Thursday, May 6

"ప్రకటన"

చేస్తున్నవారు : "ఏకే రైట్ టు జస్టిస్.కామ్"

ప్రకటన యేమిటంటే :

"యెనభై ఆరో యెన్నో అభియోగాలు నిజమని నిరూపింపబడి, దోషిగా నిర్ధారణ అయిన 'అజ్ మల్ కసబ్' కి సరైన శిక్ష విధించే అవకాశం మా .కామ్ కి ఇవ్వాలని తగిన న్యాయస్థానం లో పిటిషన్ వెయ్యబోతున్నాం.

"ఆ శిక్ష అమలుచెయ్యడానికి ఉత్సాహపడే పౌరులెవరైనా ముందుగా మా .కామ్ లో రిజిష్టర్ చేసుకోవాలి. (రిజిష్ట్రేషన్ వివరాలకోసం మా .కామ్ సందర్శించండి)

"ఆ నేరస్థుడికి కూడా మానవహక్కులు వుంటాయనేవాళ్ళెవరైనా వుంటే, వాళ్ళని కూడా వీడితో సమం గా శిక్షించడానికి మాకు అనుమతి ఇవ్వాలని కూడా అదే న్యాయస్థానం లో పిటిషన్ వెయ్యబోతున్నాం.

"వాడికి విధించాలనుకుంటున్న శిక్ష యేమిటంటే--

"ఇండియా గేట్ లో మృతవీరుల స్మారక చిహ్నం యెదురుగా, ఓ స్థంభం పాతి, వాడిని గొలుసులతో కదలడానికి వీల్లేకుండా కట్టేస్తాం. అతని దగ్గరకి వెళ్ళడానికీ, అతని ముందు ఒకే సెకన్ వుండడానికీ, తిరిగి రావడానికీ ఒకే మనిషి పట్టే విధంగా క్యూ లైన్ యేర్పాటుచేసి, నడవక్కర్లేనివిధం గా యాంత్రిక పరికరాలని నిర్మిస్తాం.

"శిక్ష యేమిటంటే, యెవరైనా సరే తమ దగ్గర వున్న ఆయుధాలతో అతన్ని, తమకి తోచిన అతని అవయవాన్ని, కొయ్యడం గానీ, పొడవడం గానీ చెయ్యవచ్చు.

"అవి యెంత పదునైన ఆయుధాలైనా అయి వుండవచ్చు. 

"ముఖ్య నిబంధన యేమిటంటే--యే ఆయుధం అయినా 'మూడంగుళాలు పొడవూ, ఒక అంగుళం వెడల్పూ మించి వుండకూడదు '. (ఆయుధాలు ముందుగానే పరిశీలించబడి, అనుమతించబడతాయి).

"ఈ శిక్ష అమలవుతూండగా, మా సొంత టీవీ ఛానెల్లో 24 గంటలూ, ప్రపంచ వ్యాప్త 'లైవ్' కవరేజ్ వుంటుంది. (మధ్యలో ప్రకటనలకి మా వాణిజ్య విభాగాన్ని సంప్రదించండి)

"వాణ్ణి సమర్ధించే 'మానవహక్కులవాళ్ళకి' కూడా, వాడి ప్రక్కనే, ఇలాంటి శిక్షలకే యేర్పాట్లు చెయ్యబడతాయి.

"వాడి సానుభూతిపరులెవరైనా వున్నా, క్యూ లైన్లలో అందరితోపాటు వెళ్ళి, ఇదివరకు యెవరైనా కోసిన చోట కుట్లు వేసుకోవచ్చు, పొడవబడ్డ చోట, మందులు రాసుకోవచ్చు!

"ఈ మొత్తం కార్యక్రమం 48 గంటలపాటు మాత్రమే అమలవుతుంది. ఇంకొక్క సెకను కూడా పొడిగింపబడదు. గమనించండి. (ఒకళ్ళిద్దరు అటూ యిటూగా 1,72,800 మందికి మాత్రమే అవకాశం!) తొందరపడండి.

"గమనిక : ఈ శిక్షల ముఖ్యోద్దేశ్యం--ప్రపంచం లో యే తల్లైనా, 'తోటకూర నాడే' తన బిడ్డని 'ఉగ్రవాదివి కాకురా కన్నా!' అని వేడుకోవాలని.

"తరవాత మీ యిష్టం".

(ప్రకటన ఫూర్తయింది)

సూచన : యేమీ చెయ్యలేని నా కడుపు మంటని తీర్చుకోడానికి మాత్రమే ఈ ప్రకటనని రూపొందించాను. ఇది నిజమని యెవరూ నమ్మవద్దని నా మనవి. ఇట్లు : కృష్ణశ్రీ)

Sunday, May 2

పెట్రో ధరలు

వడ్డనకిది సమయమా?!

'ఆహార ద్రవ్యోల్బణం ఓ రెండు మూడు నెలల్లో అదుపులోకి వస్తుంది' అని శరద్ పవార్ చెప్పి ఆ సమయం గడిచిపోయింది అనుకుంటా.

తరవాతోసారి, 'నా వ్యవసాయ శాఖకీ, ద్రవ్యోల్బణానికీ యేమిటి సంబంధం?' అని విసుక్కున్నాడు.

ఇప్పుడు 'చూశారా! తగ్గిపోతోంది?' అంటున్నాడు.

(పాపం ఆయన క్రికెట్ కుంభకోణాలనే పట్టించుకుంటాడా, తన మంత్రిత్వ శాఖనే పట్టించుకుంటాడా, తరువాత ప్రథాని కావడానికి యెత్తులే వేస్తాడా! యెన్నని చూసుకోగలడు ఒకేసారి! మధ్యలో ఫోను ట్యాపింగులొకటీ!)

ఇదే సమయం లో యూ పీ యే ప్రభుత్వం 'పెట్రో ధరల నియంత్రణ ఎత్తివేత ' గురించి గంభీరం గా ఆలోచిస్తోందట. కేంద్ర మంత్రులతో సాధికార కమిటీని నియమించేశారట. దీని నాయకుడు, ఇంకెవరు--ప్రణబ్ ముఖర్జీయే! (వీరు తీసుకొనే నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం అమోదం అఖ్ఖర్లేదట!)

మే 7 తో పార్లమెంట్ సమావేశాలు ముగిశాకే నిర్ణయం వెలువడుతుందట.

ఈ చర్య వల్ల పెట్రోలు ఓ 6 రూపాయల చిల్లరా, డిజిల్ ఓ 5 రూపాయల చిల్లరా మాత్రమే పెరుగుతాయట. ఇక వంట గ్యాస్ ఓ 270 రూపాయలూ, కిరొసిన్ ఓ 18 రూపాయల చిల్లరా మాత్రమే పెరుగుతాయట.

ఇంకా, ఒకవేళ అంతర్జాతీయ ధరలకు అనుగుణం గా దేశీయ చిల్లర ధరల్ని పెంచాల్సి వస్తే, ఈ సాధికార సంఘం విడతలవారీగా పెంచొచ్చుట!

సరైన సమయం లో సరైన నిర్ణయాలకి పెట్టింది పేరైన ఈ ప్రభుత్వం నిర్ణయం సబబేనంటారా?

గత ఎన్ డీ యే హయాములో, కొన్ని కోట్లతో ఆయిల్ పూల్ ఎకౌంట్ నిర్వహించి, దాంట్లో పెట్రో ధరల హెచ్చు తగ్గుల్ని సరిదిద్దేవారు. తరవాత, విపరీతమైన హెచ్చు తగ్గులు వుండవు అని నిర్ధారణ అయ్యాక, ఆ పూల్ రద్దు చేసి, ధరలని నిర్ణయించే అధికారం ఆ కంపెనీలకే వదిలేశారు అనుకుంటా. 

అప్పట్లో, ఫలానా రోజు నించి ధర 2 పైసలు తగ్గింది, మళ్ళీ ఫలానా రోజు నించి 5 పైసలు పెరిగింది--ఇలా రెండేసి మూడేసి రోజులకి కూడా మారుతూ వుండేవి ధరలు.

మరి యూ పీ యే వచ్చాక, ఆయిల్ పూల్ అవసరం అనిపించలేదనుకుంటా! పైగా, మురళీ దేవరా అస్తమానూ--పాతిక పెంచుతాను, యాభై పెంచుతాను అనుమతి ఇవ్వండి--అని అడుగుతూ వుంటాడు ప్రభుత్వాన్ని. 

ఇదిగో--ఇప్పుడు పులిమీద పుట్ర!

ఇంకెక్కడి ధరలు తగ్గడం!

తూర్పుకి తిరిగి దణ్ణం పెడదామా?

Sunday, April 25

అవినీతి.....

........తిమింగలాలు

కమండలం లో చిక్కిన చేప, ఇంటికి తీసుకెళ్ళేసరికి దానంతా పెరిగిపోయిందట. అలా చివరికి సముద్రం లో పడవేయ వలసివచ్చేంత పెద్దది అయిపోయిందట. అది మత్శ్యావతారం.

*  *  *

వందల్లో లంచం, వేలల్లో లంచం, లక్షల్లో లంచం, ఇప్పుడు కోట్లూ, వందల కోట్ల లో లంచం--ఇలా పెరిగిపోతున్నాయి లంచావతార చేపలు.

మెడికల్ కాలేజీలకి లైసెన్స్ లు ఇచ్చే సంస్థ అధిపతి కేతన్ దేశాయ్ ఓ రెండు కోట్లు మాత్రమే లంచం అడిగి, పట్టుబడ్డాడట.

*  *  *

నేను చదివిన ఓ ఇంగ్లీష్ క్రైం నవల లో ఓ వూళ్ళో ఓ పెద్దమనిషి ఇంట్లో నిలువెత్తు ఇత్తడి విగ్రహాలు--జీవకళ వుట్టిపడుతూ కనువిందు చేసేవిట.

నిజానికి వాడి నేలమాళిగలోనో యెక్కడో ఓ యంత్రం వుంటుంది. వూళ్ళో తనకి అందుబాటులో వున్న అందమైన ఆడ పిల్లలనీ, యెవరిమీదైనా కోపం వస్తే వాళ్ళనీ, మాయచేసి, ఆ యంత్రం క్రింద నిలబెడితే, పైనించి కరిగిన ఇత్తడి లోహం క్రింద మనుషులమీద చక్కగా పరుచుకొని, ఓ ఇత్తడి బొమ్మ తయారయి పోతుందట--సజీవులై వుండగానే!

*  *  *

క్రితం సంవత్సరం ఇవే రోజుల్లో, ఇంజనీరింగు కాలేజీలకి అనుమతులిచ్చే పెద్దమనిషిని లంచం అడిగాడనే అరెష్ట్ చేశారు. విచారించారు. ఇప్పటిదాకా ఆ కేసు యేమయిందో తెలియదు.

*  *  *

ఐ పీ ఎల్ అని పెట్టి, కూరగాయలు కొన్నట్టు క్రికెట్ ఆటగాళ్ళని కోట్లతో కొని, టీముల్ని తయారు చేస్తున్నప్పుడు అధికారులెవరికీ ఆ కోట్లు యెక్కడినించి వస్తున్నాయని అనుమానం కూడా రాలేదట.

ఇప్పుడు ఓ మంత్రీ, అతని ప్రియురాలూ, లలిత్ మోడీ అనే ఐ పీ ఎల్ అధ్యక్షుడూ--ఇలా వొకళ్ళ గుట్టు వొకళ్ళు బయటపెట్టుకుంటుంటే, 'అయ్యబాబోయ్! మనీ లాండరింగ్' జరిగిపోయింది అని గుండెలు బాదుకుంటున్నారు.

మీరు ఆశ్చర్య పోతారేమో--మొన్ననే నేను ఓ ఇన్స్యూరెన్స్ కంపెనీ లో ఓ లక్ష రూపాయలకి పోలసీ కావాలంటే, 'పీ ఎం ఎల్ రూల్స్ ప్రకారం మీకు ఆ అదాయం వచ్చినట్టు ఋజువు చూపించాల్సిందే' అని తిరస్కరించినంత పని చేశారు! 

మరి వందల వేల కోట్ల లో సంపాదిస్తున్నవాళ్ళకీ, నిలవ చేస్తున్న వాళ్ళకీ, దాన్ని మళ్ళీ అవినీతి మార్గాల్లోకి మళ్ళిస్తున్నవాళ్ళకీ ఈ పీ ఎం ఎల్ కనీసం కాలిక్రింది నల్లి లా కూడా కనిపించదేమో! యేమి మాయ!

*  *  *

హైస్కూలు పిల్లాణ్ణి అడిగితే చెపుతాడు--ఫలనా సంస్థ లో అవినీతి, అక్రమాలు జరగడానికి యెలా ఆస్కారం వుంటుంది? అని అడిగితే!

మన సీ బీ ఐ, ఏ సీ బీ వాళ్ళకి మాత్రం, ఇంజనీరింగు కాలేజీల అధిపతి యెలా మెక్కాడో, ఆ పధ్ధతీ అవీ క్షుణ్ణం గా పరిశీలిస్తేగానీ, ఇప్పుడు మెడికల్ కాలేజీల అధిపతి యెలా మెక్కాడో తెలియదు మరి!

*  *  *

ఇప్పటికి ఓ పధ్ధెనిమింది వందల ఒక్క కోటీ యాభై లక్షలు మాత్రమే సంపాదించినట్టు తేలిందట--కేతన్ దేశాయ్. ఇందులో ఓ పదిహేనువందల కేజీల బంగారం, ఇంకా నగదూ మాత్రమే వున్నాయట. బహుశా ఇంకో రెండు మూడు వందల కోట్లు బయట పడచ్చుట.

ఆ వూళ్ళో, ఆ పెద్దమనిషి కనిపెట్టిన యంత్రం క్రింద ఈ దేశాయ్ ని నిలబెట్టి, 1500 కేజీ ల కరిగిన బంగారం పోత పోస్తే, యెంత అందమైన--సజీవమైన దేశాయ్ విగ్రహం యేర్పడుతుందో కదా! 

ఆ స్వర్ణ కేతనుణ్ణి ఇంచక్కా నాలుగురోడ్ల కూడలి లో నిలబెట్టి, అక్కడో బోర్డు వేళ్ళాడదీస్తే, ఇంకెవరూ ఇలా అక్రమాలకి పాలు పడరు కదా? అంటాడు మా రుద్ర కోటీశ్వరుడు.

యెలా వుంది?

Thursday, April 22

పైరసీ

తాటాకు చప్పుళ్ళు

ఆ మధ్య ఓ యువహీరో తన అభిమానులతో సహా పైరసీ పేరుతో సీడీ షాపుల మీద దాడి చేసి తల బొప్పి కట్టించుకున్నాడు.

ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం పరిశ్రమకి సపోర్టు చెయ్యాలి అనీ, పైరసీ ని నిరోధించి, కోట్లలో నిర్మాతలకి వస్తున్న నష్టాన్ని నివారించాలి అనీ కోరితే, మన ము. మం. గారు, 'అలాగే, అలాగే, అలాగలాగే' అన్నారట.

{తమిళనాడులో ఓ జాతీయ నాయకుడు (వీడు కాంగీరేసు కాదు--ఇందిరాగాంధీని నాయకత్వం లోకి రాకుండా శతవిధాల ప్రయత్నించిన, తన 'ప్లాన్ ' తో నెహ్రూ మంత్రివర్గాన్ని కాపాడిన, తన పేర ఓ కాంగ్రెస్ స్థాపించిన--కామరాజ్ నాడార్!) యెవరేమడిగినా, నవ్వుతూ ఒకే మాట అనేవాడట--'పార్కలాం' అని. అంటే 'చూద్దాం' అని! అలాగ మన ము. మం. కి కూడా 'అలాగే, అలాగే, అలాగలాగే' అనేది వూతపదం అయిపోతుందేమో!}

ఇంతకీ ఇంత గోలకీ కారణమేమిటి?

కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాం, మేం తీసిన సినిమాని మేం చెప్పినన్ని డబ్బులు ఖర్చుపెట్టేవాళ్ళు మాత్రమే చూసి, మాకు కొన్ని పదులో, వందలో కోట్లు మాత్రమే కురిపించాలి--అనే వాదన నిర్మాతల్నించీ, నిర్మాతలు మా స్టార్ వాల్యూ తో మమ్మల్ని బుక్ చేసి, కొన్ని కోట్లు ఇస్తున్నారు, అలా ఇవ్వాలంటే--వాళ్ళు ఇచ్చిన కోట్లకి కొన్ని రెట్లు రాబట్టుకోవాలికదా? అది జరగాలంటే, నిర్మాతల వాదన నిజమే! కాబట్టి.....అంటారు యువ, ముసలి హీరోలు!

అసలు మిమ్మల్ని అన్ని కోట్లు ఖర్చుపెట్టి, అంత ఖరీదైన హీరోల్ని (పాత హీరోల, దర్శకుల, సంగీత దర్శకుల, హాస్య నటుల, కొడుకుల్నీ, మనమల్నీ హీరోలుగా) పెట్టి సినిమాలు తియ్యమని యెవరు దేబిరించారు?

తీశారుపో, ఫలానావాళ్ళే, ఫలానా అంత డబ్బుచెల్లించే, చూడాలని అనడానికి మీకేం హక్కుంది?

మీరు చేస్తున్నది వ్యాపారం అయితే, అందరూ చేసేది వ్యాపారాలే కదా? వాళ్ళు బాగు పడకుండా, మీరే బాగుపడాలని, దానికి ప్రభుత్వం సహాయపడాలని కోరడం యెంతవరకూ సబబు?

(మిగతా ఇంకోసారి!)

Monday, April 5

చొప్పించబడ్డ వార్తలు

బీటీ--2

(కాయతొలుచుపురుగు రోగనిరోధక శక్తిని పెంచుకోవడం పై, పరిష్కారం యేమిటి అని అడిగిన ప్రశ్నకు)

గుజరాత్ తో పాటు చుట్టుపక్కల వున్న రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ల లో (6 రాష్ ట్రాల్లో--యెన్నివేల యెకరాల్లోనో!) 'బోల్గార్డ్-1' రెండు మూడేళ్ళు మానేసి, 'బోల్గార్డ్-2' వెయ్యాలట. (ఈ రెండూ మొనోశాంటో నే అమ్ముతుంది మరి!)

ఈ సాగులో కూడా, పత్తికాయలు అభివృధ్ధి చెందే సమయం లో, "కనీసం రెండు మూడు సారులు పురుగు మందు పిచికారీ చెయ్యాలట."

6 రాష్ట్రాల్లోని వేల యెకరాల్లో, రెండు మూడేళ్ళపాటు వాళ్ళ పంటనే వేస్తూ, పురుగు మందులు కూడా చల్లుతూ వుండడానికి యెంత ఖర్చు అవుతుంది? మరింక బీటీ యెందుకు?

చైనాలో నిబంధనలు చాలా కఠినం గా వుంటాయట. రైతులకు రెఫ్యూజియా విత్తనాలను సరఫరా చెయ్యవలసిందే నట. (లేక పోతే మొనోశాంటో కి పగులుతుంది మరి!)

బీటీ వల్ల దిగుబడి పెరగలేదంటున్నారు కదా అన్న ప్రశ్నకి, ఆయన యెంత అందం గా జవాబిచ్చాడో చూడండి.

దిగుబడి పెరగదు--అన్నాడు. కాని, ఓ మొక్కకి 100 గ్రాముల దిగుబడిని ఇవ్వగల శక్తి వుంటే, బీటీ వల్ల జన్యుబలం పెరగడం వల్ల, పూర్తి స్థాయి దిగుబడి వచ్చి తీరుతుంది--అంటున్నాడు. (అంటే వందకి వంద గ్రాములు అన్నమాటేకదా?) ఇదెలా సాధ్యం?

విత్తనాలకి మొనోశాంటో మీదే ఆధార పడాల్సి వస్తుంది కదా అంటే, బోల్గార్డ్ మాత్రమే మోనోశాంటోవి--ఇంకా చైనా, ఖరగ్ పూర్, ధార్వాడ్, బెంగుళూరు ల నించి కూడా మొత్తం 4 రకాల బీటీ లని తిసుకున్నారట. ఇంకో మూడు రకాలు పరీక్ష దశలో వున్నాయట. మరి ఇవన్నీ యెవరు అమ్ముతున్నారు? యెప్పటికి అందరికీ అందుబాటులోకి వస్తాయి?

1996 లో బీటీ పత్తి, మొక్కజొన్న, ఆలుగడ్డ పంటలు వచ్చాయి గానీ వివిధకారణాలవల్ల ఆలుగడ్డ ఆగిపోయిందట. (ఈ మొక్క జొన్న, ఆలుగడ్డ లని కోళ్ళకీ, పశువులకీ మాత్రమే వాడారని, అదికూడా ఇప్పుడు అనేక దేశాల్లో మానేశారనే నిజాన్ని దాచిపెడుతున్నాడీయన.)

వంకాయ మనకి ముఖ్యమైన కూరగాయ. మన పెరటితోటల్లో పెంచుకునే కూరగాయ! దాదాపు అన్నికాలాల్లోనూ లభిస్తుంది. సీజన్లో తక్కువ రేటుకే దొరుకుతుంది. అలాంటిదాన్ని బీటీ చేసి, మేమే అమ్ముకుంటాం, మీరు చచ్చినట్టు తినండి (దీన్ని పశువులమీదకూడా ప్రయోగించం--మీ పాట్లు మీరు పడండి!) అంటే--వొప్పుకోడానికి మనకన్నా వెఱ్ఱివెధవలు యెవరూ వుండరనుకున్నాడేమో!

ఇలాంటి ఆలోచనలని చీల్చి చెండాడండి! 

Saturday, April 3

వివాహ......

సహజీవనం

ఈ మధ్య మన సర్వోన్నత న్యాయ స్థానం సహజీవనాలని సమర్థించింది.

ఇంతకు ముందు నా టపాల్లో సహజీవనం లో వున్న లాభాలని చర్చించడం జరిగింది. మన ప్రభుత్వం 'మైత్రీ కరార్' లని చట్టబధ్ధం చేస్తే బాగుండును.

సహజీవనం మాటెలా వున్నా, 'రాధాకృష్ణులు కూడా' అని న్యాయస్థానం ప్రస్తావించడాన్ని గురించి పిసుక్కుంటున్నారు కొంతమంది స్వాములూ, పీఠాధిపతులూ!

ఆ మాటకొస్తే, 8 మందిని వివాహం చేసుకున్న కృష్ణుడు, మరో పదహారువేల ఒక్క మంది స్త్రీలతో సహజీవనం చేసేవుంటాడు (రాధ తో కలిపి).

ఆ పదహారువేలమందీ 'గోపికలు' అని కొంతమందీ, జరాసంధుడి చెరలోంచి విడిపించిన కన్యలు అని కొంతమందీ స్వాములూ, పీఠాధిపతులూ అంటారు.

ఈ మధ్యలో సందట్లో సడేమియా గా సానియా మీర్జా ఒకతి వచ్చింది--తనకి ఇంతకుముందు జరిగిన నిశ్చితార్ధం రద్దు చేసుకొని, పాకిస్తాన్ పౌరుడు, ఆ దేశం తరఫున క్రికెట్ ఆడే షోయబ్ ని పెళ్ళి చేసుకుంటానంది.

ఓ స్త్రీ తన కన్యాత్వాన్నీ యెవరితో పోగొట్టుకోవాలో, యెవరితో సంసారం చెయ్యాలో పూర్తిగా ఆమె ఇష్టం అని మరిచిపోయిన వాళ్ళు--ఇండియాలో నీకు మగాడే దొరకలేదా? అని అడుగుతున్నారు!

ఆమె ఇప్పటికే అతడితో అనేకసార్లు కొన్ని కొన్ని రోజులపాటు సహజీవనాలు సాగించింది అని కూడా వార్తలు వచ్చాయి.

అది ఆమె ఇష్టం--కాని పెళ్ళి మాత్రం భారతీయుణ్ణే చేసుకోవాలి అని అనేవాళ్ళని యేమనాలి?

మూర్ఖాగ్రేసర చక్రవర్తులు అనచ్చేమో!

Saturday, March 20

చొప్పించబడ్డ వార్తలు

బీటీ
(వరదాయినా? దుఃఖదాయినా?)

చొప్పించబడ్డ వార్త--ఇంగ్లీషులో 'ఇన్సర్టెడ్ న్యూస్ ' అంటారు.

'ఫలానా విషయం వార్త రూపం లో వస్తేనే దాన్ని ప్రజలు నమ్ముతారు. దాని వల్ల మనకి లాభం వస్తుంది ' అనుకొన్నప్పుడు, ఆ విషయాన్ని పత్రికలతో బేరమాడి, దాంట్లో వార్తగా వచ్చేలా చేస్తారు. 

'కలకత్తాలో బంగాళా దుంపలకి వైరస్ వచ్చేసి, పంట అంతా నాశనం అయిపోయింది.' లాంటి వార్తలు చదివితే, ఈనాడు కూడా దీనికి మినహాయింపు కాదేమో అనిపిస్తుంది.

ఇలా అనిపించిన ఇంకో సందర్భం, ఢిల్లీ లోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలోని 'ఎన్ ఆర్ సీ ఫర్ ప్లాంట్ బయోటెక్నాలజీ' విభాగం డైరెక్టర్ గా పనిచేస్తున్న సీనియర్ శాస్త్రవేత్త ఆనందకుమార్ తో 08-03-2010 ప్రచురించబడ్డ ఇంటర్వ్యూ!

'బాసిలస్ తురంజైటిస్ ' (అని వ్రాశాయి పత్రికలు. దీని శాస్త్రీయనామం యేమిటో నాకు తెలియదు). కొంతమంది అయితే, 'బయొలాజికల్లీ ట్రీటెడ్' అని వాడుతున్నారు. దీని సంగతేమిటి?

స్థూలం గా చెప్పాలంటే, ఓ పంట చీడపీడల బారిని పడకుండా, అధిక దిగుబడి రావడానికి, దాని జన్యు విధానం లోని కొన్ని జన్యువుల్ని మార్చివేసి, విత్తనాలని తయారు చేస్తున్నారు. ఈ పధ్ధతిలో పంట బాగానే రావచ్చు గానీ, ఆ పంటని మళ్ళీ విత్తనం గా వాడడానికి వీలు లేదు. వాటి అంకురాలు నాశనం చెయ్యబడతాయి! (అందుకని, మళ్ళీ ఆ పంట విత్తనాలు కావాలంటే, అవి అమ్మే కంపెనీ యెంత రేటుకి అమ్మితే అంతకి రైతులు కొనుక్కోవాలి. ఇలాంటి వాటిలో 'మోనోశాంటో' అనేది ఒక బహుళజాతి సంస్థ. ప్రస్తుతం బీటీ ప్రత్తి విత్తనాలు ఒక్క ఈ కంపెనీ దగ్గరే వున్నాయి). 

కాయతొలిచే పురుగుకోటీ, కాండం తొలిచే పురుగుకోటీ--ఇలా పురుగుమందుల్ని అమ్ముకొని బాగా సొమ్ముచేసుకొంటున్న 'బాయర్ ' వంటి బహుళజాతి సంస్థల్ని దెబ్బకొట్టడానికి ఇది కనిపెట్టించింది మోనోశాంటో. (ఇప్పుడు ఆత్మహత్యలకి కూడా రైతులు పురుగుమందుల్నే కొంటూండడంతో, బాయర్ లాంటి కంపెనీల లాభాలు పెరుగుతున్నాయి!)

ఆనంద కుమార్--బీటీ ప్రకృతి ఇచ్చిన వరం అనీ, ఇది అభివృధ్ధి చెందడానికి లక్షల యేళ్ళు పట్టింది అనీ ఇది మనుషులకీ, పశువులకీ హాని చేస్తుందని జరుగుతున్న ఆందోళనలు చేయిస్తున్న స్వచ్చంద సంస్థలు వాటికోసం డబ్బు ఖర్చు పెట్టడం తప్పనీ అంటూ, తన మాటల్ని తానే ఖండించుకుంటూ మాట్లాడిన వైనాన్ని గమనించండి.

దశాబ్దం పైగా బీటీ ప్రత్తి సాగు జరుగుతోంది మన రాష్ట్రంలో. మొదట్లో తెల్లబంగారం పండింది అని సంతోషించి బాగా సంపాదించిన ప్రత్తి రైతులు, మోనోశాంటో చేస్తున్న మోసాలతో అసలు విత్తనాలే మొలకెత్తని స్థితికి చేరి, నాసిరకం దిగుబడితో, ఆత్మహత్యలు చేసుకొంటున్నారిప్పుడు.

ఆయన చెప్పిన కారణం?

గుజరాత్ లో బీటీ ప్రత్తి విఫలమైనట్లు మోనోశాంటో అంగీకరించింది కదా? అన్న ప్రశ్నకి, 'రెఫ్యుజియా' అనే ప్రక్రియ అనుసరించకపోవడం వల్లే అది విఫలమైందన్నారు. 

రెఫ్యూజియా అంటే, బీటీ విత్తనాల్లో 10, 15 శాతం మామూలు విత్తనాలని కలిపి సాగు చెయ్యడం అట. అలా చేస్తే, మమూలు విత్తనాలనుంచి వచ్చిన మొక్కలని మాత్రమే పురుగులు తినేస్తాయట. మిగిలిన బీటీ మొక్కలు చాలా అరోగ్యం గా పెరిగి, యెక్కువ దిగుబడిని ఇస్తాయట. ఇంకా విచిత్రమేమిటంటే, అలా చెయ్యకపోవడం వల్ల బీటీ విత్తనాలనుంచి మొలిచిన మొక్కల్ని కాయతొలుచు పురుగూ, శనగపచ్చపురుగూ ఆశిస్తాయట. అలా ఆశించినవాటిలో, రోగనిరోధక శక్తి పెరిగిపోతుందట! అదృష్టం కొద్దీ శనగపచ్చపురుగు నిరోధక శక్తిని పెంచుకోలేదట. కాయతొలుచుపురుగుమాత్రం పెంచుకుందట. పైగా, అది ప్రత్తితోపాటు మరో 150 పంటలకు వ్యాపించగలదట!!!

నిజమే అనుకుందాం.

మరి ఇన్నాళ్ళూ రెఫ్యుజియా గురించి యెవరైనా విన్నారా? అసలు బీటీ వల్ల విత్తనం/మొక్క పురుగు నిరోధక శక్తి పెరగాలా, దాన్ని ఆశించిన పురుగు నిరోధక శక్తి పెరగాలా?

ఇంకా, బీటీ లో 10, 15 శాతం మామూలు విత్తనాలని కలిపే అమ్మచ్చు కదా--మోనోశాంటో?

అలాకాదనుకుంటే, తన విత్తనాల డబ్బాతో పాటు, మామూలు విత్తనాల డబ్బా (10, 15 శాతం తో) కూడా కొనుక్కోమని చెప్పాలికదా?

(బీటీ వంకాయ ప్రవేశ పెట్టడం గురించి ప్రభుత్వం తన నిర్ణయం వాయిదా వేసుకున్న కొన్ని రోజులకే ఈ ఇంటర్వ్యూ ప్రచురించబడడం చూస్తేనే, ఇది మోనోశాంటో పని అని తెలియడం లేదూ!)

మిగతా మరోసారి.  

Sunday, March 14

సరిగ్గా అలాగే...........

అంతా అయిపోయింది!

ఓ అప్పారావు గుండాట ఆడుతూ, బాగానే నెగ్గాడట అప్పటివరకూ. ఓ ఐదువేలు సంపాదించాడట అప్పటికి. 

'ఆ ఐదు వేలనీ ఐదోనెంబరుమీద వెయ్యి' అని వినిపించిందట చెవిలో. 

అలాగే చేశాడు. పదివేలొచ్చాయి!

అలా చెవిలో వినపడిన మాటలని అనుసరించి, ఆడసాగాడు. అప్పటికి ఐదు లక్షలు వచ్చాయి.

'ఆ ఐదు లక్షలూ యేడు మీద కాయి' అని వినిపించి, అలాగే కాశాడు.

మొత్తం డబ్బు పోయింది!

'అర్రే! సరిగ్గా ఇలాగే జరిగి నేను ఆత్మహత్య చేసుకొన్నాను!' అని వినిపించింది సుబ్బారావుకి ఫైనల్ గా.

సరిగ్గా అలాంటి స్థితిలోనే వున్నాడు 'ఐకాస' కన్వీనర్ కోదండరామ్--1973 లో మాలాంటివాళ్ళు వున్న స్థితిలోనే!

అప్పట్లో, ఉద్యమం వుధృతం గా వుండగా, అన్ని సంఘాలూ ఒకే త్రాటి పై వుండగా, బ్యాంకుల్లాంటి ప్రభుత్వ సంస్థలు సైతం వారానికి రెండు రోజులే పనిచేస్తున్న రోజుల్లో, ఆంధ్ర రాష్ట్రం కనుచూపుమేరలో కనిపిస్తూ వుండగా, ఉప ముఖ్యమంత్రి బీ వీ సుబ్బారెడ్డి ప్రత్యేకాంధ్రోద్యమానికి మద్దతుగా రాజీనామా చెయ్యడంతో, మా లాంటి వాళ్ళం "ఇంకేముంది! ప్రత్యేకాంధ్ర రాష్ట్రం వచ్చేసినట్టే!" అనుకున్నాము.

జరిగిందేమిటి? ప్రత్యేకాంధ్ర చంక నాకిపోయింది. జరిగింది కేవలం ముఖ్యమంత్రి మార్పు మాత్రమే!

మరి ఇప్పుడు?

ఐ కా స చంక నాకి పోయింది. కాంగ్రెస్ బయటికి వెళ్ళిపోయింది. టీ డీ పీ ని బహిష్కరించారు. బీ జే పీ ని నమ్మం--పక్కన పెడతాం అంటున్నారు. మరింక కోదండరామ్ దేనికి కన్వీనర్?

ఇప్పుడైనా మించిపోయింది లేదు--శ్రీ కృష్ణ కమిటీని రద్దు చెయ్యమని అందరూ ఆందోళన చేస్తే, కనీసం సామాన్య ప్రజలకి కొన్ని కోట్ల భారం తప్పుతుంది.

ముఖ్యమంత్రి మార్పు అధిష్ఠానం కోరినప్పుడే జరుగుతుంది.

ఈ మాత్రానికి యెందుకొచ్చిన ఆందోళనలు; బందులు; రాస్తా రోకోలు; ఆత్మ హత్యలు; సూడో ఆత్మహత్యలు?

ఆలోచించండి!

Sunday, March 7

ప్రభుత్వ పథకాలు

జా.గ్రా.ఉ.హా. పథకం

గ్రామాల్లో పనులు లేని సమయం లో కూలీలకు ఉపాథికి భరోసా ఇవ్వడానికి ఈ జాతీయ గ్రామీణ ఉపాథి హామీ పథకం ప్రవేశపెట్టారు.

దీని వుద్దేశ్యం కూలీలకు ఉపాథి దొరకని రోజుల్లో, ప్రభుత్వం కనీసం 100 రోజులపాటు తనే పని కల్పించి, వారికి కూలీ చెల్లిస్తుంది.

మంచి పథకమే కదూ?

విచిత్రమల్లా, ఈ పథకం యెక్కడా సరిగా అమలు కావడం లేదు.

ఉదాహరణకి, ఓ మండలం లో గత యేడాది 293 పనులు యెంపిక చేస్తే, ఒక్కపనీ ఇప్పటివరకూ ప్రారంభం కాలేదట.

మళ్ళీ ఈ యేడాది మరో 353 పనులు యెంపిక చేశారట.

మరి ఇటీవల అదనపు సం యుక్త కలెక్టర్ గా వచ్చిన ఎం. వి. శేషగిరిబాబు, ఈ పనులన్నీ వెంటనే ప్రారంభించి పూర్తి చెయ్యాలని అదేశాలు ఇచ్చి, వాటి అమలుకోసం ప్రతి రోజూ సమీక్షిస్తూ, క్రింది అధికారుల సెల్ ఫోనులకి ఫోన్లు చేస్తున్నారట.

ప్రస్తుతం ఆ మండలం లో కూలీలకు పుష్కలం గా ఉపాథి దొరుకుతోందట--ముమ్మరం గా జరుగుతున్న వ్యవసాయ పనుల వల్ల.

మరి మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులు యేం చేస్తారు?

ఆ పనుల్లో వున్నవారినే వేటాడి, కొంతమందిని బ్రతిమలాడి, యెక్కువ డబ్బులిస్తామని చెప్పి, కొన్ని పనులు ప్రారంభింప చేశారట.

అవి పూర్తయ్యేదెప్పుడో?

గణాంకాలు మాత్రం, ఈ నెలలో ఇన్ని పనులు ప్రారంభించాం అంటూ ప్రభుత్వానికి చేరి పోయాయి!

పథకాలు వర్థిల్లు గాక!

Sunday, February 28

చరిత్ర

వ్యాఖ్యానాలు


వ్యాఖ్యాతలకు ధన్యవాదాలు.

నా టపాలో వుదహరింపబడిన 1946 లో జరిగిన అసెంబ్లీ యెన్నికలు మనకి స్వాతంత్ర్యం రాకముందు, ఆంధ్ర ప్రదేశ్ యేర్పడకముందు, అప్పటి (ఉమ్మడి) మదరాసు రాష్ట్రానికి జరిగినవి.

మనదేశం లో 'గవర్నమెంట్ ఆఫ్ ఇండియా' ఆక్టు ప్రవేశపెట్టబడినప్పటినించీ, రాష్ట్రాలకి ప్రతి 5 యేళ్ళకోసారి తప్పకుండా యెన్నికలు జరిగేవి. 

నేను చెప్పానని బాధపడకుండా, మీరు చదివిన స్వాతంత్రోద్యమ చరిత్రనీ, గాంధీ, నెహ్రూ, పటేల్, టంగుటూరి, తెన్నేటి మొదలైన వారి జీవిత చరిత్రలూ గుర్తు చేసుకోండి!

చదవని వాళ్ళు చదవడానికి ప్రయత్నించండి!


డియర్ oremuna!

గాంధీకి అంతనమ్మకంగా చెప్పినవాళ్ళెవరో కూడా మీకు తెలిసేవుంటుందంట! మరి చెప్పరూ?

అదెంత నిజమో అదికూడా చెప్పరూ?

(నా ఈ బ్లాగులో యెందుకో నా కామెంట్లు ప్రకటించబడడం లేదు. అందుకనే ఇలా వేరే టపా గా వ్రాస్తున్నాను. అన్యథా భావించవద్దు. యెవరికైనా కారణం తెలిస్తే, చెపితే సంతోషిస్తాను!)

Saturday, February 27

కాంగ్రెస్

అధిష్ఠానం

మహాత్మా గాంధీ నించి, ఇందిరా పందీ సారీ ఇందిరా గాంధీ వరకూ (ఎమర్జన్సీ విధించాక ఆవిడని అలా అనేవాళ్ళం), సోనియా గాంధీ నించి రాబోయే రాహుల్ వరకూ--తెలుగువాళ్ళ పట్ల వాళ్ళ దృక్పథం--మారలేదు, మారదు, మారబోదు!

"1946 లో జరిగిన అసెంబ్లీ యెన్నికల్లో శ్రీ (తెన్నేటి) విశ్వనాధం విశాఖపట్నం నుంచి అఖండ విజయం సాధించారు.

ఆ సమయం లో ఆంధ్ర ప్రతినిధులు నలుగురు ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు చెయిర్మన్ సర్దార్ పటేల్ ను కలుసుకోనడానికి వెళ్ళారు. వీరు (టంగుటూరి) ప్రకాశం గారికి వ్యతిరేకం గా ఢిల్లీలో ప్రచారం చేయడానికి వెళ్ళారన్న విషయం స్పష్టమౌతున్నది.

ఆప్పుడు తెన్నేటి ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఇలా వుంది:

'ఈ నలుగురు ఆంధ్రులు సర్దార్ పటేల్ వద్దకు వ్యక్తిగతం గా వెళ్ళి వుండాలి (రాష్ట్ర పార్టీ అనుమతి తో కాదు). ఆంధ్ర ప్రాంత సభ్యులకు వారెంతమాత్రమూ ప్రతినిధులు కానేకారు. చెన్న రాష్ట్ర శాసన సభ్యులకు స్వేఛ్ఛగా తమ నాయకుని యెన్నుకునే హక్కున్నది. పరోక్షం గా కాని, అపరోక్షం గా కాని యెవరైనా వారిని నిర్బంధిస్తే, వారి హక్కులకు భంగం కలుగుతుంది.'

ఈ ప్రకటనను 'ఆంధ్ర కేసరికి ' తెలియకుండానే తెన్నేటి చేశారు.

ఆయన వుద్దేశ్యం--మద్రాసు ముఖ్యమంత్రి యెన్నికలలో కాంగ్రెస్ అధిష్టానవర్గం ప్రమేయం వుండరాదని, శాసన సభ్యులే స్వేఛ్ఛగా తమ నాయకుని (ముఖ్యమంత్రిని) యెన్నుకోవాలని!

...........చర్చించడానికి ఢిల్లీ రావలసిందిగా ఆనాటి కాంగ్రెసు అధ్యక్షుడు మౌలానా ఆజాద్ తంతి పంపారు......'ఇది చాలా తప్పు. మనం ఢిల్లీ వెళ్ళకూడదు ' అని తెన్నేటి ఒక ప్రకటన చేశారు.

...........రాజాజీనే (చక్రవర్తుల రాజగోపాలాచారి ని--సియార్--అంటే హిందీలో జిత్తులమారి గుంటనక్క--అనేవారు) కాంగ్రెసుపార్టీ నాయకుడుగా, అంటే ముఖ్యమంత్రిగా యెన్నుకోవాలని కాంగ్రెసు అధిష్ఠాన వర్గం మద్రాసు కాంగ్రెసు లిజిస్లేచర్ పార్టీ కి సూచించింది.  'మీరు హైకమాండ్ ఆదేశం పాటిస్తే పాటించండి. లేకపోతే, తత్పరిణామాల బాధ్యత మీదే' అన్న ధోరణిలో తిరిగి ఆజాద్ టెలిగ్రాం పంపించారు.

రాజాజీని నాయకుడుగా అంగీకరించాలన్న హైకమాండ్ ఆదేశాన్ని మద్రాసు కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ సమావేశం లో 1946 ఏప్రిల్ 18 న వోటింగుకు పెడితే, రాజాజీకి అనుకూలం గా 38, వ్యతిరేకం గా 148 వోట్లు వచ్చాయి. ఈ సమావేశానికి ప్రకాశం గారి శిష్యుడు వి. వి. గిరి (తరవాత మన రాష్ట్రపతి అయ్యారు--ఇందిరాగాంధీ నీలం సంజీవరెడ్డిని మోసం చేసి, అంతరాత్మ ప్రబోధం ప్రకారం వోట్లు వెయ్యమనడం వల్ల) అధ్యక్షత వహించారు. 

..........కాగా ప్రకాశం గారు ఏ పరిస్థితిలోను ముఖ్యమంత్రి కారాదని కాంగ్రెసు హైకమాండ్, ముఖ్యం గా మహాత్మాగాంధీ ధృఢాభిప్రాయం.

ఈ విషయం లో మాత్రం గాంధీజీ వైఖరి ఏ విధం గానూ సమర్థనీయం గా కనిపించదు. ముఖ్యం గా--1942 నుంచి కాంగ్రెసు సిధ్ధాంతాలకు, ఆలోచనారీతికి వ్యతిరేకం గా వుంటూ, 'క్విట్ ఇండియా' తీర్మానాన్ని ప్రతిఘటించి, చివరికి పాకిస్తాన్ తీర్మానాన్ని సమర్థించి, ఆ స్వాతంత్ర్యోద్యమం చివరి ఘట్టం లో ఒక్కరోజు కూడా జెయిలుకి వెళ్ళకుండా, కాంగ్రెసు విథానాలను, మహాత్మా గాంధీ కార్యానుసరణ విథానాన్ని వెన్నుపోటు పొడిచిన--రాజాజీయే ముఖ్యమంత్రి కావాలని, అంతటి త్యాగధనుడు, మహా దేశభక్తుడు, ప్రజానాయకుడు అయిన ప్రకాశం గారు ముఖ్యమంత్రి కారాదని గాంధీజీ పట్టు పట్టడం ఆంధ్రులకేకాదు, తెన్నేటి విశ్వనాధం వంటి గాంధేయవాదులకు, నిష్పాక్షిక రాజకీయ పరిశీలకులకు సయితం అప్పటికీ, ఇప్పటికీ అర్థం కాని విషయం.

రాజాజీ గాంధీజీకి వియ్యంకుడు కావడమే ఇందుకు కారణమని అప్పటిలో కొందరు చేసిన ఆరోపణలు జాతిపితకు బంధుప్రీతిని ఆపాదించడం కావచ్చుకాని, మొత్తం మీద గాంధీజీ వైఖరి అప్పటిలో చాలామందికి అర్థం కాలేదు.

...........'పరిస్థితి ఇలా వుంది, యేమి చెయ్యమంటారో చెప్పండి ' అని వి. వి. గిరి....మౌలనా అజాద్ కు టెలిగ్రాము ఇవ్వగా, 'మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటున్నారు. ఇక మా సలహా దేనికి?' అంటూ నిష్ఠూరం గా సమాధానం ఇచ్చారు.

1946 ఏప్రిల్ 23న తిరిగి మద్రాసు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. ప్రకాశం గారికి, సి. ఎన్. ముత్తురంగ మొదలియార్ కు పోటీ జరిగింది. అధిక సంఖ్యాకులు ప్రకాశాన్ని నాయకుడుగా యెన్నుకున్నారు."

(ఆ విధం గా అధిష్ఠానానికి వ్యతిరేకం గా ముఖ్యమంత్రి గా యెన్నికైన శ్రీ టంగుటూరి ప్రకాశాన్ని--పదవి నించి దిగేదాకా నిద్రపోలేదు అధిష్ఠానం! ఆ విషయాలు తరవాత! ఇందులో "..." మధ్య వున్నదంతా తెన్నేటి విశ్వనాధం జీవిత చరిత్రనించి యథాతథం గా వ్రాయడం జరిగింది. బ్రాకెట్ల మధ్య వున్నవి నా వివరణలు. బోల్డ్ గా వున్నవి నేను ప్రాథాన్యత ఇచ్చినవి--కృష్ణశ్రీ)

Thursday, February 25

లక్ష్యం

గురి

ద్రోణుడు ఓసారి తన శిష్యుల విలువిద్యా నైపుణ్యాన్ని పరీక్షించదలిచి, ఓ చెక్క పక్షిని చేయించి, ఓ చెట్టుమీద చిటారుకొమ్మన పెట్టించి, కౌరవుల్నీ, పాండవుల్నీ ఒక్కొక్కళ్ళనీ పిలిచి 'నీకేమి కనిపిస్తోంది?' అని అడగడం మొదలు పెట్టాడట.

ఒక్కొక్కళ్ళూ--ఆకాశం, మేఘాలు, చెట్టు, పక్షీ, గురువుగారు, సోదరులూ--అంటూ లిష్టులు చెప్పారట.

చివరికి అర్జునుడు మాత్రం, 'నేను కొట్టవలసిన పక్షి ఒక్కటే నాకు కనిపిస్తోంది గురువర్యా!' అన్నాడట!

అదీ లక్ష్యం అంటే--దానికి గురి పెడితేనే విజయం వరిస్తుంది!

యెందుకు చెప్పానంటే, మన తెలుగు బ్లాగులమీద వ్యాఖ్యలు చేసేవాళ్ళు కూడా.....అర్జునుళ్ళు కాదు....వాళ్ళకి అసలు విషయం తప్ప అన్నీ అర్థం అవుతాయేమో....అనిపించి!

ఆఁ! సింగినాదం, జీలకఱ్ఱ అంటారా!

ఈ మాటా, సామెతా మా పశ్చిమగోదావరి జిల్లాలోనే, మా నరసాపురం లోనే పుట్టాయండోయ్!

డచ్చివారు (హాలెండర్స్--హలంధరులు--వలందరులు) నరసాపురాన్ని వాళ్ళ వ్యాపార కేంద్రం గా చేసుకొని, సంపన్నమైన మన అటవీ సంపదని విదేశాలకి యెగుమతి చెయ్యడానికి వుపయోగించుకోవాలని తలచి, గోదావరిని వాడుకున్నారు.

మొదటిగా, అడవుల్లోంచి 'జీలకఱ్ఱ' సేకరించి, పడవల్లో నరసాపురం రవాణా చేసి, అక్కడ గోదాముల్లో నిలవ చేసి, అక్కడనించి అంతర్వేది రేవు ద్వారా ఓడలలో యెగుమతి చేశేవారు.

(మూడు వందల యేళ్ళ క్రితమే అంతర్వేది లో లైట్ హౌస్ వుండేది--దాని శిథిలాలు మొన్న మొన్నటి వరకూ వుండేవి).

పడవలు నరసాపురం రేవుకి అల్లంత దూరం లో వుండగానే, దిగుమతి కార్మికుల్నీ, వుద్యోగుల్నీ హెచ్చరించడానికి, పడవమీద నించి 'శృంగనాదం' (కొమ్ము బూరాలు వూదడం) చేశేవారు.

ఆ నాదం వినపడగానే, వూరి ప్రజలు--'జీలకఱ్ఱ పడవలు వచ్చేశాయండోయ్' అని తమ పరిఙ్ఞాన్ని ప్రదర్శించేవారు!

ఆ శృంగనాదమే, సింగినాదం అయ్యింది--దానికీ జీలకఱ్ఱకీ సంబంధం కల్పించడం జరిగింది.

తరవాత్తరవాత, చింతపండూ, మిరపకాయలూ దగ్గరనించి, తుమ్మజిగురు దాకా అన్నీ పడవల్లోనే వచ్చేవి, వాటికీ సింగినాదమే చేసేవారు!

అప్పుడు నిశ్చయం అయ్యింది--సింగినాదానికీ, జీలకఱ్ఱకీ యే సంబంధం లేదని!

ఇప్పటికీ సంబంధం లేని విషయాలని 'ఆఁ! సింగినాదం, జీలకఱ్ఱ' అంటారు!

అదండీ సంగతి!
డియర్ oremuna!

ఇక్కడ విషయం అమెరికాలో తప్పా, ఆంధ్రలో తప్పా కాదు కదా?

ప్రభుత్వం చేస్తున్న దగా గురించి!

ఇక విద్యా విధానం, పరీక్షలూ అవీ అమెరికాకీ మనకీ చాలా తేడా వుంది కదా? మరి వీళ్ళు చదువులు యెప్పుడు వెలగబెట్టాలి?

ఆలోచించండి!

ధన్యవాదాలు.

Wednesday, February 24

కాకి బంగారం

వాయస స్వర్ణాంధ్ర ప్రదేశ్

అచ్చం బంగారం లాగే భ్రమింపచేసే దాన్ని కాకి బంగారం అంటారు.

స్వర్ణాంధ్ర ప్రదేశ్ చేసి చూపిస్తామన్న మన రాజకీయులు--"కాకి బంగారాంధ్ర ప్రదేశ్"  చేసి చూపిస్తున్నారు.

==> స్టూడెంట్ మేనేజ్ మెంట్ హాస్టళ్ళు--700 యేర్పాటు చేసిందట రాష్ట్ర ప్రభుత్వం. (యెప్పుడో నాకు తెలీదు). వాటికి, భవనం అద్దె, వంటవాళ్ళ ఖర్చు, కరెంటు బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుందట. ఇలా రెండు లక్షల మంది ఏస్సీ, ఏస్టీ, బీసీ విద్యార్థినీ విద్యార్థులు ఈ హాస్టళ్ళ నీడ పొందారట.

ఇప్పుడు మన రాష్ట్ర 'మిగులు బడ్జెట్' పుణ్యమాని, ఆ విద్యార్థులు--ఇంజనీరింగ్, మెడిసిన్, ఏంబీయే, ఏంసీయే, ఎంఫిల్, పీహెచ్డీ, సీయే--ల్లాంటివి చదువుతున్నవాళ్ళూ--హోటళ్ళలోనూ, బార్ల లోనూ వెయిటర్లుగా పనిచేస్తూ, విద్యార్థినులు--ఫంక్షన్లలో పన్నీరు చల్లే, పువ్వులు ఇచ్చి స్వాగతం చెప్పే పాత్రలతో పొట్ట పోషించుకుంటున్నారట!(ఇంకా నయం--కాల్ గర్ల్స్/బాయ్స్ గా మారడం లేదు!)

==> కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం లో 17 ట్రామాకేర్ కేంద్రాల యేర్పాటుకి రెండేళ్ళ క్రిందట, 130 కోట్లు మంజూరు చేసిందట--ప్రమాదాల్లో గాయపడిన వారికి సత్వర చికిత్స అందించడానికి.  రాష్ట్రం లో ఏటా 40 వేల రోడ్డు ప్రమాదాల్లో, 28 వేలు జాతీయ రహదారుల్లోనే జరుగుతున్నాయట. అందులో గత యేడాది 13,545 మంది మృతి చెందారట. వీరిలో, 60% సకాలం లో చికిత్స అందకే మరణించారట! ఈ కేంద్రాల కోసం 2008-09 లో 31.53 కోట్లు విడుదల చేస్తే, ఖర్చు చేసింది 15.70 కోట్లు మాత్రమేనట! ఆ నిధులన్నీ ఖర్చు చేస్తేనే తరవాత విడత మంజూరు చేస్తామన్న కేంద్రానికి జవాబు చెప్పే దిక్కే లేదట! అసలు 17 లో 7 కేంద్రాల్లో ఎలాంటి పనులూ మొదలే పెట్టలేదట!

==> నీటి పారుదల కి 'పెద్ద పీట ' వేసినప్పటినించీ, కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించకుండా, కూలీలకి పనులు చూపించకుండా, తప్పించుకు తిరుగుతోందట ప్రభుత్వం!

==> మన ఆర్టిసీ 'టోల్ పన్నుల ' రూపం లో 'అన్ని జిల్లాలనీ కలిపి ఒక యూనిట్ గా పరిగణించి ' చెల్లింపులకన్నా యెక్కువగా వసూలు చేసి, తన జేబు నింపుకుంటోందట!

==> మధ్యాన్న భోజన పథకం లో తమకు రావలసిన యేడు నెలల బకాయిలని చెల్లించాలని అడిగిని పాపానికి మహిళల్ని నెత్తురు కారేలా చితక్కొడుతున్న పోలీసుల ఫోటోలు పేపర్లో చూడనే చూశారు కదా?

==> ఈ లోపల, 'తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్న వారి ఆస్తులని లెక్క కడుతున్నాం' అంటున్నాడు--'తెలంగాణ ఐ కా స ' 'ప్రొఫెసర్ ' కోదండరామి రెడ్డి! 'శ్రీ కృష్ణ కమిటీ' ని తాము బహిష్కరించామన్నారు!

మరి వాళ్ళు బహిష్కరించిన కమిటీని కేంద్రం యెందుకు రద్దు చెయ్యదు?

'ఇదే ఆఖరి పోరాటం--ఈసారి తెలంగాణ రాకుంటే ఇక ఎప్పుడూ రాదు ' అని కూడా అన్నారు--తథాస్తు దేవతలుంటారని మరిచి పోయినట్టున్నాడు!

ఇదండీ మన 'వాయస స్వర్ణ ' ఆంధ్ర!

Monday, February 1

గొప్పవాళ్ళు



భస్పీ మాలబబ్రహ్మణ్యం  


కొంతమంది 'గొప్పవాళ్ళుగా పుడతారు', కొంతమందికి 'గొప్పతనం వాళ్ళ నెత్తిమీద రుద్దబడుతుంది', కొంతమంది 'గొప్పతనాన్ని స్వయంకృషి తో పొందుతారు'! అంటారు.  


ఆఖరి కోవకి చెందే, మన జాతి గర్వించదగ్గ తెలుగు రత్నం మన యెస్పీ!  


మొన్న (18-01-2010) '....ట్ పాడుతా తీయగా' ఎపిసోడ్ ముగింపులో, కీరవాణి 'అమ్మా సరోజినీదేవీ' పాట పాడితే 'అది ఆయన సంస్కారం' అన్న బాలూకి సమాధానం గా, కీరవాణి.... 


'సినిమావాళ్ళందరూ వీ ఐ పీ ల్లా శ్రీపతిని దర్శించుకుని తమ కోరికలు కోరుకుంటే, బాలూ కాలినడకన కొండ యెక్కి, స్వామి సమక్షం లో తను ఈ రోజు ఈ స్థితికి రావడానికి కారణమైన వాళ్ళందరినీ పేరు పేరునా తలుచుకుని, వారి తరఫున స్వామిని ప్రార్థించాడు!' అన్నాడు!  


దటీజ్ బాలసుబ్బు!  


(యెప్పుడో ఆయన సరదాగా చెప్పిన ఆయన పేరుని--అలాగే వుపయోగిస్తున్నందుకు యస్పీకి క్షమాపణలు.)

Thursday, January 14

ద్రవ్యోల్బణం



ధరలు


నాలుగురోజుల క్రితం కూడా, శరద్ పవార్ 'ధరలు తగ్గించడానికి నా దగ్గరేమీ మంత్రదండం లేదు' అన్నాడు!  


ఆహార ద్రవ్యోల్బణం రేటు దాదాపు 20 శాతానికి చేరింది!  


పప్పుల ధరలు కేజీకి శతకం దగ్గరే వున్నాయి. ఇంకో మూడునెలలలో అవి 120 దాట వచ్చు అని ఓ ప్రముఖుడి ప్రకటన!  


పెట్రోలు రేటు లీటరుకి 3 రూపాయలు పెంచుతామన్న మంత్రి!  


ఓ పక్క అడ్డం గా పెంచేసిన ఆర్ టీ సీ చార్జీలు!  


ఇలా ఓ పెద్ద భూతాన్ని ఇంకా పెద్దగా చేస్తూ గుండెలదరగొట్టిన సర్కార్లు!  


మరి సరిగ్గా సంక్రాంతి పండగకి ఒక రోజు ముందు, భోగి రోజునే పప్పుల ధరలు కేజీ కి యేకం గా 20 రూపాయలు తగ్గాయి!  


చక్కెర రేటు కూడా తగ్గింది! బియ్యం అప్పుడే పెరగవుట! పెట్రోలు ధరల పెంపు ప్రతిపాదన అప్పుడే లేదట!  


మరి యెవరు యే మంత్ర దండం ప్రయోగించారు?  


ఆ మంత్రదండం యెవరి చేతిలో వుందో తెలిస్తే, వాణ్ణి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి, మనకవసరం వచ్చినప్పుడల్లా ఓ రెండు పీకుతుంటే సరి, ధరలు 20 రూపాయలు చొప్పున తగ్గుతూ వుంటాయి--మిగిలినవి పెరగవు!  


ఇలా మీకు అనిపించడం లేదూ?  


చక్కెర విషయానికొస్తే--ఈ సంవత్సరం ఇంకా పెద్ద కుంభకోణం యేమీ బయటకు రాలేదుగానీ--మాయావతిని కేంద్రం తప్పుపట్టబోతే, ఆవిడ తిరగబడి వీళ్ళ నోరు మూయించింది!  


దాంతో, యూ పీ చక్కెరమిల్లులమీద ఆంక్షల్ని తొలగించారట! అందుకే ధరలు తగ్గుతున్నాయట!  


మరి ముడిచక్కెర వేలాది టన్నుల దిగుమతికి 'ఆ మిల్లులకే' యెందుకు పర్మిట్లు ఇచ్చారో, వాళ్ళు దిగుమతి చేసుకున్న చక్కెర పోర్టుల్లోనే యెందుకు వుండిపోయిందో, ఇప్పుడు అదింకా మిల్లులకి చేరకుండానే రేటు 20 రూపాయలు యెలాతగ్గిందో ఆ పెరుమాళ్ళకే యెరుక!  


మన చాగల్లు (జైపూర్ షుగర్స్) కార్మాగారం లోనే, 2007 లో తయారైన చక్కెర కూడా వేల టన్నుల్లో నిలవ వుండిపోతే, ఆ లెక్కల్ని గోల్ మాల్ చేసి, అక్కడి సిబ్బంది దొంగచాటుగా లారీలకొద్దీ బ్లాకు లో అమ్మేసుకొంటుంటే, వాళ్ళ మధ్యలో పంపకాలలో తేడా వచ్చి, విషయాన్ని బయటపెట్టేసుకున్నారు!  


మరి ఒక్క కార్మాగారం లోనే మూడు సంవత్సరాల నిల్వలు కొన్ని లక్షల టన్నులు వుంటే, మిగిలిన వాటి మాట యేమిటి? వ్యాపారుల వద్ద నిల్వల మాటేమిటి?  


అసలు రెండేళ్ళక్రితమే నేను ప్రశ్నించినట్టు--ఈ దరిద్రాలన్నీ ఈ కాంగీరేసు ప్రభుత్వం వున్నప్పుడే యెందుకు వస్తున్నాయి?  


ఆలోచించండి!



Friday, December 18

"ప్రధాన మం..."



రాజకీయ మోసం


"'.....పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో వున్నాయనుకుని, తెలంగాణా ప్రకటన చేశా'మని, 'ఒక మాట చెప్పి, మరోపని చేస్తారని 'తమకు' తెలియలేదని' " ప్రధాని మన్మోహన్ సింగ్--తనతో 'ఆవేదన' వ్యక్తం చేశారని--లోక్ సత్తా అధినేత జయ ప్రకాష్ నారాయణ్ అన్నారట!  


ఇంకా, ".....పార్టీలు బాధ్యతతో, నిజాయితీగా అభిప్రాయాలు వెల్లడించాలని, 'భారత ప్రభుత్వానికి' మాటిచ్చే ముందు 'ఆచి తూచి' వ్యవహరించాలని, ప్రజల జీవితాలతో ఆడుకోవడం ప్రమాదకరమని" ఆయన అన్నట్టు కూడా జేపీ తెలిపారట!  


కాసేపు ఈ మాటలన్నీ నిజం అనుకుందాం!  


యెంతటి అక్షర సత్యాలవి!  


(రాజకీయానికి కొత్త అయిన రాజీవ్ గాంధీ, వోట్ల కోసం రామ జన్మ భూమి లో 'శిలాన్యాస్' చేయించారు!)  


యే రాజకీయం తెలియని మన్మోహన్ సింగే ఇలా అంటే, రాజకీయ ధురంధరుడు, అపర చాణక్యుడు, మహా పండితుడు, బహుభాషా కోవిదుడు, మన తెలుగు తేజం పీ వీ నరసిం హా రావు--"ఆ రోజుల్లో" యెంతటి మానసిక హింస అనుభవించాడో వూహించగలమా?  


ఆయనకి రాజకీయ పార్టీల సంగతీ, ముఖ్యం గా బీజేపీ సంగతీ, కల్యాణ్ సింగ్ గురించీ, చాలా బాగా తెలుసు--కానీ, ఆయన చేస్తున్న వుద్యోగం--పార్టీలని తిట్టడమో, దేబిరించడమో కాదు! ప్రధాన మంత్రిత్వం!  


పైగా, భారతదేశం లోని 'బ్యూరాక్రసీ' నియమాలకి కట్టుబడి వున్నవాడు! 


అందుకే 'భారత ప్రభుత్వానికి' బీజేపీ నుంచీ, రాష్ట్రప్రభుత్వం--కల్యాణ్ సింగ్ ప్రభుత్వం--దగ్గరనించీ, ప్రతీ క్షణం నివేదికల్ని--మౌఖికం గా, లిఖిత పూర్వకం గా--అందుకొంటూ, ప్రతీ క్షణం యేమి జరిగిందో దస్త్రాల్లో నిక్షిప్తం చేశారు! (కావాలంటే ఆయన స్వయం గా వ్రాసిన పుస్తకం చదవండి!)  


బై ది బై, మన 'లిబర్హాన్ కమిషన్' పీవీని యేవిధం గానూ తప్పు పట్టలేదు కదా--ఇప్పుడు 'అధిష్టానం'--ఇంతకాలం-- వోట్లకోసం, వోట్ బ్యాంకుల కోసం, అంటరానివాడిగా చూసిన పీవీ కి ఈ రోజు సరైన న్యాయం చేస్తుందా? అంత దమ్ము వారికుందా?  


'చేటపెయ్య' సోనియాని ముందు పెట్టుకుని, చిదంబరాలూ, పిళ్ళైలూ, ముఖర్జీలూ, మొయిలీలూ, అహ్మద్ పటేళ్ళూ, వయలార్లూ, శరద్ పవార్లూ ఆడుతున్న నాటకాలకి, వారికి వత్తాసు పలికే 'యాదవ్' లకీ, మిగిలిన వాళ్ళకీ, ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టే రోజు యెంతో దూరం లేదు.  


దానికోసమే నిరీక్షణ!




Saturday, December 5

స్వాతంత్ర్యోద్యమం



వందేమాతరం ఉద్యమం


చరిత్రలో లిఖించబడిన ప్రకారం, అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ 1905 జూలై 7న, ‘పరిపాలనా సౌలభ్యం’ పేరిట బెంగాల్ ను రెండు రాష్ట్రాలుగా విభజించాడు.  


దీన్ని భారతీయులు వ్యతిరేకించారు. పెద్ద ఉద్యమం జరిగింది. దీన్నే ‘వందేమాతరం ఉద్యమం’ అని వ్యవహరించారు. ఉద్యమం లో పాల్గొన్నవాళ్ళు సామూహికం గా బంకిం చంద్ర చటర్జీ వ్రాసిన వందేమాతరం గీతాన్ని గానం చేసేవారు.  


ఆంగ్లేయులు తమ ‘విభజించి పాలించు‘ పధ్ధతి ప్రకారం—హిందూ ముసల్మానులని విడదీయాలని కుట్ర పన్నారు—అనే బలమైన భావనతో పెద్ద యెత్తున ఈ ఉద్యమం జరిగింది—దేశమంతటా!  


దీనికి ‘లాల్, బాల్, పాల్’ త్రయం గా పేరొందిన లాలా లజపతి రాయ్, బాల గంగాధర తిలక్, బిపిన్ చంద్ర పాల్ నాయకత్వం వహించారు.  


1906 నుంచి 1911 వరకూ ఆంధ్రదేశం లో కూడా విశేషం గా, ఉధృతం గా ఈ ఉద్యమం జరిగింది. ఇందులో భాగం గా—విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తువుల వాడకం, ఆంగ్లపాఠశాలలు మాని, జాతీయ పాఠశాలలు స్థాపించడం, ఆంగ్ల న్యాయ స్థానాల బహిష్కరణ, శాంతియుత శాసనోల్లంఘనం, పన్నుల చెల్లింపుకి నిరాకరణ—ఇలా అనేకవిధాలుగా సాగింది ఆ ఉద్యమం!  


ఇదే మొదటి పెద్ద జాతీయోద్యమం—మన దేశం లో!  


ఆ రోజుల్లో జోక్ యేమిటంటే, యెవరైనా యే మామిడికాయలో బేరం చేస్తూ, “వందేమాత్రం?” అని అడిగితే, అడిగినవాళ్ళని సైతం పోలీసులు అరెష్టు చేసేవారట—ఆ ప్రశ్న "వందే మాతరం” లా వినిపించి!  


మరి ఈ రోజున కొన్ని ముసల్మాన్ సంఘాలు ‘వందే మాతరం పాడడానికి వీల్లేదు‘ అని “ఫత్వా” జారీ చేస్తున్నాయట.  


దీనికి కేంద్రమంత్రులు కూడా వత్తాసు ట.  


యెంత సిగ్గులేని జాతి అయిపోయింది మనది!  


ఈ రోజు కూడా, మన సైనిక దళాలు కవాతు చెయ్యడానికి మహాకవి ఇక్బాల్ వ్రాసిన ‘సారే జహాన్ సే అచ్చా……’ ట్యూన్ నే వాయిస్తారే? దానికి యేమతం వాళ్ళూ వ్యతిరేకత కనబరచలేదే?  


అసలు ‘ముస్లిం సోదరులు‘ అంటూ ఓ ప్రత్యేక జాతిని సృష్టించి, ఆ పేరుతోనే ఫలానా మతస్థులని వ్యవహరిస్తున్న పేపర్లనీ, టీవీ చానెళ్ళనీ ప్రజలందరూ బహిష్కరిస్తే యెంత బాగుండును!  


మన 'ఈనాడు' ఆ దిశలో ముందడుగు వేస్తుందని ఆశిద్దామా?








Sunday, November 29

చిన్న చిన్న…..



జూదాలు

మొన్నోరోజు పేపర్లో, ‘పేకాట స్థావరం పై దాడిచేసి ముగ్గురు ఏ ఆర్ కానిస్టేబుళ్ళ అరెస్టు‘ అనేవార్త వచ్చింది.  



పోలీసులకి వచ్చిన ‘సమాచారం’ మేరకు, పకడ్బందీగా దాడిచేసి, పోలీసు క్వార్టర్లలో ఓ క్వార్టర్ లో పేకాట ఆడుతున్న 9 మంది కానిస్టేబుళ్ళని అరెస్ట్ చేశారట. అందులో ముగ్గురు ఏ ఆర్ కానిస్టేబుళ్ళన్నమాట.  


మొన్న ‘అంతర్జాతీయ పురుషుల దినం’ సందర్భం గా అనుకున్నాను—పాపం ఆ కానిస్టేబుళ్ళని ఆడకూతుళ్ళు తమ ఇళ్ళల్లోనే పేకాట ఆడుకోనిస్తే, వీళ్ళకీ, వాళ్ళకీ ఈ కష్టాలు వుండకపోవును కదా అని!  


అసలు పేకాట నేరమెలా అయ్యింది?  


అప్పుడెప్పుడో బ్రిటీషుపాలనలో, శాంతిభద్రతలకి విఘాతం జరుగుతుందని పబ్లిక్ లో పేకాట ఆడడం నిషేధించారు!  


కానీ, పట్టణాల్లో టౌన్ హాళ్ళకీ, ఆఫీసర్స్ క్లబ్ లాంటివాటికి నిషేధం వర్తించేది కాదు—కొందరు ఊరి పెద్దలూ, రిటైర్ అయిన అధికారులూ మొదలైనవాళ్ళు ఈ క్లబ్బుల్లో సభ్యులుగా వుండి, సాయంత్రం పూట సరదాగా కలిసి, డబ్బుకోసం కాకుండా కాలక్షేపం కోసం చిన్న చిన్న స్టేక్ లతో పేకాట ఆడుకొని, అలవాటున్నవాళ్ళు ఒకటో, రెండో పెగ్గులు బిగించి, రాత్రి పదింటికల్లా ఇంటికి చేరేవారు. (ఇదే కాకుండా, లైబ్రరీ, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, షటిల్ లాంటి గేంస్ కూడా వుండేవి, ఆడేవారు!)


పది దాటాక క్లబ్బు తెరిచి వుంచితే కేసు పెట్టేవారు. ప్రభుత్వమే కొన్ని క్లబ్బులకి బార్ లైసెన్సులు కూడా ఇచ్చేది!  


ఓ పదేళ్ళనించి అనుకుంటా—ఇలాంటి క్లబ్బులని కూడా నిషేధించారు!  


ఓ నలభయ్యేళ్ళ క్రితమే, మేధావులు యెండమూరి వీరేంద్రనాథ్ లాంటివాళ్ళు వ్రాసిన నాటికల్లో, నవలల్లో “మన ప్రభుత్వం పేకాటను నిషేధించి, రేసులకి డబ్బు పోస్తూంది!” అని ఆవేదన చెందే పాత్రలచేత అనిపించారు!  


మాడబ్బుతో, మా యెకరాలతో, మేము ఆడుకొంటుంటే, ఈ పోలీసులకేమి పోయేకాలం? అని ప్రశ్నించారు చోటా మోటా రాజకీయులు—పండగల్లో కోడిపందాలు ఆడుకుంటూ!  


దానివల్ల లేని ‘శాంతిభద్రతల ముప్పు’ పేకాట వల్ల వస్తుందా?  


మరి, స్టాక్ మార్కెట్, ఫ్యూచర్స్, డెరివేటివ్స్—ఇలాంటి వందలకోట్ల తో జరుగుతూ, సమాజానికి నష్టం చేస్తున్న ఈ పెద్ద పెద్ద జూదాలని యెందుకు నిషేధించరు?  


యేమంటారు?  


(ఓ పదిరోజుల క్రితం వ్రాయడం మొదలుపెట్టిన ఈ టపా, అనివార్యకారణాలవల్ల ఆలస్యం గా పూర్త్రిచెయ్యబడి, ప్రచురించబడుతోంది!)


Friday, November 13

నైతికత


తప్పుడుబిల్లులకి శిక్ష


యెట్టకేలకు యెర్నేని రాజా రమచందర్ కి బోగస్ మెడికల్ బిల్లులు పెట్టి మోసం ద్వారా ప్రభుత్వం నించి డబ్బు తీసుకొన్న కేసులో, నేరం నిరూపణ కావడం తో 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది సీ ఐ డీ న్యాయస్థానం.  


అప్పుడే న్యాయం జయించింది అని మనం అనుకోకుండా, శ్రీ నేతగారు 'పై కోర్టులో అప్పీలుచేసి, నిర్దోషిగా బయటికి వస్తాను' అంటున్నారు.  


మరి చూద్దాం!

Tuesday, November 10

మహానుభావులు


శ్రీ విశ్వనాథం


నవంబరు 10--1979 లో--బహుముఖ ప్రఙ్ఞాశాలి, పండితుడు, కవి, రచయిత, రాజకీయ వేత్త, మంత్రి, విశిష్ట పార్లమెంటేరియన్, మహామేథావి, విశాఖ ముద్దుబిడ్డ, అన్నిటినీ మించి గురువుని మించిన శిష్యుడు అని చెప్పుకోదగ్గ శ్రీ తెన్నేటి విస్వనాథం గారు పరమపదించిన రోజు--ఈరోజు ఆయన 'వర్థంతి '!  


అడ్డమైనవాళ్ళకీ సందర్భాలు ఙ్ఞాపకం చేసుకుని మరీ 'నివాళులు ' అర్పించే మన తెలుగు వాళ్ళు, ఈయన్ని యెక్కడా తలుచుకున్నట్టు లేదు!  


ఆయనతో నా పరిచయభాగ్యం--అవి 1972 ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆందోళన రోజులు! నేను మా నరసాపురం 'నిరుద్యోగుల సంఘం' కార్యదర్శిగా, మా సంఘాన్ని కూడా ఉద్యమం లోకి తీసుకెళ్ళి, ఆందోళన సాగిస్తున్న రోజులు!  


అప్పటికి కొంతమంది ఇంకా సమైక్య వాదులుగా మిగిలిపోవడం తో, వాళ్ళకి అవగాహన కల్పించి, వాళ్ళని కూడా ఉద్యమం లోకి కలుపుకోడానికి, నాయకులు సర్దార్ గౌతు లచ్చన్న, తెన్నేటి మొదలైనవారు విస్తృతంగా తెలుగునేలని పర్యటిస్తున్నరోజులు!  


ఒక రోజున, తణుకులో ఓ ప్రముఖ సినిమా హాలులో, తణుకూ, చుట్టుపక్కల వూళ్ళలోని వివిధ పార్టీల, సంఘాల నాయకులనీ ఆహ్వానించి, విస్తృత సమావేశం యేర్పాటు చేశారు. మహామహులు వస్తున్న సమావేశం అవడం తో, మేము--మా రాజకీయ గురువు శ్రీ కుంచెనపల్లి నాగేశ్వర రావుగారితో ఆ సమావేశానికి వెళ్ళాము. మన ముప్పవరపు వెంకయ్యనాయుడు అప్పుడే యెదుగుతున్న నాయకుడు!  


వేదికమీదకి దగ్గర దగ్గర ఓ వందమంది దాకా ముఖ్యులని అహ్వానించారు. (అందరూ వేదిక నేలమీద వరుసగా కూర్చోబెట్టబడ్డారు! నాయకులతోసహా!) శ్రీ తెన్నేటి, వారికి దిశా నిర్దేశం చేశారు--అందరూ ఒడంబడ్డారు. సమావేశం ముగుస్తుందనగా, (ఆ సాయంత్రం ఓ కాలేజ్ మైదానం లో బహిరంగ సభ.) మా గురువుగారు మమ్మలని హడావుడిగా వేదిక యెక్కించి, నన్ను శ్రీ తెన్నేటివారికి పరిచయం చేశారు--నిరుద్యోగుల సంఘం కార్యదర్శిగా, ఉద్యమం లో క్రియాశీల పాత్రపోషిస్తున్నవాళ్ళలో ఒకడిగా--చెయ్యెత్తి నమస్కరించాను. ఆప్యాయంగా నా చేతుల్ని పట్టుకుని 'మన రాష్ట్రం వస్తే, మీ సంఘం ఇక యెత్తెయ్యవలసిందే!' అన్నారు నవ్వుతూ! 'మా ఆశ కూడా అదేనండి!' అన్నాను కృతఙ్ఞతతో! తరువాత, ఇంకొకరితో ఆయనకి పరిచయం, నా నిష్క్రమణ!  


నిజం గా, తెలుగుతేజాలైన శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారిని, పొట్టి శ్రీరాములుగారిని, పీ వీ నరసిం హారావుగారిని, నీలం సంజీవరెడ్డిని, తెన్నేటిని--ఇలాంటి యెందరినో తలుచుకుంటున్న తెలుగువాళ్ళెంతమంది?  


శ్రీ తెన్నేటివారిగురించీ, 60 యేళ్ళ క్రితం కూడా 'సో కాల్డ్' కాంగ్రెస్ అధిష్టానం తెలుగువారిని యెలా చిన్నచూపు చూసిందీ, యెన్ని రాజకీయాలు చేసిందీ, (అన్న ఎన్ టీ ఆర్ వచ్చేవరకూ నార్తోళ్ళకి తెలుగోళ్ళంటేనే తెలీదన్నట్టు వుండేవారు!)--ఇలాంటివి వీలున్నప్పుడల్లా వ్రాస్తా!  


చదవండి!



Saturday, November 7

లాలూ మూర్ఖః


అగ్రేసరీ మమత!


రైలు బోగీల్లో బిగించిన 'కక్కుర్తి ' బెర్తులవల్ల యెంత నష్టం జరిగిందో, యెన్ని ప్రాణాలు పోయాయో యవరైనా లెఖ్ఖవేశారా?  


చులాగ్గా అవి తొలగించాలని నిశ్చయించారు!  


ఇప్పుడైనా యేమైనా సుఖం గా వుందా ప్రయాణికులకి? లేదు--యెందుకంటే, కక్కుర్తి బెర్తులకోసం మామూలు పై బెర్త్ ని ఓ ఆరంగుళాలు పైకి జరిపారు! ఇప్పుడు మధ్య వేసిన కక్కుర్తి బెర్త్ ని తొలగించేసి, చేతులు దులుపుకుంటున్నారు--మరి పై బెర్త్ ని ఆరంగుళాలు క్రిందకి యెవరు జరుపుతారు? వాళ్ళ బాబులా?  


అందుకే అన్నది 'లాలూ మూర్ఖః' అని!  


ఇక మమతాదీ--తనభాషలో 'తురంతో' అన్నవాటిని (హిందీలో 'తురంత్ ' అంటే శీఘ్రం గా అని అర్థం! అది వాళ్ళ భాషలో పదాలన్నిటికీ 'ఓ' కారం చేర్చే పధ్ధతివల్ల తురంతో అయ్యింది) మీడియా ఇష్టం వచ్చినట్టు 'దురంతో' (దుః+అంతః--అంటే చెడు అంతము కలిగినవి) అనీ, 'డ్యురాంటో' (ఇదేదో ఫ్రెంచ్ పదం లా వుంటుంది) అనీ పొగిడేశాయి!  


మరి ఈ రోజున, ఆ 'తురంతో' (అత్యధిక దూరపు, మధ్యలో యెక్కడా ఆగని) రైళ్ళకి, 'టెక్నికల్ స్టాపులు ' అని కనీసం 6 చోట్ల కనీసం అరగంటసేపు ఆపుతున్నారట! కానీ, అక్కడ యెవరైనా ప్రయాణికులు దిగిపోవచ్చుగానీ, యెవరూ యెక్కకూడదట! (మరి దిగిపోయేవాళ్ళుకూడా మొదటినించీ చివరివరకూ టిక్కెట్టు తీసుకోవాలో యేమిటో!).  


అలా అయినా, ఈ రైళ్ళన్నీ, 21 నించి 24 శాతం మాత్రమే నిండుతున్నాయట--76% ఖాళీగానే గమ్యస్థానం చేరుతున్నాయట! పైగా అన్నీ ఏ సీ బోగీలేనట! ఇక కనీసం 75 మంది ప్రయాణించవలసిన బోగీల్లో, అటెండెంట్లూ, హెల్పర్లూ, హాకర్లూ, టీ టీ ఈ లూ, 75 బ్లాంకెట్లనీ కప్పుకొని, హాయిగా నిద్రా, ఇతర సుఖాలని అనుభవిస్తున్నారో, యేమిటో!  


అందుకనే అన్నది--అగ్రేసరీ మమత--అని!  


దీనికైనా యెవరినైనా బాధ్యుల్ని చేస్తారా?  


ఇలాంటివాటికి ఓ 'తెల్ల యేనుగు ' ప్రభుత్వ సంస్థ వుంది-- 'సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ' అని! వాళ్ళెప్పుడూ ప్రభుత్వానికీ, యాజమాన్యాలకీ పాదాలొత్తుతూ, చిన్న చిన్న వుద్యోగుల్ని బలిపశువుల్ని చేస్తూ వుంటారు!  


దాని గురించి మరోసారి!



Friday, October 30

పాత్రలు


గంగాళం


అసలు పాత్రల అవసరం యేమిటి?  


ప్రవహించే గుణమున్న ద్రవ పదార్థాలని, ఒకచోట నిలబెట్టడమే వాటి వుద్దేశ్యం! అవునా?  


మొదట్లో రాతితో చేసేవారు--కానీ అవి చాలా బరువు, పైగా వాటిలో యేమైనా వండుకోవాలంటే వేడెక్కడానికే చాలాసేపు పట్టేది. రాచ్చిప్పలు కొన్నాళ్ళు వంటకి వుపయోగించగానే, పొడి పొడిగా రాలి పోయేవి!  


తరవాత మట్టితో కుండలు తయారు చేసి, వాటిని వాడుకొనేవారు. అవి తేలిగ్గానే వున్నా, తొందరగానే వేడెక్కినా, చిన్న తాకిడికే పగిలిపోయే వాటి గుణం వల్ల అవీ అంత లాభదాయకం కాలేదు.  


లోహాలు కనిపెట్టాక, ఇత్తడీ, రాగీ, కంచూ మొదలైన లోహాలతో పాత్రల్ని తయారు చేసేవారు. ఇత్తడీ, రాగీ 'చీప్ అండ్ బెస్ట్'. రాగి త్వరగా వేడెక్కేది, ఇత్తడి కూడా మందాన్నిబట్టి త్వరగానే వేడెక్కేది. యెక్కువకాలం పాత్రలు జీవించేందుకు, ఇత్తడీ రాగీ కలిపి కంచు తయారు చేసేవారు. కానీ ఇవి బరువు. గంటల్ని యెక్కువగా దీంతో తయారు చేసేవారు--బాగా మోగుతాయని.  


ఇత్తడీ, రాగి తో వచ్చిన సమస్యేమిటంటే--'కిలం'. ఉదాహరణకి ఇత్తడిలో పులుపు పదార్థాలు కాసేపు వుంచితే, అవి విష పదార్థాలుగా మారిపోయేవి--ఈ కిలం వల్ల. రాగి పాత్రలు కూడా, అస్తమానూ తోమకపోతే, రసాయన చర్యల వల్ల 'కాపర్ ఆక్సైడ్' 'మైలుతుత్తం' (కాపర్ సల్ఫేట్) తయారయ్యేవి--అవీ విషంతో సమానమే!  


ఇత్తడి పాత్రలకి లోపల తగరం, నవాసారం తో 'కళాయి' పూసేవారు--పులుపు నిలవ చేసినా కిలం పట్టకుండా వుండేందుకు--వాటినే కళాయి గిన్నెలు అనేవారు! పులుసు వడ్డించడానికి వుపయోగించే 'గోకర్ణాల'తో సహా అన్నిటికీ కళాయి పూయించేవారు!  


ఇక వాడుక నీటికోసం, రాతి బానలూ, మట్టి బానలూ, ఇత్తడి గంగాళాలూ, తరవాత్తరవాత ఇనప గుండిగలూ, సిమెంటు గోళేలు, ఇత్తడీ, అల్యూమినియం, ప్లాస్టిక్ బక్కెట్లూ--ఇలా!  


మరి ఆయనెవరో 3 కోట్లతో ఓ బంగారు 'గంగాళాన్ని ' తయారు చేయించి, శ్రీవారికి కానుక ఇచ్చాడట. దీని వుపయోగమేమి తిరుమలేశా!  


మా తెలుగు మేష్టారు, యెవరో వ్రాసిన ఓ పద్యం చెప్పేవారు--పూర్తిగా నాకు ఙ్ఞాపకం లేదు గానీ--'.........సుతుల్ గుడువనా, పతి సంతసింపనా............బాల రండా కుచ ప్రాభవంబునన్!' అని.  


అలాగే, 'అజాగళ స్థనాలు ' అనేవారు!  


అంటే--యెందుకూ పనికిరాని వాటిని ఇలా వర్ణిస్తారు!  


మరి ఆ గంగాళాన్ని యేమనాలి?  


కొసమెరుపేమిటంటే, 'స్నపన తిరుమంజనం' లాంటి వాటికి బాగా వుపయోగపడొచ్చు--అని పత్రికల కితాబు!  


అదండీ సంగతి!


(బెందాళం గురించి మరోసారి)


Monday, September 28

నానని రోకలి

(సీ) నియర్లు  


ఇంకా రోకలి నానలేదు! యెందుకుట? యెక్కడనానిపోతుందో అని నీళ్ళక్రింద మంటలుపెట్టేస్తున్నారుట--సీనియర్లు! (సీనియర్లు అంటే సముద్రానికో, ఇంకదేనికో దగ్గరగా వున్నవాళ్ళు--అని నిర్వచించాడో యువ రాజకీయవేత్త!)  


'అధిష్టానంలో నేనుకూడా భాగమే!' అని ప్రకటించుకున్న కేకే ని చూసి, 'ఓసోస్! మాకు తెలీదులే! వీరప్ప మొయిలీలూ, అహ్మద్ పటేల్ లూ, వయలార్ రవిలూ కూడా అలా ప్రకటించుకోలేదు--వర్కింగ్ కమిటీ మెంబర్ అయినంతమాత్రాన నువ్వో అధిష్టానం!? నీక్కూడా అధిష్టానం అయినవాళ్ళెవరో మాకు తెలియదనుకోకు!' అని వెక్కిరిస్తున్నారు--కార్యకర్తలు!  


మొన్నెప్పుడో ఖమ్మం లో రేణుకా చౌదరి సోనియాతో వున్నట్టు వున్న ఫ్లెక్సీ బోర్డుని కార్యకర్తలు చింపేస్తే, వీ హెచ్ అది సోనియా మీద దాడిగా అధిష్టానికి పూర్తిగా నూరిపోశాడు!  


అక్కణ్ణించీ ప్రతీవాడూ 'అది తప్పు' అంటూ స్టేట్ మెంట్లు!  


అసలు గొడవ యెక్కడ మొదలయ్యింది? కాకా 'జగన్ ని ముఖ్యమంత్రిని చెయ్యాలి'--అని వూరుకోకుండా, రాజీవ్ గాంధీకి ప్రథాని కాకముందు అనుభవం లేదుకదా? అన్నాట్ట!  


ఇక వీరభజనగాళ్ళకి మంచి అవకాశం వచ్చింది--సోనియా, రాహుల్ భజన చేస్తూ, పనిలో పనిగా తమ పబ్బం గడుపుకోడానికి!  


పార్టీ చీలిపోతే, అధిష్టానాన్ని నమ్ముకున్నవాళ్ళకి పదవులూ, కొత్తపార్టీ వారికి అఙ్ఞాతవాసం, మళ్ళీ యెలక్షన్లువచ్చేసరికి కొత్తపార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడం--ఇలాగే జరుగుతూంది ఇన్నాళ్ళూ! 


మరి రేపేమవుతుందో? అసలే చెట్టుపేరుచెప్పుకొని కాయలమ్ముకుంటున్న పార్టీ--దాని క్రింద అధిష్టానం చెట్టునీ, దాని పిలకల్నీ నెత్తిమీదపెట్టుకొని, రాష్ట్రఫలాలని మింగాలనుకొనే నక్కలు ఇంతకంటే యేమి చేస్తాయి?  


చూద్దాం!



Sunday, September 13

అధిష్టానం మార్కు.....

 
ముఖ్యమంత్రెవరు? 

రాజశేఖర రెడ్డి కరువు ప్రకటనకి రోకలి నానేస్తే, ఇప్పుడు అధిస్టానం ఆయన తరవాత ముఖ్యమంత్రెవరు అని తెలియడానికి మళ్ళీ రోకలి నానేసిందట!  

అది పూర్తిగా నానగానే, సీల్డు కవరు పంపిస్తారట!  

ఈ లోపల రాజ్యాంగేతర శక్తి ఒకాయన పొద్దున్నే ఢిల్లీ కి మళ్ళీ రాత్రికి హైదరాబాదుకీ ప్రయాణాలు సాగిస్తున్నాడు. అక్కడ ఒక్కో అరగంటో, గంటో 'చిన్న అధిష్టానాల 'తోనూ, వీలైతే ఇంకో అరగంటో యెంతో 'పెద్ద అధిష్టానాల 'తోనూ సంప్రదింపులు సాగించి, హైదరాబాదు వచ్చాక 'అంతా సవ్యంగానే వుంటుంది--మీరందరూ నోరెత్తనంతవరకూ!' అని అందరినీ సవరదీస్తున్నాడు!  

ఇంత డ్రామా యెందుకో? కాంగ్రెస్ సంస్కృతి తెలియంది యెవరికి? 

ఆ వచ్చే సీల్డుకవర్ లో 'శ్రీమతి రాజశేఖర రెడ్డి ' పేరు వ్రాసి, సీ ఎల్ పీ లో ఆవిడ యెన్నిక కాగానే--'ఆంధ్ర ప్రదేశ్ తొలి మహిళా ముఖ్యమంత్రి!' అనీ, 'ఓ స్త్రీ కి ఆ పదవి ఇవ్వడం లో అధిష్టానం త్యాగనిరతి ప్రశంసనీయం!' అంటూ ప్రకటనలు వెలువడి, పులివెందులనించి ఆవిడని పోటీకి దింపినా--ఆశ్చర్యపడక్కర్లేదు!  

(సానుభూతి కార్డూ పని చేస్తుంది, మిగిలిన సామాజిక వర్గాలూ, అసమ్మతులూ మాట్లాడరు--పరిపాలనకి రాజ్యాంగేతర శక్తులెలాగూ వుంటాయి!)  

బహుశా రోకలి మంగళవారానికి నానచ్చు అంటున్నారు!  

చూద్దాం!


Monday, September 7

స్మారక......


దోపిడి రాజకీయం


మాజీ ముఖ్యమంత్రి మరణం తరవాత, మొదటి మంత్రివర్గ సమావేశం లో తీసుకొన్న ముఖ్య నిర్ణయాల్లో ఒక అతి ముఖ్యమైనది--వై యెస్ హెలికాప్టరు 'కూలిన చోట ' ఒక బ్రహ్మాండమైన 'స్మారక చిహ్నాన్ని ' నిర్మించి, ప్రతి రోజూ ప్రజల సందర్శనకి యేర్పాట్లు చెయ్యలి--అనిట!  


ఇంకేం! కొన్ని వందల కోట్ల అంచనాలూ, కాంట్రాక్టులూ, అంచనా వ్యయాలు మించడాలూ, మళ్ళీ కొన్ని వేల కోట్ల అంచనాలూ, ఓ పది పదిహేనేళ్ళు గుత్తదారుల, ఉప గుత్తదారుల, ఉప-ఉప గుత్తదారుల, వాళ్ళక్రింద వేలాదిమందీ--పంట పండినట్లే!  


మరి, 15 కిలోమీటర్లు కాలినడకన, దారి తెలియకుండా (జీ పీ యెస్ వున్నా) తప్పిపోయే అవకాశం వున్న దారి తెలియని దారుల్లో నడిచి, అక్కడకి చేరుకోవాలే? 


అక్కడున్న చెంచులూ వగైరాలకీ, అస్తమానూ అక్కడ తిరిగే మావోయిష్టులకీ కూడా సాధ్యం కాని చోటుకి, ప్రతిరోజూ ప్రజల సందర్శనానికి యెలా యేర్పాట్లు చేస్తారో?  


బహుశా, 'బెల్ 430' హెలికాప్టర్లలో వేలాది రూపాయల టిక్కెట్లు కొనుక్కొని, రాత్రి పూట మాత్రమే--లేదా తెల్లవారుజామునగానీ, సాయంత్రం పూటగానీ మాత్రమే (మధ్యాన్నం దాన్ని మూసేసి)--సందర్శించే యేర్పాట్లు చేస్తారేమో!  


జగన్ ముఖ్యమంత్రి సంగతేమోగానీ, ఓ నా కార్యకర్తల్లారా! ఆ డబ్బుతో యెంతమందికి 'ఆరోగ్య శ్రీ' పడుతుందో ఆలోచించండి!  


ఇలాంటివాటికి వ్యతిరేకంగా నిరాహారదీక్షలూ, ధర్నాలూ, ర్యాలీలూ చెయ్యండి!  


లేదూ--అలాగే కానివ్వండి!