్న కృషే జీవితం. ఏం సాధించాలో తెలీని సందర్భంలో ఎంతో సంపన్నమైన స్థితిలో వున్నవారు ఆత్మహత్య చేసుకోవడం మనం వింటున్నాం. పేదవారిని పేదగా వుంచడం ఎవరి వుద్దేశ్యం కాదు కాని, ప్రతి వ్యక్తి కష్టపడే అవకాశం, కష్టపడితే ఫలితం దక్కే అవకాశం ప్రభుత్వం కలిపిస్తే, ఏదో ఒక పని చేయాలన్న తపన. చేసిన ప్రతిఫలం సమాజానికీ, దేశానికీ దక్కుతుంది.

లేదా ముఖ్యమంత్రుల్ని ఎన్నుకుంటే – ఉచితంగా భోజనం, పళ్ళపొడి, గావంచా, సినిమా టిక్కెట్లు – లభిస్తాయన్న అలసత్వంలో ప్రజలు పడితే – వాళ్ళు తిరుగువాటు కాలాన్ని ఏం చెయ్యాలో తెలీక జేబులు కొట్టడం ప్రారంభిస్తారు.

* * *

—ఇది శ్రీ గొల్లపూడి మారుతీ రావు 27 యేళ్ళ క్రితం, అంటే 10-9-1982 న, “ఆంధ్ర జ్యోతి” లో ‘జీవనకాలం’ అనే శీర్షిక క్రింద వ్రాసిన వ్యాసం!

మరి అప్పటికీ ఇప్పటికీ యేమైనా మార్పు వచ్చిందా?

రాలేదంటే దానికి బాధ్యులెవరు?

మనమేమీ చెయ్యలేమా?

ఇవాళ టివీల్లో ప్రసారమైన జయప్రకాష్ నారాయణ్ ప్రసంగ పాఠాన్ని వినండి!

సత్తా జనాస్సుఖినోభవంతు!

Saturday, April 11

వినతి

నా బ్లాగు చదువరులకి.....

నేను నా ఇంటికి కొన్ని అలంకరణలు, మార్పు చేర్పులు చేయించిన కారణంగా నా 'సిస్టం' ని భద్రం చెయ్యవలసి రావడం మూలాన, ఈ మధ్య వ్రాయలేక పోయాను!

క్షంతవ్యుణ్ణి!

ఇదిగో! ఇక్కడనించీ, వీలైతే ప్రతీ రోజూ......!

ధన్యవాదాలు!

Tuesday, March 10

మిధ్య

“25,00,00,000” కోట్లు!

ఆసియా డెవలప్ మెంట్ బ్యాంకు అంచనాల ప్రకారం క్రితం యేడాదిన్నరలో ‘హరించుకుపోయిన’ ప్రపంచ సంపద (ట)! ఇది నిజం అంటోందట ఏ డీ బీ!

అసలు నిజం నేనెప్పుడొ చెప్పాను—‘ఊరువెలుపల పాడు కోనేటి చెంత……….’ అని!
అదే సంపద! అదే వృద్ధి! అదే హరించుకుపోవడం!

“గజం మిధ్య! పలాయనం మిధ్య!

కాదా?

Monday, February 16

దేశ భక్తి

ఇంక మా తరానికి వొస్తే, మేము నోట్లో వెండి చెంచా తో పుట్టక పోయినా, కష్టం అంటే యేమిటో తెలియకుండా పెరిగాము!

మా తాతలు కష్టాలు పడ్డారు, మా తండ్రులు కష్టాలు పడ్డారు కానీ, మాకు కష్టం అంటే యేమిటో తెలియకూడదు అని వాళ్ళు అహోరాత్రం కష్ట పడ్డారు!

ఓ క్రమ శిక్షణలో పెంచారు!

ఎలిమెంటరీ స్కూల్ లో నాలుగవ తరగతి నించే, ‘కబ్స్’ అని, (స్కౌట్స్ కి జూనియర్ డివిజన్) వుండేది—అందులో చేరమని ప్రోత్సహించేవారు!

హై స్కూల్ లో ఆరో తరగతి నించి ‘భారత్ స్కౌట్స్ & గైడ్స్’ శిక్షణ వుండేది!
ఇది కాకుండ, ప్రత్యేకంగా వారానికో పీరియడ్ ‘సిటిజన్ షిప్ ట్రైనింగ్’ వుండేది. వీటిలో క్రమ శిక్షణతో పాటు—పరిశుభ్రత, ప్రధమ చికిత్స, లోకోపకారం, పౌర నిబంధనలు (రోడ్డు మీద యెటువైపు నడవాలి, రోడ్డు యెలా దాటాలి లాంటివి) కూడా చెవినిల్లు కట్టుకొని బోధించే వారు!

యెనిమిదో తరగతి నించీ ‘నేషనల్ కేడెట్ కోర్’ (ఎన్. సీ. సీ.)—ఇంకొంచెం కఠిన క్రమ శిక్షణ, శారీరక శ్రమ, కొంచెం క్లిష్టమైన నియమావళి—లీడర్ చెప్పిన దాన్ని వెంటనే ఆచరించడం, తోటి విద్యార్ధులతో చక్కగా సహ జీవనం, కేంపులు, ఆయుధాల శిక్షణ, మేప్ రీడింగ్—ఇలా మిలిటరీ కి సంబంధించిన శిక్షణ ఇచ్చి, ఏ సర్టిఫికెట్ ఇచ్చే వారు—ఉత్తీర్ణులకి!

ఇక కాలేజ్ లో సీనియర్ డివిజన్ ఎన్. సీ. సీ. దీంట్లో మళ్ళీ ఆర్మీ డివిజన్, నేవీ డివిజన్ రెండూ వుండేవి! చిన్న వూళ్ళలో ఎయిర్ ఫోర్స్ లేదు!

ఇంకా చక్కటి శిక్షణ ఇచ్చి, బీ-1, బీ-2, సీ సర్టిఫికెట్ లు ఇచ్చేవారు ఉత్తీర్ణులకి!
యాన్యువల్ ట్రైనింగ్ కేంపులే కాకుండా, అడ్వాన్స్డ్ లీడర్ షిప్ కేంపులూ, ఆర్మీ ఎటాచ్ మెంట్ కాంపులూ నిర్వహించేవారు! మంచి ట్రైనింగ్ పొందిన వారిలో ఒకరిద్దరికి, రిపబ్లిక్ డే పెరేడ్ లో పాల్గొనే అవకాశం వచ్చేది!

వారానికి రెండు పెరేడ్లు, యే కారణం చేతైనా కుదరక పోతే ఆదివారం డబల్ పెరేడ్, పెరేడ్ అయ్యాక అందరికీ ఉచితంగా టిఫిన్, డబల్ పెరేడ్ రోజున డబల్ టిఫిన్, అందరూ గబగబా ఇళ్ళకి వెళ్ళిపోతే, మిగిలిన వాళ్ళూ, లీడర్లూ, మిగిలిన టిఫిన్ పొట్లాలని సద్వినియోగం చెయ్యడం, తిరునాళ్ళూ, తీర్థాలూ వచ్చినప్పుడు బందోబస్తు నిర్వహించడం, కలరా వంటి జాడ్యాలు వ్యాపిస్తున్నాయంటే, మంచినీళ్ళలో (క్లోరిన్) మందు కలపడం అందరికీ అలవాటు చెయ్యడం—అన్నిటికన్నా మిగిలిన విద్యార్ధుల్లో ఓ ప్రత్యేకమైన గుర్తింపు—యూనిఫారం ధరించగానే ఓ ఠీవి—చాలా ఉత్తేజ పూరితంగా వుండేది!

ఇక కేంపుల విషయానికొస్తే, ఫిజికల్ ట్రైనింగ్ దగ్గర నించీ, అన్ని రకాలైన శిక్షణలూ ఇచ్చి, ఆయుధాల వినియోగం లో ప్రత్యేక శిక్షణనిచ్చి రైఫిళ్ళూ, గ్రెనేడ్లూ, మెషీన్ గన్లూ పేల్చడం, టాంకులూ, రాకెట్ లాంచర్లూ, యాంటి ఎయిర్ క్రాఫ్ట్ గన్ లూ, ఆర్ సీ ఎల్ గన్ లూ మొదలైన వాటితో ప్రత్యక్ష పరిచయం కలిగించి, వాటిలో శిక్షణ ఇవ్వడం ఒక యెత్తైతే, మన పనులు మనమే చేసుకోవడం, నిజమైన స్నేహాన్ని పొందడం, అనుభవించడం, కేంపు ఆఖర్లో (మిగిలిపోయిన బడ్జెట్ తో కొన్న రేషన్లతో) బడా ఖానా, సాంస్కృతిక కార్య క్రమాలు—వొదల్లేక వొదల్లేక పూర్తి ఆత్మ విశ్వాసంతో తిరిగిరావడం మరో యెత్తు!

………(ఇంకా చాలా వుంది)

Sunday, February 15

మానవహక్కులు

పోలీసులపై కేసులు!

వినడానికి చిత్రంగానే వుంటుందిగాని, మన ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం ఇది జరిగే తీరాలట!

ఓ పదిహేనేళ్ళ క్రితం, పోలీసుల తీరుపై ‘అమానుష హక్కులు’ శీర్షిక తో ఈనాడు పత్రికలో నా లేఖ ఒకటి ప్రచురితమయ్యింది.

అప్పటికీ, ఇప్పటికీ యేమైనా మార్పు వచ్చిందా అంటే, వచ్చింది—వెనకనించి!

అప్పట్లో, యెవరైనా అందోళన చేస్తూ వుంటే, పోలీసులు అక్కడకి చేరుకొని, మైకులో రెండు మూడు సార్లు హెచ్చరికలు చేసి, అప్పుడు గుంపుని చెదరగొట్టేవారు! బెత్తాలకీ, లాఠీలకి పని చెప్పేవారు! యెవరికీ పెద్దగా గాయాలు తగిలేవి కాదు—అవి నిజమైన అందోళనలు కాబట్టి!

తరవాత్తరవాత, ఈ రాజకీయ, కుల, మత ఫ్యాక్షన్ అందోళనలు పెరిగాక, తరలించబడిన జనాలతో, గూండాల నాయకత్వం లో జరుగుతున్న అందోళనలు ముష్టి యుద్ధాలనీ, కత్తి యుద్ధాలనీ తలపిస్తున్నాయి! ఇంకా పురాణాలు, ఇతిహాసాల్లో విన్న కుస్తీలూ, పోరాటాలూ వీటి ముందు దిగదుడుపు అనిపిస్తున్నాయి!

పైనించి వచ్చే అదేశాలమేరకు వాళ్ళని ఓఅరగంటో, గంటో అందోళన చెయ్యనిచ్చి, ఆ తరవాత విజృంభిస్తున్నారు! మన పోలీసులు! ఆడవాళ్ళనీ, మొగవాళ్ళనీ ఒకే విధంగా పక్షపాతం లేకుండా చూస్తున్నారు!

ఇక పేపర్లలో ఫోటోలూ, టీవీల్లో వీడియోలూ చూస్తూనే వున్నాము—చెరో పోలీసు ఒకణ్ణి చెరోకాలూ పట్టుకొని భీముడు జరాసంధుణ్ణి చీల్చినట్టు చీలుస్తుంటే, ఇంకొకడు కాళ్ళ మధ్యన బూటు కాలితో తన్నడం! వెనక్కి రెక్కలు విరిచేసి ఒకడు పట్టుకుంటే, ఇంకొకడు బూటు కాళ్ళతో గూడు మీద తన్నడం! ఈడ్చుకు తీసుకెళ్ళి, కాళ్ళొకళ్ళూ, చేతులొకళ్ళూ పట్టుకొని, వాన్ లోకి బస్తాని విసిరినట్లు, నడుములు విరిగేలాగ విసిరెయ్యడం! (దీంట్లో నాయకులకి కూడా మినహాయింపు లేదు!)

మరింక మానవహక్కులెక్కడ?

అదే విదేశాల్లో చూస్తే, ఆందోళనలు కాక పోయినా, క్రిమినల్స్ నీ, మాఫియా వాళ్ళనీ కూడా రాగ ద్వేషాలకతీతంగా అందర్నీ ఒకే రకంగా ఒకే పద్ధతిలో లొంగతీసుకుని అరెష్టు చేస్తారు!

మన పోలీసులు యెప్పుడు అలా అవుతారు? యెన్ని కోర్టు తీర్పులూ, యెన్ని కేసులూ విచారణలు జరగాలి? యెంతమంది పోలీసులూ, ఉన్నతాధికారులూ శిక్షలు అనుభవించాలి? అసలు ఇవన్నీ జరిగేవేనా!

చూద్దాం!

Saturday, February 14

" 'క్రూర'మండల్" అనే గరీబ్ (లాలూ) రథం

మన దేశం లోనే మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ రైలు ‘కోరమాండల్ ఎక్స్ ప్రెస్’ పట్టాలు తప్పిందిట! కేవలం 18 మందే మరణించారట! యెందుకంటే, అప్పుడు అది గంటకి 60 కి.మీ. వేగంతోనే వెళుతోందట!

మరి దాని పూర్తి వేగం (గంటకి 120 కి.మీ. తో మొదలు పెట్టారు—ఇప్పుడు 140 కి.మీ. కి పెంచినట్టున్నారు) తో వెళుతూ వుండగా (అమంగళము ప్రతిహతమగుగాక!) అయితే అని అడగద్దు.

మన రైల్వేలకే ప్రతిష్ఠాత్మకమైన కోరమండల్ ప్రవేశపెట్టగానే—అతి తక్కువ స్టేషనులలో ఆగుతూ, మధ్య స్టేషనులలో ఆగకుండా వెళ్ళిపోతుంటే జనం నోరు వెళ్ళబెట్టి ‘అబ్బా! కోరమాండల్’ అంటూ చూసేవారు! (వెంటనే మనసులో ప్రశ్న—అంత స్పీడులో అది గానీ………అనుకొని చెంపలు వేసుకునేవారు పాడు ఆలోచన వచ్చినందుకు).

ఇప్పటివరకూ యెప్పుడూ జరగరానిది జరగలేదు! మరి ఇప్పుడెందుకు—అంటే సమాధానం—లాలూగారి కక్కుర్తీ, మన బ్యూరాక్రసీ!

దాదాపు 50 యేళ్ళుగా యెప్పుడూ వినని ‘పట్టాలు విరిగిపోవడం’ గురించి 21వ శతాబ్దం మొదట్లో విని, ఆశ్చర్య పోయేవాడిని!

చిన్నప్పుడు సైన్సు లో లోహాల సంకోచ వ్యాకోచ లక్షణాల గురించి చెపుతూ, ‘రైలు పట్టాల్కి ఒక దానికీ, ఇంకోదానికీ యెడం వుంచుతారు యెందుకు—అవి వ్యాకోచించి, ఒకదాని నొకటి గుద్దుకొని ప్రమాదాలు జరుగుతాయని’ అని చెప్పేవారు మా మేష్టారు!

కొత్త టెక్నాలజీ అంటూ, పట్టాలని వెల్డింగ్ చేయడం మొదలు పెట్టారట—అందుకని పట్టాలు విరిగి పోవడం మొదలు పెట్టాయి!

మరి ఆ టెక్నాలజీని యెక్కడ సంపాదించారో, దాని మీద సరైన అధ్యయనం జరిగిందో లేదో మన బ్యూరాక్రసీయే చెప్పాలి.

అక్కడనించీ, కోకొల్లలుగా ‘త్రుటిలో తప్పిన’ రైలు ప్రమాదాలూ, గ్యాంగుమన్ సమయ స్పూర్తి వల్ల తప్పిన రైలు ప్రమాదాలూ, లైన్మెన్ కి అవార్డులు ప్రకటించడాలూ లాంటి వార్తలు పేపర్లలో చదువుతూనే వున్నాము.

వీళ్ళ కక్కుర్తికి పరాకాష్ట—‘సైడ్ మిడిల్ బెర్త్ లు’ బిగించడం!

ఒక రైలు పెట్టెలో, తొమ్మిది ‘సెల్స్ ‘ గా, ఒక్కోదాంట్లో అడ్డంగా యెదురెదురుగా మూడేసి చొప్పున ఆరూ, నిలువుగా రెండూ కలిపి, యెనిమిది బెర్తులతో మొత్తం 72 బెర్తులూ, యేదో ఒక పక్క మరో మూడు బెర్తులూ కలిపి, పెట్టెకి 75 చొప్పున బెర్తులు వుంటాయి.

ఇప్పుడు, తొమ్మిది సెల్స్ లో ఒక్కొక్కటి చొప్పున 9 సైడ్ మిడిల్ బెర్తులు బిగించడంవల్ల—తొమ్మిది మంది మనుషులు—ఒక్కొక్కరూ సగటున 50 కే జీల బరువున్నా, దాదాపు అర టన్నూ, బెర్తుల, వాటి గొలుసుల, బరువూ, వాళ్ళ లగేజీ బరువూ కలుపుకుంటే, కనీసం ఒక టన్ను బరువు పెరుగుతుంది కదా? మరి చక్రాలూ, ఇరుసులూ, బ్రేకులూ—వాటి పై యెంత భారం పడుతోంది—అని అధ్యయనం చేశారా? అదీ మన బ్యూరాక్రసీయే చెప్పాలి.

బొగ్గు ఇంజన్లతో రైళ్ళు నడిచేటప్పుడు మామూలు ఇంజన్లతో నడిచే రైళ్ళకి గరిష్ఠంగా యేడు లేక ఏనిమిది పెట్టెలు వుండేవి! కెనడా ఇంజను తో నడిచే మెయిలూ, జీటీ, సర్కార్ లాంటి రైళ్ళకి గరిష్ఠంగా పది/పన్నెండు పెట్టెలు వుండేవి. అప్పట్లో చక్రాల క్రింద నిప్పురవ్వలు రావడం, చూడడం చాలా అరుదు! అది కూడా మెయిలూ అవీ రాత్రి పూట పూర్తి వేగంతో వెళుతున్నప్పుడు—యెవరోగానీ చూసేవారు కాదు.

ఇప్పుడు చిన్న రైలుకి కూడా 18 పెట్టెలూ, పెద్దవాటికి 23 నించి 27 వరకూ తగిలిస్తున్నారు. వాటిల్లో కనీసం 9 నించి 14 వరకూ స్లీపరు క్లాస్ పెట్టెలూ, రెండైనా ఏ సీ (III) పెట్టెలూ వుంటున్నాయి. అంటే, కనీసం 15 నించి 20 టన్నులు బరువు పెరుగుతోంది ఈ సైడ్ మిడిల్ బెర్త్ ల వల్ల.

మరి పట్టాల లో యేమైనా మెరుగుదల వుందా?

కాంట్రాక్టర్ల అధికారుల అవినీతి తో బల్లాస్ట్ గా వాడే కంకర దగ్గరనించీ, ఒకచోట వేసిన దానినే బిల్లు తినేశాక ఇంకో చోటు కి తరలించి బిల్లులు పెట్టుకోవడం లాంటి లీలలతో నానాటికి తీసికట్టు నాగంభొట్టు అన్నట్టుంది వాటి స్థితి.

చక్రాలనించి నిప్పు రవ్వలు వచ్చినప్పుడు, పట్టాల వెల్డింగ్ కి ఉపయోగించిన లోహం కరిగిపోయి, చక్రాలకి చుట్టుకుని చక్కగా మండుతూ, బోగీలని అంటించేస్తోంది! అందుకే స్లీపర్ క్లాస్ లో మొదటి లేదా చివరి బోగీలకీ, వాటి పక్కనే ఏ సీ బోగీలకీ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి--బ్రేకులు వేసినప్పుడు వాటి చక్రాలకే వత్తిడి యెక్కువగా వుండి, నిప్పులు బాగా యెక్కువగా వచ్చి!

ట్యూటికోరిన్ లో తనకు బహూకరించిన మేకపిల్లని ఢిల్లీలో తన మనవడికి ఇచ్చి, అది మళ్ళీ తల్లికోసం బెంగ పెట్టుకుందని ఆ తల్లిని వెతికించి, దాన్ని మళ్ళీ ప్రత్యేక ఏ సీ బోగీలో ఢిల్లీ కి పంపించిన మన మేనేజిమెంటు గురు లాంటి వాళ్ళ నడ్డి విరగదన్నాలా వద్దా.

ఆలోచించండి!

Monday, February 2

I'm a citizen of the World

మన బ్యూరాక్రసీ


దీనికి సరైన తెలుగుమాట ఇంకా పుట్టలేదు!

ఇదెలాంటిదంటే, నిద్ర నటిస్తున్న గాడిద లాంటిది!

నిజంగా నిద్రపోతున్న గాడిదని లేపితే, వెనుక కాళ్ళతో తన్ననైనా తన్నుతుంది. దీనికి అలాంటి అనుభూతులేమీ వుండవు—నిద్ర నటిస్తోందిగదా!

రెండు చిన్న వార్తలు చూడండి!

ఈనాడు 06-01-2009 సంచికలో, పెట్రోలు కోసం క్యూలో రమ్మన్నందుకు కోపం వచ్చిన విద్యుత్ శాఖ ఉద్యోగి ఒకరు, ఆ లైనుకి చెందిన ట్రాన్స్ ఫార్మర్లోని ఫ్యూజులు తీసి పారేశాడట! బంకుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా అంధకారం లో ముంచాడట ఆ రాత్రిపూట! ఆ బంకు ఒక్కదానిలోనే పెట్రోలు వుందట! జనరేటరు కూడా లేదట! దాంతో గంటకు పైగా యెంతమంది యెన్నివిధాల ఇబ్బంది పడ్డారో ఊహించండి!

ఆ సోమరాజు మీద వాళ్ళ ఏ డీ ఈ కి ఫిర్యాదు చేస్తానన్నాడట వాళ్ళ ఏ ఈ!

తరవాతకధ వెండితెరమీద రాదు కదా? అందరూ అప్పుడే మరిచిపోయుంటారు!

అదే రోజుల్లో, ఏలూరులో, విద్యుత్ బిల్లులు కట్టలేదని, పురపాలక సంస్థ కి విద్యుత్ సరఫరా నిలిపి వేశారట విద్యుత్ శాఖవారు!

నీ పని ఇలాగవుందా? అని నగరపాలక సంస్థవారు ఓ జే సీ బీ ని తీసుకొచ్చి, మీ విద్యుత్ శాఖ భవనమే అక్రమ కట్టడం! దీన్ని కూల్చి వేస్తాము—యెవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అని విజృంభిస్తే, ఆ ఉద్యోగులందరూ నాలుగు దిక్కులకీ పరార్! ఆనక పోలిసులు రంగ ప్రవేశం చేసి, జేసీబీని స్వాధీనం చేసుకొని, 17 మంది ఉద్యోగులమీద కేసులు పెట్టి, తీరిగ్గా ‘విచారిస్తున్నారు’ట.

అదండీ!

Sunday, February 1

కార్పొరేట్.....

కార్పొరేట్ చిల్లర దుకాణాలు!


నేను ముందే చెప్పాను—రిటెయిల్ (చిల్లర) వ్యాపారాల్లోకి కార్పొరేట్ లు ప్రవేశించడం వాటికీ, ప్రజలకీ, చిన్న దుకాణదారులకీ, ఆర్ధిక వ్యవస్థకీ దేనికీ మంచిది కాదని! విన్నారా? వినరు!

ఒక తాగుబోతు ఒక పెద్ద వీధి దీపం క్రింద గంట నించీ వెదుకుతున్నాడట దేనికోసమో! ఆ వీధినే గంటక్రితం వెళ్ళి, తిరిగి వస్తున్న వ్యక్తి అతన్ని అడిగాడట ‘యేమి వెతుకుతున్నావు?’ అని. అతను చెప్పాడు ‘పక్క వీధిలో మా యింటి తాళం పడిపోయింది—వెతుకుతున్నాను’ అని. ‘అదేమిటీ—పక్క వీధిలో పోతే అక్కడే వెతకాలిగాని, ఇక్కడ వెతుకుతే యెలా?’ అన్న ఆ వ్యక్తికి తాగుబోతు సమాధానం ‘మరి అక్కడ వెతకడానికి దీపం లేదుగా!’ అని!

మన కార్పొరేట్లు మాత్రం, ‘లాభాలు’ యెక్కడ వున్నాయా అని, సెర్చి లైట్లు పట్టుకొని వెతికేస్తాయి! చీమ దూరేంత సందు వుంటే యేనుగుని దోపెయ్యడానికి ప్రయత్నించేస్తాయి! దాని కోసం యెన్ని అడ్డ దారులైనా తొక్కుతాయి!

కొన్ని లక్షల చతురపు అడుగుల వ్యాపార ప్రదేశం లో, అనేక రకాల వస్తువులని నిలవ వుంచి, జనాన్ని రండి, కొనండి, ఆనందించండి అంటూ అహ్వానిస్తాయి!

మరి ఆ నిల్వలకి పెట్టుబడీ, భవన కట్టుబడి వ్యయం, దుకాణం నిర్వహణ ఖర్చులూ, ఉద్యోగుల జీత భత్యాలూ ఇలాంటివాటినన్నీ లెక్క వేసుకుని, వీధి చివర విల్లర కొట్టు వాడి కన్నా ప్రతీ వస్తువూ ఒకటి నించి పది రూపాయల తక్కువకి అమ్మి కూడా, లాభాలు అర్జించాలంటే, ముందే లెక్కలు వేస్తారు—మొదటి మూడు నాలుగు సంవత్సరాలూ నష్టాలు వచ్చినా, తరవాత (చిల్లర కొట్లన్నీ భూమి మీద నించి మాయం అయ్యాక, రెట్టింపు ధరలకి అన్నీ అమ్మడం మొదలెడితే) అయిదో సంవత్సరం నించీ ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వస్తాయి—అని!

మరి ఈ లెక్కలు వేసేవాళ్ళు కూడా మన తొట్టి ఆడిటర్లే కదండీ? కాయితం మీద అన్నీ బాగానే వుంటాయి గాని, అసలు మాత్రం……అదన్నమాట!

నా చిన్నప్పుడు మా అమ్మ ‘బాబూ, ఎదురుగా వున్న చిల్లర కొట్లో ఓ పావుకేజి పంచదార పట్రా’ అంటే వెళ్ళిన నేను, దుకాణంవాడు కడుతుంటే, ఇంకొకావిడ వచ్చి ‘మూడ్డబ్బుల బెల్లం, కాణీ కాప్పొడుం బేగి ఇచ్చెయ్యి బాబూ! ఈళ్ళ నాన్న కోప్పడిపోతన్నాడు’ అని చంకలో చంటిబిడ్డని చూపిస్తుంటే, దుకాణంవాడు ‘కాసేపాగు! కాటాలొ పంచదార కనబడడంలేదు!’ అని విసుక్కుంటుంటే, ‘పోనీ ఆవిడకి ఇచ్చేసిన తరవాతే నాకు పంచదార ఇయ్యి!’ అనేవాడిని—నాకంత అర్జెంటు లేదని!

మరి ఈ రోజునైనా, పొద్దున్నే ఆరింటికి కాఫీ గొంతులో పడక పోతే గడవని వాళ్ళూ, నిన్న రాత్రి పొద్దు పోతేగానీ తమ ఆర్జన చేతిలో పడని వాళ్ళూ, తొమ్మిదింటికో, పదింటికో తెరిచి, ఉద్యోగులందరూ వచ్చి, సర్దుకుని, అమ్మకాలు సాగించే వరకూ, ‘మూడ్డబ్బుల బెల్లం, కాణీ కాప్పొడుం’ యెక్కడ వున్నాయా అని ‘మాల్’ అంతా గంటల తరబడి వెతుక్కుని, కొని, తీసుకెళ్ళడం—సాధ్యమేనా?

అందుకే ఈ రోజు ‘సుభిక్ష’ సంక్షోభంలో వుంది; రేపు త్రినేత్ర; యెల్లుండి ఇంకో చతుర్ముఖ, ఇలా అన్నీ!

మీ పిచ్చిగానీ! ఆడిటర్లూ—చిన్న లెఖ్ఖకి సమాధానం చెప్పండి—ఒక ఇల్లు కట్టడానిమి 30 మంది మనుషులకి 60 రోజులు పడితే, 600 మంది మనుషులు అదే ఇంటిని యెంత సేపట్లో కట్టగలరూ?

బుర్రలకి పదును పెట్టండి మరి!

పీ ఎస్: అపార్ట్ మెంట్ కొనబోతున్నారా? కొనొద్దు! ఆగండి. యెందుకంటే బిల్డర్లు ఉక్కుని టన్ను 60 వేల రూపాయలకి కొని కట్టారట! అదంతా మన మీద రుద్దుతారు! ఇప్పుడు టన్ను 29 వేలే! వాళ్ళు చెప్పిన ధరకి సగం రేటు కి ఇస్తేనే కొంటాం అని చెప్పండి! ఇవాళ కాక పోతే రేపు చచ్చినట్టు మీరడిగిన రేటుకే ఇస్తారు—లేదా కోట్లలో ములుగుతారు! తొందర మనకు లేదు!


విన్నారా?

విన్నారా?


".....వాల్ స్ట్రీట్ అధికారులు బిలియన్ డాలర్ల కొద్దీ బోనస్ లు తీసుకోవడం సిగ్గుచేటు, బాధ్యతారాహిత్యం" అని అమెరికా అధ్యక్షుడు ఒబామా......"ప్యాకేజీతో జెట్ విమానం కొనేందుకు సిటీ బ్యాంకు యత్నాల"ను తప్పు పట్టారు!

మన చట్ట సభల సభ్యులూ! వింటున్నారా?

Friday, January 30

“ఫుట్ బాల్”

మా చిన్నప్పుడు ఫుట్ బాల్ ఆడేవాళ్ళం!

మరీ చిన్నప్పుడు టెన్నిస్ బాల్ తో, ఎలిమెంట్రీ స్కూల్లో వున్నప్పుడు యెప్పుడో వారానికో, 15 రోజులకో ఒకసారి డ్రిల్లు పీరియడ్ లో, మా స్కూలు వెనక ఉన్న పుంతలో, యేరంగుదో తెలియని నిజం ఫుట్ బాల్ తో, హై స్కూల్ లో నిజం గ్రౌండ్ లో, నిజం ఫుట్ బాల్ తో, నిజం గా—ఇలాగ! కాలేజీకి వచ్చాక చిత్రంగా హాకీ లోకి మారి పోయే వాళ్ళం!

ఇప్పుడు యెవరన్నా ఆడుతున్నారో లేదో తెలీదు.

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దీన్ని ‘సాకర్’ అనే వ్యవహరిస్తున్నారు.

ఇంతకీ, నేను మొదలుపెట్టింది ఆ ఫుట్ బాల్ గురించి కాదు!
అమెరికా ప్రెసిడెంట్ దగ్గర వుండే “ఫుట్ బాల్” గురించి!

అమెరికా సర్వ సైన్యాధ్యక్షుడుగా ప్రెసిడెంట్ ఒక్కడే అణ్వాయుధ ప్రయోగం పై చివరి నిర్ణయం తీసుకో వచ్చు—అంతే కాదు వాటి ప్రయోగాన్ని ప్రారంభించవచ్చు! ఆ ప్రారంభాన్ని చేసేదే ‘ఫుట్ బాల్’! ప్రెసిడెంట్ శరీరాన్ని యెల్లప్పుడు అంటి పెట్టుకొనే వుంటుంది ఆ పరికరం!

మాజీ ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్ తుపాకి తో కాల్చబడి, చావు బతుకుల్లో వుండగా, పెద్ద తర్జన భర్జన దీని గురించే జరిగింది! వైస్ ప్రెసిడెంట్ విదేశీ పర్యటనలో వున్నాడు! ఫుట్ బాల్ వుండగా, శస్త్ర చికిత్స చేస్తే, అటూ ఇటూ అయితే, ఆ ఫుట్ బాల్ సంగతేమిటి? ఆయన హాస్పిటల్ లో వుండగా, ఆ ఫుట్ బాల్ ని వైస్ ప్రెసిడెంట్ కి అమర్చ వచ్చా? అవసరం పడితే దాన్ని ఆయన ప్రయోగించదానికి రాజ్యాంగం అనుమతి ఇస్తోందా? ఇలా వందలాది ప్రశ్నలు!
యేదో చేసి, వెంటనే వైస్ ప్రెసిడెంట్ ని వెనక్కి రప్పించి, ఆ పరికరం నియంత్రణని తాత్కాలికంగా ఆయనకి అప్పచెప్పారు! తరవాత, రీగన్ కోలుకొని, మళ్ళీ తన ఫుట్ బాల్ తాను తీసేసుకుని వుంటాదనుకోండి.

మరి మనకి ‘ఫుట్ బాల్’ అనేది వుందా? అది మన అధ్యక్షురాలు వొంటి మీదే వుందా?
లేక మన ప్రధాని దగ్గర వుందా? మన ప్రధాని 18 గంటలకి పైగా అయిదో ఆరో బైపాస్ లు చేయించుకొంటున్నపుడు, అది యేమయ్యింది? కొంపదీసి ప్రణబ్ ముఖర్జీ కి గానీ ఇచ్చారా!

మరి పాకిస్థాన్ మాటేమిటి? వాళ్ళ ప్రెసిడెంట్ దగ్గర వుందా? మహమ్మద్ అజర్ దగ్గర వుందా?

ఒసామా బిన్ లాడెన్ దగ్గర యే దేశానికి సంబంధించినదైనా వుందా?

మన సోకాల్డ్ ప్రింట్/ఎలక్ట్రానిక్/ఇతర మీడియా యేమైనా పరిశోధన చేసి, ప్రజలకి వెల్లడించ గలుగుతుందా?

(అమెరిచాలో రోనాల్డ్ రీగన్ సంఘటన జరిగినప్పుడు విషయం బయట పెట్టినది వాళ్ళ మీడియానే!)

Thursday, January 29

"దేశ భక్తి"

యుద్ధోన్మాదమా?


మన పొరుగు దేశానికి బుద్ధి చెప్పాలనడం యుద్ధోన్మాదమా!

యుద్ధోన్మాదమంటే—1948 లో పాక్ ప్రదర్శించిందీ, 1962 లో చైనా చూపిందీ, తరవాత సంవత్సరాల్లో మళ్ళీ మళ్ళీ పాక్ చెలరేగిందీ—అదీ యుద్ధోన్మాదమంటే!

ఇంకా, వియత్నం మీదా, అఫ్ఘాన్ మీదా, సద్దాం మీదా, అమెరికా వాడు చూపింది!

మరి, మన జనం యెందుకు ఉలిక్కిపడతారు యుద్ధం అనగానే?

మనది శాంతికాముక దేశం కాబట్టి—అని ఓ వెర్రి నవ్వు నవ్వుతాము!

నిజంగానే మనది శాంతికాముక దేశం సరే! మన జాతి యెప్పుడో ఘోర యుద్ధాలు చేసీ, చూసీ, శాంతిని కోరుకుంది. అశోకుడంతటి వాడిని అహింసా పథానికి నడిపించిన కళింగ యుద్ధమే మన దేశంలో జరిగిన ఆఖరి అతిపెద్ద యుద్ధం!

తరవాత మన దేశం లో రాజులూ, చక్రవర్తులూ, సార్వభౌములూ యుద్ధాలు చేసినా, నష్టం వాళ్ళ (అంటే మన) వైపే వుండేది—యెందుకంటే మన సైనికులే తుపాకి గుళ్ళకీ, ఫిరంగి గుళ్ళకీ బలయి పోయేవారు!

అందుకే, అలాంటి మూర్ఖులకి వ్యతిరేకంగా పోరాడాలంటే మామూలు ఆయుధాలు పనికి రావు అని, అహింసనీ, సత్యాగ్రహాన్నీ పరమాయుధాలుగా మలిచి, ప్రజల్లో దేశ భక్తి ని రగిల్చి, అందర్నీ ఒకే తాటి మీదకి తీసుకొచ్చి స్వాతంత్ర్యాన్ని సాధించాడు మన జాతిపిత గాంధీ. అందుకే ఆయన మహాత్ముడయ్యాడు!

ఆ తరంలో అందరికీ, దేశ భక్తి అనేదొకటి అన్నిటికన్నా ముందు వుండేది!

1962 లో మనకి ఆధునిక ఆయుధాలు లేక పోయినా, మన సైన్యం చాలా తక్కువైనా, మన ప్రజల దన్నుతో ధైర్యంగా పోరాడగలింది మన సేన. అప్పట్లో ‘దేశ రక్షణ నిధి’ స్థాపించి, పిలుపు ఇవ్వగానే, దేశ ప్రజలే స్వచ్చందంగా కోట్లాది రూపాయలు ధార పోశారు—నగదుగా, బంగారం గా, వస్తు రూపంలో—యెలా వీలైతే అలాగ!

1965 లో, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి ‘వారానికొక పూట భోజనం మానేసి, దానికయ్యే ఖర్చుని రక్షణ నిధికి విరాళంగా ఇవ్వండి!’ అని పిలుపు ఇస్తే, దేశ ప్రజలందరూ వీలైనన్ని రోజులు ఒంటిపూట భోజనమే చేసి, పొదుపు చేసిన సొమ్ము విరాళాలిచ్చారు!

మహాత్ముడు ధనవంతులు సంపదకి దేశ ప్రజల తరుఫున ట్రస్టీలుగా వుండండి అంటే, ఆతరం అలాగే వుండేది! టాటాలు మొదలైనవాళ్ళు ఉక్కు కార్మాగారాల్ని స్థాపించినా, జౌళి మిల్లులు పెట్టినా, మన దేశ సంపద పెరగాలి, మనదేశం వర్ధిల్లాలి అనే భావించేవారు!

ధనికుల కుటుంబాల్లో పుట్టినా, జే ఆర్ డీ టాటా కూడా కష్టాలు అనుభవించాడు—వ్యాపారాభివృద్ధికి! ‘పీత కష్టాలు పీతవి’ అన్నట్టు, బిర్లాలు, దాల్మియాలూ, రూయాలూ, వాడియాలూ, అంబానీలూ—ఇలా అందరూ!

యెంత దార్శనికుడు కాకపోతే, వంటనూనెల వ్యాపారం చేసుకునే ‘విప్రో’ అధిపతి ‘కంప్యూటరు’ వ్యాపారం లోకి దిగాడు?
కార్సన్ భాయ్ పటేల్ ఇంటింటికీ తిరిగి, తన ‘నిర్మా’ అమ్ముకొనేవాడట!

(యెక్కడో ఒక ధీరెంద్ర బ్రహ్మచారి—జయంతీ షిప్పింగ్--వుండేవాడనుకోండి) అయినా, ఆ తరం అందరిలో, దేశ భక్తి అనేది ఒకటి వుండేది!

సరే, తరవాతది, మా తరం!

—(ఇంకా వుంది)

Monday, December 29

సామూహిక......Vs జనాభా

వివరణ-2

మగాడు సెక్స్ కోసం పెళ్ళికి ఒప్పుకుంటే, స్త్రీ భద్రతకోసం ఒప్పుకుంటుందంటారు! పెళ్ళి జరగ్గానే, మగాడికి భార్య మీద ఓ ఆధిపత్యం వచ్చేస్తుంది! భార్య ‘వద్దు’ అనడానికి వీల్లేదు! పైగా క్రిందితరగతి వాళ్ళకి వున్న టిక్కెట్ అక్కర్లేని వినోదం అదొక్కటే! అందుకని నిర్బంధంగానైనా అనుభవిస్తుంటాడు. పిల్లల్ని కంటూనే వుంటారు—సెక్స్ లో స్త్రీ సంతృప్తి చెందినా, లేకా పోయినా!

సహజీవనంలో ఈ స్థితి వుండదు! ముందుగా ఇద్దరూ ఒకరిని ఒకరు అన్నివిధాలా బాగా ఇష్టపద్దాక, ముందుగానే సెక్స్ లో కూడా ఇద్దరూ సంతృప్తి చెందుతున్నారని నమ్మకం కలిగాకే సహజీవనానికి అంగీకరించవచ్చు!

ఇలా కాకపోతే, ఒకళ్ళకి ఒకళ్ళు నచ్చిన తరవాత, పూర్తిగా అర్ధం చేసుకునేవరకూ సెక్స్ ప్రసక్తి లేకుండా కూడా సహ జీవనంచెయ్యవచ్చు! పూర్తిగా నమ్మకాలు కుదిరితేనే సెక్స్ కి పరస్పరం అంగీకరించవచ్చు!

సహజంగా, ఇద్దరూ స్వేచ్చగా మాట్లాదుకొని, పిల్లల్ని కనడమా వద్దా నిర్ణయించుకోవచ్చు! వద్దనుకున్నంతకాలం నియంత్రణ పద్ధతులు వుండనే వున్నాయి!

యేడాది తిరగకుండా బిడ్డని యెత్తుకోవాలనే ఒత్తిడి వుండదు! స్త్రీకి ‘వద్దు’ అనడానికి సర్వ హక్కులూ వుంటాయి!
మరి జనాభా పూర్తిగా అదుపులోకి వచ్చెయ్యదూ?

దీన్ని చట్టబద్ధం చేస్తే, ఒడంబడిక వ్రాతలో వుండి రిజిష్టరు అయి వుంటుంది గనక, షరతులు ఉభయుల్లో యెవరు ఉల్లంఘించినా, చట్టబద్ధంగానే విడిపోవచ్చు—విడాకుల తతంగం కొనసా………గకుండా! (పిల్లల విషయం కూడా ఒప్పందంలో వుంటుందికదా!)

పట్టణాల్లోను, నగరాల్లోనూ ఇప్పుదు ఇలాంటివి జరుగుతూనే వున్నాయి—చట్టం లేకుండా, లిఖిత ఒడంబడిక లేకుండా!

ఓ స్త్రీ, ఓ పురుషుడూ ఒక బిడ్డతొ మీ పక్క అపార్టుమెంటు అద్దెకి తీసుకుని, సామానుతో సహా దిగి, మగాడు ఉద్యోగానికో, వ్యాపారానికో వెళ్తూ, బిడ్డ స్కూలుకి వెళ్తు వస్తూ వుంటే, అది ముచ్చటైన కుటుంబం అనుకుంటారా లేక ఆ మగాడు బిడ్డతో సహా వున్న స్త్రీని లేపుకొచ్చాడనుకుంటారా?

అలాంటి సహజీవనాలెన్ని లేవు?

Sunday, December 28

సామూహిక...... Vs జనాభా

వివరణ--1



1) అసలు వివాహం అంటే ఓ లైసెన్స్—చట్టబద్ధంగా, సురక్షితంగా, స్వేచ్చగా, భార్యా భర్తలు లైంగిక సంబంధాన్ని అనుభవించడానికి! దానికోసం మొదటి మూడు నిద్రలూ జరిపించటం ఓ ముచ్చట! ఆ తరవాత కూడా, రాత్రి తొమ్మిది అవగానే, భార్యా భర్తలు పడగ్గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నా, ఇంట్లో వాళ్ళు (పుట్టింట్లో గాని, అత్తింట్లో గాని) ముసిముసిగా నవ్వుకుంటారేగానీ, వద్దనరు, తప్పు పట్టరు! (యెక్కడో కొంతమంది అత్తలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారులెండి!)

ఇంతే కాకుండా, వాళ్ళమీద ఒక అజ్ఞాత ఒత్తిడి వుంటుంది—వెంటనే ఓ బిడ్డని కనాలని.

దీంతోపాటు, ఒక యేడాది తిరిగేసరికల్లా, బిడ్డ పుట్టలేదనుకోండి, ఇంట్లో వాళ్ళూ, వీధిలో వాళ్ళూ, ఇంటికి వచ్చేపోయే బంధువులూ, ఇంటిపనివాళ్ళూ, చివరికి ఆ వీధి ముష్టివాళ్ళు కూడా ఆరా తీస్తారు—‘అమ్మాయి ఇంకా నీళ్ళు పోసుకోలేదా?’ అంటూ!

దీనివల్ల, ఈ రోజు ఓ వెయ్యి సామూహిక వివాహాలు అయ్యాయనుకోండి, (వాళ్ళ సరాసరి వయసు పాతిక వుండచ్చు) 2009 డిసెంబరు 31 లోపల కనీసం 800 నించి 850 శిశువులు పుడతారు! (ఇవి కోట్లాదిగా ప్రతీ యేటా జరిగే మామూలు వివాహాలకి అదనంగా, ప్రభుత్వ/మత ప్రోత్సాహంతో జరుగుతున్నవి అని మరిచి పోకండి).

వాళ్ళలొ, ఓ 5 శాతం దాకా—అంగ వైకల్యంతోనో, మానసిక సమస్యల్తోనో పుట్టడానికి అవకాశం వుంది అని ఆధునిక శాస్త్రం చెబుతోంది!

ఇంకో 10 శాతం దాకా—సరైన ఆహారం లేక, 5 యేళ్ళలోపే మరణిస్తున్నారని కూడా శాస్త్రం చెబుతోంది!

బతికి బట్టకట్టిన వాళ్ళలో, సరైన తిండీ, గుడ్డా లేక, పతితులూ, భ్రష్టులూ, బధా సర్పదష్టులుగా మారుతున్నవాళ్ళూ—ఓ 20 శాతం వుంటారు!

మిగిలిన వాళ్ళలో 50 శాతం—చేతికీ, నోటికీ కష్టం మీద లింకుచేసుకుంటూ బ్రతికే దిగువ మధ్యతరగతికి చెందే అవకాసం వుంది!

ఇక్కడకి మిగిలిన 15 శాతంలో, కొంతమంది ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ, ఇతర వృత్తుల్లోనూ చేరి, యెగువ మధ్య తరగతిగా మారతారు!

ఏ 0.5 శాతమో కోటీస్వరులు అయినా అస్చర్యం లేదూ!

ఇవన్నీ సామాజిక సమస్యలు. వీటిని అధిగమించడానికి సహజీవనం యెలా తోడ్పడుతుందో—మళ్ళీ చూద్దాం!

Saturday, December 27

సహజీవనం

ఇవాళ 27-12-2008 ఈనాడులో ‘సహజీవనమూ పెళ్ళే’ అనే శీర్షిక చదివారా?

మహారాష్ట్ర ప్రభుత్వం సహజీవనం చేసేవారు పెళ్ళి తో సమంగా న్యాయసూత్రాలకి బద్ధులై వుండాలని, మార్గ దర్శక సూత్రాలు రూపొందించే పనిలో వుందట!

ఇదో సంగతి!

Friday, December 26

జనాభా

675,16,43,600

రేపు జనవరి ఫస్ట్ కి ప్రపంచ జనాభా చేరుకోబోతున్న అంకెట ఇది!
అది కూడా అభివృద్ధి చెందిన దేశాల్లోనే పెరుగుదల శాతం యెక్కువట! (అచ్చు పొరపాటై వుంటుంది—‘చెందుతున్న’ అని వుండవలసింది.)

మరి మనదేశంలో మనవంతు కృషి?

ఎందుకు చెయ్యడంలేదు—అంటారా?

అదే—తితిదే తరఫున వేలాది సామూహిక వివాహాలూ, వీళ్ళని చూసి ఇతర మతాలవాళ్ళు కూడా సామూహిక వివాహాలకి ప్రొత్సాహకాలు అందించడం—ఇలా శాయ శక్తులా కృషి చేస్తున్నాం!

మొన్నీ మధ్య ఓ బాలీవుడ్ నటీమణి, జనాభా పెరుగుదలని అరికట్టక పోవడం వలననే ‘సునామీలూ’ వగైరా వస్తున్నాయి అందిట! (పాపం తను చదువుకున్న ‘మాల్థూజియన్ థియరీ ఆఫ్ పాప్యులేషన్’ లోని పాజిటివ్ చెక్స్ వగైరా గుర్తొచ్చి ఎదో అని వుంటుంది!—మీడియా దాన్ని సందర్భ రహితంగా వుపయోగించుకొంది!)

జనాభా పెరుగుదల అరికట్టాలంటే, మేధావులు చేస్తున్న ముఖ్య సూచన, ఇష్ట పడిన స్ట్రీ పురుషులు ‘కలిసి వుండడం’ ని చట్టబద్ధం చెయ్యాలని! కొన్ని దేశాల్లో ఇది అమల్లో వుందట!

నిజంగా చాలా మంచి సూచన! సమాజం కూడా బాగుపడుతుంది!

ఓ పాతిక సంవత్సరాల క్రితం, ఉత్తర భారతంలో ‘మైత్రీ కరార్’ అని వ్రాసుకుని, రిజిష్టర్ చేయించుకునేవారు.

అంటే ఓ ఆడా ఓ మగా ‘మేమిద్దరం స్నేహం గా వుండదలుచుకున్నాం’ అని ఒప్పందం వ్రాసుకొని, మిగిలిన షరతులన్నీ పకడ్బందీగా వ్రాసుకునేవారు—‘తోడుకోసం, సామాజిక భద్రతకోసం మాత్రమే, యెవరి సంపాదనా ఖర్చూ వారివే, ఒకవేళ పిల్లలు పుడితే ఏమి, ఎలా చెయ్యాలి—లాంటివన్నీ కూడా వ్రాసుకొని, రిజిష్టరు చేయించుకునేవారు!

అప్పట్లో, ఓ హైకోర్ట్ ఈ కరార్లు చెల్లవు అని తీర్పు ఇచ్చినట్టు గుర్తు.

ఇప్పటికైనా ఇలాంటివి చట్టబద్ధం చేస్తే, సగం సామాజిక సమస్యలు, ప్రేమోన్మాదాలూ, యాసిడ్ దాడులూ లాంటివి తప్పుతాయి!

ఏ పార్టీ అయినా ఇలాంటి వాగ్దానంతో పోటీ చేసే ధైర్యం చేస్తుందా?

Wednesday, December 24

నిజమేనా?

Is it not?


Feroz Khan was a Parsi.

When he wanted to marry Indira Gandhi and she agreed, her father Nehru was reluctant to marry her off to Feroz!

Then our Mahatma Gandhi announced that he would adapt Feroze and lend him the name of Gandhi!

Then he himself has performed the marriage, convincing Mr. Nehru.

Our modern World history starts with the words “When Constantinople yielded to the Turks………..”! Nobody know why it yielded to the Turks!

The ancient Turks (‘Turushkulu’ in Telugu) had divided later into so many Religions, Sub-Religions, Sects and Sub-Sects—like Shias, Sunnis, Jews, Zorastrians, Dawoodi Bohras, Parsis, Bondilis etc.

The only common bond among these is ‘Suntee’ in Telugu, ‘barmitzvah’ for Jews, and ‘Male Organ Circumcission’ in Science & Surgery!

(Please correct me if I am wrong in case of any of these sects.)

So far as ‘kur-An’ is concerned, there is never a reference to the word ‘Muslim’ in the entire Text!

The followers of ‘Islam’ were called ‘Musalmaan’s! The Western People, who could not pronounce the word properly used to pronounce ‘Moslems’ and later it has transformed into the word ‘Muslims’!

In India also, the followers of Prophet Mohammed were called ‘Mohammadans’!

But the irony is, the Indian Media has created a separate Religion/Sect known as ‘Muslim Sodarulu’!

They are neither Mohammadans, Muslims, Islam followers, Turks, Shias, Sunnis, Parsis etc., but a separate entity!

(Please read, in any print media, no single word ‘Muslim’ is printed! Only ‘Muslim Sodarulu’ is found!

Hear any electronic media—no single word ‘Muslim’ is heard! Only ‘Muslim Sodarulu’ is heard!—

What a pinnacle of hipocracy!)

Why don’t we call a Spade a Spade—at least now?