Monday, January 9

నూతన సంవత్సరం లో......



నా "తీర్మానాలు" .....

క్రొత్త సంవత్సరం సందర్భంగా, అందరూ కొన్ని తీర్మానాలు చేసుకుంటారు, అనీ జనవరి 3, 4, 
లేదా 7 లోగా, అవన్నీ మరిచిపోతారు అనీ, వాడెవడో "సర్వే" చేసి తేల్చాడట!!
నేనుమాత్రం, జనవరి ఒకటిన కాకుండా, డిసెంబరు 31నే కొన్ని తీర్మానాలు చేసుకున్నాను! 
అవెన్ని? అని మీరు అడగకూడదు..... నేను చెప్పాకూడదు! 
విషయం ఏమిటి? .....అంటే, జనవరి ఒకటిన, అన్ని తీర్మానాలూ "అండర్లైన్"......అన్నీ 
పాటించాను! హుర్రే!!
రాత్రి 12 దాటగానే, (రెండో తారీఖు వచ్చేసిందికదా.... ) ఓ చిన్న తీర్మానాన్ని ప్రక్కన పెట్టేశాను.
సరే, ఇవాళ రెండు. మధ్యాహ్నం 12 దాటాక, నా రెండో తీర్మానాన్ని కొంచెం రిలాక్స్ చేశాను!!! 
ఇప్పుడు రాత్రి....... ఏం చేస్తున్నానో, చేసానో..... "సస్పెన్స్!"
ఇది, 2017 డిసెంబర్ 31 వరకూ...... "అద్భుతం, సస్పెన్స్, థ్రిల్!!!!
వేచి చూడండి........!!

--ఈ టపా ఫేస్ బుక్ లో ప్రచురించగానే, నా చిరకాల మిత్రులు కూడా "అపార్థం" చేసేసుకున్నారు......అంటే, "సిగరెట్లు పూర్తిగా మానేస్తాను" లాంటి తీర్మానాలు చేసేసుకున్నానేమో అని! అందుకే, ఇప్పుడే సస్పెన్స్ విప్పెయ్యవలసి వస్తోంది! ఇంతకీ ఆ తీర్మానాలేమిటి? అంటారా......? అక్కడికే వస్తున్నా......!

కానీ, ఆ తీర్మానాల గుట్టు విప్పేటప్పుడు, ముందు నా దినచర్య గురించి టూకీగా చెప్పాలి మరి!

నేను రిటైర్ అయ్యాక, నా మిత్రులు చాలామంది అడిగేవారు.....కాలక్షేపం ఎలా చేస్తున్నారు? అంటూ. నేను, సర్వీస్ లో ఉన్నప్పుడు చక్కగా విశ్రాంతి దొరికేది, ఇప్పుడు ఉన్న సమయం అంతా సరిపోవడం లేదు.....అని సమాధానం ఇస్తే, ఆశ్చర్య పోయేవారు. 

ఎలా.....అంటే, పేపర్ చదవడం దగ్గర్నుంచి, నెట్ లో గడపడం గురించి, రోజూ 5 పుస్తకాలు చదవడం గురించి, మిత్రులతో కాలక్షేపం గురించి, ఇంకా కొంత సమాజ సేవ గురించి.....చెపితే, భలే ఆశ్చర్య పోయేవారు!

ఇంకా వివరంగా అడిగినా, కొన్నిమాత్రమే వివరించేవాడిని. కాని ఇప్పుడు సమయం వచ్చింది.....ఇంకొంచెం వివరంగా చెపుతూ, టూకీగా చెప్పడానికి. 

నేను ఎప్పుడూ చేసేది, "మల్టీ టాస్కింగే"! ఒకేపని కోసం సమయం వృధా చెయ్యను. ఆ కోణం లోనే అర్థం చేసుకోండి.....నా సమయాన్ని!

(మరో సారి!)

Wednesday, January 4

(తప్పనిసరి) తద్దినాలు.....!?



"పి కాః" అంటే.....?

మా ఇంట్లో మా అమ్మమ్మ మా అమ్మకి ఇచ్చిన, ఇత్తడి "అడ్డెడు గిన్నె" ఉందేది. అంటే, అందులో అడ్డెడు బియ్యం ఒకేసారి అన్నం వండుకోవచ్చు అన్నమాట. అడ్డెడు అంటే, కుంచం లో సగం. అంటే ఇప్పట్లో 2 కేజీలకు పైగా అనుకుంటా! 

ఆ గిన్నెతో రోజూ అన్నం వండుకోవడం అవసరం ఉండదు కదా? మహా అయితే మనం రోజూ ఓ సారి తినేది 100 నించి 200 గ్రాములేమో! అందుకని, ఆ గిన్నెని మా తలంట్లకీ, స్నానాలకీ వేణ్ణీళ్లకోసం వాడేవాళ్లు. ఆ గిన్నె మీద తెలుగు లో చెక్కించబడిన పేరు, నాకు అలా తోచి, "పికాః" అని చదివేవాడిని!

నిజానికి అది ఆ చెక్కిన వాడి దృష్టిలో, "పి కొం"--అంటే పిరాట్ల కొండయ్య--అది మా తాత, అంటే అమ్మ తండ్రి  పేరు!

అందుకనే, నేను ప్రతీసారీ "అమ్మయ్య" అనుకున్నప్పుడల్లా, "పిరాట్ల కొండయ్య"! అని కూడా అనుకుంటాను. 

అలాగే, "అమ్మమ్మా" అనో, "అయ్యయ్యా" అనో, "అయ్యమ్మా" అనో అనాల్సి వస్తే, వాళ్లపేర్లు కూడా తలుచుకోవాలి అని నియం పెట్టుకొని, ఏడాది పైగా ఆచరిస్తున్నాను. 

మా ఆవిడ కూడా ఇది ఆచరణలో పెట్టింది. మొదట్లో, అమ్మయ్య అన్నప్పుడు, వాళ్ల అమ్మ తండ్రి పేరు "రొయ్యూరు వెంకటేశ్వర శర్మ" అని తలుచుకోడానికి కష్టపడేది! దానికి నేనో చిట్కా చెప్పాను.

అసలు, "వెంకటేశ్వర శర్మ"; "సుబ్రహ్మణ్య శాస్త్రి"; "అప్పయ్య దీక్షితులు"; "పరమేశ్వర సోమయాజి"; "నరసింహ అవధాని"-- లాంటి పేర్లు, "బ్రాహ్మణ వ్యాకరణం" లోంచి పుట్టాయి గానీ, అసలు పేర్లు--"వెంకయ్య"; "సుబ్బయ్య"; "అప్పయ్య"; "పరమయ్య"; "నరసయ్య"--ఇవీ! 

అందుకని, అమ్మయ్య అంటూ, "వెంకయ్య" అనుకుంటే సరిపోతుంది! అదే ఆచరిస్తోంది మా ఆవిడ ఇప్పుడు!

అసలు ఇదంతా ఎందుకు? అంటారా! ఏడాదికోసారి, తప్పనిసరి తద్దినాల్లోనే వాళ్ల పేర్లు తలుచుకోవడం, 12 యేళ్లకోసారి, ఇతర పూర్వీకులని తలుచుకోవడం, చాలామందికి వాళ్ల పేర్లు తెలియక ఇబ్బంది పడి, అందర్నీ అడిగి, తెలుసుకోవడం కన్నా, ఇలా అయితే, మన తరవాత తరాలవాళ్లకి వాళ్ల పేర్లు ఎప్పుడూ నోట్లో వుంటాయి!

పైగా, పూర్వీకుల పేర్లు అన్నీ దేవీ దేవతల పేర్లే! అందుకే, పుణ్యమూ పురుషార్థమూ కలిసివస్తాయి!

యేమంటారు?

Thursday, June 25

నేనూ......నా రాక్షసి--6

"టాపు లేచి పోద్దే....."

మేము....హర్యాణాలో వుండే మా ఆఖరి చెల్లెలు ఇంటికి వెళ్లినప్పుడు, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యాణా, రాజస్థాన్‌, యూ పీ వగైరాలకి టూర్లు వేసేవాళ్లం. 

(మా చెల్లెలు పిల్లలు షమ్మీ, సౌమ్య, మాతోపాటే వచ్చేవారు. ఉదయం 5 కే బయల్దేరి, యేవేవో చూసి, మళ్లీ యే రాత్రి 3 గంటలకో ఇంటికి చేరే వాళ్లం. ఇంకా జీపులో అందరూ దిగడం, సామాన్లు తీసుకుని ఇంట్లోకి రావడం అయ్యేసరికి, మా ఆవిడ అప్పుడే, తన చీర మార్చేసుకొని, యెదురు వచ్చేది మాకు.) 

మా షమ్మీ, ఓ సారి టీవీ పెట్టి, "ఆ పాట" రాగానే, 'మాంమయ్యా.....నువ్వెప్పుడు ఈ పాట రాశావు'?  అని అడిగేది. (దానికి తెలుగు బాగా వచ్చు--కొంచెం హిందీ యాసతో మాట్లాడుతుంది అంతే.)

"ఆ పాట నేను వ్రాయడం యేమిటిరా?......యెవరు చెప్పారు?" 

అనగానే, సౌమ్య......"మామాజీ....జరా పాట సునో.....'రాయె రాయే నా రాకాశి, నువ్వలా పైటేసి, ఇలా దోపేస్తే......' బోల్తా హైనా.....?" (ఈ పిల్లకి తెలుగు రాదు....కానీ మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది). "పర్, అత్తా ఐసాహీ కర్తాహైనా?" 

"కదా మాంమయ్యా......అత్త కొన్ని క్షణాల్లోనే......టింగ్...టింగ్....టింగ్....అని మూడు యాక్షన్‌ లలో, చీర మార్చేసుకొని, వచ్చేస్తుంది కదా? అందుకే......తను.....నీ 'కమ్‌ బెనారస్' కదా? అందుకే నువ్వే ఈ పాట రాసి వుంటావు.....నిజం చెప్పు....!" అని షమ్మీ సౌమ్యకి తోడొస్తే, ఇంకేమి చెప్పను.....?

"అత్తా ని గిన్నిస్ బుక్ లో--ఫాస్టెస్ట్ శారీ ఛేంజర్--అని యెక్కించెయ్యచ్చు కదా?" అంటారు ఇద్దరూ!

(........ఇంకోసారి)

Monday, June 22

నేనూ.....నా రాక్షసి-5

"క్విడ్ ప్రో కో"......అనే....."నీకది, నాకిది"......!

సీ ఐ బీ జేడీ లక్ష్మిన్నారాయణ తను దర్యాప్తు చేసిన కేసుల్లో ఈమధ్య ఈ మాట ప్రవేశ పెడితే, మీడియావాళ్లు అందుకున్నారేమో గానీ, మాకిది యెప్పుడో తెలుసు.

భోజనానికి కూర్చోగానే, మా ఆవిడ....."ఇవాళ మామిడికాయ పప్పూ, దోసకాయ పచ్చడీ, దొండకాయ కూరా, చారూ పెట్టాను......పెరుగు యెలాగూ వుంది....." అంటుంది. సుష్టుగాలాగించేస్తాను. సరే.

మర్నాడు......"ఇవాళ ముద్దపప్పూ, బెండకాయ కూరా, పప్పులుసూ, పెరుగూ....నిన్న ఫ్రిజ్ లో పెట్టిన దోసకాయ పచ్చడీ......'మీకు'. 'నాకివాళ'.......పొద్దున్నే మడిగా......కాస్త ఆవకాయా, మాగాయా బయటికి తీసుకున్నాను లెండి....."!

ఆ మర్నాడు......"ఇవాళ గోంగూర పప్పూ, బంగాళ దుంప పోపు వేసిన ఉప్మా కూరా, పచ్చి చారూ, పెరుగూ.....ఇదిగో....'మొన్నటి దోసకాయ' పచ్చడి కొంత మిగిలింది.....అవి 'మీకూ'; 'నాకు' మాగాయా..."!

(మా ఇంట్లో ఓ పోర్షన్‌లో, మా తమ్ముడు వుంటాడు.....వాడి పిల్లలు కీర్తీ, శ్రావణీ చిన్నప్పట్నుంచీ మా దగ్గరే పెరుగుతూ, నా భోజనం టైముకి వచ్చేసి, నా గోరుముద్దలు తింటారు....ఇప్పటికీ! ....వాళ్లకు 20; 18 యేళ్లు వచ్చినా!....వాళ్లకి చిన్నప్పట్నుంచీ నన్ను "మయ్యా" అని పిలవడం అలవాటు). 

మా ఆవిడ......."పప్పులుసూ" (అదే....సాంబారు లాంటిది) అనగానే, ఇద్దరూ....."రాత్రికి మయ్యాకి ఇడ్లీలా దొడ్డా".......? అనేస్తారు.

మా ఆవిడ......"బంగాళ దుంపల".....అనగానే, ఇద్దరూ....."రాత్రికి మయ్యాకి చపాతీలా దొడ్డా....."? అనేస్తారు!

పచ్చళ్ల ప్రహసనం లో......"మర్నాడు"......'మా అమ్మ బీరపొట్టు పచ్చడి చేసింది.....వేసుకో మయ్యా' అనీ, "ఆ మర్నాడు", 'మా అమ్మ ఆనపగింజల పచ్చడి చేసింది....వేసుకో మయ్యా'.....అనీ.....తెచ్చిస్తూ వుంటారు!

(నేను 1985 లో--30 యేళ్ల క్రితమే--రాత్రి భోజనం మానేశాను. లైట్ టిఫిన్‌ మాత్రమే! అప్పటి నుంచీ కూడా, మా ఆవిడ ప్రతి రోజూ రాత్రి.....ఇడ్లీ, ఉప్మా, దోశ, చపాతీ, పెసరట్లూ, సేమ్యా ఉప్మా, గారెలూ, ఆవడలూ,....ఇలా వెరైటీ మార్చి వెరైటీ.....వడ్డిస్తుంది నాకు! దానికి, యెప్పటికీ మా ఆవిడకి ఋణపడి వుంటాను నేను!)

(.......మళ్లీ ఇంకోసారి.) 

Thursday, April 10

మా కొత్త కాపురం - 4


నేనూ, నా రాక్షసి

ఇంక మేము విజయవాడలో వుండగా దోచుకున్న జీవితకాలానికి సరిపోయే సంపదలు.........

శ్రీకృష్ణ దేవరాయలు అనే ఆయన (స్టేట్  బ్యాంక్ వుద్యోగి)  ఫి సొ (విజయవాడ ఫిలిం సొసైటీ) స్థాపించి, బ్యాంకువాళ్ళందరికీ ఆహ్వానాలు పంపగానే చేరిన మొదటివాళ్లలో ఒకణ్ని నేను.

ఆ సొసైటీ సౌజన్యంతో, ప్రపంచ ప్రఖ్యాత చలన చిత్రాలు చూసే భాగ్యం కలిగింది. విట్టోరియా డిసికా బైసికిల్ థీవ్స్ నుంచి, ప్రాంతీయ అవార్డు చిత్రాలవరకూ యెన్నో...........ప్రతీ ఆదివారం ఒక్కో థియేటర్లో ప్రదర్శించేవారు.

సాధ్యమైనంత ముందుగా వెళ్లి, అనేక మంది ప్రముఖ రచయితల్నీ, పాత్రికేయులనీ, దర్శకులనీ, కవి పండితులనీ దగ్గరగా చూసి, వీలైతే వాళ్ల దగ్గరగా కూర్చొని ఆ సినిమాలు చూడడం చక్కటి అనుభవం. వాళ్లని పరిచయం చేసుకోవాలంటే భయం!

అలా ప్రఖ్యాత రచయితలు డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావుగారినీ, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారినీ, శ్రీ శ్రీ నీ, బాలచందర్ నీ, అలా చాలామందిని దగ్గరగా చూస్తూ, వాళ్ల వ్యాఖ్యలు వినడం....అదో అదృష్టం.

సత్యజిత్ రే అపూ ట్రయాలజీ--పథేర్ పాంచలి, అపరజితొ, అపుర్ సంసార్; గోపీ గైన్‌-బాఘా బైన్‌ లాంటి అన్నిసినిమాలూ, శ్యాం బెనెగల్, మృణాళ్ సేన్‌, పుట్టణ్ణ కణగల్, బీ వీ కారంత్, శివరామ్‌ కారంత్ లాంటి మహామహుల సినిమాలూ, బెంగాలీ, తమిళ, కన్నడ, మళయాళ, ఒరియా, మరాఠీ లాంటి అన్ని భాషల్లోనూ యెన్నొసినిమాలు.

గోపీ గైన్‌-బాఘా బైన్‌ లో "హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ" మాంత్రికుడి వేషం, ఆయన డ్యాన్‌సు చెయ్యడం....కన్నడం లో అమరీష్ పురీ తొలి చిత్రం "కాడు", వంశవృక్ష, సంస్కార, ఆంథోనీ మళయాళ చిత్రం "నిర్మాల్యం"--ఇలా అన్నీ మరిచిపోలేని చిత్రాలే!

ఇంకా, వేసవికాలం లో ఓపెన్‌ ఎయిర్ లో అనేక రష్యన్‌, ఇటాలియన్‌, జపనీస్....ఇలా అన్ని భాషల చిత్రాలూ-రోజుకి రెండేసి అయినా చూసెయ్యడం, ఒకసారైతే, హనుమంతరాయ గ్రంథాలయం లో (బాక్సులు రాత్రే తిరిగి ఇచ్చెయ్యాలని) మూడు పూర్తి నిడివి రష్యన్‌ చిత్రాలు.....మధ్య చిన్న విరామాలతో, రాత్రి 3 గంటలవరకూ చూసెయ్యడం--ఇవన్నీ కూడా మరచిపోలేనివే!

ఇంకో చిత్రమైన విషయం, మృణాళ్ సేన్‌ దే అనుకుంటా, "మాయాదర్పణ్" అనే చిత్రం, సబ్ టైటిల్సు లేకుండా పుర్తిగా చూడడం! దాంతో అందరూ బంగ్లా భాషలో ఎక్స్‌పర్ట్‌ లయిపోయాం! యెలా అంటారా.....కా, కే, కి, లాంటి మాటలకి యేమిటి? యెవరు? యెందుకు? అని అర్థాలు అని తెలిసిపోయి, ఒకళ్లని ఒకళ్లు ఇంక అలాగే పలకరించేసుకుని, నవ్వేసుకునేవాళ్లం. నిజంగా ఆ సినిమా ఓ పనిష్మెంటు.

ఇంతకీ ఆ మూడు గంటల సినిమాలో దాదాపు ఒకటే సీను.....ఓ అమ్మాయి మాటి మాటికీ హాల్లో సోఫాలని ఓ గుడ్డతో దులిపేస్తూ, తుడిచేస్తూ వుంటుంది......సినిమా పుర్తయి బయటికి వచ్చాక, ప్రఖ్యాతులతో సహా, అందరిలోనూ రిజిస్టరు అయిపోయిన సీను అదే!

అక్కణ్ణుంచీ, మా ఆవిడ ఇల్లు తుడుస్తున్నా, వంటింట్లో స్టౌ శుభ్రం చేసుకుంటున్నా, "ఓహో! దర్పణం చేస్తున్నావా" అని యేడిపించేవాడిని. ఆ గుడ్డలు మురికి అయిపొతే, నా పాత బనీనో, లుంగీయో ఇచ్చేసి, "ఇంక హేపీగా దర్పణం చేసేసుకో" అనేవాడిని. ఆ తరువాతకూడా, మా పిల్లలూ, ఇప్పుడు మా తమ్ముడి పిల్లలూ కూడా ఆవిడని అలాగే యేడిపించడం అలవాటు చేసేసుకున్నారు! ఆవిడ రాక్షసిలా పడిపోతుంది "మరి శుభ్భరాలు రమ్మంటే యెలా వస్తాయి....నేనుకాబట్టి చేస్తున్నాను లంకంత కొంపని." అంటూ, తడి మోప్ తో తుడిచిన అరగంటవరకూ అన్ని ఫేన్లు (అన్ని కాలాల్లోనూ) వేసేసి (అది త్వరగా ఆరడానికట) యెవ్వరినీ పుర్తిగా ఆరేవరకూ అడుగులు వేయనివ్వదు!

నేను గవర్నర్ పేట బ్రాంచి లో వుండగా, సేవింగ్స్ కవుంటర్లో వున్నప్పుడు, ఎకవుంట్ తెరవడానికి వచ్చిన ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారికీ, ఉషాబాల గారికీ, ఫారాలు ఇచ్చి, పూర్తి చేయించి, వారిని మేనేజరుకి పరిచయం చేసి, (వారికీ నాకూ పరిచయం అల్లా వారి రచనలు మాత్రమే!) పావుగంటలో పాసుబుక్కులు చేతిలో పెట్టాను. అదో గొప్ప అనుభవం. అలగే ఓ ప్రఖ్యాత కార్టూనిస్ట్ కి కూడా. ఆయన స్పెసిమెన్‌ సిగ్నేచర్ ఇమ్మంటే, కార్టూన్‌ మీద ఆయన చేసే సంతకమే ఇవ్వడంతో, ఆయన్ని పోల్చుకొని, అడిగితే, ఆయన యెంత సంతొషించాడో!

ఇంకొంత మరోసారి.

Thursday, April 3

మా కొత్త కాపురం - 3


నేనూ, నా రాక్షసి

......దొందూ దొందే అన్నట్టుగా సాగేవి మా వినోద కార్యక్రమాలు.

టిక్కెట్లు చేతిలో పడగానే, గబగబా బ్యాంకు పని పూర్తిచేసుకొని, ఇంటికి చేరి, హడావుడి పెట్టేసేవాణ్ని".......ఐదు నిమిషాల్లో బయలుదేరాలి, ఊఁ....రెడీ...."అంటూ. "అబ్బ యెక్కడికో చెప్పరూ....తెమలాలి తెమలాలి అంటారు" అంటూ తాపీగా తయారై వచ్చేది. 

ఊర్వశి, మేనక, అలంకార్ లాంటి వాటికైతే నడుస్తూనే, గవర్నర్ పేట లో వినోదా, అప్సర, జైహింద్, లక్ష్మీ, నవరంగ్, సూర్యారావుపేటలోని విజయా, లాంటి వాటికైతే రిక్షాకి ముప్పావలా, వన్‌ టౌన్‌ శేష్ మహల్, శ్రీనివాస, మారుతీ, సరస్వతీ లాంటి వాటికైతే రూపాయి రిక్షాలో!

దారిపొడుగునా యేవేవో మాట్లాడుతున్నా, తనకి టెన్‌షన్‌....మధ్యమధ్యలో "యెక్కడికండీ" అంటూ. చివరిదాకా యేదేదో చెపుతూ, చివరికి నిజం చెప్పగానే, "హబ్బా! మరి చెప్పరేం?" అంటూ ఆనందం.

డి కే పట్టమ్మాళ్ కచేరికి అంటూ, నవరంగ్ లో ఇంగ్లీషు సినిమాకి తీసుకెళ్లిపోతే, "చూశారా....నిజమే అనుకొని మంచి చీర కట్టుకొచ్చేశాను" అంటూ గొణుగుళ్లూ.

తరుచూ సినిమా వాళ్లు కొత్త సినిమా ప్రమోషన్‌ కోసం వస్తూండేవారు. నాకు మొదటినించీ వాళ్లని చూడాలని పెద్ద ఆసక్తి లేకపోయినా, తనకి మాత్రం దగ్గరనుంచి వాళ్లని చూడడం భలే ఆనందం. అలా జయప్రద, రజనీకాంత్, కమల్ హాసన్‌, ఎస్ పీ బాలూ, బాలచందర్, నారాయణ రావు, రాజబాబు, రమాప్రభ, జయసుధ, ప్రభ, లాంటి చాలా మందిని ఫిలిం ఛాంబర్ హాలు దగ్గరో, ఎగ్జిబిషన్‌ లోనో చూసే వాళ్లం. తరవాత సినిమాకి వెళితే, మా వెనక వరసలోనే వాళ్లు కూర్చొని సినిమా చూస్తూండడం......మరీ థ్రిల్లింగ్ అనుభూతి.

ఎగ్జిబిషన్‌ లో జైంట్ వీల్ యెక్కడం, ముంజేయి అంత పొడుగు పెద్ద కోన్‌ లలో ఐస్ క్రీములు తినడం, అలాగే గొప్ప గొప్ప వాళ్ల మీటింగుల కి హాజరవ్వడం, ముఖ్యంగా లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, అబ్రహాం టి కోవూర్ లాంటి వాళ్లని దగ్గరగా చూడడం గొప్ప అనుభూతులు. 

ఇంక ఇలాంటి కార్యక్రమాలు లేని రోజుల్లో, గాంధీ పార్కు కో, ప్రకాశం బేరేజి కో, కనక దుర్గ గుడికో, గాంధీ హిల్ కో షికార్లు. అప్పట్లో అవన్నీ పెద్ద రణగొణల్లేకుండా ప్రశాంతంగా వుండేవి. 

దుర్గ గుడికైతే, అక్కడివరకూ రిక్షాలో వెళ్లిపోయి, మెట్ల క్రింద ఈప్రక్కా ఆ ప్రక్కా వుండే ఒకటి రెండు దుకాణాల దగ్గర చెప్పులు విడిచేసి, ఓ వాళ్లిచ్చే వెదురుబుట్టలో కొబ్బరకాయీ, పువ్వులూ, హారతి కర్పూరం, అగరొత్తులూ వగైరా కొనుక్కొని, మెట్లెక్కి, వెనుక కోనేట్లో కాళ్లు కడుక్కొని, దుర్గని దర్శించుకొని, తిరిగి శివాలయానికి నడుచుకుంటూ వచ్చే దారిలో చెట్లక్రింద వుండే సిమెంటు సోఫాల్లో కూర్చొని, శివాలయం మీదుగా క్రిందికి మెట్లమీద దిగి వచ్చేసేవాళ్లం. యెక్కడానికి యెన్నో మెట్లు వుండేవి కాదు. దిగడానికి ఇంకా తక్కువ. రాజబాబు ఐతే, తన స్కూటర్ మీద ఘాట్ రోడ్డులో మాకన్నా ముందే పైకెక్కేసేవాడు. ఆ కొండ మీద మేము తప్ప, ఒకటో రెండో జంటలు మాత్రమే వుండేవి. దైవభక్తితో పాటు, సరదాగా గడపడానికి కూడా బాగుండేది. 

అలాగే బ్యారేజీ మీద కొంత దూరం వెళ్లి, కాసేపు అక్కడ గడపడం, గాంధీ హిల్ మీదకి వెళ్లి, మ్యూజియం చూడ్డం, అక్కడ చిన్న రైల్లో కొండ చుట్టు తిరగడం, గాంధీ పార్కు 8 గంటలకి మూసేసేవరకూ వుండి, తరవాత ఇంటికి చేరడం, తరవాత గువ్వా గూడెక్కె, రాజూ మేడెక్కె!

ఇంకొంత మరోసారి.

Thursday, March 27

మా కొత్త కాపురం - 2


నేనూ, నా రాక్షసి

భోజనాలసంగతలా వుంచితే, విజయవాడ జీవితం చాలా బాగుండేది. 

మా గాంధీనగర్ బ్రాంచి లో నాతోపాటు కొత్తగా చేరినవాళ్లు (కొద్దిగా ముందూ వెనకా) మణి అనే అమ్మాయీ, లక్ష్మీనారాయణ, రమణ, సోమయాజులు, కనకరత్నం అనే ఓ అమ్మాయి, ఉదయ శంకర్ అనే ఓ ప్రొబేషనరీ ఆఫీసరు. సీనియర్లు కవుంటర్లు చూసుకుంటూంటే, ఆ ప్రక్క సీట్లలో మమ్మల్ని కూర్చోబెట్టి, పని నేర్చుకునే అవకాశం కలిగించేవారు. సీనియర్ ఆఫీసర్ చౌదరి గారయితే, "ఇది బ్రాంచి కాదు ప్రొబేషనర్స్ ట్రెయినింగ్ కాలేజ్" అంటూ గంటకోసారి బహిరంగంగా గట్టిగా విసుక్కొనేవారు.

ముఖ్య విషయం యేమిటంటే, సినిమా డిస్త్రిబ్యూటర్ ల ఆఫీసులన్నీ గాంధీనగర్ లోనే వుండి, వాళ్ల ఎకవుంట్లన్నీ మా బ్రాంచి లోనే వుండేవి. సినిమావాళ్ల ఎకవుంట్లన్నీ మద్రాసులో మా టి నగర్ బ్రాంచి లో వుండడంతో, రోజూ టీ టీ ల ద్వారా కొన్ని లక్షలు (ఒక్కొక్కళ్లూ 1 నుంచి 5 లక్షలు) రోజూ పంపిస్తూ వుండేవారు. దానికోసం బస్తాలకొద్దీ రకరకాల నోట్లు జమ చేసేవారు. వాళ్లకి చేసిన సర్వీసుకి సంతోషించి, కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలకి మొదటిరోజు, మొదటి ఆట టిక్కెట్లు ముందే మాకు యెన్ని అడిగితే అన్ని ఇచ్చేసేవారు. దాంతో, ఆ వూళ్లో వున్న ఇతర బ్రాంచీలవాళ్లు కూడా మాకు ఫోన్లు చేసి మరీ రిజర్వు చేసుకొనేవారు. ప్రతీ కొత్త సినిమాకీ 20 నుంచి 30 టిక్కెట్లు వుండేవి మా బ్యాంకు వాళ్లవి. 

గవర్నర్ పేట బ్రాంచిలో ప్రసాద్, రాజబాబు కూడా మా క్లోజ్ ఫ్రెండ్స్. ఇంక సినిమాహాల్లోకి వెళ్లగానే, మారాజబాబు తన పని ప్రారంభించేవాడు. మేం యెవరు చెప్పగానే అన్ని టిక్కెట్లూ యెప్పటికప్పుడు చెపుతూండడంతో, సీట్లు నాలుగోచోటా, ఐదో చోటా, ఇంకొన్ని ఇంకోచోటా, వేరే వేరే వరసల్లో వచ్చేవి. దాంతో, మా పక్క సీట్లవాళ్లని బతిమాలి, సీట్లు మార్పిస్తూ, మా వాళ్లందరినీ ఒకే వరసలో కూర్చోబెట్టే సరికి అరగంట పట్టేది. "ఇంకో అరగంట టైమిస్తే, మీ సత్యనారాయణపురం వాళ్లందరినీ ఒక వరసలోకి చేర్చేగలను" అంటూ కాలరెగరేసేవాడు.

రెండు మూడు వారాలయ్యేటప్పటికి, మొదటిరోజే యెగబడని వాళ్లకి పాస్ లు పంపించేవారు. ఒక్కో పాస్ మీదా నలుగురు వెళ్లిపోవచ్చు. అలా వెళ్లడానికి వీలు పడని వాళ్లు అవి మళ్లీ మాకు ఇచ్చేసేవారు. మేము మళ్లీ తయార్. (ఇప్పుడు ఇలాంటి వాటిని కూడా లంచాలు అంటారేమో).

నాకు అంతకు ముందు సినిమాల మీద అంత వ్యామోహం వుండేదికాదు గానీ, కొత్త వుద్యోగం, కావలసినంతా సమయం, అదే ముఖ్యమైన వినోదం కావడంతో, అందరితోపాటే నేనూ. అందరిలోకీ ముందుగా పెళ్లి చేసుకున్నవాణ్ని నేనే. చెప్పద్దూ, మా ఆవిడకి చిన్నప్పటి నుంచీ ప్రతీ సినిమా చూడడం అలవాటు అని తరవాత తెలిసింది. ఇప్పటికీ పాత సినిమాలలో చెలికత్తెల వరకూ అందరిపేర్లూ చెప్పేస్తుంది. గొంతు అంత బాగుండదుగానీ, పాటలు వరస యేమాత్రం తప్పకుండా పూర్తిగా పాడేస్తుంది. 

ఇంకేముంది......దొందూ దొందే అన్నట్టుగా సాగేవి మా వినోద కార్యక్రమాలు.

ఇంకొంత మరోసారి.

Wednesday, March 19

మా కొత్త కాపురం



నేనూ, నా రాక్షసీ......

"పోదురూ బడాయి. అందరూ నిజమనుకోగలరు. ఈ వయసులో కొత్తకాపురం యేమీటీ?" అంటూ ముసిముసిగా బుగ్గలు నొక్కుకొంది నా రాక్షసి.

"మొన్ననే కదా మన మూడో హనీమూన్‌ గురించి వ్రాశాను. మరేం ఫర్వాలేదులే. అయినా నేను వ్రాస్తున్నది మన  'అప్పటి' కొత్త కాపురం గురించిలే". అన్నాను.

"అయినా ఆ శీర్షిక యేమిటీ" అంది కొరకొరా చూస్తూ. 'అదంతేలే' అని నీళ్లు నమిలేశాను. 

అప్పుడెప్పుడో శ్రీశ్రీ ఆరుద్ర గురించి చెప్పినట్టు, 'రాక్షసి' అంటే మా ఆవిడ ఒప్పుకోదు, నా భార్యా 'మణి' అంటే నేనొప్పుకోను. ఈ తగాదా యెవరు తీర్చేను!

1975 నుంచీ నిత్యనూతనంగా (అంటే యెప్పటికప్పుడు పరగడుపే) సా......గుతున్న మా కొత్తకాపురం సంగతులే వ్రాస్తున్నవి.

విజయవాడలో తను కాపురానికి వచ్చేసరికి, అవడానికి మా అన్నయ్యా, వదినా తో కలిసే అయినా, వాళ్లు యెక్కువగా వుండేవారు కారు. దాంతో మా 'ప్రత్యేక' కాపురం "గువ్వా గూడెక్కె, రాజూ మేడెక్కె".

ఉదయం యేదో టిఫిన్‌ చేసి, వేడివేడి బెడ్ కాఫీతో నిద్రలేపితే, టిఫిన్‌ తిన్నాక, మరోసారి కాఫీ త్రాగి, 7.45 కల్లా బ్యాంకుకి బయల్దేరి, 8.00 కి నా సీట్లో వుండేవాడిని. మళ్లీ లంచి కి 12.30 కి బయలుదేరి, ఇంట్లో భోజనం చేసి, కాసేపు విశ్రాంతి. మళ్లీ 3.00 కి బ్రాంచి. (అది షిఫ్ట్ బ్రాంచి. సాయంత్రం 5.30 వరకూ వుండేది.)

అప్పట్లో గ్యాస్ కొత్త. మా యింట్లో "నూతన్‌" స్టవ్వే. నేను లంచికి ఇంటికి చేరేసరికి, వేడివేడిగా అన్నం, పప్పూ, కూరా, చారూ వడ్డించేది. అందుకోసం నిమిషాలతో సహా ప్లాను వేసుకొనేదనుకుంటా. కంచం లో వడ్డిస్తూ, "ఐదువేళ్లూ దోపెయ్యకండి. వేడి" అంటూ వార్నింగూ. ప్రక్కనే టేబులు ఫ్యాన్‌ తిరుగుతున్నా, నెమ్మదిగా వూదుకుంటూ నేను పప్పు కలుపుకొని తినేసరికి, తను మజ్జిగలోకి వచ్చేసేది! తనకి అంత వేడి కావాలి మరి! 

తరవాత గ్యాసూ, కుక్కరూ వచ్చిన తరవాతకూడా, అన్నీ కుక్కర్లోనే పెట్టేసి, వేడి వేడిగా వడ్డించవలసిందే.

నేను సరదాగా యెలాగైనా తన భోజనం ఆలస్యం అవ్వాలని ప్లాన్లు. 

నేనసలే మితభాషిని. "అన్నం పెట్టు" అనడానికి 'అన్నమెట్టు' ని షార్ట్ కట్ లో ".....మెట్టు" అనీ, "నెయ్యి వెయ్యి" అనడానికి 'నెయ్యెయ్యి'  ని "...యెయ్యి" అనీ, "నూనె వెయ్యి" అనడానికి ".......నెయ్యి" అనీ, "కూర వెయ్యి" అనడానికి ".....రెయ్యి" అనీ, "చారొయ్యి" అనడానికి ".....రొయ్యి" అనీ, "పచ్చడెయ్యి" అనడానికి "....డెయ్యి" అనీ, "పులుసొయ్యి" అనడానికి ".....సొయ్యి" అనీ, "మజ్జిగ పొయ్యి" అనడానికి "....గొయ్యి" అనీ, "పెరెగెయ్యి" అనడనికి "......గెయ్యి" అనీ........ఇలా ఒకదానికీ మరోదానికీ చిన్న తేడాలతో కన్‌ఫ్యూజ్ చేసేవాడిని. 

మొదట్లో తాను కూడా ఎంజాయ్ చేస్తూవుండేది గానీ, రాను రానూ నా కుట్రని కనిపెట్టేసింది. నా వొకాబులరీలో ఎక్స్ పర్ట్  అయిపోయి, తన భోజనం మాత్రం ఒక్కనిమిషం ఆలస్యం కాకుండా చూసుకొంటూనే, నాకు వడ్డించేది. 

ఇలాక్కాదు అని, 'నెయ్యి' అని, తను నూనె వడ్డించగానే, "అదేమిటి? నేను నెయ్యి అంటే నువ్వు నూనె వేస్తావేమిటీ" అని క్రాస్ ఎక్జామినేషన్‌ మొదలెట్టేవాణ్ని. దానికి సమాధానం చెప్పేసరికి కొంత కాల నష్టం. దాంతో, "ఇంక నేను చెప్పను బాబూ" అనేది. చెప్పకపోతే, నేను తినడం మానేస్తాను అని నా మారాం. కొన్నాళ్లు కొనసాగింపు. 

ఇంకొన్నాళ్లకి "మీరు తినకపోతే మానెయ్యండి బాబూ, నా అన్నం చల్లారిపోతుంది" అనేదాకా వచ్చించి. నేను తక్కువ తిన్నానా. "చెప్పేవరకూ నిన్నూ తిననివ్వను" అని తన చేయి పట్టేసుకునేవాణ్ని. ఇంక తప్పక నేను ప్రశ్న వెయ్యకముందే తను వ్యాఖ్యానం చెప్పేసి, తను తినెయ్యడం మొదలెట్టింది! ఇంక ఆఖరి అస్త్రం కూడా అయిపోవడంతో నేను పని కానిచ్చేసేవాడిని. 

కానీ, ఓ వార్నింగ్ మాత్రం అప్పుడే ఇచ్చేసింది. "మీరేం వేషాలు వేసినా మనిద్దరం వున్నప్పుడే. మూడో మనిషి ముందు.......జాగ్రత్త!" అని.

తరవాత మాపిల్లలు పుట్టాక కూడా, ఇప్పటికీ అదే మా మధ్య లక్ష్మణ రేఖ. యెవరిముందయినా సరదాలూ, వేళాకోళాలూ బంద్. ఇంకేం చేస్తాము? యేకొన్ని నిమిషాలో తప్ప, యెప్పుడూ యమ సీరియస్.

ఇప్పుడిప్పుడు, తన పని కొంత తగ్గించుకొనేందుకు పప్పూ కూరా వగైరాలు కొంచెం ముందు వండేసి, అన్నం మాత్రం కుక్కర్లో కరెక్టుగా తినడానికి 20 నిమిషాల ముందు మాత్రమే పడేస్తుంది. 

నేనూ ఓ ట్రిక్ నేర్చుకోక తప్పలేదు. పప్పూ అవీ వేడిగానే వున్నా, వేళ్లు కాలేంత కాకపోవడంతో, అన్నం వడ్డించగానే దానిమీద పప్పు పరిచేసి, చల్లబరిచేసుకుంటాను. 

అలా మా అన్యోన్య భోజనాలు కానిస్తున్నాము.

..................మరి కొంత మరోసారి.

Thursday, February 27

కొన్ని దశాబ్దాల క్రితం........


తూనికలూ, కొలతలూ వగైరా

మా చిన్నప్పుడు మన ప్రభుత్వం అప్పటివారకూ చెలామణిలో వున్న బ్రిటిష్ కొలతలూ అవీ మార్చి, మెట్రిక్ పధ్ధతిని ప్రవేశపెట్టారు. ఆ పధ్దతికి అలవాటు పడడానికి ప్రజలకి చాలా కాలం పట్టింది. రూపాయలు, అణాలు, పైసలు, పోయి నయా పైసలు, రూపాయలు వచ్చినా, ఒకటీ, రండూ, ఐదూ, పదీ పైసల నాణాలు ముద్రించినా, పావలా ని 25 పైసలుగా, అర్థరూపాయిని 50 పైసలుగా, ముద్రించారు. అలాగే, పంపులూ, యేబులాలూ, వీశెలూ పోయి, కిలోలూ, అరకిలోలూ, గ్రాములూ, గిద్దలూ, అవీ పోయి, లీటర్లూ వచ్చాయి. అడుగులూ, గజాలూ, ఫర్లాంగులూ, మైళ్లూ పోయి, మీటర్లూ, కిలో మీటర్లు వచ్చాయి. దాంతో కొన్ని తమాషాలూ జరిగేవి.

వుదాహరణలు కొన్ని.........

ధాన్యం, బియ్యం బస్తా అంటే 24 కుంచాలు కొలిచేవారు. మా నాన్నగారు బియ్యం బస్తా ఇంటికి పంపిస్తే, గోనె సంచి పట్టుకెళ్లి పోవాలని బియ్యం మా ఇంటి హాల్లో దిమ్మరించి వెళ్లిపోయేవాడు. అమ్మ నన్ను వెనకింటివాళ్లదగ్గరకి వెళ్లి, కుంచం తెమ్మనేది. (వాళ్లు రైతులు. ధాన్యం కొలవడానికి కుంచం వుండేది వాళ్లింట్లో). నేను కుంచం తెస్తే అమ్మ అవి కొలిచి, బియ్యం జాడీలో నింపేది. 24 కుంచాలూ యెప్పుడూ వచ్చేవి కాదు. ఆఖరు కుంచం లో సగానికి కాస్త పైకే వచ్చేవి. నాన్న రాగానే అమ్మ ఫిర్యాదు--షావుకారు మోసం చేశాడని. షావుకారుని అడిగితే, ధాన్యం కొలిచే కుంచం తో కొలిస్తే అంతే, బియ్యం కుంచంతో కొలుచుకోండి అనేవాడు. వాళ్ల కొట్లో కుంచానికీ, మేము కొలిచే కుంచానికీ షేపులో తేడా వుండేది. కానీ కొలత ఒకటే వుండాలికదా? (ఇలాంటి వాటి నివారణకోసమే ప్రభుత్వం నిర్దిష్ట కొలతలని ప్రవేశపెట్టి మంచిపని చేసింది). నేను కుంచం తెచ్చి అమ్మకి ఇస్తూ, లోపల చింతపండు యేమైనా అంటించారేమో చూసుకో అని జోక్ చేసేవాణ్ణి--ఆలీబాబా 40 దొంగల ప్రభావంతో!

అలాగే, మధ్యాహ్నం పూట ఓ సైకిలు మీద వెనుక ఓ పెద్ద క్యాన్‌ పెట్టుకొని, మూతని డబడబలాడిస్తూ శేరూ బేడ పాలెయ్ అంటూ ఒకడు వచ్చేవాడు. (వెన్నతీసేసిన పాలు అలా అమ్మేవారు. పితికిన పాలైతే రేటు దాదాపు రెట్టింపు వుండేది). వాడికి పావలా (25 నయాపైసలు) నాణెం ఇచ్చి, శేరు పాలు పోయించుకుని, తిరిగి 13 పైసలు ఇస్తావా ఛస్తావా అని వాడితో దెబ్బలాడేవాళ్లం. (బేడ అంటే రెండు అణాలు అంటే 12 పైసలే కదా?). వాడు ఛస్తే ఒప్పుకొనే వాడు కాదు. కావాలంటే, రెండు శేర్లు పోసేస్తాను తీసుకోండి అనేవాడు!

అగ్గిపెట్టె 2 పైసలు వుండేది. అప్పుడు విమ్‌కో వాడు తన గుర్రపు డెక్క మార్కు అగ్గిపెట్టెని 3 పైసలకి పెంచాడు. దాణ్ని అర్థణా అనే వాళ్లు. అయినా, 5 పైసలు ఇస్తే రెండు అగ్గిపెట్టెలు ఇచ్చేసేవాడు.

బట్టల దగ్గరకి వస్తే, మా ఆస్థాన టైలరు భూషణం అని వుండేవాడు. అతన్ని యెవరికి యెంత గుడ్డ తీసుకోవాలి అని అడిగి, బట్టల షాపుకి తీసుకెళ్లేవారు నాన్న. వాడు గజాల కొలత చెపితే, కొట్లో మీటర్ల కొలత! మేం చెప్పిన కొలతలని షాపువాడు మీటర్లలోకి మార్చి, మొత్తానికి గుడ్డలు చించి ఇచ్చేవాడు. తీరా భూషణం దగ్గరకి తీసుకెళ్తే, ఈ గుడ్డ సరిపోదండి. ఇంకొంచెం కొనాలి అనేవాడు. షాపువాడు సరిపోతుందన్నాడు, యెలాగోలా కానెచ్చెయ్యి అంటే, సరేలెండి, అవసరమైనచోట సైనుగుడ్డ అతుకులు పెట్టేస్తాను అని ఒప్పుకొనేవాడు. తీరా కుట్టిన బట్టలు ఇంటికి తెచ్చేసరికి, అమ్మ చూడండి యెంత బిగుతుగా కుట్టేశాడో....కనీసం ముప్పాతిక మువ్వీసం గుడ్డ దొబ్బేసి వుంటాడు అనేది! (గజాన్ని నాలుగు భాగాలు చేస్తే, ఒక్కొక్కటీ ఓ పాతిక, ఆ పాతికని 4 భాగాలు చేస్తే, ఒక్కోటీ ఓ వీసం).

ఇక్కడ నాకో ప్రాక్టికల్ జోక్ గుర్తొచ్చింది.

ఒకతను టైలరు దగ్గరకు  గుడ్డ తీసుకెళ్లి, టోపీ కుట్టమంటే, వాడు టేపుతో కొల్చుకొని, సరే అన్నాడట. తిరిగి వెళ్తూ, ఇంకా గుడ్డ మిగిల్తే వాడు దొబ్బేస్తాడేమో అని ఆలోచించి, మళ్లీ రెండు టోపీలు కుట్టు అన్నాడట. దర్జీ మళ్ళీ గుడ్డ కొలిచి, సరేలే అన్నాడట. ఈ లెఖ్ఖన ఇంకా చాలా మిగలచ్చు అనుకొని, పోనీ 3 టోపీలు కుడతావా? అన్నాడట. దర్జీ ముఖం చిట్లించి, మీరు కుట్టమంటే అలాగే అన్నాట్ట. 4 టోపీలు కుట్టగలవా? అని అడిగితే, మీ ఇష్టమే, కుట్టమంటే కుడతాను అన్నాట్ట. సరే, 5 టోపీలు కుట్టేయి అన్నాడట. దర్జీ, సరే, అంతకన్నా యెక్కువ కుట్టడం మాత్రం నావల్ల కాదు అంటే, సరే అని అప్పటికి తృప్తిగా వెళ్ళాడట. టోపీలు తీసుకోడానికి వస్తే, దర్జీ తన ఐదు వేళ్లకీ ఐదు టోపీలు పెట్టుకొని, చూపించి, నామాట నిలబెట్టుకొన్నాను చూడండి! అన్నాడట.

ఇప్పటికీ టైలర్లు వాళ్ల గురువూ, వాడి గురువూ నేర్పించినట్టు......ఛాతీ 32.....అంటూ అంగుళాల్లోనే కొలతలు తీసుకుండారు. పొడుగు సరిపోతుందా? ఇంకో అంగుళం పెంచమంటారా? అని అడుగుతూ వుంటారు గమనించండి.

(మరి కొన్ని మరోసారి)

Friday, January 17

చిన్నప్పటి జ్ఞాపకాలు


మళ్లీ చదవాలని వుంది

1960 ప్రాంతాల్లో, ఆంద్రప్రభ సచిత్ర వారపత్రికలో, విద్వాన్ విశ్వం తన మాణిక్యవీణ మీటడం మొదలుపెట్టిన రోజుల్లో అనుకుంటా, "కథ కాని కథ" అని ఓ శీర్షిక మొదలుపెట్టి, పాఠకులని అలాంటివి వ్రాయమని, ప్రచురించేవారు.

వాటిలో నేను చదివిందీ, ఎప్పటికీ మరిచిపోలేనిది ఒక కథ. (యథాతథంగా వ్రాయలేనుగానీ, నాకు గుర్తున్నట్టు--వ్రాస్తున్నాను)

"నల్లులని నిర్మూలించడానికి అత్యంత ప్రభావవంతమైన విధానం--కేవలం రూ.5/- లకే--ఫలితం గ్యారంటీ" అని ఓ ప్రకటన చూసి, అది తెప్పించుకుంటే, ఓ పార్సెల్ వచ్చింది. అందులో పెద్ద గోళీ కాయలంత గుండ్లు రెండు ఉన్నాయి. ఒక దానిమీద "ఎ" అనీ, ఇంకోదానిమీద "బి" అనీ వ్రాసి వుంది. వాటితో వచ్చిన కాయితంలో, "నల్లులని చంపే విధానం=ఒక్కో నల్లుని పట్టుకొని, ఎ గుండు మీద వుంచి, బి గుండుతో బలంగా మోదండి" అని, క్రింద షరా: నల్లు చచ్చేలా మోదే బాధ్యత మాత్రం మీదే! అనీ--వ్రాసి వుంది".

అదండీ కథ కాని కథ!

ఇంక, ఆ రోజుల్లోనే, పిల్లకోసం "బాలప్రభ" విభాగం నిర్వహించేవారు. అందులో శ్రీ వీ ఎస్ సుక్తాంకర్ వ్రాసిన ఓ పిల్లల నవల అనువాదం "వనసీమలలో....." పేరుతో ప్రచురించారు. 

".......ఇంత వయసువచ్చినా ఇంకా అమ్మా అంటూ యేడుస్తున్నావు
--సిగ్గులేదా" అంటూ "ముసలి నాయకుడు" హీరోని తిట్టడంతోననుకుంటా నవల మొదలవుతుంది. కథనం మొత్తం ఉత్తమ పురుషలో హీరో చెపుతున్నట్టు సాగడంతో, హీరో పేరు తెలియదు. హీరో స్నేహితులు గోబో, వాళ్ల చెల్లెలు ఫలీనా వగైరాలతో, అడవుల్లో వాళ్లు పడే కష్టాలూ, మూడో చెయ్యి కలిగిన మానవులు సాగించే మారణహోమం, ముసలినాయకుడు ఆపదల్లో వున్నవాళ్లని కాపాడడం, వుచ్చుల్లోనుంచి కూడా సమర్థంగా తప్పించడం లాంటి ఆసక్తికర కథనాలతో నవల వేగంగా చదివించి (మళ్లీ వారం యెప్పుడు వస్తుందా అని అత్యంత ఉత్కంఠతో యెదురు చూసేవాళ్లం!), ఒక తరం కథ పూర్తి చేసి, చివరికి హీరో తలమీద యెగురుతున్న ఈగలు "ఈయనెవరనుకున్నావు? ఇప్పుడు ముసలి నాయకుడు!" అని చెప్పుకుంటూండడంతో ముగుస్తుంది!

ఇంతకీ ఆ హీరో వాళ్లూ--అడవిలో జింకలూ, దుప్పులూ!

ఇలాంటి నవల మళ్లీ ఇప్పటి వరకూ రాలేదు. యెక్కడైనా దొరుకుతుందో లేదో తెలీదు. 

మళ్లీ యెవరైనా ప్రచురిస్తే చదవాలని వుంది. అందరిచేతా చదివించాలని వుంది!

Saturday, July 28

నా సోది...........



.........మళ్లీ మొదలు!

(ఇక్కడ వ్రాస్తున్న నిజాలు.......వూరికే మీకందరికీ తెలియజెప్పడానికే గానీ, యెవరినీ కించపరచడానికో, తప్పు పట్టడానికో మాత్రం కాదు. కొన్ని కొన్ని సంఘటనలు అలా...అలా..జరిగిపోతూ వుంటాయంతే! దాన్నే "లలాట లిఖితం" అంటారేమో! అందుకే నేను యెవరినీ యెప్పుడూ నిందించను.) 

చాలా కాలం అయిపోయింది టపాలు వ్రాసి. 

యెందుకంటే......, చావుతప్పి, కన్ను కాదుగానీ, కాలు లొట్టపోయి మళ్లీ మా వూరు చేరాను మొన్ననే. 

వెధవది......అలవాటైన ప్రాణం కదా.........వూరుకోదు. 

ఒకడు తెలంగాణా గురించి వాపోతాడు, ఇంకొకడు జగన్ నీ వాళ్లని వుతికి ఆరేస్తూంటాడు. ఇంకొకావిడ ఒకే వంటని యెన్ని రకలుగా చెయ్యొచ్చో, మన ముఖరవిందాన్ని యెలా చక్కబరచుకోవచ్చో వ్రాసేస్తూ వుంటుంది. ఇంకొకావిడ కణిక వ్యవస్థని దుయ్యబడుతూ వుంటుంది. ఒకాయన సినిమాలగురించీ, గాసిప్ ల గురించీ వ్రాస్తే మరొకాయన అమెరికా వగైరాలగురించీ, ఇంకొకాయన భార్య చీరలని లాండ్రీకి వెయ్యడం గురించి.........ఇలా యెవరి వ్యసనం వారిది!

నా వ్యసనం ప్రకారం ఇవాళ వ్రాస్తున్నది, 2000వ సంవత్సరం వరకూ అలాంటి వూరు ఒకటి వుంది అని కూడా తెలియని "రాయ దుర్గం" గురించి. 

2000వ సంవత్సరంలో, మా బ్యాంకు "పోలసీ" (దీనికి తగ్గ తెలుగు మాట నాకు తట్టడంలేదు--ఇంకా, అంతకు కొన్నేళ్ల ముందు, మేము మా యూనియన్ తరఫున "ఫలనా విషయంలో మీ పోలసీ యేమిటి?" అనడిగితే, "యే పోలసీ లేకపోవడమే మా పోలసీ" అని చమత్కరించేవాళ్లు మా వున్నతాధికారులు!) ప్రకారం, నేను పని చేస్తున్న మావూరు నుంచి రెండు మూడు జిల్లాలు దాటించి, కర్నూలు జిల్లాకి బదిలీ చేశారు. జిల్లా కర్నూలే గానీ, ఆ జోనల్ కార్యాలయం పరిధి మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం జిల్లాలూ, కర్నాటకలో కొంతభాగం వరకూ వుందిట! 

నా అదృష్టం కొద్దీ నాకు మహబూబ్ నగర్ బ్రాంచి లో వేశారు--అక్కడి మేనేజరు పాపం "కంప్యూటర్లు ప్రారంభించడానికి, సాయంత్రం వాటిని ఆపడానికి తెలిసివున్నవాళ్లు మా బ్రాంచిలో లేకపోవడం తో చాలా ఇబ్బందిగా వుంది. అవి తెలిసున్నవాళ్లని పంపించండి మహాప్రభో!" అని కొన్నాళ్లుగా మొరపెట్టుకొంటుంటే, ఆ పనికి నేను తగినవాణ్నని నన్ను పంపించారు. 

ఆ వూరి గొప్పతనం యేమిటంటే, అక్కడ పనిచేసే 90% వుద్యోగులు (ప్రభుత్వ, బ్యాంకు, ఇతర) హైదరాబాదు నుంచి ఉదయాన్నే "తుంగభద్ర" ఎక్స్ ప్రెస్ లో వచ్చి, డ్యూటీలు చేసుకొని, మళ్లీ సాయంత్రం అదే తుంగభద్ర ఎక్స్ ప్రెస్ లో హైదరాబాదు చేరతారు!

నేను నా భార్యతోసహా అక్కడే కాపురం పెట్టడంతో, ఆఫీసు భారం (కంప్యూటర్లకి సంబంధించినంతవరకూ) నామీదే పెట్టేసేవారు. ఇంకా నా సహజ గుణాలైన ఆలోచించడం, వ్రాయడం, మొదలైనవాటిని కూడా అందరూ వుపయోగించుకొనేవారు. రోజులు బాగానే గడిచి పోయాయి.

ఓ యేడాది గడిచేటప్పటికి, మా మేనేజరుకి ప్రమోషన్ వచ్చి, హైదరాబాదు బదిలీ చేశారు. ఆ లోపల మా అమ్మాయి పెళ్లి కుదిరి, పనులన్నీ పూర్తవడానికి వీలుగా ఓ నెల్లాళ్లు సెలవు మంజూరు చేయించుకొని వచ్చేశాను నేను.

నేను మళ్లీ తిరిగి డ్యూటిలో చేరడానికి వెళ్లేసరికి, కొత్త మేనేజరుగా వచ్చినాయన, "ఠాట్! ఇంత సీనియర్ని, ఇంత జీతం ఇచ్చి, అన్నేసిరోజులు సెలవుల్లో పంపించి, నేను భరించలేను......." అంటూ కర్నూలులో వున్న జోనల్ ఆఫీసులోని డెప్యుటీ జనరల్ మేనేజరు (ఆయన కూడా కొత్తగానే వచ్చాడు!) చెవినిల్లు కట్టుకొని పోరి, నాకు బదిలీ వుత్తర్వులని రప్పించి, నేను డ్యూటీకి రాకముందే నన్ను "రిలీవు" చేసినట్టు నోటీసుబోర్డులో తగిలించేశాడు. 

అంతవరకూ వాడి మొహం నేనూ, నా మొహం వాడూ చూసుకొని యెరగం! ఇవన్నీ నిబంధనలకి వ్యతిరేకం అయినా, అలాంటివాడిదగ్గర పనిచెయ్యడం అంత బుధ్ధి తక్కువ ఇంకేమీ వుండదు అనుకొని, జోనల్ ఆఫీసుకి వెళ్లిపోయాను......బదిలీ వుత్తర్వు కాపీలతో.

...........మిగతా మరోసారి.

Thursday, May 17

నాకు నచ్చే.....2



......నమ్మ బంగళూరు

తరవాత నేరుగా బన్నేర్ ఘట్టాకి ప్రయాణం. సమయం సరిగ్గా పది అయ్యేటప్పటికి ఇన్నర్ రింగురోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకి వెళ్లే జంక్షన్లో, పెద్ద ట్రాఫిక్ జామ్. ఆఫీసులకి వెళ్లేవాళ్ల బైక్ లూ, కార్లూ, సాఫ్ట్ వేర్ కంపెనీల బస్సులూ......45 నిమిషాలు పైగా పట్టింది. (ఇదంతా, రాజరాజేశ్వరి గుడికి వెళ్లకముందే అనుకుంటా).

ఆగుళ్లో ఇంకో గోపురం నిర్మాణం జరుగుతోంది. బంగారు నందులూ వగైరా మామూలే. దర్శనం త్వరగానే అయ్యింది.

అక్కణ్నించి బన్నేర్ ఘట్టా "బయొలాజికల్ పార్కు"కి. (దాన్నే నేషనల్ పార్క్ అనికూడా అంటున్నారు). 

అక్కడికి చేరాక, "సఫారీ"తో సహా పార్క్ దర్శనానికి 230 రూపాయలో యెంతో టికెట్. 'సీ'నియర్ పౌరులకి కొంత కన్సెషన్. 5 సంవత్సరాల లోపు పిల్లలకే టిక్కెట్ లేదు. 

సఫారీ బాగానే జరిగింది. (అందరికీ కావలసిన నీళ్ల సీసాలూ, బిస్కెట్లూ, డ్రింకు సీసాలూ, బ్రెడ్, జామ్ వగైరాలు మా కోడలు--సెక్యూరిటీవాళ్లని బ్రతిమాలి, బయటికి వెళ్లి తెచ్చింది.)

మొదట్లో "బైసన్"లూ, తరవాత అనేక 'యెలుగుబంట్లూ', జింకలూ, సాంబార్లూ, నీల్గాయ్ లూ, నెమళ్లూ--తరవాత 'పులులూ'; ఆ తరవాత 'సిం హాలూ'--ఇలా అన్నీ వాటి వాటి ప్రకృతిసిధ్ధ ఆవాసాల్లో! 

(ఇదివరకు పార్క్ గేటు వరకూ వాహనాలని అనుమతించేవారు. గేటు ప్రక్కనే టిక్కెట్ బుకింగ్ లు వుండేవి. ఆ చుట్టూ అనేక తినుబండారాల దుకాణాలూ, పిల్లల ఆటవస్తువులు అమ్మేవాళ్లూ, జంతువుల ఫోటోలు అమ్ముకునేవాళ్లూ వగైరాలతో సందడిగా వుండేది. ఇప్పుడు పార్కింగ్ ని ఒకటిన్నరకిలోల దూరంలో యేర్పాటు చేశారు. దుకాణాలున్న ప్రదేశం నుంచి పార్క్ గేటు వరకూ "శూన్య ప్రదేశం". టిక్కెట్టు చూపించి పార్కులోకి వెళితేగానీ, అక్కడెక్కడోగానీ....... "టాయిలెట్లు" లేవు! ఇదంతా "అభివృధ్ధి" అందామా?)

అలాగే, ఇదివరకు సఫారీలో "సిం హాల" డెన్ దగ్గరికి బస్సు తీసుకెళ్లి, ఆ ముందరి పూల్ లో ఆడ సిం హాలు స్నానం చేస్తూండగా, మగ సిం హం "రాజసం" వుట్టిపడుతూండగా డెన్ ముందు కూర్చొని వుండడం చూశాము.

దారిలో, పెద్దపులులు రోడ్డు దాటుతూ, బస్సుని చూడగానే చుట్టుముట్టి, ముందరికాళ్లతో బస్సు పైకెక్కడానికి చేసే ప్రయత్నాలు చూశాము. 

ఇప్పుడవేమీ లేవు. ఆఖరుగా ఓ పెద్దపులి తన బోనులో ఆకలిగా ఇటూ అటూ తిరుగడం కాసేపు చూసి, ఫోటోలు తీసుకొని (కెమేరాలకి వేరే టిక్కెట్లు!) తిరిగి రావాల్సి వచ్చింది. 

తీరా పార్కు కి చేరాక, ఒక్క పదిహేను నిమిషాలే సమయం వుండడంతో, పార్క్ లో అందరూ అవశిష్టాలు తీర్చుకొనేసరికే, పుణ్యకాలం కాస్తా కుక్కెత్తుకెళ్లిపోయింది!    

.........మిగతా మరోసారి

Sunday, April 29

నాకు నచ్చే.....



......నమ్మ బెంగళూరు

బెంగళూరు వాతావరణమంటే నాకిష్టం. 

ఇప్పుడిప్పుడు 'నమ్మ మెట్రో' వగైరా పేర్లతో చెట్లు నరికేసి, బయటికి వస్తే నెత్తీ అవీ, అన్నీ మాడేలా తయారయ్యిందిగానీ (అక్కడికీ పర్యావరణ ప్రేమికులు ధరణాలూ అవీచేసి లాఠీ దెబ్బలు తినడం, కోర్టులకెక్కడం, కోర్టులు అధికారులకి మొట్టికాయలు వెయ్యడం లాంటివీ, వందేళ్ల వయసు చెట్లని కూకటివేళ్లతో పెకలించి వేరే చోట్ల నాటడం లాంటివి జరుగుతున్నాయిగానీ, పెద్ద ప్రభావం వుండటం లేదు!), లేకపోతే స్వర్గానికి బెత్తెడు దూరమే! మన హైదరాబాదు, విజయవాడ, గుంటూరు, విశాఖ వగైరాలతో పోలిస్తే మాత్రం లక్ష రెట్ల బెటరు! అందుకే నాకిష్టం.

మొన్న మళ్లీ ఓ పదిరోజులు బెంగళూరు వెళ్లి వచ్చాము......మా అబ్బాయి మార్తహళ్లి లో కొనుక్కున్న అపార్ట్మెంట్ గృహ ప్రవేశం చేయించడానికి.

ఈసారి మాతో వచ్చిన, ఇంతవరకూ బెంగళూరు చూడని వాళ్లకోసం, కేటీడీసీ వాళ్ల "న్యూ బెంగళూరు" ప్యాకేజీలో తీసుకెళ్లాను. 

మొట్టమొదట, "ఇస్కాన్" టెంపుల్. ఒకప్పుడు దివ్యప్రభతో, ఇసకేస్తే రాలని జనంతో కిటకిటలాడే "దేవాలయం". (ఇదివరకటి నా టపా చదివి వుంటే, అక్కడ నూట యెనిమిదో యెన్నో--నీళ్ల మధ్య గుండ్రని తిన్నెలూ, వాటిమీదనుంచి--బలవంతపు బ్రాహ్మణార్ధంగా, హరేరామ, హరేరామ, రామ రామ హరే హరే; హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే అంటూ అందరినీ అరిపించడం (నేను హరే అల్లా; హరే యేసు అనడం) వగైరాలు గుర్తుండే వుంటాయి.

ఇప్పుడవేవీ లేవు. క్యూలు ఖాళీ, కేంటీన్లు ఖాళీ, గుడి ఖాళీ--ఒక్క కేటీడీసీ టూరిస్టులు తప్ప, అక్కడ భక్తిపారవశ్యాన్ని సూచించే వింత డ్యాన్సులు చేసే "భక్తులు" తప్ప, యెవరూ లేరు! 

ప్రసాదం మాత్రం వేడివేడిగా, రుచిగా వుంది. 

ఇంక అక్కడ చిన్న చిన్న కృష్ణుడి విగ్రహాలూ, ఫోటోలూ, పూసలదండలూ, వెండీ వగైరా కుందులూ, అనేక చేతి వుత్పత్తులూ--మామూలుగానే రేట్లు వందల్లో! (నేనే వాటికి అధికారినైతే, యేమాత్రం కక్కుర్తిలేకుండా అందరికీ వుచితంగా పంచిపెట్టించేవాణ్ని! అదేమీ బీదవాళ్లు కట్టిన గుడి కాదుకదా? పైగా వాళ్లు అక్కడ వ్యాపారం చెయ్యనఖ్ఖరలేదుకదా?)

(అక్కడే బ్రేక్ ఫాస్ట్. మాకు టైములేక పార్సెల్ చేయించుకున్నాము.)

యేదీ శాశ్వతం కాదు అన్నదానికి నిలువెత్తు సాక్ష్యంగా మిగిలిందీ గుడి!

తరవాత 1970 ల్లో కట్టిన--యేక శిలా హనుమాన్ విగ్రహం వుండే గుడీ, రాజరాజేశ్వరి (మధుర మీనాక్షి కాపీ) గుడీ. 

.........మిగతా మరోసారి

Monday, March 12

పైవాడు.....



......కోరితే

మొన్నీమధ్య, మావాడు (సన్నిహిత బంధువు) తో "ఛాట్" చేస్తూ, "ఇన్షా అల్లా" అని యేదో వ్రాశాను. దానికి వాడు "బాబాయ్! మతం మార్చావా? యెప్పుడూ?" అని క్రొశ్నించాడు. వెంటనే నేను, "అసలు పై వాడనేవాడొకడు వుండేడిస్తే, మనం యేపేరుతో పిలిచినా పలక్క ఛస్తాడా? ఈ మాత్రానికి మతాలూ, మార్పిళ్లూ యెందుకు?" అనగానే, అటునుంచి....అహ్హహ్హహ్హ!

నిజంగా, ఉర్దూలో ఆమాట నాకు చాలాబాగా నచ్చుతుంది. మిగిలినభాషల్లో అలాంటి "సంక్షిప్త" మహార్థాలిచ్చే మాటలు లేవు. ఇంగ్లీషులో బై గాడ్స్ గ్రేస్ అనీ, తెలుగులో దేవుడు మేలు చేస్తే అనీ, హిందీలో అగర్ భగవాన్ చాహే.....ఇలా యెన్ని వున్నా, ....."దేవుడు కోరితే", "దేవుడు అనుమతిస్తే", "పైవాడి శెలవైతే".....లాంటి అర్థాలు చెప్పే ఈ మాటకి సాటి అయినది లేదు!

అందుకే......"ఇన్షా అల్లా!"

Saturday, March 3

నా గురించి........

మరో.......సింహావలోకనం - 2


మరి సాధించిందేమిటి? అంటే.....

నా వొక్కడి గొప్ప అని చెప్పనుగానీ, కొంతమంచి జరిగింది. ముఖ్యంగా నాలుగు విషయాల్లో.

  • రైల్వేల విషయంలో, విజిలెన్స్ దర్యాప్తులు జరిగి, కొన్ని చర్యలు తీసుకొన్నారు. ముఖ్యంగా రిజర్వేషన్ల విషయంలో, తత్కాల్ విషయంలో కొంత సంస్కరించారు. (ఇప్పుడు మళ్లీ "నాలుగు నెలల" ముందే రిజర్వేషన్ అంటున్నారు. అది అంత అవసరం అనిపించడం లేదు నాకు).


  • తి తి దే వారు కూడా దర్యాప్తులూ అవీ జరిపి, కొన్ని సంస్కరణలు తెచ్చారు. ముఖ్యంగా అప్పటి ఈవో ఐ వై ఆర్ కృష్ణారావు గారు, సేవా టిక్కెట్ల విషయంలో, ప్రత్యేక దర్శనాల విషయంలో, క్యూలైన్ల విషయంలో కొంత సౌకర్యం కల్పించారు. భక్తి ఛానెల్ ని సంస్కరించారు. 


  • మన తెలుగు విషయంలో, ఈనాడు వారు కొంత మారారు/మార్చారు. ఇంకా చాలా చోట్ల తెలుగులో కొంత అభివృధ్ధి జరిగింది.


  • ఆర్ బీ ఐ వారు కొన్ని చర్యలు తీసుకున్నారు. మొన్ననే, ముథూట్, మణప్పురం లాంటి సంస్థల విషయంలో కొన్ని చర్యలకి శ్రీకారం చుట్టారు.


ముఖ్యమైనవి ఇవి. చిన్నచిన్నవాటి గురించి వ్రాయడం లేదు.

ఈ విషయాల్లో నాతో యేకీభవించినవారికీ, ఆ టపాలు తగినవారి దృష్టికి తీసుకెళ్లినవాళ్లకీ, చర్యలు తీసుకొనే భాగ్యం కలిగించినవారికీ మా మనః పూర్వక కృతజ్ఞతలు.

ఇలాగే కొనసాగాలని నా ఆకాంక్ష.

Sunday, February 26

నా గురించి........



మరో......."సింహావలోకనం"

"బ్లాగులోకం" లో "బిగ్ బ్యాంగ్" యెప్పుడు జరిగిందో నాకు తెలీదుగానీ, అప్పట్లో యేర్పడ్డ ఓ "వూర్ట్" మేఘం లో ఓ చిన్న "కాస్మిక్" ధూళి రేణువుగా, "ఏ సిటిజెన్ అఫ్ ది వరల్డ్" అని బ్లాగు ప్రారంభించి, "తెంగ్లిష్" లో "సింహావలోకనం" అనే శీర్షికతో ఓ టపా వ్రాశాను--2007 మే లో. (తరవాత తెలుగు బ్లాగుల గురించి తెలుసుకొని, దాన్ని "ఓ ప్రపంచ పౌరుడు" గా మార్చాను. అందుకేనేమో--నా మొదటి టపా ఇప్పుడు కనపడడం లేదు.)

ఇప్పుడు, ఓ నాలుగేళ్లు పూర్తయ్యాక, ఐదో యేట మరో "సింహావలోకనం". 

అనేక "సామాజిక" లు వచ్చాయి. కానీ వాటివల్ల యెవరికీ యే మేలూ జరగడంలేదు. పైగా కీడు జరిగిన దాఖలాలున్నాయి. ఒకాయన ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరింపబడడం, ఇంకొకాయన మంత్రి పదవి వూడినంత పని అవడం, ఇంకొకరెవరో తమ పేరున ట్వీట్లు వగైరా నిర్వహిస్తున్నారని వాపోయే వాళ్ల అభియోగాలు--ఇవన్నీ వింటూనే వున్నాము కదా?

ఈ నాలుగేళ్లుగా, నేను అనేక బ్లాగులని వ్రాస్తూ, ఒక్కో విషయం మీదా ఒక్కోటపా ప్రచురిస్తూ, నా ప్రస్థానం సాగిస్తున్నాను. ఈ మార్గంలో, అనేక భూషణ, దూషణ, తిరస్కారాలు యెదుర్కొన్నాను. అయినా, "ఐ లవ్ బ్లాగింగ్!"

బ్లాగింగ్ ఒక్కటే ఆరోగ్యకరమైన విధానం. "నా బ్లాగు, నా య్హిష్టం" అని వ్రాసుకోవచ్చు.  మీ అభిప్రాయాలని జనులందరికీ (చదివేవాళ్లకు మాత్రమే) ప్రకటించవచ్చు. మనకెలాగూ వాక్ స్వాతంత్ర్యం మన రాజ్యాంగమే ఇచ్చేసింది! 

కానీ కొందరు "వెధవ" మంత్రులు, అంతర్జాలం మీదా నియంత్రణ విధించాలని వాదిస్తున్నారు. (మంత్రి వెధవలు అనకూడదు!) కానీ, మొత్తం దేశవ్యాప్తంగా కంప్యూటర్లనీ, ఐ పీ లనీ వగైరాలని  నిషేధిస్తే తప్ప, ఆ నియంత్రణ వీరికి సాధ్యమా?

సరే, పోనివ్వండి. ఆ గొడవలు పెద్దవాళ్లు చూసుకుంటారు. 

నాకు స్వతహాగా అనేక విషయాలు నచ్చవు. సహజత్వానికి భిన్నంగా వుండేవి, వుండవలసిన విధంగా వుండనివి, కొంచెం యెక్కువగా వుంటున్నవి......ఇలా.....పర్ ఫెక్షనిస్ట్ అంటారే, అలా అన్నమాట. (సహజత్వం, వుండవలసిన.....లాంటివేమిటో అడగద్దు.) 

అలాంటి వాటిని నా టపాల్లో యెత్తి చూపుతూ వుంటాను. కొంచెం ఘాటుగానే వ్రాశాను. నా కోపాన్ని ప్రదర్శించడం లో యేమాత్రం సందేహించలేదు. నా పేరు "కచ్చశ్రీ" గా మార్చుకోమన్నవాళ్లు కూడా వున్నారు. అయినా, నా పంథా మార్చుకోలేదు.

అప్పటికింకా "కొలవెరి" అనే పదం నాకు తెలీదు గానీ, ఇప్పుడు చెప్పగలను--నాకు కొలవెరి వుందికాబట్టే నా టపాలు అలా వుంటాయి అని!

నా టపాలవల్ల (నా వొక్కడివల్లే అని చెప్పను) కొన్ని మార్పులు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. ఆయనెవరో చెప్పినట్టు, యే ఒక్కరి ఆలోచన కొంచెం మారినా, నా ఆశయం నెరవేరినట్టే.

నాకు ఆశ్చర్యకరమైన విషయం యేమిటంటే, నేను యెన్ని టపాలు వ్రాసినా, "అక్కడ కామా లేదు, అక్కడ ఫుల్ స్టాప్ మరిచారు, మన "వు"చ్చారణ అనకూడదు, "వు"దాహరణ అన కూడదు....." లాంటి వ్యాఖ్యలు వస్తాయి తప్పితే, నేను వ్రాసిన "విషయాల" గురించి, ధైర్యంగా, యేకీభవిస్తూనో, ఖండిస్తూనో--ఒక్క.....ఒకే ఒక్క....వ్యాఖ్య.....ఇప్పటివరకూ రాలేదు!

ఈ విషయంలో, నా టపాలమీద వచ్చిన వ్యాఖ్యలకి ప్రతి వ్యాఖ్యగా అనేక సార్లు వ్రాయడం, ఒక్కోసారి టపాల్లోనే వ్రాయడం కూడా జరిగింది. అనేకమందితో వాదప్రతివాదనలు సాగించడం కుడా జరిగింది. 
  
.........మిగతా మరోసారి

Friday, January 27

బ్లాగుసోదరులకి విజ్ఞప్తి



నా క్రొత్త బ్లాగు

నా "కృష్ణశ్రీ" బ్లాగుని రెండుగా భాగించి, "కృష్ణశ్రీ స్వగతాలు" కొనసాగిస్తూ, రెండోదానికి "కృష్ణశ్రీ విసుర్లు" అని పేరు పెట్టాను. 

కానీ, మన "సంకలినుల్లో" అది కనిపించడం లేదు. వాటికి లింకు పెట్టుకొనే వోపిక లేదు నాకు.

అందుకే, దయచేసి, ఈ క్రింది లింకు తెరిచి, నా టపాలు చదువుతారని ఆశిస్తూ, 



మీ

కృష్ణశ్రీ

Saturday, January 21

శతజయంతీ వగైరా......



......కార్యక్రమాలు

ప్రసక్తి వచ్చిందికాబట్టి, మా నాన్నగారి శతజయంతి ఉత్సవాలూ, నా షష్టిపూర్తీ, మా అమ్మగారి సహస్రచంద్ర దర్శనం కార్యక్రమాల గురించి మా అబ్బాయీ, కోడలూ ఈనాడు పత్రికలో ఇచ్చిన ప్రకటన ప్రచురిస్తున్నాను. 


12-12-2011 (సోమవారం) మా తాతగారు కీ.శే. అమ్మనమంచి నరసింహ మూర్తిగారి శతజయంతి.
సంవత్సరమంతా, ఆయన శతజయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ, 12-12-2012 (బుధవారం) సమాపనోత్సవాలు
నిర్వహించాలని సంకల్పం.

వాటితోపాటు, మా మామ్మగారు శ్రీమతి అమ్మనమంచి లక్ష్మీ కాంతం (నరసింహ మూర్తిగారి భార్య)
సహస్రచంద్ర దర్శనోత్సవం”,
మా నాన్నగారు అమ్మనమంచి కృష్ణ శాస్త్రి (విశ్రాంత ఆంధ్రా బ్యాంక్ అధికారి)
షష్టిపూర్తి మహోత్సవం
వరసగా మూడురోజులలో నిర్వహించాలని సంకల్పించాము.

ఉత్సవాలకి మా తాతగారి
మిత్రులూ, సహోద్యోగులూ, శిష్యులూ, ప్రశిష్యులూ, మరేవిధంగానైనా ఆయనకి పరిచయస్తులు, వారి వారి వారసులు;

అలాగే
మా మామ్మగారి (పిరాట్ల కొండయ్య గారి కుమార్తె) తరఫు బంధు మిత్రులూ, పరిచయస్తులూ, వారి వారసులూ;

మా
నాన్నగారి సహాధ్యాయులు, సహోద్యోగులు, బ్లాగ్ మిత్రులూ, వారి వారి వారసులూ,
మా అమ్మగారి (దర్భా లక్ష్మణ శర్మ గారి కుమార్తె కృష్ణ భారతి) తరఫు బంధు మిత్రులూ, వారి వారి వారసులూ
అందరూ, సకుటుంబ సపరివారంగా, ఆహ్వానితులే!

ఉత్సవాలకి అందరూ తప్పక విచ్చేయమని పత్రికా ముఖంగానే ఆహ్వానం. (రాబోయే ప్రకటనలు కూడా చూడండి).

దయచేసి, మీ రాకని తెలియపరుస్తూ, క్రింది ఈమెయిల్ అడ్రెస్ కి మెయిల్ పంపిస్తే, మీ వివరాలు రిజిస్టరు చేసుకోబడతాయి. అవసరమైతే, మీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపబడతాయి.

రాదలచుకొని, రాలేకపోతున్నవారికిఅవసరానుగుణంగాతగిన యేర్పాట్లు జరపడానికి ప్రయత్నిస్తాము.

దయచేసి, అందరూ ఆహ్వానాన్ని మన్నించి, ప్రత్యక్షంగా కలిసి, ఉత్సవాలని జయప్రదం చెయ్యాలని మా ఆకాంక్ష.

ఇట్లు,

అమ్మనమంచి శశికాంత్ భరద్వాజ్ (Mobile : 94414 93523)
అమ్మనమంచి అరుణ రమ్య
అమ్మనమంచి నరసింహ మూర్తి శతజయంతి ట్రస్ట్, నరసాపురం.

(రిజిస్ట్రేషన్ అనేది కేవలం మీకు సరియైన సదుపాయాలు కల్పించి, మీరు మాతో ఆహ్లాదంగా గడపడానికి దోహదం చేసి, మరువలేనిదిగా చెయ్య్డానికి మాకు తోడ్పడాలనే.)

అలాగే, శతజయంతి కార్యక్రమాల ప్రారంభోత్సవం గురించి కూడా--ఇంకో టపా.

అందరూ ముందుగానే ప్లాను చేసుకుంటారని యేడాది ముందుగానే ఆహ్వానాలు పంపిస్తున్నాను. 

బ్లాగు మిత్రులందరూ తప్పక కలుస్తారని ఆశ! 

మీ సహయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ.....
Posted by Picasa

Friday, January 20

పురుషులూ.......



........పుణ్య పురుషులూ

రిటైర్ అయ్యాక యేవో చిన్న చిన్న సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నా, ఇంకేదైనా చేస్తే బాగుంటుందనిపించింది. 

మొన్న 12-12-2011న మా నాన్నగారి 100వ పుట్టినరోజు సందర్భంగా, కీ.శే. అమ్మనమంచి నరసిం హమూర్తి శతజయంతి ట్రస్ట్ అని స్థాపించి, యేడాది పొడుగునా కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి, 12-12-12 నాటికి సమాపనోత్సవాలు కొంచెం ఘనంగా నిర్వహించాలని తలపోశాను. 

పనిలో పనిగా మా పిల్లలు నాకు షష్టిపూర్తీ, మా అమ్మగారికి సహస్ర చంద్ర దర్శనోత్సవం కూడా జరిపిస్తే బాగుంటుంది అని, దాన్ని మూడురోజుల కార్యక్రమంగా మార్చారు. 

ఆ రోజులకి మా నాన్నగారి పరిచయస్తులూ, వారి వారసులూ, నా సహోద్యోగులూ, మిత్రులూ, వారివారసులూ, మా బంధు మిత్ర వర్గాన్ని ఆహ్వానించి, చక్కగా కార్యక్రమాలు నిర్వహించాలని, మొన్న 12-12-2011న శతజయంతి కార్యక్రమాల ప్రారంభోత్సవాన్ని నిర్వహించాము.

కొంతమంది అడిగారు--యేమి సేవలు చేస్తారు? అని. మా కార్యక్రమాలు అన్నీ వివరించి, ఈ రోజుల్లో యెన్నెన్నో ట్రస్టులూ, సేవా సంస్థలూ, లయన్స్, లయన్ లేడీస్, లియో, రోటరీ, రోటరాక్టు, కేటరాక్టు లాంటి సంస్థలున్నా, సామాన్యుడికి వుపయోగిస్తున్నవి చాలా తక్కువ వున్నాయి అని చెప్పాను.

తరువాత, మొన్నో విషయం తెలిసింది నాకు. అది మీకు చెప్పాలనే ఈ టపా.

మా ఇంటికి దగ్గరలోనే, గవర్నమెంట్ ఆస్పత్రి వుంది. ఆ ఆస్పత్రి వున్న సెంటర్లో సన్యాసిరావు అని ఒకతను ఓ కూరగాయలకొట్టు పెట్టుకొని, జీవనం సాగిస్తున్నాడు. కులం రీత్యా రజకుడు. తన వ్యాపార సంబంధమై, తన ఇతర సమస్యలతో సతమతమౌతూ, ఆర్థికంగాకూడా అంతంతమాత్రమే గా గడుపుతున్నాడు.

ఒకరోజు, ఆస్పత్రికి వచ్చిన ఒకతను, అక్కడ ఇచ్చిన బ్రెడ్ తెచ్చి, "నేను ఈ బ్రెడ్ తినలేకపోతున్నాను, ఇది తీసుకొని, డబ్బులిస్తే, ప్రక్కన బండిలో వేస్తున్న దోశ కొనుక్కుంటాను" అని బ్రతిమాలాడట సన్యాసిరావుని. జాలిపడి, అలాగే ఇచ్చాడు. 

అది మొదలు, తానే అన్నం, కూరలూ వగైరాలు వండించి, ఆస్పత్రికి వచ్చేవాళ్లందరికీ--రోజుకి ఓ ఇరవైమందికి తక్కువగాకుండా "అన్నదానం" మొదలు పెట్టాడు!

ఇప్పుడు ఇంకా కొంతమంది దాతలు ముందుకు వచ్చి, ఒక్కో రోజు ఖర్చు మొత్తం మేము భరిస్తాము అని కొనసాగిస్తున్నారు. యెవరూ చెయ్యనిరోజున తానే నిర్వహిస్తున్నాడు.

ఓ సామాన్యుడైన ఆ వ్యక్తి అలాంటి "బృహత్తర" కార్యక్రమం చేస్తున్నాడంటే.......పుణ్యపురుషుడు అనాలా వద్దా?

ఈ సోకాల్డు "సేవాదారులు" బుధ్ధి తెచ్చుకుంటే బాగుండును.