Wednesday, August 5

నెత్తిన చేతులు

ఇంకో మహా మాయగాడు!
గుడిపల్లి చంద్రశేఖర రెడ్డి అని, నల్గొండవాసి తన భార్య, మరదలితో కలిసి చేస్తున్న మోసాలకి అంతులేదట!

ఈయన చేసేదేమిటంటే, ఓ పట్నం లో, ఖరీదైన ప్రాంతం లో కుటుంబంతో సహా అద్దెకుదిగి, రెండుకార్లూ, సెల్ఫోన్లూ వాడుతూ, ఫోన్ లో అవతలవాళ్ళతో అస్తమానూ కోట్లాది రూపాయల లావాదేవీలు గురించి మాట్లాడుతూ, డాబూ దర్పం ప్రదర్శించి, యెదటివారిని--అడగగానే, అడిగినంత డబ్బు ఇచ్చేలాగ మాయ చేసి, తరవాత రాత్రికి రాత్రే మకాం యెత్తేస్తాడట!

ఈయన చేసినవాటిలో కొన్ని—

ప్రొద్దుటూరు లో ఓ మహిళ బ్యాంకు ఖాతాలో పది లక్షలు వున్నాయని గమనించి, వారం లోజుల్లో ఇచ్చేస్తానని 7 లక్షలు తీసుకున్నాడట.

ఆయన భార్య కూడా, తిరుపతిలో పెళ్ళికి వెళ్ళివచ్చేక ఇచ్చేస్తానని, ఆవిడ దగ్గరే ఓ 3 తులాల బంగారు నెక్లెస్ తీసుకుందట.

మరదలు తక్కువ తిందా!—కొంత బంగారం కొని, కొంత మొత్తం చెల్లించి, 30 వేలు అరువేసి, దానికి ఆవిడని జామీనుగా పెట్టిందట.

ఇంకొకావిడని వీ ఐ పీ దర్శనం చేయిస్తానని తిరుమల తీసుకెళ్ళి, 15 తులాల బంగారం కాజేశాడట.

ఇవన్నీ చేసి, రాత్రికి రాత్రి మకాం యెత్తేశాడట—ఓ కారులో—రెండో కారూ, ఓ మోటర్ సైకిలూ వదిలేసి!

పోలీసులు కూపీ లాగుతుంటే, 2007 నించీ అనేక చోట్ల ఆయనమీద దాఖలైన కేసులన్నీ బయటకొస్తున్నాయట!

ఇవన్నీ ఒకెత్తు, ఓ ఆఫీసు పెట్టి, ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులనించి (పాపం నిరుద్యోగులు!) భారీగా డబ్బు గుంజి, 27-07-2009 న పరారయ్యాడట.

శభాష్!

మోసపోతున్నవాళ్ళలారా—ఇకనైనా మేలుకుంటారా?


No comments: